-
తిరుపతికొండ మెట్టు
శ్రీ తిరుమల మహాపుణ్యక్షేత్రంలో గాలిగోపురానికి పోయే మొదటిమెట్ల వరసలో సగము దాటిన పైన ఏకాకి, కుంటి బిచ్చగాడు పున్నెడి నివాసం. ఏ బిచ్చగాళ్ళ రుషి కులానికి చెందకుండా పున్నెడు ఆశ్రయం ఏర్పరుచుకున్నాడు. రెండు కాళ్ళూ మొండే. కానీ వాడికున్న బలం విపరీతం. వాడు చేసే దొమ్మరి విద్యల సాహసం ఏ ఇసాకో గ్రాండ్ రషియన్ సర్కసు జట్టులో ఉండే పరమ సాహసికిన్నీ లేదు. చేతులతో మెట్టెక్కుతాడు. కోతిలా కొమ్మ నుంచి కొమ్మకు ఎగిరి ఛంగున పోతాడు. వేలాడుతూ చక్రంలా గిరగిర తిరుగుతాడు. దేహమంతా వాలఖిల్య మునిలా పైకెత్తి వేళ్ళ మీద తలక్రిందులా నిలబడి నడుస్తాడు. మెట్టు మీద నుంచి పై మెట్టుకి బంతిలా ఎగురుతాడు. ఒంటి చేతి మీద నిలుస్తూ, చేతుల్లోంచి దేహమంతా దూరుస్తూ చూపించే విచిత్రపు ఆసనాలా, మొగ్గలా ముందర హఠయోగి విరూపానందస్వామి యోగవిద్య గాని, జపాను మాంత్రికుడు మసుకాకో కనబరచే ‘ఫీట్లు’గాని, నూరు వోల్టుల ఎలక్ట్రిక్ దీపం ముందర పడకగది దీపంబుడ్డిలా తెలతెలపోవాలసినదే! యాత్రికుల తండాల మేఘాలు పున్నెడు ముందర ఆగి, అతని అద్భుత చర్యలను చూసి విస్తుపోయి దమ్మిడీలు, కాసులు, అణాల వర్షం కురిపిస్తే, రాత్రి తొమ్మిది అయ్యేటప్పటికి అయిదూ, ఆరు రూపాయల చిల్లర చెరువులు కడుతుంది. ఏ బ్రహ్మోత్సవమో అయితే పది పదిహేను రూపాయలు పోగుచేశాడన్నమాటే. తిరుపతి కొండల ఎక్కు దిగుడుల ఏడు మైళ్ళలో ఉన్న మూడువందల ఏబదియారు బిచ్చగాళ్ళలో పున్నెడికి వచ్చే రాబడి ఇంక ఎవరికీ లేదు. వికలాంగులు ఉన్నారు. ముక్కునోరు అంతా ఏకరంధ్రమైనవారు, కుష్టురోగులు, మాంత్రికులు, సన్యాసులు, ముళ్ళ మీద హంసతూలికా తల్పం మీదలా పడుకునే యోగీశ్వరులు, గుడ్డివారు, కోకిలకంఠంతో పాడే గాయకుడు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, బిడ్డలు, భయం కలుగచేసేవి, కళాసౌందర్యం వెల్లి విరియజేసేవి విగ్రహాలను ముందుంచుకొని పూజారిపని చేసేవారు ఎన్ని రకాలున్నారో తిరుమలేశ్వరుని కొలువు చేసే అయ్యంగార్లు, అయ్యరులు, అయ్యలు, రెడ్లు, మొదలియారులు, సెట్లతో పాటు, కోతులతో పాటు, ఈ బిచ్చకుల బృందాలు! ఈ విచిత్ర ప్రపంచంలో ఉన్న బిచ్చగాళ్ళంతా పున్నెణ్ణి చూసి అసహ్యించుకునేవారు. పున్నెడు ముష్టివాళ్ళందరికీ విరోధి అయిపోయినాడు. వాడి సంపాదన వాళ్ళ కడుపు మండజేసింది. వాడికి ఉడుకుబోతుతనం కాశ్మీర దేశాన్ని సహారా ఎడారి చేయగల శక్తితో విజృంభించింది. ధర్మప్రవాహాలు వాడి దగ్గర ఆనకట్టలా కట్టబడి నిర్జల వాహినులు కొండంతా ప్రవహిస్తున్నవి. పున్నెణ్ణి త్వరగా కొండ మీద నుంచి జపాను వారు చీనాను తరిమినట్లుగా నెట్టివేయవలెనని బిచ్చగాళ్ళ సంఘంలో సంచలనం కలిగింది. వారిలో ఏ కబురున్నూ తీగలేని వార్తలా నిమిషంలో ఆ కొండలోయల మోకాళ్ళ పర్వతం చుక్కల పర్వతం ఏడుమైళ్ళూ వ్యాపిస్తుంది. పున్నెణ్ణి శ్రీ వేంకటేశ్వర సన్నిహిత భక్త బృందంలోంచి రెండువేల మైళ్ళన్నా విసిరివేసేటందుకు ఒక మాఘ శుద్ధ ఏకాదశినాడు బిచ్చకుల ఆశ్రమాలన్నీ తీర్మానించుకున్నవి. ఆ తీర్మానం ప్రకారం బిచ్చగాళ్ళకు అన్నం, సాంబరు అమ్మేవాళ్ళు అమ్మడం మానేశారు. నీరు తెచ్చేవాళ్ళు నీరు తేవడం మానివేశారు. సరుకులు ఏడుమైళ్ళ దారి పొడుగున్నా విక్రయించేవాళ్ళు విక్రయించడం మానివేశారు. పున్నెడు మొదట వేళాకోళం అనుకున్నాడు. క్రింద ఆశ్రమంలో ఉన్న దిగుడు బావిలో నుంచి నీళ్ళు పై ఆశ్రమాల వాళ్ళకి విడి బిచ్చగాళ్ళకి అమ్మే నీళ్ళ మనిషి పున్నెణ్ని వెక్కిరించి, ‘‘నీళ్ళు నీళ్ళు’’ అని పున్నెడు గోల పెడుతున్నా నడుం ఆడించుకుంటూ వెళ్ళిపోయింది. పున్నెడికి కళ్ళు పచ్చబడ్డాయి. చెట్టునీడనే కూలబడి తల మొండి కాళ్ళ మీద ఆన్చి ఉన్నాడు. ఆలోచనలో మునిగిపోయాడు. తన జీవితమంతా ఒక్కసారిగా ఫిల్ము తిరిగినట్లు పొడచూపింది. పున్నెడు అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే అభిమానవంతులైన ఒక రెడ్డి కులంలో పుట్టాడు. ఆ ఊరి రెడ్డి వారికి పక్క గ్రామం రెడ్డివారికి ఒక గ్రామం విషయమై తగాదా వచ్చి కురుపాండవ యుద్ధమైపోయింది. అప్పుడు పున్నెడి పేరు పుణ్యంరెడ్డి. పుణ్యంరెడ్డి తండ్రీ, ముగ్గురు అన్నదమ్ములు వీరస్వర్గం అలంకరించారు. పుణ్యంరెడ్డి కాళ్ళు రెండూ విరిగినాయి. ఆస్పత్రిలో రెండు కాళ్ళూ ఛేదించి మొండిజగ్గణ్ణి చేసినారు. కుటుంబం యావత్తు నశించి, వ్యాజ్యాలలో ఆస్తీ మాయమైంది. కతిపయ ప్రయాణాలు చేసి రెండేళ్ళకు వెంకటాచల సోపాన పంక్తి రెండవ శేషాచలపతిలా అవతరించినాడు పుణ్యంరెడ్డి. ఇంక రెండేళ్ళలో పున్నెడయ్యాడు రెడ్డి. పూర్వ చరిత్రలన్నీ మాయమై పున్నెడి కళ్ళ రెండు చుక్కలు రాలినవి. అతని గొంతుక ఎండినది. ఆకలితో మాడినాడు. కొండ మీద దుకాణాలకు సరుకు అందుబాటు చేసే వర్తకులు వచ్చినప్పుడు పున్నెడు కొంత డబ్బు వారికి ఇచ్చి సాయంత్రానికి వంట సామాగ్రి తెప్పించుకున్నాడు. డోలీల వాళ్ళకు ఒక అర్ధణా చేతిలో వేసి కుండెడు నీళ్ళు తెప్పించుకున్నాడు. ఆ సరుకుతో ఆ నీటితో మూడురోజులు గడిపినాడు. నాలుగోరోజు తెల్లవారగట్ల మూడింటికే లేచి ముష్టికి తయారైనాడు. తెల్లవారే వరకూ ఒక రూపాయిన్నర మూడు దమ్మిడీలు ప్రోగయినవి. కొండ మీద దుకాణాలకు సరఫరాదారుడు కందసామి వంట సామాగ్రి తెచ్చి ఇచ్చే సమయమైందని కొండపైకి దిగువకు చూసి ఆ ›పక్కనే నాలుగు బారల దూరంలో తాను నిద్రపోవడానికి ఏర్పర్చుకున్న పొద కడకు పోయి ఒక పెద్దరాయి తీసి చూసినాడు. అతడి కళ్ళు తిరిగి ‘అమ్మయో’ అని వెనక్కు వాలిపోయినాడు. ఆ రాతి క్రింద పున్నడు దాచుకున్న అయిదువందల డెబ్బై అయిదు రూపాయల మూట మాయమైపోయింది. పున్నెడి ప్రాణం మరిగిపోయింది. రాతి మీద నుంచి కిందకు కూలబడిపోయాడు. కొంతసేపటికి అతనికి ముఖం జేవురించింది. ఈ పని చేసినది మామూలుగా బిచ్చగాళ్ళతో వర్తకం చేసే కుప్పుస్వామి పని అని అనుమానం తట్టింది. వట్రువలు తిరిగి కండలు కట్టి, హునుమంతుని హస్తాల వంటి బలమైన అతనికి చేతులు భయంకరంగా వంకరలు తిరిగినవి. ఆ సమయంలో అతని చేతులకందిన ప్రాణి కబంధుని వాత బడినట్లే. ఆరోజు దొరికిన డబ్బునిచ్చి వంటసామాగ్రి కొనుక్కున్నాడు పున్నెడు. ధనంతో పాటు అతని బలమూ నశించింది, జీవితేచ్ఛా పోయినది. ప్రపంచంలో యుద్ధక్రమంగా సంసారయాత్ర చేసే ఆశ అడుగంటింది. తన చర్యలు చూపించి ముష్టి ఎత్తడం మానివేసినాడు. డబ్బు లేకపోతే తిండి తిప్పలు పోయినవి. అయిదు రోజులయ్యేసరికి పున్నెడు అస్థిపంజరమై పోయాడు. పున్నెడి దురదృష్టం వెంకటాచలాన రాళ్ళలా ఆశ్రయించి ఉన్న వర్తకులు మొదలగు యావన్మందికీ తెలిసిపోయింది. శేషాచల బిచ్చకుల లోకానికంతా సంతోషమైనది. వదులుతాడురా పిశాచి అనుకున్నారు. అందరికీ ఇక కొంచెమో గొప్పో దొరుకుతుంది. ఇదివరకు పున్నెడున్నంత కాలము అదృష్టదేవత అతన్నే ఆవహించింది. ఇప్పటి నుంచి కొండమెట్ల దారి ఏడుమైళ్ళు కిందికీ పైకీ ఆమె తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మంచి దినాలు వచ్చినవి అనుకున్నారు. నీరసించి పోయిన పున్నెడు ఆరో దినం రాత్రి స్పృహ తెచ్చుకొని కొండ మీద నుంచి పక్కనున్న లోయలోనికి ఉరికి వెంకటేశపాద సన్నిధి చేరుదామనుకున్నాడు. చేతులతో పాకి ఆరడుగుల దూరంలో ఉన్న ఎత్తుబండల మీదికి పోయినాడు. ‘‘గోవిందా! వెంకటరమణా, గోవిందా’’ అని ఉరకబోయినాడు. కాని చల్లనిచేయి అతని చేతిని పట్టి వెనుక్కు లాగి వేసింది. కళ్ళు మూసుకున్న పున్నెడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమైనాడనుకున్నాడు. అతని దేహము పులకరించింది. చల్లని గాలులు ప్రసరించినట్లయింది. వెన్నెలలు పిండి ఆరగా కాచినట్లయింది. అతడు కళ్ళు తెరిచేటప్పటికీ ఎట్ట ఎదుట ఆ చుట్టుప్రక్కల బిచ్చగాళ్ళ ఆశ్రమాలకి నీళ్ళు పోసే బోయపిల్ల కనబడింది. ఆమె తీరైన నల్లని ముఖమంతా నక్షత్రాల వెలుగులో కాంతిలో కళ్ళ నీళ్ళు మెరుస్తూ కనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ‘‘పున్నెడు, నాను బహు పాపిని! నిండా దోసం చేసినా, ఆరుమాసాల క్రింద రోగం వచ్చి దుడ్డు లేక సబ్బరపడినప్పుడు సత్తు రూపాయి రహస్యంగా పంపిన నీ చల్లని గుండే నాను తలుచుకున్నా! చచ్చిన శుక్లపర్వతం కుష్టు ముసలి దానికి నువ్వు చేసిన చాకిరి దా నా ఒడంబు తిప్పినది. ఓ సామి నీవు దేవుండు! నీకు వీండ్లు పిశాచిలు, నిండా ద్రోగం తలపోసినారే! నాను కూడా సరిదా అంటిని! ఓయ్! ఓయ్! నాను నరరక్కసి! నాకు పదునాలో కుంపిని నరకం!’’ అని అతి దీనంగా పొర్లి పొర్లి వచ్చే ఏడుపును ఆపకుండా ఏడ్చింది. ‘‘పిల్లా, నాకు కల్గిన ఈ సెబ్బరకు నానుదా దుఃఖం పొందేది లేదు. నిండా ఇంతకు మించి కష్టాలు తీరినై ఈ పాణికి. కాని అతి మెత్తని నీకుదా ఏడ ఈ గెట్టిమణసు అని విచారింసినా! మొన్న నీ కళ్ళు మేఘాల రాత్రిలా ఉండినైదా. ఇంగ పెపంచికంలో మంచీ, పున్నెం లేదని తోసినదే. ఏల ఈ పాణి బతికేది! అంతదా!’’ ‘‘ఓ సామి, నన్ను చెమించు! నాను రక్కసిని దా సెప్పుంటినే! నీ సొమ్మూ దుడ్డు ఏడ దాచేది నాకు దా తెలుసునే! వాండ్ల మాయలో చేరి వాండ్ల చెప్పినా! ఆ పాపి కుప్పుసామిదా తీసిండు అయ్యో!’’ పున్నెడి ముఖం నవ్వింది. అతని హృదయం వెన్నెల్లు కాసింది. ‘‘పోయేలే! ఈ పాణికి ఈ చేతులిచ్చిన వెంకటసామి చల్లగా, పది అయిదు నూలు సంపాదించలేనా! నువ్వు నా దగ్గిరుండేది అంతదా!’’ అని ఆమెను తన చేతుల్లోకి తీసుకుని తల ముద్దు పెట్టుకున్నాడు. మంగి తాను తెచ్చిన కూడు పున్నెడికి నెమ్మదిగా తినిపించింది. చుక్కలు నవ్వినవి. తమవైపు తిరిగి మోకరించిన ఆ నూతన స్త్రీ పురుషుల తలపై సేవలు చల్లినవి మంచుబిందువులు. శ్రీ వెంకటపతి తాను సలిపిన పెండ్లిళ్ళ కన్న ఇది మించినదనుకున్నాడా! -అడివి బాపిరాజు -
నీ పోరు పడలేను నాయుడుబావా
చిత్రకారుడు, కథకుడు, కవి, నవలాకారుడు అడివి బాపిరాజు కళాసేవలో తన్మయులై వున్నప్పటికీ, వుద్యోగం పురుష లక్షణమనే భావంతో నాలుగేళ్లు న్యాయవాద వృత్తిని చేపట్టారు. సరసులు, సహృదయులు, సంపన్నులు అయిన గంధం వెంకయ్యనాయుడు దగ్గర జూనియర్గా చేరారు. అయితే బాపిరాజు వృత్తిలో పైకి రావాలనే ఆలోచన లేకుండా యెప్పుడూ కులాసాగా కాలక్షేపం చేసేవారు. చిత్రకారుడుగదా ఒకసారి యే మూడ్లో వున్నాడో విలువైన స్టాంపు మీద బొమ్మ వేశారు. అది చూసిన నాయుడు ‘‘ఇంకానయం. అదృష్టవశాత్తూ దానికి రంగులు వేయలేదు కాబట్టి శుభ్రంగా రబ్బరుతో చెరిపేసి వాడుకోవచ్చు’’ అని నవ్వి వూరుకున్నారు. ఇంకోసారి ఓ పెద్ద కేసులో రికార్డు చూడమంటే, ‘‘నీ పోరు పడలేను నాయుడుబావా! నే రంగమెళ్లి పోతాను నాయుడుబావా’ అంటూ పాడటం మొదలెట్టారు బాపిరాజు. అయితే బాపిరాజు తత్వం తెలిసినవారు కాబట్టి నాయుడు కూడా తేలిగ్గా తీసుకుని నవ్వేశారు. అయినాల కనకరత్నాచారి -
అందమున మొదటివారు...
అడివి బాపిరాజు అత్యుత్తమ వర్కుగా విమర్శకులు భావించే ‘నారాయణరావు’(1934) నవలలో భారతీయుల ఆహార్యం, ఆచారవ్యవహారాల గురించిన పరిశీలన ఒకటి ఇలా సాగుతుంది: ‘నారాయణరావు వివిధ దేశాల ప్రజల యాచార వ్యవహారములు, వివిధ దేశములలో బంటలు, ప్రజల కట్టుబొట్టులు, వర్తకసరళి మొదలైన విషయముల గూర్చి యుపన్యాసము నిచ్చినాడు. ఉత్తరదేశ ప్రజలు సిక్కులు, కాశ్మీర దేశస్థులు, పంజాబీయులు, పఠానులు, సరిహద్దు పరగణాలవారు చాలా బలమైనవారు. సంయుక్త పరగణాలవారు, మధ్య పరగణాలవారు, బిహారీయులు, రాజపుత్రులు, మహారాష్ట్రులు, ఆంధ్రులు రెండవరకమువారు. ఆఖరిరకము వంగము, అరవ, మళయాళిములవారు. కన్నడులు రెండవరకమునకు, ఆఖరి రకమునకు మధ్యనుందురు. అందమున మొదటివారు కాశ్మీరదేశ స్త్రీలు. మంగుళూరువారు, మైసూరు వైష్ణవులు తరువాత. తర్వాత మళయాళివారు, రాజపుత్ర స్త్రీలు. కొంకణీయులు, గుజరాతీ, మహారాష్ట్ర, ఆంధ్ర, వంగ మొదలైన తక్కిన దేశములవారు తర్వాత, దాక్షిణాత్య స్త్రీ లాఖరున వచ్చెదరు. కట్టులలో ఆంధ్రస్త్రీల నేటి కట్టు చాలా అందమైనది. తర్వాత మహారాష్ట్రపు కట్టు, అయ్యంగారి కట్టు తర్వాత. కథైవారీలు, రాజపుత్రస్థాన స్త్రీలు పరికిణిలు కట్టెదరు. సిక్కులు, కాశ్మీరదేశస్థ వనితామణులు లాగులు తొడుగుకొనెదరు. గుజరాతీ, ఉత్తరహిందూస్థానం, వంగదేశముల లలనలు చిన్న చీరలు కట్టెదరు. ఒక శాలువ పైన కప్పుకొనెదరు. అందరికట్టుకన్న అసహ్యమగు కట్టు ఒరియాదేశ స్త్రీలు కట్టెదరు’. -
స్మరణ:: కళలను గెలిచినరాజు...
‘అతడు గీసిన గీత బొమ్మై.. అతడు పలికిన పలుకు పాటై అతడు చూపిన చూపు మెరుపై అతడు తలచిన తలపు వెలుగై’... అన్నాడు విశ్వనాథ- అడవి బాపిరాజు గురించి. అడవి బాపిరాజును ఒక్క పదంలో కుదించలేము. ఒక్క కళకు పరిమితం చేయలేము. ఒక్క రంగంలో మాత్రమే నిలువరించ లేము. ఆయన తెలుగువారి రవీంద్రనాథ్ టాగోర్ అంటే కాదనడానికి ఎవరికీ ధైర్యం చాలకపోవచ్చు. కథ, కవిత, సంగీతం, నాటకం, చిత్రకళ, నవల... ఇలా సకల రంగాలలోనూ ఆయన తన అపారమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన పుట్టింది భీమవరం కావచ్చుగాని కళాజగత్తే ఆయనకు ఊయల పట్టింది. రంగులూ రసమయ వాక్యాలే ఆయన బుగ్గలను పుణికి ఊహలను రేపి చేయి పట్టి తెలుగు సారస్వతంలో దోగాడమని దోవ చూపాయి. ఒకవైపు జాతీయోద్యమంలో పాల్గొనమని ప్రేరేపించే ఉడుకు నెత్తురు. మరోవైపు ప్రమోదకుమార ఛటోపాధ్యాయ వంటి గురువు సమక్షంలో కుంచె పట్టమని ఉసిగొలిపే కళాకాంక్ష. బి.ఎల్ చదివినా చట్టాలూ సెక్షన్ల కంటే కథలూ వెతలే ఆయనను ఆకర్షించాయి. ‘నారాయణరావు’ నవలతో ఆయన దాదాపుగా విశ్వనాథ ‘వేయి పడగలు’ సరసన నిలుచున్నారు. ‘తుఫాను’, ‘కోణంగి’ వంటి సాంఘిక నవలలు సరే ‘హిమబిందు’ వంటి చారిత్రక నవలలవైపు కూడా దృష్టి సారించారు. ఆ దారిలో ఆయన చేసిన ఉత్కృష్ట రచన ‘గోన గన్నారెడ్డి’. కాకతీయ పరిపాలనను నేపథ్యంగా తీసుకుని విశేష పరిశోధనతో మరుగున పడ్డ గాథను ముందుకు తెచ్చి తెలుగువారికి ఆయన ఇచ్చిన అద్భుతమైన వీరుడు గోన గన్నారెడ్డి. ఆయనకు చిరకీర్తి సంపాదించి పెట్టిన రచన. ‘అంజలి’, ‘తరంగిణి’, ‘రాగమాలిక’ వంటి కథాసంపుటాలు, ‘తొలకరి’, ‘గోధూళి’, ‘శశికళ’ వంటి కవితా సంపుటాలు, ఇంకా జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, ‘కిన్నెరసాని’కి వేసిన బొమ్మలు... క్షణం విశ్రాంతి ఎరగక ఆయన సృజనలోకంలో మునిగితేలారు. అందుకు ప్రతిఫలంగా రసజ్ఞుల అభిమానం మూటగట్టుకొని కనకాభిషేకం పొందారు. ‘అతని హృదయంలోని మెత్తన... జీవికలోని తియ్యన’ ఇతరులకు సాధ్యం కాలేదు. అడవి బాపిరాజు ఎప్పటికీ అవనతం కాలేని ఒక సారస్వత పతాకం. - అక్టోబర్ 8 ఆడవి బాపిరాజు జయంతి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement