-
ఆ గుహ ఇక మ్యూజియం
మే సాయ్: వైల్డ్బోర్స్ సాకర్ జట్టుకు చెందిన 12 మంది పిల్లలు, కోచ్ చిక్కుకుపోయిన తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు చియాంగ్రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్సక్ తెలిపారు. ఈ ప్రాంతం త్వరలోనే థాయ్లాండ్లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా నిపుణులు వాడిన పరికరాలు, డైవింగ్ సూట్లు, యంత్రాలను సందర్శనకు ఉంచనున్నట్లు నరోంగ్సక్ తెలిపారు. ఇక్కడ అమర్చిన భారీ పైపుల్ని, యంత్రాలను దాదాపు 50 మంది సిబ్బంది తొలగిస్తున్నారని, ఈ పనులు ఆదివారం వరకూ కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం గుహలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున లోపల యంత్రాలు ఉన్నప్పటికీ ఎవ్వరినీ అనుమతించడం లేదన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డైవర్, అనస్థీషియా నిపుణుడు రిచర్డ్ హారిస్ లేకుంటే ఈ మిషన్ విజయవంతం అయ్యేది కాదన్నారు. గుహలో 13 మంది సజీవంగా ఉన్నట్లు మొట్టమొదట గుర్తించిన బ్రిటిష్ డైవర్ జాన్ వాలంథెన్కు థాయ్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. స్వదేశానికి వెళ్లేందుకు జాన్ బుధవారం సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడి ప్రజలందరూ లేచినిల్చుని కరతాళ ధ్వనులతో ఆయన్ను సాగనంపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు, నిపుణుల్ని కీర్తిస్తూ పలు స్థానిక పత్రికలు కథనాలను ప్రచురించాయి. జూన్ 23న తామ్ లువాంగ్ గుహలోకి వెళ్లిన 13 మంది నీటి ప్రవాహం కారణంగా లోపల చిక్కుకున్నారు. చివర్లో తప్పిన పెనుముప్పు.. తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు చివరి నిమిషంలో పెనుప్రమాదాన్ని ఎదుర్కొన్నారని థాయ్ నేవీ సీల్స్ సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. గుహలో చివరి విద్యార్థి, కోచ్లను బయటకు తీసుకురాగానే నీటిని బయటకు పంపింగ్ చేసే యంత్రాలు ఆగిపోయాయి. ఆ సమయంలో గుహలో దాదాపు 20 మంది డైవర్లున్నారు. చివరికి పరిస్థితి చేయిదాటకముందే డైవర్లందరూ సురక్షితంగా బయటకు రాగలిగారని పేర్కొన్నారు. తామ్ లువాంగ్ ఘటన ఆధారంగా సినిమా తీస్తామని ‘ప్యూర్ ఫ్లిక్స్’ సంస్థ భాగస్వామి మైఖేల్ స్కాట్ ఇప్పటికే ప్రకటించారు. -
'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి'
హైదరాబాద్:ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం పులిచింతల ముంపు ప్రాంతాలు, నిర్వాసితుల సమస్యలపై హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాలకు ఇవ్వాలని నిధులను ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్వార్టర్స్ ఆక్రమణకు గురైయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే వృథాగా ఉన్న క్వార్టర్స్ ను బహిరంగంగా వేలం వేస్తామని హరీష్ తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ఇద్దరు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తామన్నారు. అధికారుల విభజనపై బీజేపీ నేతల విమర్శల కంటే ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తే మంచిదని హరీష్ రావు సూచించారు. -
నోటిఫికేషన్ తర్వాతే వేతనాలు
ట్రెజరీ డైరక్టర్ విజయ్కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: రెవెన్యూ నోటిఫికేషన్ తరువాతే ముంపు మండలాల ఉద్యోగులకు వేతనాలు మంజూరు చేస్తామని ట్రెజరీ డెరైక్టర్ విజయ్కుమార్ అన్నారు. సొమవారం జిల్లాలో పర్యటించిన ఆయనను జిల్లా ఖజానా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ బిల్లు ఆమోదించారని, దీంతో రెవెన్యూ నోటిఫికేషన్ వెలువడితేనే వేతనాలు చెల్లింపు తెలంగాణ ట్రెజరీ నుంచా, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచా అనే విషయం తేలుతుందన్నారు. జిల్లాలో పలు సబ్ట్రెజరీ కార్యాలయాలు శిథిలావస్ధల్లో ఉన్నాయని, కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్తో చర్చించి వాటి మరమ్మతులకు తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో ట్రెజరీ డీడీ కె.నీలిమ, ఎస్టీవో ఖాజామియా, వెంకటేశ్వర్లు, కృష్ణారావు, వేలాద్రి,దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
రైతులకు విలీనం ముప్పు
కుకునూరు : ‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా మారింది ఆంధ్రాలో విలీనమైన ముంపు మండలాల రైతుల పరిస్థితి. ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చడంతో తెలంగాణ నుంచి ఏడు మండలాల్లోని (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎరువులు అందని దుస్థితి ఏర్పడింది. జూలై నెల గడుస్తున్నా ఇప్పటికీ ఎరువులను సరఫరా చేయని జిల్లా మార్క్ఫెడ్ విలీనం సాకును చూపుతోంది. దీంతో ఆయా మండలాల రైతులు ఎరువుల కోసం దిక్కులు చూస్తున్నారు. పది సంఘాలకు పోటు జిల్లా పరిధిలో 105 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా లు ఉండగా, ముంపు మండలాల్లో పది ఉన్నాయి. వాటిలో కుకునూరు, వింజరం సహకార సంఘం పరిధిలో ఉన్న నాలుగు వేలకు మందికి పైగా రైతులకు నేటికీ ఒక్క ఎరువుల బస్తాకూడా అందలేదు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, చెరుకు, ఆయిల్పామ్ సాగుకు యూరియా, 20-20, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులన్నీ కలిపి సుమారు 3 వేల టన్నులు అవసరం ఉంటుంది. ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సాగుపై నిరాశగా ఉన్న రైతులు, ఇప్పుడు ఎరువులు కూడా లభించకపోవడంతో మరింత కుంగిపోతున్నారు. ఎరువుల కోసం వ్యయ ప్రయాసాల కోర్చి తెలంగాణలో ఉన్న భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. అక్కడ అధిక ధరలను భరించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. సరఫరా లేదు గతేడాది రైతులకు దాదాపుగా 3 వేల టన్నుల ఎరువులు అవసరంకాగా, జిల్లా మార్క్ఫెడ్ కేవలం వెయ్యి టన్నులను మాత్రమే సరఫరా చేసింది. వాటిలో యూరియా పూర్తిగా విక్రయించగా, 20-20, పొటాష్ వంటి ఎరువులు కొద్ది మోతాదులో గిడ్డంగుల్లోనే పడి ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ ఇచ్చాం కదా...ఎరువులను పంపండి అని పీఏసీఎస్ సంఘాల పాలకవర్గం సభ్యులు ప్రాధేయపడినా జిల్లా మార్క్ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. మీ మండలాలు ఆంధ్రాలోకి వెళ్లాయి.. ముందుగా నగదును చెల్లించి.. ఎరువులను తీసుకెళ్లండంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. కాగా రూ.లక్షల నగదును ముందుగా చెల్లించే స్థోమత ముంపు మండలాల పరపతి సంఘాలకు లేదు. ఈ మండలాలను ఆంధ్రాలో కలపడం వల్ల మార్క్ఫెడ్ ఎరువులను సరఫరా చేయడంలేదని, మేము ఏమీ చేయలేమని ఆ సంఘాలు చేతులెత్తేస్తున్నాయి. -
ముంపు అటే..!
భద్రాచలం, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన బిల్లు క్లైమాక్స్కు చేరుకున్న దశలోనూ భద్రాచలమే హాట్టాపిక్గా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం సీమాంధ్రలో ఉంటే ముంపు ప్రాంతం తెలంగాణలో ఉండటమే దీనికి కారణం. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి సమావేశమైన కేంద్ర కేబినెట్ బిల్లుకు కీలక సవరణలు చేస్తూ తుదిరూపు ఇచ్చింది. పోలవరం ముంపు కింద వచ్చే జిల్లాలోని 134 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి భద్రాచలం డివిజన్ ఎటువైపు అనేది తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపంపై పూర్తి స్థాయిలో సమీక్ష లేకుండానే కేంద్ర కేబినెట్ హడావిడి నిర్ణయాలు తీసుకోవటమే ఈ గందరగోళానికి కారణమని వాదన వినిపిస్తోంది. పోలవరం ముంపు ప్రాంతాలివే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాచలం డివిజన్లోని వీఆర్పురం, కూనవరం మండలాలు పూర్తిగానూ, చింతూరు, భద్రాచలం మండలాలు పాక్షికంగానూ ముంపునకు గురవుతాయి. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 98 రెవెన్యూ గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలకు ఎదురుగా గోదావరి నదికి అవతల ఒడ్డున ఉన్న పాల్వంచ డివిజన్ పరిధిలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగానూ, బూర్గంపాడు మండలం పాక్షికంగా ముంపు పరిధిలోకి వస్తుంది. మొత్తంగా పాల్వంచ రెవెన్యూ డివిజన్లో 36 రెవెన్యూ గ్రామాలు పోలవరం ముంపు కిందకు వస్తాయి. వీటి పరిధిలో మొత్తం 205 గ్రామాలు (హ్యాబిటేషన్)ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ బిల్లులో చేసిన సవరణల ప్రకారం పై గ్రామాలన్నీ సీమాంధ్రకు చెందుతాయి. గతంలో ఏం చేప్పారంటే.. తెలంగాణ బిల్లు ఢిల్లీకి వెళ్లిన సమయంలో సమావేశమైన జీవోఎం రాష్ట్ర అసెంబ్లీ నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు సవరణలు చేపట్టింది. దీనినే కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించింది. దీని ప్రకారం భద్రాచలం రెవెన్యూ డివిజన్, పాల్వంచ డివిజన్లోని 37 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రలో కలుపేందుకు నిర్ణయించారు. భద్రాచలం టెంపుల్ టౌన్( అంటే భద్రాచలం పట్టణం)ను మాత్రం తెలంగాణలోనే కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏం నిర్ణయం తీసుకున్నారంటే బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుపై చర్చించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ముంపు గ్రామాలనే సీమాంధ్రలో విలీనం చేస్తారు. ఈ లెక్కన ఏడు మండలాల్లోని ముంపు ప్రాంతాలు మాత్రమే సీమాంధ్రకు వెళ్తాయి. ముంపు పరిధిలో లేని గ్రామాలన్నీ యథాతథంగా తెలంగాణలోనే ఉంటాయి. ఈ రకంగానే బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఆదివాసీలకు ఒరిగిందేంటి? పోలవరం నిర్మాణమంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా...తెలంగాణలో ఉన్నా ఎప్పటికైనా ముంపు గ్రామాలను ఖాళీ చేయాల్సిందే. ఆదివాసీలు రాష్ట్ర విభజన అంశం పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన లేకుంటే ఏదో రీతిన దీన్ని అడ్డుకోవచ్చని ఇప్పటి వరకు ఆదివాసీలు భావించారు. దీనిపై కోర్టులలో కేసులు కూడా వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని బహుళార్థక సాధ క ప్రాజెక్టుగా గుర్తించింది. దీన్ని నిర్మించేందుకు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు నిర్ణయించింది.ఇది ఆదివాసీలకు గొడ్డల పెట్టులా మారింది. భౌగోళికంగా ఇబ్బందులే భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లు ముక్కలు చేసి ముంపు ప్రాంతాలను సీమాంధ్రకు, మిగతా గ్రామాలు తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు భావిస్తున్న నిర్ణయం భౌగోళిక ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాలతో పాటు పూర్తిగా ముంపునకు గురయ్యే మండలాల్లో కూడా ఇళ్లు ఒక రాష్ట్రంలో ఉంటే వారి భూములు మరో రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైబ్యాక్ వాటర్ వచ్చేంత వరకు ఇక్కడనే ఉంటూ వారి భూములను అనుభవించ వచ్చనేది రైతులు ఆశ. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో డివిజన్లు ముక్కలు అవుతుండటం వారికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇక రహదారుల పరిస్థితి కూడా ఇదే రీతిన ఉంటుంది. ఉదాహరణకు భద్రాచలం మండలంలోని విస్సాపురం, చలంపాలెం పరిసర గ్రామాలు వారు ప్రస్తుతం నందిగామ మీదగా భద్రాచలం రావాల్సి ఉంటుంది. కానీ విభజనలో నందిగామ సీమాంధ్ర రాష్ట్రంనకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విస్సాపురం వాసులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాల మీదగా మళ్లీ తెలంగాణలోని భద్రాచలానికి రావాల్సి ఉంటుంది. వీటి న్నింటి పై సరైన స్పష్టత లేకుండా భౌగోళికంగా సరైన సరిహద్దులు చూపకుండా విభజిస్తే తమ పరిస్థితి ఏంటని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement