Sakshi News home page

'నయీంను పెంచి పోషించింది టీడీపీనే'

Published Fri, Aug 12 2016 4:11 AM

'నయీంను పెంచి పోషించింది టీడీపీనే' - Sakshi

* ‘హోదా’ విషయంలో టీడీపీది ద్వంద్వవైఖరి
* వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి

సాక్షి, హైదరాబాద్:  నయీం చేసిన ఘోరాలపై విచారణ జరపడమే కాదు, ఆయన వెనకుండి ప్రోత్సహించిన వారి చిట్టాలనూ ప్రజలముందుంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నయీం మూలాలన్నీ టీడీపీ నేతల చుట్టే తిరుగుతూ ఉండటం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. టీడీపీవాళ్లు ఈ రకంగా కూడా రాజకీయాలు చేస్తున్నారా? అనే ఆందోళన కలుగుతోందన్నారు.

పత్రికల్లో వస్తున్న వార్తలు, టీఆర్‌ఎస్‌లోని కొందరు సీనియర్ నేతలు చెబుతున్న మాటల్నిబట్టి చూస్తే నయీంను గతంలో పెంచిపోషించింది ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలేననేది తెలిసిపోతోందన్నారు. నయీం కేసులో ఏ-1గా టీడీపీ మాజీమంత్రి ఒకరిని పెడుతున్నారని వార్తలొస్తున్నాయన్నారు. నయీం చేసిన నేరాలు ఎంత ఘోరమైనవో... అతన్ని పెంచి పోషించిన వారిదీ అంతే  తప్పిదమన్నారు.
 
ఏపీలో ఎంతమంది నయీంలను పోషిస్తారో...
అధికారంకోసం రౌడీల్ని పెంచి పోషించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే సంస్కృతి టీడీపీలో ఉండటం చూస్తే ఇక రాజధాని భూదందాలు, తీవ్రమైన కుంభకోణాలకు పాల్పడుతున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది నయీంలను... పెంచిపోషిస్తుందోననే భయాందోళనలు కలుగుతున్నాయని అన్నారు.  ప్రత్యేకహోదా కావాలనే సెంటిమెంట్‌ను జగన్ రెచ్చగొడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్‌బాబు చెప్పడం ఆపార్టీ ద్వంద్వవైఖరికి, డ్రామాలకు నిదర్శనమని పార్థసారథి దుయ్యబట్టారు.

ప్రత్యేకహోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని అన్నారు. ‘హోదా’ వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని జగన్ చెబుతున్నారని లోకేశ్ విమర్శిస్తూ ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి? సమస్యలన్నీ తీరిపోతాయా? అని చెప్పడంలో అర్థమేమిటన్నారు. హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, వద్దని లోకేశ్ ధైర్యంగా చెప్పగలరా? అని సవాలు విసిరారు.

Advertisement

What’s your opinion

Advertisement