Sakshi News home page

కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలి

Published Sun, Jan 21 2018 10:06 AM

kapu leader mudragada padmanabham fires on rolling party - Sakshi

సాక్షి, కొత్తపల్లి: కాపులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించకుండా, బీïసీ–ఎఫ్‌లో చేర్చడం, బిల్లు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కొత్తపల్లిలో ఉన్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు ఇంటికి శనివారం అల్పాహారానికి హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ ప్రభుత్వం అసిస్టెంట్‌ పోస్టులు 700 లకు మొదటి విడతగా నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని రెండో విడతగా మరో 700 పోస్టులకు నోటిఫికేషన్‌ రెండు నెలల్లో విడుదల చేయనుందన్నారు. 

అలాగే పోలీసు శాఖకు సంబంధించిన పలు ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తోందన్నారు. అయితే కాపు యువతీ, యువకులకు సంబంధించి బీసీ–ఎఫ్‌లో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్‌ కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో జారీ చేసే పోస్టులకు రాష్ట్రపతి సంతకం అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఉద్యోగాలకు మాత్రమే రాష్ట్రపతి సంతకం, పార్లమెంట్‌ తీర్మానం, కేంద్ర బీసీ కమిషన్‌ రిపోర్టు కావాలన్నారు. రాష్ట్ర పరిధిలో విడుదల చేసే నోటిఫికేషన్‌కు రాష్ట్రపతి సంతకం లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినేట్‌లో చర్చించినప్పటికీ రిజర్వేషన్‌ కల్పించకపోవడం వల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత లేదన్నారు. 

కేంద్రానికి పంపుతున్నామనడం ఎంత వరకూ సబబన్నారు. ఇది కేంద్రానికి పంపనవసరం లేదన్నారు. రాష్ట్ర పరిధిలో విడుదల చేసే నోటిషికేషన్‌ను ఆమోదించే సర్వాధికారాలు సీఎంకు ఉన్నాయని, దీనిపైనే ఉద్యోగాలకు రిజర్వేషన్‌ కల్పించాలని లేఖ రాశానని, ఆయన నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి ఉందన్నారు. మండల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మండల యువజన అధ్యక్షుడు మారిశెట్టి బుజ్జి, తలిశెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement