-
పన్ను ఎగవేసేందుకు ప్రయత్నాలు
నెల్లిమర్ల, న్యూస్లైన్: నెల్లిమర్ల నగర పంచాయతీ... ఏడాది కిందట ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రేడ్ 3 మున్సిపాలిటీ. నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయినప్పటికీ సరైన ఆదాయం లేక ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెల కొంది. ఏడాదికి ఇక్కడ అయ్యే వ్యయం సుమా రు 6 కోట్ల రూపాయలు అయితే ఆదాయం మాత్రం రూ.లక్షల్లోనే వస్తుంది. దీంతో నగర పంచాయతీగా ఏర్పాటైన నాటి నుంచీ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. పోనీ అభివృద్ధి మాట అటుంచితే నగర పంచాయతీ పరిధిలో బడా సంస్థలు పన్ను సక్రమంగా చెల్లిస్తే కనీసం ఉద్యోగులకు వేతనాలైనా సక్రమంగా ఇవ్వవచ్చని ఆశించారు. అయితే సదరు బడా సంస్థల యజమానులు మాత్రం పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కోటి రూపాయలకు పైగా బకాయిలు వసూలు కాకుండా నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే నెల్లిమర్ల,జరజాపుపేట మేజర్ పంచాయతీలను కలిపి నగర పంచాయతీగా (గ్రేడ్ 3 మున్సిపాలిటీ) గత ఏడాది మార్చిలో ప్రభుత్వం మార్పుచేసిన సంగతి తెలిసిందే. నగర పంచాయతీగా మార్పు చేసిన తరువాత శానిటేషన్, పరిపాలన సౌలభ్యం కోసం అప్పట్లో అధికారులు మరికొంతమంది సిబ్బందిని నియమించారు. ప్రతినెలా వీరందరికీ సుమారు రూ.5లక్షలు వేతనాలుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఆదాయం అంతంత మాత్రంగా వస్తోం ది. దీంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు సంవత్సర కాలంగా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మిమ్స్ వైద్యకళాశాల, నెల్లిమర్ల జూట్మిల్లు, పారిశ్రామిక వాడలోని కొన్ని పరిశ్రమలు సక్రమంగా పన్ను చెల్లిస్తే వేతనాలు చెల్లించవచ్చని అధికారులు ఆశించారు. అయితే బడాసంస్థల యాజమాన్యాలు నగర పంచాయతీకి పన్ను ఎగవేసేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఆరునెలల నుంచి పన్ను చెల్లించాలని అధికారులు చెబుతున్నా వారు స్పందించడం లేదు. వాస్తవానికి ఈ సంస్థలు గత ఏడాదికి సంబంధించి ఆస్తిపన్ను, బిల్డింగ్పన్ను వగైరా కలిపి కోటి రూపాయలకు పైగానే చెల్లించాల్సి ఉంది. మిమ్స్, జూట్మిల్లు రూ.39 లక్షల చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది. మిగిలిన సంస్థలు కూడా మరో రూ 30 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం మారిపోవడంతో ప్రజాప్రతినిధులతో చెప్పించి పన్ను ఎగవేసేందుకు ఈ సంస్థ లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నగర పం చాయతీ తిరిగి పంచాయతీగా మారిపోతుందని, అప్పుడు పన్ను ఎగవేయవచ్చునని ఆరాటపడుతున్నారు. ఒకవేళ పంచాయతీగా మారిపోయినా ఏడాది పాటు నగర పంచాయతీగానే ఉంది కాబట్టి ఎలాగైనా బకాయిలు చెల్లించక తప్పదని నగర పంచాయతీ అధికారులు అంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇప్పటికైనా పన్నులు చెల్లించేలా ఒత్తిడి తీసుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయమై నగర పంచాయతీ కమిషనర్ శంకరరావు ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ నగర పంచాయతీలోబడాసంస్థలు బకాయిలు పడినమాట వాస్తవమేనని, పన్ను చెల్లించాలని ఇప్పటికే పలుమార్లు కోరినట్లు చెప్పారు. -
ఓటెత్తిన చైతన్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సూరీడుతో ఓటర్లు పోటీపడ్డారు.. ఎండ మండే కొద్దీ ఓటర్లు అధికమయ్యారు.. సూర్యుడు మండుతున్న కొద్దీ ఓటర్లు రెట్టింపవుతూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. మడకశిరలో సీఐ ఆరోహన్రావు దౌర్జన్యం.. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వీరంగం వంటి చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి 12వ వార్డులో ఈవీఎం మొరాయించడంతో మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీరు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరపాలక సంస్థతోపాటు 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ స్థాయిలో బారులు తీరారు. మండుతున్న ఎండను లెక్క చేయలేదు. ఉక్కపోతనూ ఖాతరు చేయలేదు. యువతీ యువకులతో వృద్ధులు కూడా పోటీపడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మడకశిర నగర పంచాయతీ పరిధిలో అత్యధికంగా 85.22 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం నగరంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. షరా మామూలే.. 2004 సార్వత్రిక ఎన్నికలు.. 2005 మున్సిపల్ ఎన్నికలు.. 2009 సార్వత్రిక ఎన్నికలు.. 2012 ఉప ఎన్నికలు తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలు పలు చోట్ల మొరాయించడంతో పోలింగ్ అర్ధగంట పాటు ఆగిపోయింది. అనంతపురం నగరంలో 21వ డివిజన్ పోలింగ్ బూత్లో, తాడిపత్రిలో 34వ వార్డు, గుంతకల్లులో 7వ వార్డు, గుత్తిలో 5, 21వ వార్డులు, కళ్యాణదుర్గంలో 1, 3వ వార్డులు, రాయదుర్గంలో 14వ వార్డు, ధర్మవరంలో 21వ వార్డు, పుట్టపర్తిలో 11, 18వ వార్డులు, హిందూపురంలో 12వ వార్డు, మడకశిరలో 15, 16, 19వ వార్డులు, కదిరిలో 5, 15, 25, 33వ వార్డుల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు కాసేపు అంతరాయం గలిగింది. ఆ తర్వాత ఈవీఎంలను సరిచేసి.. పోలింగ్ను నిర్వహించారు. తాడిపత్రిలో 12వ వార్డులో 20 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించింది. కేవలం పది ఓట్లు మాత్రమే పోలైనట్లు ఈవీఎంలో నమోదైంది. ఆ ఈవీఎం స్థానంలో కొత్తది ఏర్పాటుచేసి.. పోలింగ్ కొనసాగించడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ.. అది కూడా మొరాయించడంతో పోలింగ్ను మంగళవారానికి వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించాలని జిల్లా ఎన్నికల అధికారి డీఎస్ లోకేష్కుమార్ నివేదిక పంపారు. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అంగీకరించడంతో 12వ వార్డుకు మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించనున్నారు. బీఎల్వోల నిర్లక్ష్యం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు స్లిప్పుల పంపిణీని తొలి సారిగా బీఎల్వోలకు అప్పగించింది. పోలింగ్కు 24 గంటల ముందే ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని పేర్కొంది. రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. కానీ.. ఎన్నికల సంఘం ఆదేశాలను బీఎల్వోలు నీరుగార్చారు. ఓటరు స్లిప్పుల పంపిణీని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. స్లిప్పులేని వారిని ఓటు వేసేందుకు పోలింగ్ అధికారులు నిరాకరించడంతో వేలాది మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుతిరిగారు. అనంతపురం నగరంలో అత్యల్ప పోలింగ్ నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు అంగీకరిస్తుండటం గమనార్హం. గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, హిందూపురం, కదిరి, ధర్మవరం మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి. తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలు తప్పులతడకగా మారాయి. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఇతర నియోజకవర్గాల్లోని ఓటరు జాబితాలో పేర్లున్న వారి పేర్లను కూడా మున్సిపాల్టీల ఓటర్ల జాబితాలో చేర్చారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. అనంతపురం నగరంలో 20వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి స్వరూపకు మద్దతుగా ఓటు వేయించుకునే కుట్రతో పెరవలి గ్రామానికి చెందిన ఓటర్లను ఆ జాబితాలో చేర్పించారు. సుమారు 130 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంతో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇక్కడెలా ఓటు వేస్తారని నిలదీశారు. ఓటర్లను భయపెడుతున్నారంటూ స్వరూప ఆందోళనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ నేతలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. హిందూపురం, ధర్మవరం, కదిరి మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి. మడకశిరలో సీఐ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ వీరంగం.. మడకశిరలో నడువలేని స్థితిలో ఉన్న ముగ్గురు వృద్ధులను ఓటు వేయించేందుకు కాంగ్రెస్ నేత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి 16వ పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడే బందోబస్తును పర్యవేక్షిస్తోన్న సీఐ ఆరోహన్రావు ఓటర్లను వాహనాల్లో తరలిస్తావా అంటూ ప్రభాకర్రెడ్డిపై విరుచుకుపడ్డారు. లాఠీలతో కుళ్లబొడిచారు. సీఐ దెబ్బకు ప్రభాకర్రెడ్డి ఎడమ చేయి విరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహించాయి. ఎమ్మెల్యే సుధాకర్ నేతృత్వంలో పోలీసుస్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ సుబ్బారావు సంఘటనపై విచారణ జరిపి.. సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సుధాకర్ ధర్నాను విరమించారు. పోలింగ్కు ఆటంకం కల్పిస్తారనే ఉద్దేశంతో తాడిపత్రిలో ఆదివారం ఉదయం ఏడు గంటలకే వైఎస్సార్సీపీ నేతలు పేరం నాగిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి జేసీ ప్రభాకర్రెడ్డి.. తాడిపత్రి పోలీసుస్టేషన్ను ముట్టడించి డీఎస్పీ నాగరాజు, సీఐ సుధాకర్రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాసేపు హల్చల్ చేశారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్రెడ్డిని ఆయన ఇంటికి తరలించిన పోలీసులు.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రాయదుర్గంలో 12వ వార్డులో ఓ టీడీపీ నేత ఇంట్లో ఓటర్లకు భారీ ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తోండటంతో.. ఆ ఇంటిని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ముట్టడించాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతపురం, రాయదుర్గంలో ఓటర్లకు టీడీపీ నేతలు నకిలీ రూ.వెయ్యి నోట్లు పంపిణీ చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన కరెన్సీ నోట్లతో వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్లిన ఓటర్లకు.. అవి నకిలీ నోట్లని తేలడంతో లబోదిబోమన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement