Sakshi News home page

పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్‌

Published Mon, Dec 25 2017 3:17 AM

Mp office as gambling den - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్‌ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు  రూ.12 కోట్లు వరకు చేతులు మారుతున్నట్లు వినిపిస్తోంది. మూడు నెలలుగా కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పేకాట కొనసాగుతున్నా వీకెండ్‌ (శుక్ర,శని,ఆదివారాలు)లో పందేలు మరింత పెద్ద ఎత్తున నడుస్తున్నాయి.

పెద్ద సంఖ్యలో జూదరులు..  కోట్లలో పందేలు..
కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు హైదారాబాద్‌ నుంచి ప్రత్యేకంగా పేకాట రాయుళ్లను ఆహ్వానించి కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు 80 మంది నుంచి వంద మంది వరకు ఈ కోత ఆటకు వస్తుంటారు. ఎంపీ కార్యాలయంలోని పెద్ద హాలులో నిర్వహించే ఈ పేకాటలో పాల్గొనే జూదరులకు పక్క రూమ్‌లోనే మందు, విందు ఏర్పాట్లు చేయడం గమనార్హం. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల వరకు కోత ఆట జరుగుతూనే ఉంటుంది. రోజుకు కనీసం రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా  బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతోంది. అధికార పార్టీ ఎంపీ కార్యాలయం కావడంతో పోలీసులు అటువైపు చూసే సాహసం చేయలేకపోతున్నారు. అయినా నెలవారీ మూమూళ్లు షరా మామూలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు పేకాటపై కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌ కి స్పందించలేదు. 

అధికార పార్టీ నేతలు, క్రికెట్‌ బుకీలే నిర్వాహకులు...
టీడీపీ ఎంపీ కార్యాలయంలో సాగుతున్న ఈ పేకాట క్లబ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన క్రికెట్‌ బుకీలు  నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కోతాట క్లబ్‌ నిర్వహిస్తున్నందుకు గాను వారికి కమీషన్లు ముడుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు రూ.23 కోట్ల మేర కమీషన్ల రూపంలో సంపాదించారని  తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధాన క్రికెట్‌ బుకీగా పోలీస్‌ రికార్డులకెక్కిన శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి, ఇటీవల నెల్లూరులో పట్టుబడిన క్రికెట్‌ బుకీలు ఇచ్చిన సమాచారంతో పోలీస్‌ రికార్డులకెక్కిన మరో వ్యక్తి, హైదరాబాద్‌లో పేకాడుతూ పట్టుబడిన వ్యక్తి, భీమవరం తదితర ప్రాంతాల్లో భారీగా క్రికెట్‌ పందాలు, పేకాటల్లో ఆరితేరిన వ్యక్తులు ఈ జూద శిబిరానికి నేతృత్వం వహిస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ అనధికార పేకాట క్లబ్‌లో టీడీపీ నేతలు, కోత ఆట నిపుణులకు ఆరు వాటాలుండగా రాష్ట్రంలోని కీలక క్రికెట్‌ బుకీలకు ఏడవ వాటాగా లాభాలను పంచుతున్నారని సమాచారం.

జూదరులకు ఆప్పులిచ్చి మరీ ఆడిస్తున్నారు...
ప్రతిరోజూ వచ్చే జూదరులకు వారి పరపతికి తగినట్లు నిర్వాహకులు అప్పులు కూడా ఇస్తున్నారు. పేకాటరాయుళ్లకు అప్పులిచ్చే వ్యక్తి కోత ఆట జరిగే హాలులో ఒక మూలన టేబులు, కుర్చీ వేసుకుని కూర్చుని ఉంటారు. ప్రతీ రోజు దాదాపు రూ.5 కోట్ల మేర అప్పుగా ఇచ్చి వారి పేర్లు నమోదు చేసుకుంటాడు. కరెన్సీకి బదులు రంగు రంగుల కాయిన్స్‌ ఇస్తాడు. రూ.10 లక్షలను అప్పుగా ఇచ్చినందుకు రోజుకు రూ.20 వేలు కమీషన్‌గా వసూలు చేస్తాడు. మొదటి రోజు అప్పుగా తీసుకున్న మొత్తాన్ని మరుసటి రోజు పేకాటకు వచ్చినప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోత ఆటలో నిర్వాహకులకే ఎక్కువ ఛాన్స్‌లు ఉండటంతో పేకాట రాయుళ్ల జేబులు గుల్లవుతున్నాయి. ఇటీవల కోత ఆటలో భారీగా నష్టపోయిన వైజాగ్, ఒంగోలు, భీమవరం, విజయవాడకు చెందిన పలువురు యువకులు ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన దుస్థితి వచ్చింది.   అప్పులు తీర్చలేక మరికొందరు జూదరులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. 

ఏమిటి ఈ కోత ఆట..??
పేకాటలో అత్యంత ప్రమాదకరమైన గేమ్‌ ఇది. సహజంగా రిక్రియేషన్, కల్చరల్‌ క్లబ్‌ల్లో 13 పేక ముక్కలతో ఆడే రమ్మీ (కిల్‌ గేమ్‌)ని ఎటువంటి బెట్టింగ్‌లు లేకుండా అధికారులు అనుమతిస్తుంటారు. కానీ బెట్టింగ్‌లతో ఆడే పేకాట, కోత ఆట, కోసు పందేలపై మాత్రం నిషేధం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లకే గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ తెచ్చారు. దాని ప్రకారం స్కిల్‌ గేమ్‌ మినహా.. బెట్టింగ్‌ వేసే ఏ పేకాటను చట్ట ప్రకారం అనుమతి ఇవ్వరు. కోత ఆట అంటే లోనా బయటా ముక్కలు తిప్పుతూ ఎంపిక చేసిన పేక ముక్క ఎటువైపు పడితే అటువైపు పందేలు గెలిచినట్లుగా పరిగణిస్తుంటారు. ఇందులో క్షణాల్లో లక్షలాది రూపాయలు అటో ఇటో తేలిపోతాయి. దీనికంటే ప్రమాదకరమైంది కోసు పందెం. ఇందులో లోనా బయటా పేకలు తిప్పుతూ ఎక్కువ అవకాశాలు నిర్వాహకులకే ఉంచుకుంటారు. çఫలానా పేక ముక్క వస్తే పందెం డబ్బు ఇవ్వబోమని చెబుతారు. రెండో ముక్క, ఒకటో ముక్క ఇలా ఎంపిక చేసిన పేక ముక్క నిర్వాహకులు చెప్పినట్లు వస్తే ఆ మొత్తం నిర్వాహకుల జేబుల్లోకి వెళితాయి. ఒకటికి రెండు, మూడు రెట్లు అదనంగా ఇస్తామని ప్రకటిస్తూ నిర్వాహకులు మోసం చేస్తుంటారు. 

పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్‌

Advertisement

What’s your opinion

Advertisement