కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు | Sakshi
Sakshi News home page

కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు

Published Sun, Jun 29 2014 1:19 AM

కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల సం ఖ్యను స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీలుగా మారిన కొత్త పట్టణాల్లో బార్ల ఏర్పాటు కు లెసైన్స్‌లు జారీ చేస్తారు. జూలై 1 నుంచి మొదలు కాబోతున్న 2014- 15 ఎక్సైజ్ పాలసీని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. జూలై ఒకటి నుంచి ప్రస్తు త బార్లను రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా జీవోలు జారీ చేశారు. కాగా,బార్ల లెసైన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబుల్లో ఈ ఫీజులు ఉంటాయి. అయితే ప్రివిలేజ్ ఫీజు 5 రెట్లకు కుదించారు. అంటే లెసైన్స్ ఫీజు కన్నా ఐదు రెట్ల అమ్మకాలు దాటితే, తరువాత కొనుగోలు చేసే బాటిళ్లపై ఎక్సైజ్ శాఖ 14.5 శాతం ఫీజు వసూలు చేస్తుంది.


పెరగనున్న బార్లు: తెలంగాణలోని 10 జిల్లాల్లో బార్ లెసైన్స్‌లు 726 ఉన్నప్పటికీ ప్రస్తుతం 704 మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పటివరకు బార్లులేని కొత్త మునిసిపాలిటీల్లో వాటిని ఏర్పాటుకు ఎక్సైజ్ కమిషనర్ అనుమతిస్తారు. రాష్ట్రంలో మొత్తం 38 మునిసిపాలిటీలు ఉండగా వీటిలో 8 కొత్తవే. బార్ల లెసైన్స్ ఫీజు ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.   కాగా ప్రివిలేజ్ ఫీజును 5 రెట్లకు తగ్గించడం వల్ల ఒక్కో బార్ నుంచి కనీసం రూ. 5లక్షల వరకు సర్కార్‌కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement