తాడికొండ: రాజధాని ప్రాంతంలో కోట్ల రూపాయల విలువ చేసే మట్టి, ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తూ అధికార పార్టీ నేతలు దందాచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీక్రిస్టీనా విమర్శించారు. దందా రాయుళ్లను తరిమికొట్టి సంక్షేమ పాలన అందించే జననేత వైఎస్ జగన్ను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. జగనన్న అధికారంలోకి వస్తే నవరత్నాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మరి పించే సంక్షేమ పాలన అందుతుందన్నారు.
జననేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పేరేచర్లలో శని వారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జగనన్న రాకతో పేరేచర్లకు పండుగొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో 600 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వివరించారు. పేరేచర్ల ప్రాంతంలో 30కి పైగా క్వారీలు ఉండగా, అధికార పార్టీ నాయకులు 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నాలుగేళ్లలో దోచుకున్నారని విమర్శించారు.
స్టోన్ క్రషర్ల కారణంగా పేరేచర్ల కాలుష్యం కోరల్లో చిక్కుకొని, ఊపిరితిత్తులు చెడిపోయి, క్యాన్సర్ వంటి వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
సీఐఐ సమ్మిట్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదలచేయాలి
దిగంవత మహానేత వై ఎస్ రాజశేఖరరెడ్డి మరణించి తొమ్మిదేళ్లయినా సంక్షేమ పాలనతో ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచా రని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పేరేచర్లలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, జన్మభూమి కమిటీలతో ప్రజ లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అప్పు రూ.90 వేల కోట్ల నుంచి రూ.215 వేల కోట్లకు చేరిందని దుయ్యబట్టారు.
విశాఖలో సీఐఐ సమ్మిట్ ద్వారా 3 సంవత్సరాల్లో రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తోక పత్రికల్లో కథనాలు రాయిం చుకున్నారని, వాటిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఫిరంగి పురం మండలం వేమవరంలో నలు గురు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, ఇప్పటికీ పైసా ఇవ్వలేదని విమర్శించారు. తుళ్లూరు మండలం రాజధాని ప్రాంతంలో రైతులు నాలుగేళ్లుగా సాగుకు దూరమై, ఆదాయం లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తోక పత్రికల్లో రాజధానిపై రోజుకొక డిజైన్, బాహుబలి చిత్రాలు చూపిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే రాజధాని అభివృద్ధి సాధ్యమన్నారు.