హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి | Sakshi
Sakshi News home page

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి

Published Sat, Nov 26 2016 3:10 AM

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి - Sakshi

 కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కిషన్‌రెడ్డి వినతి
 సాక్షి, హైదరాబాద్: హోంగార్డులుగా మూడేళ్ల శిక్షణ, అనుభవం ఉన్న వారిని కేంద్ర ఉత్తర్వుల మేరకు కానిస్టేబుళ్లు, సెక్యూరిటీ గార్డులు, డిస్పాచ్ రైడర్స్, ప్యూన్లు, ఆర్డర్లీలు, చౌకీదార్లు, ఫైర్‌మెన్లు, ఫారెస్ట్ గార్డులు తదితర పోస్టుల్లో నియమించేలా చూడాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న హోంగార్డులను కానిస్టేబుళ్లు, ఇతరత్రా పోస్టుల్లో నియమించవచ్చని కేంద్రం గతంలో సర్క్యులర్‌ను జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు వివరించారు. శుక్రవారం ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయంలో రాజ్‌నాథ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. మిజోరాం ప్రభుత్వం హోంగార్డులను కార్పెంటర్లుగా నియమిస్తూ నిబంధనలను కూడా రూపొందించిందన్నారు.
 
 రాష్ట్రాల పోలీసు శాఖలకే అధికారం: రాజ్‌నాథ్
 రాష్ట్రాల్లోని పోలీసు శాఖలే హోంగార్డులను నియమిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కిషన్‌రెడ్డి సమర్పించిన వినతి పత్రంపై స్పందిస్తూ, హోంగార్డులకు సంబంధించిన చట్టాలను మార్చుకుని పూర్తిస్థారుులో ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాల కల్పన అధికారం రాష్ట్రాలకే ఉందని తెలిపారు. హోంగార్డుల పరిస్థితుల మెరుగుకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయని స్పష్టం చేశారు. 
 

Advertisement
Advertisement