Sakshi News home page

బంద్‌ విజయవంతం

Published Tue, Aug 2 2016 11:07 PM

బంద్‌ విజయవంతం

ఉదయం 5 గంటల నుంచి నాయకులు, ప్రజల బైఠాయింపు
వెలవెలబోయిన ప్రభుత్వ కార్యాలయాలు
బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర
అడుగడుగునా అడ్డలంకులే..
 
ప్రత్యేక హోదా కోసం పరితపిస్తున్న ప్రతి వ్యక్తి బంద్‌లో భాగస్వాములయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు అడుతున్నారంటూ నిరసన తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో జరిగిన బంద్‌ సక్సెస్‌ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలిపాయి. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. 
 
సాక్షి, అమరావతి : జిల్లాలో బంద్‌ సక్సెస్‌ అయింది. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రతిబింబించేలా ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. టీడీపీ, బీజేపీల తీరును ఎండగడుతూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్‌కు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌తో పాటు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దుకాణాలు, విద్యాసంస్థలు, పెట్రోలు బంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం ఐదు గంటలకే ఆర్టీసీ బస్‌ డిపోల వద్దకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకొని బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న బంద్‌ను విఫలం చేసేందుకు చేసిన ప్రభుత్వ కుట్రను ప్రజలు తిప్పికొట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలను అడ్డుకొని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజలు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా నినాదాన్ని గట్టిగా వినిపించారు. మంగళవారం జరిగిన బంద్‌లో ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష జనంలో ప్రతిబింబించింది. యువకులు, విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లా అర్బన్‌ పరిధిలో 242 మంది, రూరల్‌ పరిధిలో 589 మంది కలిపి మొత్తం 831 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
  • గుంటూరు నగరంలో ఉదయం ఐదు గంటలకే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌lముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు మేరుగ నాగార్జున, వాణిజ్య విభాగం నాయకుడు ఆతుకూరి ఆంజనేయులు ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకుని బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వారిని ఏడు గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌విలాస్‌ సమీపంలోని ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేస్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఎసై ్స అమీర్‌ వీరిపై దురుసుగా ప్రవర్తించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బైఠాయింపులో సీపీఎం జిల్లా అధ్యక్షుడు పాశం రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మౌనప్రదర్శన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముత్యాలరావు, షేక్‌ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
  • చిలకలూరిపేట నియోజకవర్గంలో బంద్‌కు అపూర్వ స్పందన లభించింది. ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ నేతత్వంలో పట్టణంలో బైక్‌ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. పోలీసులు ఆయనతోపాటు 14 మంది పార్టీ నేతలను అరెస్టు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. 
  • పెదకూరపాడులో నియోజకవర్గ ఇన్‌చార్జి కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. ప్రజలు బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
  • మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఆధ్వర్యంలో బంద్‌ సాగింది. తెల్లవారుజామున మూడు గంటలకే బస్టాండ్‌కు చేరుకుని బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. రింగ్‌రోడ్డు సెంటర్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజలు మాచర్ల – గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.
  • రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేతత్వంలో బంద్‌ చేపట్టారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పట్ణణ అధ్యక్షుడు రాధాకష్ణమూర్తి సహా ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 
  • మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల ఆర్కే ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పార్టీ శ్రేణులు బస్టాండ్‌కు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. తాడేపల్లి, దుగ్గిరాలలో బంద్‌ విజయవంతమైంది. ఎమ్మెల్యేతో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
  • నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా నిలువరించారు. ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు గంటల పాటు స్టేషన్‌లో నిర్బంధించారు.
  • గురజాల నియోజకవర్గంలో జంగా ఆధ్వర్యంలో బంద్‌ సాగింది. జంగాతో పాటు పలువురు ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పిడుగురాళ్లలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. 
  • బాపట్ల నియోజకవర్గంలో పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బస్సు డిపో వద్ద బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీరితోపాటు మరో పది మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement