Sakshi News home page

అదరగొట్టిన కడప బాలికలు

Published Tue, Oct 10 2023 5:43 AM

Kadapa and Vizianagaram Teams Won The State Level Under 17 Boys And Girls Volleyball Competitions - Sakshi

కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాలుర, బాలికల వాలీబాల్‌ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్‌ మ్యాచ్‌లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్‌ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది.

రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్‌లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్‌లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి.
 

క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం 
రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్‌ టోర్నమెంట్‌ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్‌ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్‌ మేనేజర్లకు అందజేశారు.

మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్‌ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు.

శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌తోపాటు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్‌ అకాడమి చైర్మన్‌ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్‌ మెడల్స్‌ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్‌ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్‌ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్‌ బాబు, గణేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జట్లకు ఎంపిక
శ్రీనగర్‌లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్‌–17 బాలుర, బాలికల వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్‌–17 బాలుర, బాలికల వాలీబాల్‌ టోర్నమెంట్‌ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. 


బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్‌.పూజిత (ప్రకాశం), సీహెచ్‌ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్‌ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్‌.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్‌.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం).


బాలుర జట్టు :  ఎ.ప్రేమ్‌ కుమార్, ఎస్‌.తోషన్‌ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్‌.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్‌ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్‌ (అనంతపురం), కె.డేవిడ్‌ రాజు (గుంటూరు), పి.కిరణ్‌బాబు (ప్రకాశం), ఎన్‌.అజయ్‌కుమార్‌ (కడప), స్టాండ్‌బైగా ఎస్‌.భరత్‌ (కృష్ణ), వై.రోహిత్‌(కడప), ఎం.ఆర్యన్‌ (నెల్లూరు), బి.కార్తీక్‌(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి).  

Advertisement

What’s your opinion

Advertisement