పట్టిసీమ పేరుతో పచ్చి మోసం | Sakshi
Sakshi News home page

పట్టిసీమ పేరుతో పచ్చి మోసం

Published Mon, Apr 20 2015 4:05 AM

drinkig water project

కడప సెవెన్‌రోడ్స్:  నామమాత్రపు బడ్జెట్ కేటాయింపులతో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పట్ల చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సీమకు నీరివ్వడానికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని చెప్పడం పచ్చి మోసమని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతం చుట్టూ ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్యారిడార్‌కు నీరందించడం కోసమే ఈ పథకాన్ని చేపడుతూ పైకి రాయలసీమ పేరు చెప్పడం వంచించడమేనన్నారు. కృష్ణా నికర జలాల పునః పంపిణీకి చర్యలు చేపట్టకుండా పట్టిసీమ పేరుతో మరోమారు ‘సీమ’ను వంచించే యత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. మరో విభజన ఉద్యమానికి బీజం పడితే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘పట్టిసీమ నిర్మాణం-రాయలసీమ ప్రాజెక్టులపై ప్రభావం’ అనే అంశంపై  ఏపీ రైతుసంఘం (ఏఐకేఎస్)జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడారు.
 
 ‘సీమ’ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
  2015-16 వార్షిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ. 5258 కోట్లు కేటాయించారని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఇందులో పట్టిసీమకు రూ.1030 కోట్లు కేటాయించగా, రాయలసీమ ప్రాజెక్టులైన గాలేరు-నగరికి రూ. 169 కోట్లు, హంద్రీ-నీవాకు రూ. 212 కోట్లు, వెలిగొండకు రూ. 153 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారన్నారు. ఇలాంటి నామమాత్రపు కేటాయింపులతో 50 ఏళ్లైనా సీమ ప్రాజెక్టులు పూర్తి కావన్నారు. సుమారు రూ. 12 వేల కోట్ల నిధులు అవసరం కాగా, కనీసం 10 శాతం కూడా కేటాయించకుండా పట్టిసీమ ద్వారా ఏ విధంగా నీరందిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం వల్ల కూడా రాయలసీమకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
 కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాలి
 పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి అన్నారు. పట్టిసీమ పేరుతో కోస్తా వారు చేస్తున్న మరో మోసమని ఆరోపించారు. రాజధాని చుట్టూ ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్యారిడార్ కోసమే పట్టిసీమ చేపడుతున్నారు తప్ప ‘సీమ’ ప్రాజెక్టుల కోసం కాదన్నారు. కృష్ణా నీటిని పునః పంపిణీ చేస్తే ‘సీమ’కు 120 టీఎంసీలు కేటాయించేందుకు వీలుంటుందని, కావాల్సిందల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధేనన్నారు.
 
 పట్టిసీమకు వ్యతిరేకంగా పోరాడతాం
 పట్టిసీమకు వ్యతిరేకంగా అఖిలపక్షంతో కలిసి తాము కూడా పోరాటాలు నిర్వహిస్తామని మేయర్ సురేష్‌బాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రక్కన పెట్టి బాబు పట్టిసీమను పట్టుకుని వేలాడటం తగదన్నారు. పట్టిసీమ వల్ల తాము కూడా నష్టపోతామన్న ఆందోళనలు గోదావరి జిల్లాల్లో సైతం వ్యక్తమవుతున్నాయన్నారు. పట్టిసీమ టెండర్లను 21 శాతం ఎక్సెస్‌తో కట్టబెట్టి ముఖ్యమంత్రి ముడుపులు స్వీకరించారని ఆరోపించారు.
 
  పట్టిసీమ జీఓలో రాయలసీమకు నీరిస్తామన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్‌దేనన్నారు. గండికోట రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా ఆయన హయాంలో 70 శాతం జరిగాయన్నారు. ప్రస్తుతం మొదటి దశ కింద నీరివ్వడానికి రూ. 1400 కోట్లు అవసరం కాగా, కేవలం రూ. 169 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. జూన్ నాటికి గండికోట ద్వారా ఎలా నీరిస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు.
 
 ముడుపుల కోసమే పట్టిసీమ
 కాంట్రాక్టర్ల నుంచి కేవలం ముడుపులు పొందడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని ఎమ్మెల్యే అంజాద్‌బాషా విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల బాబుకు రూ. 300 కోట్లు అందాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును విస్మరించి పట్టిసీమను చేపట్డడంలోని ఉద్దేశమేమిటో సీఎం స్పష్టం చేయాలన్నారు. సీమ పట్ల సవతితల్లి ప్రేమ కనబరుస్తున్నారని చెప్పారు. ‘సీమ’కు నీరిస్తామని జీఓలో కూడా ఎక్కడా పొందుపరచలేదన్నారు. పోలవరం కుడికాలువ పనులు 35 కిలోమీటర్లు ఇంకా అసంపూర్తిగా ఉన్నప్పటికీ పట్టించుకోని చంద్రబాబు ఆ కాలువ ద్వారా పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనన్నారు.  
 
 ఏపీరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు కేసీ బాదుల్లా, కార్మిక నాయకుడు సీఆర్‌వీ ప్రసాద్‌రావు, సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ తదితరులు పాల్గొన్నారు.
 
 పట్టిసీమతో ప్రయోజనం లేదు
 పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న చంద్రబాబు సీమకు నీరందించడం కోసమే పట్టిసీమను చేపడుతున్నామని చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రాయలసీమ నీటిని కోల్పోయి శాశ్వత ఎడారిగా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలేరు-నగరికి రూ. 169 కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు జూన్ నాటికి గండికోట ద్వారా నీరెలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ముడుపులు దండుకోవడానికే పట్టిసీమను నెత్తికెత్తుకున్నారు తప్ప సీమకు ఇందువల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.
 

Advertisement
Advertisement