ముందడుగు | Sakshi
Sakshi News home page

ముందడుగు

Published Thu, Nov 27 2014 1:59 AM

'Slum Free City' State Screening Committee green signal

* ‘స్లమ్ ఫ్రీ సిటీ’కి స్టేట్ స్క్రీనింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్
* రూ.2,374 కోట్లతో 183 మురికివాడల అభివృద్ధి
* ‘స్మార్ట్ సిటీ’కి డీపీఆర్‌కు సన్నాహాలు
* ‘ఫండ్ యువర్ సిటీ’తో 15 జంక్షన్ల ముస్తాబు
* సమావేశంలో నగర కమిషనర్ సువర్ణ పండాదాస్

వరంగల్ అర్బన్ : ఓరుగల్లు రూపురేఖలు మార్చే బృహత్తర ప్రణాళికకు నగర పాలక సంస్థ ముందడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ హోదా దక్కుతుందనే విశ్వాసంతో బల్దియా అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రతిపాదలకు రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు ప్రకటించారు. ఫండ్ యువర్ సిటీ కింద 15 జంక్షన్లకు నిధులు సేకరించి మోడల్‌గా ముస్తాబు చేస్తామని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు, మౌలిక వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సువర్ణ పండాదాస్ బుధవారం సాయంత్రం బల్దియా కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
 
పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రతిపాదనలకు ఆమోదం
వరంగల్ స్లమ్ ఫ్రీ సిటీ యాక్షన్ ప్లాన్‌కు స్టేట్ లెవల్ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ నగరాలు స్లమ్ ఫ్రీ సిటీ యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించాయి. మొదట వరంగల్ మురికివాడలపై బల్దియా రూపొందించిన డీపీఆర్‌పై స్క్రీనింగ్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ట్రైసిటీస్‌లో ఉన్న 183 మురికివాడల్లోని పేదలకు మౌలిక వసతులు, డబుల్‌బెడ్ రూమ్‌లతో కూడిన ఇళ్లకు ప్రతిపాదనలు రూపకల్పన చేయడం జరిగింది. గతంలో సింగల్ బెడ్ రూమ్‌కు 274 స్కేర్ ఫీట్లతో తయారు చేయగా, తాజాగా 458 స్కేర్ ఫీట్లతో తయారు చేయడం జరిగింది. యూనిట్ కాస్ట్ గతంలో రూ.5.72 లక్షలు కాగా ఇప్పడు రూ.8.15 కోట్లుగా అంచనాతో తయూరు చేశారు.

ప్రాజెక్టు వ్యయం రూ.2,374 కోట్లతో తయారు చేసి డీపీఆర్‌లను సమర్పించడమైనది. 2013-2022లో తొమ్మిదేళ్లలో మురికివాడల్లో మెరుగైన వసతులు సమకూరుస్తాం. తొలి దశగా మురికివాడల్లోని అంబేద్కర్ నగ ర్, గాంధీనగర్, మీరాసాహెబ్ కుంటలను పైలేట్ ప్రాజెక్టు ఎంచుకొని అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.70.76 కోట్ల నిధులు మంజూరు చేసింది. 31 మురికివాడలు అ త్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్నాయని, ఇక్కడి ప్రజల కోసం ప్రభుత్వ స్థలం 62 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నాం. ఈ స్థలంలో 31 మురికివాడల్లోని 6,336 మంది కు టుంబాలకు బహుళ అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్‌లతో ఇళ్లను కట్టించి, వసతులు సమకూర్చాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథ కం శంకుస్థాపన చేసేందుకు సన్నహాలు చేస్తున్నాం.
 
స్మార్ట్‌సిటీకి ప్రతిపాదనలు
దేశ వ్యాప్తంగా 100 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో వరంగల్ నగరం ఒకటి. స్మార్ట్ సిటీ కోసం ప్రతిపాదనలను తయారు చేస్తున్నాం. పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్టు, సిస్టమ్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పార్కింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్మార్ట్ పవర్ గ్రిడ్ సిస్టమ్, వైఫై సర్వీసు కనెక్టివిటి, ప్రతి ఇంటి నంబరును జీఐఎస్ నమోదు, ఈ-గవర్నెన్సి ఇ-సేవా సెంటర్లు, తాగునీటి సరఫరాలో స్కాడా సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, సివరేజీ సిస్టమ్స్, ఎస్‌ఎఫ్‌సీపీవోఏ సిస్టమ్, ఇంటెలిజెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అందుకోసం నిట్ ప్రొఫెసర్లు, ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను తీసుకోనున్నాం. స్మార్ట్‌సిటీపై త్వరలో స్టేక్ హోల్డర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం.
 
ఫండ్ యువర్ సిటీతో 15 జంక్షన్ల ముస్తాబు
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య వర్గాలు, సంస్థల ద్వారా ఫండ్ యువర్ సిటీ నిధులను సేకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రైసిటీస్‌లో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 15 జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. మడికొండ, కాజీపేట, వడ్డేపల్లి క్రాస్ రోడ్డు, కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ ఆర్టీసీ, రాంనగర్, కిట్స్, వడ్డేపల్లి చర్చి, గోపాలపురం, మిషన్ ఆస్పత్రి, వరంగల్ రైల్వే-ఆర్‌టీసీ బస్‌స్టేషన్, పెద్దమ్మ గడ్డ, హంటర్ రోడ్డు ఆర్‌వోబీ, అబ్బనికుంట, గోకుల్ నగర్ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

అందుకోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, క్లబ్‌లు, చాంబర్ ఆఫ్ కామర్స్, రైస్‌మిల్లర్స్, కిరాణ మర్చంట్స్, ఫంక్షన్ హాల్స్, కూరగాయల, పండ్ల మార్కెట్, లారీ అసోసియేషన్స్ తదితర వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్, ఇన్‌చార్జీ డిప్యూటీ కమిషనర్ గంగుల రాజిరెడ్డి, ఎస్‌ఈ అబ్దుల్ రహ్మాన్, సీపీ రమేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement