Sakshi News home page

పెళ్లి ఘనంగా నిర్వహించాడని...అమానుషం

Published Tue, May 2 2017 9:49 AM

పెళ్లి ఘనంగా నిర్వహించాడని...అమానుషం

భోపాల్: మధ్యప్రదేశ్‌ లో మరో అమానుషం చోటు చేసుకుంది.  సుమారు 500మందికి దాహార్తిని తీర్చే మంచినీళ్ల బావిలో దుండగులు కిరోసిన్‌ కుమ్మరించారు.   దీనికి గల కారణాలను ఆరాతీస్తే.. కుల, వర్ణ వివక్షపై అసహ్యం కలగ మానదు. గ్రామానికి చెందిన ఒక దళితుడు  తన కుమార్తెకు  మేళ తాళాలతో ఘనంగా వివాహం చేశాడన్న అక్కసుతో  ఆధిపత్య కులానికి చెందిన గ్రామస్తులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.  దళితులు ఉపయోగించే మంచినీటి బావిలో కిరోసిన్ కలిపారు. మధ్యప్రదేశ్లోని మాదా గ్రామంలో ఈ దుశ్చర్య  చోటు చేసుకుంది.    
 
 వివరాల్లోకి వెళ్తే...మధ్యప్రదేశ్‌ లోని మాదా లో దళితుడైన మేఘ్వాల్ (47) తన కుమార్తె మమత  వివాహం ఘనంగా జరిపించాలని అనుకున్నాడు.   దీనికోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఈ ఆలోచనే  ఆధిపత్య కులాలకు ఆగ్రహం తెప్పించింది. బ్యాండ్ మేళం పెట్టవద్దని  హుకుం జారీ చేశారు.  తమ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  అక్కడితో ఆగలేదు  "కట్టుబాట్లు" ఉల్లంఘిస్తే తన కుటుంబానికి సాధారణ బావి నుంచి నీటిని తోడుకోవడానికి వీల్లేదని,  స్థానిక ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని గట్టిగా  హెచ్చరించారు. అయినా మేఘావాల్‌ లెక్కచేయలేదు.  ఏప్రిల్‌ 23 బ్యాండ్ బాజాలు, గ్రామంలో ఊరేగింపుతో అట్టహాసంగా ఈ శుభకార్యాన్ని  ముగించాడు. ముఖ్యంగా  బ్యాండ్ పార్టీతో పూర్తిస్థాయి  ఊరేగింపుతో వరుడు పెళ్లి వేదికకు తరలి వచ్చాడు. అదీ ఆధిపత్య కులాలకు మాత్రమే పరిమితమైన ప్రధాన రహదారి గుండా. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పూర్తి ఆమోదంతో, రైఫిల్స్, బాటన్లు, టియర్‌ గ్యాస్‌ లాంటి  ముందు జాగ్రత్త  చర్యలతో  పటిష్ట పోలీసు బందోబస్తు  మధ్య శాంతి యుతంగా జరిగింది.

ఇదే గ్రామంలోని ఆధిపత్య కుల పెద్దలకు త్రీవ ఆగ్రహం కలిగింది.  రెండు రోజులు ప్రశాంతంగా ఉన్నా.. ఆ తర్వాత ఆవేశంతో రగిలిపోయారు. ప్రతీకార చర్యకు దిగారు. గ్రామంలో దళితులంతా తాగేందుకు వినియోగించే మంచినీటి బావిలో కిరోసిన్ ను కలిపారు.  ఇది గమనించిన దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ నీటిని పరిశీలించిన అధికారులు...బావిలో నీటిని మోటారుతో తోడించి, వినియోగానికి అవసరమైన విధంగా బావిని శుభ్రం చేయించారు.  దీంతో గత ఆరు రోజులుగా, గ్రామంలోని దళిత మహిళలు 2 కి.మీ.ల దూరంలో ఉన్న నదినుంచి నీటినిని మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.

అయితే కావాలనే కిరోసిన్‌ పోసినట్టుగా భావిస్తున్నామని సీనియర్‌ దుర్విజయ్‌ సింగ్‌  వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా  హ్యాండ్‌ పంప్‌ వేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.  నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement