– నాగార్జున
‘‘ఈ సినిమాలో కొత్త చైతూను చూస్తారు. అభిమానులు చైతూను ఎలా చూడాలనుకుంటున్నారో.. అతని షర్ట్ బటన్స్ ఎలా తెగాలనుకుంటున్నారో... అలాగే చూస్తారు. తండ్రిగా కొడుకుని ఎక్కువ పొగడకూడదు. కానీ, నిర్మాతగా చెబుతున్నా... మై హీరో ఈజ్ సూపర్. చైతూలో ఆల్రౌండర్ను మీరు చూస్తారు’’ అన్నారు నాగార్జున. తనయుడు నాగచైతన్య హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘రారండోయ్.. వేడుక చూద్దాం’. రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమా పాటల వేడుక ఆదివారం హెదరాబాద్లో జరిగింది.
నాగార్జున మాట్లాడుతూ – ‘‘ఏడాది క్రితం నా కుమారులు ఇద్దరితో రెండు బ్లాక్బస్టర్స్ ఇస్తానని అభిమానులకు ప్రామిస్ చేశా. ఫస్ట్ బ్లాక్బస్టర్ ఈ సినిమా. ‘సోగ్గాడే...’ ఆడియోలో ఏం చెప్పానో... మళ్లీ ఇప్పుడదే చెబుతున్నా. ‘వస్తున్నాం. మళ్లీ (హిట్) కొడుతున్నాం’ – ఇది ఫిక్స్. అఖిల్ రెండో బ్లాక్బస్టర్ పనిలో ఉండడంతో ఇక్కడికి రాలేకపోయాడు. ఈ సినిమాకి అద్భుతమైన పాటలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్కి థ్యాంక్స్’’ అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన చిత్రమిది. పక్కా కమర్షియల్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాలో చిన్న భయం ఉండేది. కానీ, ఇప్పుడిది కూడా నా కంఫర్ట్ జోన్ అయ్యింది. ఈ నెల 26న కలుద్దాం’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నాకు పెద్దన్నయ్యతో సమానం. రెండున్నరేళ్ల క్రితం ఆయన్ను కలిశా. అప్పట్నుంచి ఆయనతో గడిపిన ప్రతిక్షణం విలువైనదే. నేను ఈ స్థాయిలో ఉండే అవకాశం కల్పించిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. చై (నాగచైతన్య) తెల్లటి కాగితం. నిజంగా బంగారం లాంటోడు’’ అన్నారు కల్యాణ్కృష్ణ. ఈ వేడుకలో అక్కినేని అమల, రకుల్ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.