Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

Published Fri, Jun 23 2017 10:20 PM

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు - Sakshi

– కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక  
-  ఘనంగా ఒలింపిక్‌ డే
– ఐదు కూడళ్ల నుంచి ఒలింపిక్‌ జ్యోతులతో ప్రజాప్రతినిధుల రన్‌
– భారీగా తరలి వచ్చిన విద్యార్థులు, క్రీడాకారులు
– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు 
 
కర్నూలు (టౌన్‌):  క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎంపీ బుట్టారేణుక  క్రీడాకారులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఒలింపిక్‌ డేను పురస్కరించుకొని  శుక్రవారం కర్నూలు నగరంలో ఔట్‌డోర్‌స్టేడియంలో  నిర్వహించిన కార్యక్రమంలో ఆమె  అతిథిగా హాజరై మాట్లాడారు.  ఒలింపిక్‌ సంఘం రాష్ట్ర చైర్మన్‌ కె.యి. ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలను ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా  ఎంపీ మాట్లాడుతూ శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో  రాణించే అవకాశం ఉందన్నారు.  జిల్లా కలెక్టర్‌ సత్యనారయణ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రతి ఏడాది ఒలింపిక్‌ డే నిర్వహిస్తు‍న్నారన్నారు.   నగరంలో ఇంతపెద్ద ఎత్తున రన్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ   ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యత  ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి   ఇష్టమైన క్రీడను ఎంచుకొని అందులో రాణిస్తే స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాలు వస్తాయన్నారు.
 
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎవ్వరికీ లేని గుర్తింపు  క్రీడాకారులకే ఉందన్నారు.  రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ  రాబోయే రోజుల్లో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. టీజీవీ సంస్థల అధినేత టీజీ భరత్‌ మాట్లాడుతూ క్రీడారంగానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఆధునిక ఒలింపిక్‌ జ్యోతులకు అయ్యే ఖర్చు తాము భరిస్తామన్నారు.   రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఒలింపిక్‌ డే వేడుకల్లో పాలొ​‍్గని  విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ  అభినందనలు తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఆర్‌డీఓ హుసేన్‌ సాహెబ్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ సీబీ హరినాథ్‌రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మల్లికార్జున పాల్గొన్నారు.
 
ఐదు కూడళ్ల నుంచి ఒలింపిక్‌ జ్యోతులతో రన్‌ 
  ఒలింపిక్‌డేను   పురస్కరించుకొని నగరంలోని ఐదు ముఖ్య కూడళ్ల నుంచి ఒలింపిక్‌ జ్యోతులతో ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థినీ, విద్యార్థులు భారీ రన్‌ నిర్వహించారు. స్థానిక స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియం నుంచి టీజీ భరత్, సిల్వర్‌ జూబ్లీ కళాశాల నుంచి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, స్పెషల్‌ కలెక్టర్‌ సుబ్బారెడ్డి, మల్లికార్జున, చెన్నమ్మ సర్కిల్‌ నుంచి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, పాత బస్తీ ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం చైర్మెన్‌ కేఈ ప్రభాకర్, కార్యదర్శి పురుషోత్తం, ఏపీఎస్‌పీ పోలీసు పటాలం నుంచి కమాండెంట్‌ శామ్యూల్‌జాన్, నగరపాలక సంస్థ కమిషనర్‌ హరినాథ్‌రెడ్డి క్రీడా జ్యోతులను వెలిగించి జెండా ఊపి రన్‌ ప్రారంభించారు. ఐదు కూడళ్ల నుంచి  స్థానిక రాజ్‌విహార్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడి నుంచి స్టేడియానికి చేరుకున్నారు. 
 
 విజేతలకు బహుమతులు 
ఒలింపిక్‌ డే రన్‌ను పురస్కరించుకొని మూడు రోజుల పాటు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు, మెడల్స్‌ను అందించారు. అంతర్జాతీయ క్రీడాకారులైన  డేవిడ్ (సాఫ్ట్‌బాల్‌), జాఫ్రిన్ (టెని​‍్నస్‌), లావణ్య (వాలీబాల్‌)ను కమిటీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌తో పాటు అతిథులు ఘనంగా సన్మానించారు. 
 
 అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు 
 ఒలింపిక్‌ డే రన్‌ను పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని అలరించాయి. శ్రీలక్ష్మి, మాంటిస్సోరి, ఇండస్‌ పాఠశాలల విద్యార్థులు, సైక్లోన్‌ డ్యాన్స్‌ అకాడమి న​ృత్యకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘం కమిటీ సభ్యులు రవూఫ్, విజయ్‌కుమార్, రామాంజనేయులు, శ్రీనివాసులు, కబడ్డీ సంఘం కార్యదర్శి రాజశేఖర్, అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి హర్షవర్దన్, స్కేటింగ్‌ సంఘం కార్యదర్శి సునీల్‌కుమార్, త్రోబాల్‌ సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్, పీఈటీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్, జాకీర్, సాఫ్ట్‌బాల్‌ సంఘం కార్యదర్శి గంగాధర్, వెయిట్‌లిఫ్టింగ్‌ కార్యదర్శి పాపా పాల్గొన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement