ఎంవీపీకాలనీ: విశాఖ పట్నం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా ఎస్.తాతారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. 1996లో ఎస్ఐగా విధుల్లో చేరిన ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది విశాఖ సిటీ, రూరల్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సేవలు అందించారు. కె.కోటపాడు సీఐగా పనిచేస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందారు.
ఏయూలో ఎంఏ పాళి, బుద్ధిస్ట్ స్టడీస్ కోర్సులు
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరిధిలో ఎం.ఏ పాళి, బుద్ధిస్ట్ స్టడీస్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆర్ట్స్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ శ్రీలంకలోని జయవర్ధనపుర విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా తొలిసారిగా ఈ కోర్సును అందిస్తోందని పేర్కొన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కోర్సును ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని తెలియజేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సులో చేరవచ్చని, ఆసక్తి గలవారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వార్షిక ఫీజుగా రూ.19,500 చెల్లించాలని తెలియజేశారు. ఇతర వివరాలకు 97013 42985 నంబరులో సంప్రదించాలని సూచించారు.