Sakshi News home page

టీఎస్‌ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల 

Published Wed, Mar 6 2024 4:45 AM

TS ICET Notification Released - Sakshi

7వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ.. జూన్‌ 4, 5 తేదీల్లో పరీక్ష నిర్వహణ

కేయూ క్యాంపస్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2024–2025)లో ప్రవేశాలకుగాను ప్రవేశ పరీక్ష (టీ ఎస్‌ఐసెట్‌) నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ వీసీ, టీఎస్‌ ఐసెట్‌ చైర్మన్‌ తాటికొండ రమేశ్, కన్వినర్‌ ఆచార్య నర్సింహాచారి మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు హనుమకొండలోని యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలోని టీఎస్‌ ఐసెట్‌ కార్యాలయంలో తొలుత సెట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీనుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని వారు తెలిపారు.

ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో మే 17వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చునని, మే 20వ తేదీనుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. టీఎస్‌ ఐసెట్‌ను జూన్‌ 4, 5వ తేదీల్లో నిర్వహిస్తారని చెప్పారు.

ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టుగానే నిర్వహిస్తారని పేర్కొన్నారు. జూన్‌ 4న రెండు సెషన్‌లలో, 5న ఒక సెషన్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. కాగా, జూన్‌ 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్‌ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంత రాలు స్వీకరిస్తారు. ఫలితాలను జూన్‌ 28న విడుదల చేస్తారు. కార్యక్రమంలో కేయూ రిజి్రస్టార్‌ పి.మల్లారెడ్డి, కామర్స్‌అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి, డీన్‌ పి.అమరవేణి, బీఓఎస్‌ చైర్మన్‌ కట్ల రాజేందర్, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.సదానందం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ రాధిక పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement