పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక | Sakshi
Sakshi News home page

పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక

Published Fri, Jul 28 2023 9:27 PM

Third Danger Warning Issued At Bhadrachalam - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 14లక్షల 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ప్రవహిస్తోంది. రాత్రికి 58 నుంచి 60 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్‌ అన్నారు. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.

గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు వరదనీటిలో మునిగిపోయాయి. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది.
చదవండి: వానలు మిగిల్చిన విషాదం

ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 

Advertisement
Advertisement