న్యూఢిల్లీ: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ షాక్కు గురై రెండు చేతులను పోగొట్టుకున్న బాలుడికి కోటి రూపాయల నష్టపరిహారమివ్వాలని సుప్రీం కోర్టు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఏఎమ్ సప్రేలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 2012లో హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు వ్యవసాయ భూమిలో తన తల్లికి సాయపడుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్కు గురవటంతో బాలుడి రెండు చేతుల్ని తొలగించారు.
నష్టపరిహారంపై ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు రూ.1.25 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం∙సుప్రీం కోర్టును సంప్రదించింది. వాదనలు విన్న అనంతరం నష్టపరిహారాన్ని రూ.90 లక్షలకు తగ్గిస్తూ..దానిపై 2013 నుంచి 6 శాతం సాధారణ వడ్డీతో కలిపి మొత్తం రూ. 1.16 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదని సుప్రీం కోర్టు పేర్కొంది. దేశమంతటా ఆక్రమణలను తొలగించేలా ఆదేశాలివ్వాలని వాయిస్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ధానేశ్ ఈశ్ధాన్ వేసిన పిటిషన్ పై విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.