Sakshi News home page

పోలీసు వాహనం ఢీ: మహిళకు తీవ్రగాయాలు

Published Sat, Dec 19 2015 6:21 PM

woman injured in road accident

తుర్కయంజాల్ (రంగారెడ్డి) : పోలీసు వాహనం ఢీకొని ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వెల్డండకు చెందిన దండు అంజయ్య వనస్థలిపురం వైదేహి నగర్‌లో నివాసముంటూ మల్కాజిగిరిలోని సీఐడీ కార్యాలయంలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పోలీసు శాఖకు చెందిన క్వాలిస్‌ను ఇంటికి తీసుకొచ్చాడు.

శనివారం ఉదయం అంజయ్య కొడుకు(13)కు క్వాలిస్ వాహనంపై వైదేహినగర్‌లో డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఆ సమయంలో అదే కాలనీ నివాసి నాంపల్లి శోభారాణి (45) నడిచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి శోభారాణిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో భయాందోళనలకు గురైన అంజయ్య, అతని కొడుకు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శోభారాణిని కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తన కొడుకును ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులపై అంజయ్య తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement