► టీడీ బకాయిలపై తకరారు
► నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగాయంటున్న సర్పంచులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో గ్రామ పంచాయతీలకు అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ(టీడీ) బకాయిలు అందకుండా పోయాయి. ఫలితంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెలా భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ బకాయిలను రిజిస్ట్రేషన్ల శాఖ గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం లేదు.
ఎవరి వాదన వారిది..
పంచాయతీరాజ్ శాఖ నుంచి తమకు ఆయా గ్రామ పంచాయతీల డీడీవో కోడ్లు, పీడీ అకౌంట్ల వివరాలు అందకపోవడమే ప్రధాన కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అంటుండగా, ట్రాన్స్ఫర్ డ్యూటీని ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని తాము కోరినా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్పందన కరువైందని పంచాయతీరాజ్ అధికారులు ఆరోపిస్తున్నారు.
వడ్డీలు కట్టలేక సతమతం
రెండేళ్లుగా పంచాయతీలకు అందాల్సిన టీడీ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వమే వాడుకుంటోంది. ఉపాధిహామీ పథకం కింద మూడు నెలల కిందట దాదాపు రూ.350కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రహదారులను నిర్మిస్తే, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, కొందరు ప్రజాప్రతినిధులు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని దుస్థితి. – అందోల్ కృష్ణ, సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు
ఇప్పటి వరకు టీడీ బకాయిల మొత్తం సుమారు రూ.కోట్లు 600
16 నెలలుగా విడుదల చేయడం లేదు
ఆస్తి విలువలో టీడీగా వసూలు చేసేది 1.5%
30 రోజులు ఈ మొత్తాన్ని పంచాయతీల ఖాతాల్లో జమచేయాల్సిన సమయం: 30 రోజులు(నెల)
Related news
-
‘ధరణి’ క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంతోపాటు పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపిన కమిటీ.. శనివారం సర్వే సెటిల్మెంట్, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డులకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించింది. సోమవారం సచివాలయంలో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖతో సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలను కమిటీ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. రంగారెడ్డి, నిజామాబాద్తోపాటు ఆదిలాబాద్ లేదా ఖమ్మంలో ‘ధరణి’ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలు పూర్తయ్యాక అన్ని అంశాలను క్రోడీకరించి, ధరణి పోర్టల్ వాస్తవ పరిస్థితిని తెలి యజేస్తూ.. ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీ భావిస్తోంది. మీ శాఖల్లో ఏం జరుగుతోంది? సర్వే విభాగానికి సంబంధించి రికార్డుల జాబితా, ఖస్రా, సెస్లా పహాణీల నిర్వహణ, ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయడం, భూభారతి ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన సర్వే పటాల ప్రస్తుత స్థితి, ధరణి పోర్టల్ సమాచారానికి, పటాలకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా తమ భూమిని సబ్డివిజన్ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అందుకు అవలంబిస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక వక్ఫ్ బోర్డు అధికారులతో చర్చల్లో భాగంగా.. మొత్తం వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూవిస్తీర్ణం ఎంత? అందులో ఎంత కబ్జాకు గురైంది? వక్ఫ్ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్లో ఈ భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమావేశంలో.. ఆ శాఖ ఆదీనంలో ఉన్న మొత్తం భూవిస్తీర్ణం, ఈ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్లో సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిత్తల్, మధుసూదన్, సీఎంఆర్వో పీడీ వి.లచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల ఎకరాల్లో తేడా.. భూములను జియోట్యాగింగ్ చేసుకోండి దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డుతో చర్చల సందర్భంగా ‘ధరణి’ కమిటీ సభ్యులు పలు వివాదాస్పద అంశాలను గుర్తించారు. దేవాదాయ శాఖ గెజిట్లో, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములకు, ఆయా శాఖల పేరిట ధరణి పోర్టల్లో నమోదైన భూముల విస్తీర్ణానికి వేల ఎకరాల్లో తేడా ఉందని తేల్చారు. ఆ భూములన్నీ ఎటు పోయాయని అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇక దేవాదాయశాఖ గెజిట్లో పేర్కొనని పట్టా భూములను కూడా ధరణి పోర్టల్లో నిషేధిత భూములుగా చేర్చారని.. వీటిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ట్రిబ్యునల్ను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి భూముల విషయంలో పరిష్కార మార్గాలను వెతకాలని సూచించారు. ముఖ్యంగా దేవాదాయ భూములన్నింటినీ జియోట్యాగింగ్ చేసుకోవాలని.. పట్టాదారులు తమ భూముల వివరాలను చెక్ చేసుకునే తరహాలోనే ఎప్పటికప్పుడు తమ భూముల స్థితిగతులను పరిశీలించుకోవాలని సూచించారు. మార్గదర్శకాలు, బదలాయింపు లేనందునే సమస్యలు: ఎం.కోదండరెడ్డి శనివారం వివిధ వర్గాలతో సమావేశం తర్వాత ‘ధరణి’కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ సమస్యలపై తమ అధ్యయనం నిరంతరం కొనసాగుతుందన్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడామన్నారు. అందరితో సంప్రదింపులు పూర్తయిన తర్వాత ప్రాథమిక నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
భూముల సర్వేకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, సర్వేకు సంబంధించిన ప్ర తిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆ దేశించారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భూముల సర్వేలను పరిశీలించండి. అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే ఎలా చేయాలన్న దాని పై నివేదిక తయారు చేయండి’అని నిర్దేశించా రు. బుధవారం సచివాలయంలో భూపరిపాల న, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. భూపరిపాలన, సర్వే విభాగాల అధికారులతో సమీక్ష సందర్భంగా భూముల సర్వే అంశం చర్చకొచ్చింది. ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్లో సర్వేలు జరుగుతున్నాయని, ఏపీలో జరుగుతున్న సర్వే మోడల్ సర్వేగా ఉపయోగపడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన పొంగులేటి.. ఏపీలో ఏం జరుగుతోందో పరిశీలించడంతోపాటు మంచి, చెడులను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. భూముల క్రమబద్దీకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రెవెన్యూ రికార్డుల్లో దాపరికం ఉండకూడదని చెప్పారు. వీఆర్ఏలకు త్వరలోనే ఐడీ కార్డులు, వేతనాలివ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీసీఎల్ఏ, సర్వే–ల్యాండ్ సెటిల్మెంట్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయమెందుకు తగ్గింది? రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ వృద్ధి గతంతో పోలిస్తే సహేతుకంగా లేదని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. దీనికి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పందిస్తూ గతంలో పంచాయతీల లేఅవుట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసేవారమని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి పెండింగ్లో పడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు తెచ్చిన సవరణలు ఇబ్బందికరంగా మారాయని, ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు . దీనిపై స్పందించిన పొంగులేటి.. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతోనూ తాను మాట్లాడతానని, సుప్రీం తీర్పు ఉల్లంఘన జరగకుండా ఎల్ఆర్ఎస్ విషయంలో ఏం చేయాలో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. -
భూసమస్యలన్నీ పరిష్కారమయ్యేలా...
దాదాపు వందేళ్ళ క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సర్వేలో భూమిని అనుభవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించారు. అయితే రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు.ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని (భూ యాజ మాన్య హక్కు చట్టం) తెచ్చింది. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూకమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భారతీయుల్లో భూమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంస్కృతులు భూ యాజమాన్యానికి అనుకూలంగా ఉండడం వల్ల అందరూ దాన్ని కోరుకుంటారు. దేశంలోని గ్రామీణ కుటుంబాల మొత్తం ఆస్తిలో భూమి 73 శాతం ఉండగా, పట్టణ గృహాల ఆస్తిలో భూమి, భవనాలు 90 శాతం ఉన్నట్లు 2013 ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో తేలింది. అందుకే పెట్టుబడిదారులు, రుణదాతలు, బ్యాంకర్లు స్పష్టమైన టైటిల్, స్పష్టమైన ల్యాండ్ మ్యాపింగ్, రికార్డుల నిర్వహణ, స్పష్టమైన హక్కులు ఉండాలని కోరుకుంటారు. కానీ మెకెన్సీ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో దేశంలోని ఎక్కువ భూముల యాజమాన్యానికి సంబంధించి చట్టపరమైన వివాదాలున్నాయని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా భూముల వివాదాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ మన దేశంలో దాదాపు 70 శాతం సివిల్ వివాదాలున్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ప్రాథమికంగా బ్రిటిష్ ప్రభుత్వం 100 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. అవన్నీ ప్రభుత్వానికి భూముల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో రూపొందించినవి. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సాగు చేసేవారికి సురక్షితమైన హక్కులు ఉండేలా ప్రోత్సహించడానికి అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టాయి. ‘ఎస్టేట్లు – ఇనామ్ నిర్మూలన చట్టం’, ‘వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం’, ‘పీఓటీ’ చట్టం, ‘ఆర్ఓఎఫ్ఆర్’ వంటి చట్టా లను వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సాగుదారులకు అనుకూలంగా తీసుకువచ్చాయి. భూముల యాజమాన్యంలో జరిగిన ఈ మార్పు లన్నీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కినా... కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల క్రమం తప్పకుండా నవీకరణ (అప్డేట్) అవలేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో భూమిని అను భవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించినా... రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థి తులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ సమస్య లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ఆ చట్టాన్ని సవరించడం ద్వారా గ్రామాల వారీగా ప్రతి వ్యక్తి అధీనంలో ఉన్న భూమి వివరాలను రికార్డుల్లో అప్డేట్ చేసింది. ఇలా హక్కుల రికార్డును ప్రవేశపెట్టిన తర్వాత కూడా భూ వివాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ఊహాజనిత హక్కును మాత్రమే కల్పిస్తాయి. కొన్ని కేసుల్లో రికార్డులు క్షేత్ర స్థాయి పరిస్థితికి విభిన్నంగా ఉంటాయి. కోర్టు కేసులు, వారసత్వాలు, తనఖా వంటి భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే ఎలాంటి ఒకే ఒక్క మూలాధారం ప్రస్తుత రికార్డుల్లో లేదు. దీనివల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూ కమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భూ యాజమాన్యంపై ఉన్న గందరగోళాన్ని తొలగించేలా రీ సర్వేలో ప్రతి భూభాగానికి జియో రిఫెరెన్స్ ఇస్తున్నారు. భూమి, దానికి సంబంధించిన రికార్డులను అనేక శాఖలు (రెవెన్యూ, పంచాయితీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ శాఖలు) నిర్వహిస్తుండడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే పౌరులు వాటికి సంబంధించిన అనుమతులు, సేవలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే? భూమి యాజమాన్యం సార్వభౌమాధికారంతో ఉంటుందని దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నిశ్చయాత్మకమైన టైటిల్ విధా నానికి (కన్క్లూజివ్ టైటిల్ విధానం) మన దేశం వెళ్లలేదు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ టైటిల్ విధానం... యాజమాన్యాన్ని ధ్రువీకరించే నిశ్చ యాత్మక టైటిల్కు విరుద్ధంగా ‘అనుకూల టైటిల్ కాన్సెప్ట్’ (ప్రిజెమ్టివ్ టైటిల్) ఆధారంగా రూపొందించబడింది. అంటే భూమి అధీనంలో ఉన్న వ్యక్తి సదరు భూమికి సంబంధించి రెవెన్యూ శాఖకు పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా భావించబడే అర్థంలో ఇచ్చిన టైటిల్ మాత్రమే. అది కూడా ‘1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ ప్రకారం చట్టపరమైన స్వాధీనమే. భూమిపై లావాదేవీ జరిగినప్పుడు కూడా టైటిల్ వెరిఫి కేషన్ అవసరం లేని వ్యవస్థ కారణంగా భూమి టైటిల్ విధానం పేల వంగా ఉంది. ‘1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కూడా పత్రాల నమోదుకు సంబంధించిన చట్టమే తప్ప భూమి లేదా టైటిల్ రిజి స్ట్రేషన్కి సంబంధించినది కాదు. 1982 ఆస్తి బదిలీ చట్టానికి యాజ మాన్యం యొక్క ధ్రువీకరణ అవసరం లేదు. భూమి లావాదేవీల విషయంలో ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే ఈ చట్టాలు పరిమి తమయ్యాయి. ఆ భూముల యాజమాన్యానికి సంబంధించి ఏదైనా ప్రశ్న తలెత్తితే, అది తనదేనని నిరూపించుకోవాల్సి బాధ్యత యజమా నిపైనే ఉంటుంది. తక్షణ సంస్కరణలు అవసరం ఈ నేపథ్యంలో భూ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను నియమించింది. ఈ ‘టైటిల్ సర్టిఫికేషన్ టాస్క్ఫోర్స్’ ఒక సమగ్రమైన భూమి టైటిల్ వ్యవస్థను దేశంలో వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2011లో ఒక ముసాయిదా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తీసు కువచ్చింది. నిశ్చయాత్మకమైన ఆస్తి హక్కుల (కన్క్లూజివ్ ప్రాపర్టీ టైటిల్స్) వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాలన, నిర్వహించడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ‘టోరెన్స్’ వ్యవస్థ ఆధారంగా దీన్ని రూపొందించారు. టోరెన్స్ వ్యవస్థ 3 సూత్రాలతో ఉంటుంది. 1. మిర్రర్ సూత్రం. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ను సూచిస్తుంది. క్షేత్ర స్థాయి వాస్తవికత (గ్రౌండ్ రియాలిటీ)ను కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. 2. కర్టెన్ సూత్రం. ఇది గతానికి అడ్డుగా ఒక తెర ఉన్నన్నట్లు సూచిస్తుంది. టైటిల్ను రిజిస్టర్లో టైటిల్ నమోదు కావడమే ప్రస్తుత టైటిల్ నిశ్చయాత్మక రుజువు అనీ, గతాన్ని పరిశోధించాల్సిన అవ సరం లేదనీ చెబుతోంది. 3. హామీ సూత్రం. ఇది టైటిల్ను రిజిస్టర్ చేసే క్రమంలోనూ, భూ యజమానులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలలోనూ దొర్లే తప్పు లకు నష్టపరిహారానికి ప్రభుత్వ సంస్థల హామీని ఇస్తుంది. ఇది కోర్టుల్లో కూడా చెల్లుబాటయ్యే పూర్తి అజేయమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసనసభ 2019లో ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టా’న్ని ఆమోదించి దాన్ని భారత రాష్ట్రపతి అంగీకారం కోసం పంపింది. దాన్ని అందుకున్న కేంద్రం భూమి వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ఎల్ఓఆర్, ఐటీ, న్యాయ తదితర శాఖల పరిశీలనకు పంపింది. ఆ యా శాఖలు కొంత సమయం తీసుకుని ఈ చట్టంపై అభిప్రా యాలు, వ్యాఖ్యలు పంపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకనుగుణంగా టైట్లింగ్ బిల్లుకు పలు సవరణలు చేసి శాసనసభకు పంపింది. దీనిని 2023లో సభ ఆమోదించింది. ఆ బిల్లును మళ్లీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఇటీవలే దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నోటిఫై చేసి అమలు చేయడానికి కావల్సిన నియమాలు, మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కానీ చర్చించకుండా హడావిడిగా చట్టం తెచ్చారని కొందరు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. రెండు సార్లు పూర్తిగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాతే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. మన దేశంలో చట్టాలు ఇదే విధానంలో రూపుదిద్దు కుంటాయి తప్ప వేరే విధానంలో కాదు. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రాజ్యాంగ సవరణలు కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లవు. దీన్ని సమగ్రంగా పరిశీ లించడానికి, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పలు దఫాలుగా పంపిన వివరణలు చూసి ఆమోదించడానికి కేంద ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ సమర్థతను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు పత్రికలకు ఎక్కడం కూడా దురదృష్టకరం. బహుశా ఈ దేశంలో భూ యాజమాన్య వ్యవస్థల పరిణామం గురించి వారికి తెలియకపోవచ్చు. బ్రిటిష్వారు మొదటిసారిగా రైత్వారీ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, రెవెన్యూ సిబ్బంది అయిన సెటిల్మెంట్ అధికారులే భూమిని అనుభవిస్తున్న ప్రజలకు హక్కులు ఇచ్చారు తప్ప వేరే వారు కాదు. ఆర్ఓఆర్, ఎస్టేట్ల రద్దు, ఇనాం రద్దు, ల్యాండ్ సీలింగ్ వంటి భూమికి సంబంధించిన ప్రతి చట్టంలోనూ హక్కుదారులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ సమస్యలను పరిష్కరించడంలో, పట్టా హక్కులు లేదా యాజమాన్య హక్కులు ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బందికి మించిన జ్ఞానం ఎవరికీ ఉండదు. రెవెన్యూ సిబ్బందికి భూ చట్టాలు/సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం లేదని చెప్పడం సరికాదు. అదే సందర్భంలో ఏ సీనియారిటీ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభు త్వానికే వదిలేయాలి. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఖరారు చేస్తుంది. చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులుగా సర్వీసులో ఉన్న లేదా రిటైర్ అయిన జాయింట్ కలెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉన్న వారే నియమితులవుతారు. అప్పీలేట్ అధికారులుగా ఎవరిని నియ మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. ఈ దశలో ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవడం సరికాదు. టైటిల్ రిజిస్టర్లో నమోదైన ఎంట్రీలపై అప్పీల్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం ఎలా సరిపోతుందని కొందరు ప్రశ్నించారు. ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. మ్యుటేషన్ చట్టం, ఆర్ఓఆర్ వంటి ఏ ఇతర చట్టాల ప్రకారమైనా రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి చరిత్రలో ఎన్నడూ కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు. రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఇస్తారు. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో రెండు సంవత్సరాల సమయం ఇచ్చారు. పైన చెప్పిన టోరెన్స్ వ్యవస్థ ప్రకారం పునఃసమీక్ష, పరిష్కారం తర్వాత, రికార్డింగ్ చేయబడుతుంది, ఇది తాత్కాలికంగా మాత్రమే పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియలో పట్టాదారులకు నోటీసులు ఇవ్వబడతాయి. ఈ తాత్కా లికాన్ని సవాలు చేయడానికి ప్రజలకు 2 సంవత్సరాల సమయం ఇస్తారు. 2 సంవత్సరాలలోపు ఎటువంటి ఛాలెంజ్ లేకపోతే, తాత్కా లికమే ఫైనల్ అవుతుంది. ఈ విషయంలో పరిమితి చట్టంలోని నిబంధనలను కోట్ చేయడం అసంబద్ధం. అజేయ కల్లం వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు -
చిటికెలో ‘మ్యుటేషన్’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిశేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్తో పాటు ఆటోమెటిక్గా మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. సరళంగా ప్రక్రియ ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్ల్యాండ్లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ల తీరును ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయ్యేదాకా ఉత్కంఠే! స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇన్నాళ్లూ క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. ఆస్తిని రిజిష్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాన్ని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేసేది రెవెన్యూ శాఖ. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఏళ్ల తరబడి అదే విధానం కొనసాగడంతో రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేది కాదు. అవతవకలకు ఆస్కారం ఉండేది. సంక్లిష్టంగా ఉన్న మ్యుటేషన్ల విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా మార్చింది. ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది. రిజిస్ట్రేషన్ల శాఖకు వెబ్ల్యాండ్ అనుసంధానం నూతన విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ను, రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేశారు. దానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ కార్డ్ స్థానంలో కార్డ్ ప్రైమ్ను ప్రవేశపెట్టారు. ఆటో మ్యుటేషన్తోపాటు ఆన్లైన్లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం, అందుకు తగ్గట్టుగా ఆన్లైన్లోనే చలానాలు కట్టడం, అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డ్ ప్రైమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టార్ ఆఫీసు లేదంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్తోపాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగిపోతోంది. మళ్లీ మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నింటినీ పక్కాగా నిర్థారిస్తారు. సబ్ రిజి్రస్టార్లు రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు నెలల క్రితం నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లతోపాటు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త విధానం వచ్చాక 26 జిల్లాల్లో ఇప్పటివరకు 7 వేలకుపైగా ఆటో మ్యుటేషన్లు జరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సిద్ధమవగా మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. సులభతరం రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మ్యుటేషన్ విధానాన్ని సులభతరం చేశాం. కార్డ్ ప్రైమ్ విధానంలో ఆటో మ్యుటేషన్ వెంటనే జరిగిపోతోంది. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సాఫ్ట్వేర్లను పూర్తిగా మార్చాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అర్బన్ ఆస్తులకూ ఇదే విధానాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానం, ఆటో మ్యుటేషన్ చాలా బాగా అమలవుతోంది. దుష్ప్రచారాలను నమ్మవద్దు. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే ఆన్లైన్లో.. మా గ్రామ సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశా. నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అరగంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్లైన్లో కూడా మారింది. ఇంతకుముందు ఆన్లైన్లో పేరు చేర్చాలంటే రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ జరగడం బాగుంది. – నల్లపోతుల నాగరాజు, నందిగామ మండలం, రాఘవాపురం తిరిగే తిప్పలు లేవు.. నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె వెంకటేశ్వరమ్మ పేరిట రాశాను. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆమె పేరిట భూమి మారిపోయింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ లేకుండా వెంటనే పని పూర్తయింది. – చల్లా ఆంజనేయులు, కొండూరు, నందిగామ మండలం. -
భూ చరిత్రలో కొత్త శకం
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవుతాయి. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్ట పరంగా కన్క్లూజివ్ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ ► భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ► ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ► ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే ► టైటిల్ రిజిష్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్నా, అడంగల్లో ఉన్నా, ఆర్ఎస్ఆర్లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్ రైట్స్ అనేవారు. 1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. ► ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరిదో ఉండదు. ► టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్ రిజిస్టర్గా మారనున్న ఆర్ఓఆర్ రికార్డు ► ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్ రిజిస్టర్లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ► పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్ఓఆర్ రికార్డు టైటిల్ రిజిస్టర్గా మారుతుందని చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. గొప్ప ముందడుగు ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఇది ఒక ల్యాండ్ మార్క్ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారా లీగల్ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరియెంటేషన్ అవసరం. ఇది ఆర్ఓఆర్ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. – ఎం సునీల్కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్
Related News by category
-
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్
సాక్షి,కరీంనగర్: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. మానకొండూర్లో ఆదివారం(ఏప్రిల్27) నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. ‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. -
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్లో కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్పేట కారిడార్లో నాగోల్కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్మెంట్పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్రింగ్రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్పాస్తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్పేట మీదుగా ఎల్బీ నగర్కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. ♦ బైరామల్గూడ, సాగర్రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్మెంట్ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement