సెమీస్‌లో సానియా–బెథానీ జోడీ

5 Jan, 2017 00:47 IST|Sakshi
సెమీస్‌లో సానియా–బెథానీ జోడీ

బ్రిస్బేన్‌: ఈ ఏడాది ఆడుతున్న తొలి టోర్నమెంట్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తన భాగస్వామి బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)తో కలసి బ్రిస్బేన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన డబుల్స్‌ రెండో రౌండ్‌లో సానియా–బెథానీ ద్వయం 6–4, 4–6, 10–5 తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఇరీనా బెగూ (రొమేనియా) –దరియా కసత్‌కినా (రష్యా) జంటపై గెలిచింది. క్లెపాక్‌ (స్లొవేనియా)–మరియా జోస్‌ (స్పెయిన్‌), సు వీ సెయి (చైనీస్‌ తైపీ)–లారా సిగెమండ్‌ (జర్మనీ)ల మధ్య జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో సానియా జోడీ తలపడుతుంది.

సానియాకు సంకటం: గత 91 వారాలుగా ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అప్రతిహతంగా దూసుకుపోయిన సానియా మీర్జా తన అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. మ్యాచ్‌ ఓడితే కాకుండా... సానియా మరో విజయం సాధిస్తే అది ఆమెను నంబర్‌వన్‌ నుంచి దూరం చేయనుండటం ఆసక్తికరం పరిణామం! అదీ ఆమె భాగస్వామిగా ఈ టోర్నీ ఆడుతున్న బెథానీ నంబర్‌వన్‌ స్థానానికి చేరుకునే అవకాశ ముంది. ఈ టోర్నీలో సానియా–బెథానీ జోడి ఫైనల్లోకి ప్రవేశిస్తే బెథానీ నంబర్‌వన్‌ అవుతుంది. సానియా రెండో స్థానానికి పడిపోతుంది. ఈ వివరాలు సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు