Sakshi News home page

క్వార్టర్స్ లో శ్రీకాంత్

Published Thu, Sep 19 2013 11:38 PM

క్వార్టర్స్ లో శ్రీకాంత్ - Sakshi

టోక్యో: సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్, కేరళ కుర్రాడు హెచ్.ఎస్.ప్రణయ్... జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడ్ శ్రీకాంత్ 21-12, 21-16తో కజ్‌తెర్ కొజాయ్ (జపాన్)పై విజయం సాధించాడు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీ.. స్మాష్‌లతో చెలరేగాడు. కీలక సమయంలో నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించాడు. ఆరంభంలో ఇద్దరు ప్లేయర్లు మెరుగ్గా ఆడటంతో స్కోరు 7-7తో సమమైంది.
 
 
  అయితే ఏపీ కుర్రాడు కాస్త దూకుడు పెంచి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గాడు. చివర్లో మరో నాలుగు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో జపాన్ ఆటగాడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 5-5, 10-10, 16-16తో స్కోరు సమం చేశాడు. ఈ దశలో శ్రీకాంత్ బలమైన స్మాష్‌లతో హోరెత్తించాడు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను వశం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో జయరామ్ 21-13, 11-21, 21-18తో యుచి కెదా (జపాన్)పై పోరాడి నెగ్గగా; ఆనంద్ పవార్ 12-21, 16-21తో టాప్‌సీడ్ లీ చోంగ్‌వీ (మలేసియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. డబుల్స్‌లో మను ఆత్రి-సుమీత్ రెడ్డి 17-21, 16-21తో జియోలాంగ్ లీ-జిహాన్ క్యూ (చైనా) చేతిలో కంగుతిన్నారు.
 
 ప్రణయ్ సంచలనం
 మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్.ఎస్.ప్రణయ్ సంచలనం సృష్టించాడు. 21-14, 13-21, 21-17తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ జాన్ ఓ జార్గెన్‌సెన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ పోరాట స్ఫూర్తిని కనబర్చాడు. తొలి గేమ్‌లో 1-4తో వెనుకబడ్డా 9-9తో స్కోరును సమం చేశాడు. తర్వాత బలమైన స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా పాయింట్లు సాధించాడు. రెండో గేమ్‌లో 4-2 ఆధిక్యంలోకి వచ్చిన జార్గెన్‌సన్‌ను ఓ దశలో ప్రణయ్ అధిగమించినా.. చివరి వరకు అదే జోరును కనబర్చలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన భారత కుర్రాడు 18-17 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను నిలబెట్టుకున్నాడు.
 
 సింధు ఓటమి
 మహిళల ప్రిక్వార్టర్స్‌లో ఏపీ అమ్మాయి పి.వి.సింధు 6-21, 17-21తో అకెని యమగుచి (జపాన్) చేతిలో ఓడింది. 32 నిమిషాల ఈ మ్యాచ్‌లో సింధు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. స్మాష్‌లు సంధించడంతో పాటు నెట్ వద్ద పూర్తిగా విఫలమైంది. తొలి గేమ్‌లో నిరాశపర్చిన సింధు... రెండో గేమ్‌లో పుంజుకునే ప్రయత్నం చేసింది. అయితే క్వాలిఫయర్ యమగుచి భిన్నమైన షాట్లతో భారత క్రీడాకారిణిని కట్టిపడేసి సంచలనం సృష్టించింది.
 
 దిగజారిన సింధు ర్యాంక్
 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో... హైదరాబాద్ ప్లేయర్ పి.వి.సింధు రెండు ర్యాంక్‌లు దిగజారింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 12వ స్థానంలో నిలిచింది. స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ 14వ, గురుసాయిదత్ 23వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. అజయ్ జయరామ్ ఏడు స్థానాలు కోల్పోయి 30వ ర్యాంక్‌లో, ఆనంద్ పవార్, సాయి ప్రణీత్, కె.శ్రీకాంత్, సౌరభ్ వర్మలు వరుసగా 37, 38, 39, 46వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement