-
అస్సాం, బెంగాల్లో భారీ పోలింగ్
గువాహటి/కోల్కతా: అస్సాం, పశ్చిమబెంగాల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. అస్సాంలో 85, పశ్చిమ బెంగాల్లో 79.56 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొదటి దశకు భిన్నంగా ఈ సారి అస్సాంలో హింస చోటుచేసుకుంది. బార్పేట జిల్లా సొర్భోగ్ పోలింగ్ కేంద్రం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానికులకు మధ్య క్యూ విషయంలో గొడవ జరిగి 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ముగ్గురు సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. కామరూప్ జిల్లా ఛాయ్గాన్లో గర్భిణీ మహిళతో సీఆర్పీఎఫ్ జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిస్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. బెంగాల్లో మొత్తం 31 నియోజకవర్గాల్లో దాదాపు 79.56 శాతం ఓటింగ్ నమోదైంది. ఎండను లెక్క చేయకుండా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. -
రెండు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
మహారాష్ట్రలో 64 శాతం, హర్యానాలో 76 శాతం {పశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు హర్యానా చరిత్రలో ఇదే భారీ పోలింగ్ ముంబై/చండీగఢ్: లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికలు బుధవారం భారీ పోలింగ్తో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం గా ముగిశాయి. పంచముఖ పోటీ నెలకొన్న మహారాష్ట్రలో 64 శాతం పోలింగ్, త్రిముఖ పోటీ నెలకొన్న హర్యానాలో ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో 76 శాతం పోలింగ్ నమోదైంది. హర్యానాలో 1967లో చివరిసారి నమోదైన భారీ పోలింగ్ 72.65 శాతం కంటే ఈసారి దాదాపు నాలుగు శాతం ఎక్కువ రికార్డయింది. పూర్తి వివరాలు అందాక పోలింగ్ ఇంకా పెరిగే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. హర్యానాలో 2009 ఎన్నికల్లో 72.37 శాతం, మహారాష్ట్రలో 59.49 శాతం పోలింగ్ జరిగింది. తాజా ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 19న జరగనుంది. మహారాష్ట్రలో..: 8.35 కోట్లమంది ఓటర్లున్న మహారాష్ట్రలో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఉదయం వేగంగా మొదలై మధ్యాహ్నానికి తగ్గి, సాయంత్రానికి మళ్లీ పుంజుకుంది. మొత్తం 288 సీట్లకు ఎన్నిక లు జరిగాయి. 4,119 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఓటేసిన ప్రముఖుల్లో మాజీ సీఎం పృథీరాజ్ చవాన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. నాగపూర్ జిల్లాలోని పారశివనిలో పిడుగుపడడడంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గడ్చిరోలి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో నక్సలైట్లు పోలీసులపై, ఎన్నికల సిబ్బందిపై కాల్పులు జరిపారు చాముర్తి తాలూకా మక్కెపెల్లి వద్ద బ్యాలట్ బాక్సులు తీసుకెళ్తున్న సిబ్బంది లక్ష్యంగా నక్సల్స్ మందుపాతర పేల్చి కాల్పులు జరపగా ఒక పోలీసు గాయపడ్డాడు. గెదా గ్రామం వద్ద పోలింగ్ బూత్కు దగ్గర్లో నక్సల్స్, పోలీసుల మధ్య 15 నిమిషాలు కాల్పులు జరిగాయి. హర్యానాలో..: హర్యానాలోని మొత్తం 90 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 1.63 కోట్ల మంది ఓటర్లున్న ఈ రాష్ట్రంలో 1,351 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న హర్యానాలో సీఎం భూపీందర్సింగ్ హూడా(కాంగ్రెస్), అభయ్ చౌతాలా(ఏఎన్ఎల్డీ) తదితర ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో భారీ పోలింగ్ నమోదైంది. హిస్సార్ జిల్లాలోని బర్వాలా, మేవాత్ జిల్లా పున్హానా తదితర చోట్ల ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది పోలీసులు సహా 32 మంది గాయపడ్డారు. కాగా, మహారాష్ట్ర, హర్యానాల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు అన్నీ ధీమా వ్యక్తం చేశాయి. తరలి వచ్చిన సినీతారలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ అగ్రతారలు, వివిధ రంగాల ప్రముఖులు బిజీబిజీ షెడ్యూళ్లను పక్కనపెట్టి మరీ పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. ముంబైలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, హేమమాలిని, రేఖ, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్ తదితరులు ఓటు వేశారు. -
‘ఏడు’లోనూ భారీ పోలింగ్
7 రాష్ట్రాలు, 2 యూటీలలోని 89 స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 81.35 శాతం పోలింగ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి భారీ పోలింగ్ నమోదైంది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 89 లోక్సభ స్థానాల్లో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు అత్యధికంగా 81.35 శాతం పోలింగ్ నమోదవగా పంజాబ్లోని 13 స్థానాలకు ఒకే దశలో జరిగిన పోలింగ్లో ఆ రాష్ట్ర చరిత్రలోకెల్లా తొలిసారిగా 73 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ రికార్డయింది. 2009 లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో కేవలం 47.92 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 లోక్సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలకు 57.10 శాతం, బీహార్లోని ఏడు స్థానాలకు 60 శాతం నమోదైంది. అలాగే జమ్మూకాశ్మీర్లో ఒక స్థానానికి 25.62 శాతం, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డామన్ డయూలలో ఒక్కో స్థానానికి వరుసగా 85 శాతం, 76 శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్లోని మోగా, ఖదూర్ సాహిబ్, అమృత్సర్ స్థానాల పరిధిలో అకాలీదళ్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 15 మంది గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేసిన యూపీలోని రాయ్బరేలీ స్థానంలో 51.85 శాతం ఓటింగ్ రికార్డయింది. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేసిన గుజరాత్లోని వడోదరా స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసిన మోడీ భార్య, తల్లి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భార్య యశోదాబెన్, ఆయన మాతృమూర్తి హిరాబా మోడీలు బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెహ్సనా జిల్లాలోని ఉంఝా నగరంలో ఉన్న కోట్ కువా ప్రాంతంలో యశోదాబెన్ ఓటు వేశారు. అనంతరం మీడియా ప్రశ్నలకు ఏమాత్రమూ స్పందించకుండానే ఆమె హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేవిధంగా మోడీ తల్లి హిరాబా గుజరాత్లోని గాంధీనగర్లో ఎన్నికల కేంద్రానికి ఆటోలో వచ్చి ఓటు వేశారు. గాంధీనగర్ నుంచి బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు గుర్తుండిపోతాయి: అద్వానీ భారత్లో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల కంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చెప్పారు. బుధవారం కుమారుడు జయంత్, కుమార్తె ప్రతిభా అద్వానీలతో కలిసి గుజరాత్లోని అహ్మదాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో ఓటేసిన అనంతరం అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ‘నేను 1947 నుంచి అన్ని ఎన్నికలను చూశాను. దేశంలో 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికలను చూశాను. అయితే దేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయి’ అని చెప్పారు. నిర్బంధ ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలని పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్ విజయవంతమైతే ఎంతగానో సంతోషిస్తానని చెప్పారు. అయితే, తన పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలపై ప్రశ్నించగా, అద్వానీ దాటవేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడతానని, రాజకీయాలు మాట్లాడనని పేర్కొన్నారు. -
జిల్లాలో 81 శాతం పోలింగ్ నమోదు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఫలితంగా భారీ పోలింగ్ నమోదైంది. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 81 శాతం పోలింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 6 శాతం ఎక్కువ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిత్మా సబర్వాల్ తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 86 శాతం, అత్యల్పంగా సిద్దిపేట నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న మొన్నటి వరకు నిప్పులు చెరిగిన సూర్యుడు ఎన్నికల వేళ ఓటర్లకు సహకరించాడు. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. యువ ఓటర్లు భారీగా పోలింగ్లో పాల్గొన్నారు. యువ ఓటర్లు రాకతో అభ్యర్థుల గెలుపు ఓటముల తలకిందులయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 2,678 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 20 శాతం కేంద్రాల్లో ఈవీఏంలు మొరాయించడంతో అధికారులు ఉరుగులు పరుగులు పెట్టారు. మనూరు మండలం దన్వాడ గ్రామంలో ఎంపీ అభ్యర్థి కోసం ఏర్పాటు చేసిన ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా చెయ్యి గుర్తుకే ఓటు పడుతుందని ఓటర్లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పరిశీలనలో కూడా అలానే జరుగుతోందని నిర్ధారణ కావడంతో ఈవీఎంను మార్చారు. అయితే అప్పటికే 71 ఓట్లు పడటంతో వాటిపై ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గులాబీ దళపతి కేసీఆర్ హెలికాప్టర్లో వచ్చి తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు. మెదక్ మండలం మద్దులవాయి గ్రామంలో ఓ ఎన్నికల అధికారి వృద్ధుల ఓట్లను కారు గుర్తుకు వేయిస్తున్నారని ఆరోపిస్తూ విజయశాంతి పోలింగ్ కేంద్ర ఎన్నికల ప్రిసైడింగ్ అధికారితో వాదనకు దిగారు. ఆయనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం బంజరుపల్లిలో ఓటర్లపై ఎస్ఐ కోటయ్య, తూప్రాన్ మండలం కోనాయపల్లి(పిపి) గ్రామంలో ఎస్ఐ అనిల్రెడ్డి ఓటర్లపై దురుసుగా ప్రవర్తించారు. అనిల్రెడ్డి ఓటర్లపై అకారణంగా దాడి చేశారని గ్రామస్థులు ఆరోపిస్తూ ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓటర్లు కులాల వారీగా విడిపోయి డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని భీష్మించి కూర్చున్న సంఘటనలు పలు నియోజకవర్గాల్లో కనిపించింది. ఇలాంటి సంఘటనతో ఓటర్ల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం, అందోల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గం కేంద్రం పాటు, కోహీర్, ఝరాసంగం మండలాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మెదక్ నియోజకవర్గం ఉదయం ఏడుగంటలకే మెదక్, పాపన్నపేట మండలాల్లో స్వల్పంగా వర్షం కురవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని పిట్లంబేస్, న్యూహైస్కూల్, గీత కాలేజీ, మండలంలోని రాజ్పల్లి, పేరూర్, మాచవరం, పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి, చిన్నశంకరంపేట మండలం మడూర్, రామాయంపేట మండలంలో పర్వతపూర్, అక్కన్నపేట, కె. వెంకటపూర్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలీంగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మెదక్ మండల పరిధిలోని మద్దులవాయి గ్రామంలో ప్రిసైడింగ్ అధికారి మదన్మోహన్రావు ఓపార్టీకి మద్దతుగా ఓటర్లను తప్పుదారి పట్టించి ఓట్లు వేయించారంటూ గ్రామస్థులు ఆరోపించడంతో పోలింగ్ పది నిమిషాల పాటు ఆగిపోయింది. అనంతరం అక్కడికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ప్రిసైడింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం: వెల్దుర్తి మండలం బొమ్మారంలోని 22వ పోలింగ్స్టేషన్లో 50మంది ఓట్లు వేశాక ఈవీఎం పనిచేయకపోవడంతో 30 నిమిషాల పాటు పోలింగ్ ఆగిపోయింది. మాసాయిపేటలో, కుకునూర్లో పోలింగ్ ప్రారంభంలోనే ఈవీఎం పనిచేయక పోవడంతో కొత్తవాటితో పోలింగ్ ప్రారంభించారు. కొల్చారం మండలం ఎనగండ్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరగడ ంతో వారిని చెదర గొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. రంగంపేటలో ఈవీఎం పనిచేయకపోవడంతో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. శివ్వంపేట మండలం గోమారంలో మంగళవారం రాత్రి టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. టీఆర్ఎస్ దాడిలో కాంగ్రెస్కు చెందిన పలువురికి గాయాలయ్యాయి. సర్పంచ్ చంద్రాగౌడ్తో పాటు మరో 11మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. చెన్నాపూర్ గ్రామ సేవకునిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయగా టీఆర్ఎస్ నాయకుడు భిక్షపతితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి ఆమె స్వగ్రామమైన గోమారంలో ఓటు వేశారు. కౌడిపల్లి మండలంలోని అంతారంలో ఈవీఎం పనిచేయక పోవండతో 30 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కౌడిపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేయి చేసుకోవండతో కొంత సేపు గందరగోళం నెలకొంది. హత్నూర మండలంలోని సాదుల్లానగర్లో ఈవీఎం పని చేయక పోవడంతో 40 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దౌల్తాబాద్లో ఆయా పార్టీల ఏజెంట్లు రాకపోవడంతో 20 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మంగాపూర్లో 12మంది ఓటు వేశాక ఈవీఎం పనిచేయక పోవడంతో 30నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్లో బుధవారం తెల్లవారుజామున టీడీపీ నాయకులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న క్రమంలో తాము వీడియో చిత్రీకరించేందుకు యత్నించగా దాడి చేశారని టీ-న్యూస్ ఛానెల్ విలేకరి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. {పతాపరెడ్డిని కొద్దిసేపు పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. అనంతరం వదిలేశారు. తూప్రాన్ మండలం కోనాయిపల్లిలో యాదగిరిపై అతని కుటుంబీకులపై అకారణంగా ఎస్ఐ అనిల్రెడ్డి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులంతా మూకుమ్మడిగా రెండుగంటలపాటు ఎన్నికలను బహిష్కరించి, సదరు ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ స్వామి గ్రామానికి చేరుకొని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో పోలింగ్ పునఃప్రారంభమైంది. తూప్రాన్ మండలం కుచారం తండాకు చెందిన గిరిజనులు ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తూ ఓటు వేయడానికి నిరాకరించారు. అధికారులు ఒప్పించి వారితో ఓటు వేయించారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతు కావడం ఓటు వేయకుండా వెనుతిరిగి వెళ్లారు. పటాన్చెరు నియోజకవర్గం... ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ కార్పొరేటు కంపెనీలు కార్మికులకు సెలవు ఇవ్వలేదు. గేట్లకు ‘మూసివేయబడినది’ అనే నోటీసు అంటించి లోపల మాత్రం కార్మికులతో పని చేయించుకున్నట్టు సమాచారం అందింది. పటాన్చెరు మండలం చిట్కుల్లోని జీటీఎన్ టెక్సటైల్ పరిశ్రమను ఎన్నికల టాస్క్ఫోర్సు సీజ్ చేసింది. సెలవు ఇవ్వకుండా పరిశ్రమ నడుపుతుండటంతో సీజ్ చేశారు. పటాన్చెరులోని జీహెచ్ఎంసీ పోలింగ్ కేంద్రంలోని 113 పీఎస్ నంబర్లో ఈవీఎం మొరాయించింది. దీంతో 45 నిమిషాల పాటు పొలింగ్ నిలిచింది. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మండలం నిజాంపూర్ ఏడవ నంబరు పోలింగ్ బూత్లో వెంకటాపూర్ జడ్పీహెచ్ఎస్, వెల్టూరు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో అరగంటపాటు పోలింగ్ ఆగింది. పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేవు. వెలుతురు లేదు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఎండతీవ్రతకు పలుచోట్ల ఓటర్లు ఇబ్బందులు పడాల్సివచ్చింది. నందికందిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎద్దుమైలారంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జహీరాబాద్ నియోజవర్గం జహీరాబాద్ మండలం అల్గోల్,హోతి(కె),పట్టణంలోని గడి, న్యాల్కల్ మండలంలోని మిరియంపూర్, రత్నాపూర్, డప్పుర్, కోహీర్ మండలంలోని కవేలి పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మోరాయించాయి. దీంతో పోలింగ్కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. జహీరాబాద్, కోహీర్, ఝరాసంఘంలో మధ్యాహ్నం గంట పాటు భారీ వర్షం కురిసింది. అందోల్ నియోజకవర్గం జోగిపేటలో 184, 172, మర్వెళ్లిలోని 97, రెడ్డిపల్లిలోని పోలింగ్బూత్లలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యింది. రేగోడ్ మండలం వెంకటాపూర్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా 15 నిమిషాలు పోలింగ్ను నిలిపివేశారు. పోలీసుల జోక్యంతో తిరిగి ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు, ఎన్జీఓ భవన్, పీఆర్ కార్యాలయం, శుభోదయ, సిద్దిపేట మండలంలోని ఎన్సాన్పల్లి, చిన్నగుండవెల్లి, లింగారెడ్డిపల్లి, బుస్సాపూర్ తదితర పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. గ్యాస్ గోదాంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 200 ఓట్లు గల్లంతయ్యాయి. మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో 95 శాతం పోలింగ్ నమోదైంది. నారాయణఖేడ్ నియోజకవర్గం ఖేడ్ పట్టణంలోని మంగల్పేట్ ప్రాథమిక పాఠశాలలో, మండలంలోని నిజాంపేట్, జూకల్ గ్రామాల్లో అలాగే, మనూరు మండలంలోని ధన్వార్, మనూరు, కరస్గుత్తి, ఇరక్పల్లి గ్రామాల్లోని ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ధన్వార్లో లోక్సభకు సంబంధించిన అభ్యర్థి ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా నాలుగో నంబరు అభ్యర్థికే సిగ్నల్ చూయించడంతో ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. జోనల్ అధికారులు వచ్చి మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. అప్పటికే 70 ఓట్లకు పడ్డాయి. దీనిపై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం రుద్రారంలో మంగళవారం రాత్రి టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయటంతో గ్రామంలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దుబ్బాక మండలం లచ్చపేట, దౌల్తాబాద్ మండలం రాయపోల్,మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో ఈవీఎంలు మోరాయించటంతో ఆలస్యంగా ఓటింగ్ జరిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement