-
కనీసం ఇప్పటికైనా...
దేన్నయినా పదే పదే చెప్పవలసిరావటం ఎవరికైనా ఇబ్బందే. అందునా రాజ్యాంగ పదవుల్లో వున్నవారికి పదే పదే రాజ్యాంగ నిబంధనలు గుర్తుచేయటం మరింత ఇబ్బందికరమైన వ్యవహారం. కానీ మన సర్వోన్నత న్యాయస్థానానికి ఇది తప్పడం లేదు. తమ శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తీర్పునిస్తూ గవర్నర్ల అధికారాలకుండే పరిధులు, పరిమితుల గురించి సుప్రీంకోర్టు మరోసారి చెప్పక తప్పలేదు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 10న వెలువడిన ఆ తీర్పు పూర్తి పాఠం గురువారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెలువడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును నిలిపి వుంచేందుకు, వెనక్కి పంపేందుకు రాజ్యాంగంలోని 200వ అధికరణ గవర్నర్కు అధికారమిస్తోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్ భావించినప్పుడు దాన్ని తిప్పిపంపొచ్చు. అయితే ఆ సందర్భంగా గవర్నర్ ఏం చేయాల్సివుంటుందో కూడా అదే అధికరణ వివరిస్తోంది. గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక యధాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని కూడా అదే అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని ఆ అధికరణ వివరిస్తోంది. నిబంధనలు ఇంత స్పష్టంగా వున్నప్పుడు రోజుల తరబడి, నెలల తరబడి నిర్ణయం చెప్పకుండా బిల్లుల్ని పెండింగ్లో వుంచటం అసమంజసం, రాజ్యాంగ విరుద్ధం. కానీ మన దేశంలో పదే పదే ఇలాగే జరుగుతోంది. ఇతరేతర వ్యవస్థలు కాలానుగుణంగా ఎంతోకొంత మార్పులు చెందుతూ వచ్చాయి. గవర్నర్ల వ్యవస్థ మాత్రం అన్నింటికీ అతీతంగా వుండిపోయింది. అంతక్రితం సర్కారియా కమిషనైనా, ఆ తర్వాత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషనైనా రాజకీయ నేతలకు ఆ పదవులు ఇవ్వొద్దని సూచించాయి. గవర్నర్ పదవిని రాజకీయ పునరావాసంగా మార్చొద్దని 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు కూడా హితవు చెప్పింది. రాజకీయాలకు అతీతంగా వుండే వ్యక్తులు లేదా ఏదో ఒక రంగంలో నిష్ణాతులైనవారు ఆ పదవిలో వుంటే మంచిదని సర్కారియా కమిషన్ సూచించింది. కానీ కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ ఆ సూచన శిరోధార్యమని భావించలేదు. ఇటీవల గవర్నర్లకూ, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య తరచు వివాదాలు తలెత్తు తున్నాయి. పంజాబ్తోపాటు తమిళనాడు, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వా లకూ, గవర్నర్లకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పంజాబ్లో మరీ విపరీతం. అక్కడ ఏకంగా 12 బిల్లుల విషయంలో గవర్నర్ ఎటూ తేల్చకుండా ఆపేశారు. గవర్నర్లు ఇలా వ్యవహరించటం వల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వాలు చులకనవుతాయి. సమస్య అపరిష్కృతంగా వుండిపోవటా నికి కారణం తెలియక అధికార పక్షంపై సామాన్యులు విరుచుకుపడతారు. బహుశా అలా జరగాలని గవర్నర్లు కోరుకుంటున్నారేమో తెలియదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలపట్ల ఇలా చిన్నచూపుతో వ్యవహరించటం తమ పదవిని తామే చిన్నబుచ్చుకోవటమని గవర్నర్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సమస్యేమంటే తమ ఏలుబడిలోని ప్రభుత్వాలకు గవర్నర్లు ఇబ్బందిగా మారినప్పుడు కొత్తగా మొదటిసారి ఇలా జరుగుతున్నట్టు మాట్లాడే పార్టీలు, గతంలో తాము అధికారంలో వుండగా వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోతాయి. దేశంలో ఏ మూలైనా గవర్నర్కూ, ఒక ప్రభు త్వానికీ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా కేంద్రంలోని జనతాపార్టీ ప్రభుత్వం గుర్తుకు రాకమానదు. 1977లో జనతాపార్టీ అధికారంలోకి రాగానే ఒకే వేటుతో పది రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద బర్తరఫ్ చేసింది. 1980లో కేంద్రంలో మళ్లీ అధికారం వచ్చాక కాంగ్రెస్ ఇదే పని చేసింది. ప్రజల ఆమోదంతో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలను ఇలా ఇష్టానుసారంగా, కక్ష పూరితంగా రద్దు చేయటం దారుణమని ఆ రెండు పార్టీల ప్రభుత్వాలూ అనుకోలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగాక బొమ్మై కేసులో సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అలాంటి చర్యకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం వుండితీరాలన్న నిబంధన విధించింది. అటు తర్వాత ఈ నిరంకుశ విధానానికి ఏదోమేరకు బ్రేకు పడిందనే చెప్పాలి. ఇప్పుడు పంజాబ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా ఊరట వచ్చినట్టే. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బిల్లులు పెండింగ్లో వుంచటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల పాత్రేమిటన్న అంశంలో మన రాజ్యాంగ నిర్మాతలకు తగిన అవగాహన లేకపోవచ్చు. కానీ ‘సాధ్యమైనంత త్వరగా’ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలనటం ద్వారా గవర్నర్ల బాధ్యతేమిటో స్పష్టంగా చెప్పినట్టయింది. చట్టాల రూపకల్పనలో శాసనసభల పాత్ర వమ్ము అయ్యేలా అధికారాలను వినియోగించటం సరికాదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు చెప్పటం హర్షించదగింది. మరోసారి ఇలా చెప్పించుకోవాల్సిన అవసరం రాకుంటే తమకే గౌరవప్రదమని గవర్నర్లు గుర్తించటం మంచిది. -
గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలు
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 1–4 కేటగిరీల పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే గ్రామ పంచాయతీల బిల్లుల తయారీ తదితర అన్ని రకాల డీడీవో అధికారాలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా గ్రామ పంచాయతీ బాధ్యతల్లోనూ కీలకం కానున్నారు. ఈ ప్రతిపాదనల ఫైలుకు సీఎం జగన్ ఆమోదించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు ఏపీలోని గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 1, 2, 3, 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండేవారు. అప్పట్లో కొన్ని చోట్ల..మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించేవారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రతి 2,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయాలం చొప్పున ఏర్పాటు చేసి, గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వీరికి మిగిలిన 4 కేటగిరి పంచాయతీ కార్యదర్శుల తరహా జాబ్చార్ట్ నిర్థారణ జరిగినప్పటికీ..అప్పట్లో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు కాలేదన్న కారణాలతో వీరికి డీడీవో అధికారాలను పూర్తిస్థాయిలో అప్పగించ లేదు. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ పూర్తి విధివిధానాలతో త్వరలో ఉత్తర్వులు వెలువరించనుంది. 1. చాలా కాలంగా కోరుతున్న సమస్య గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు వారి జాబ్ చార్ట్ ప్రకారం చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నాం. మా విజ్ఞప్తిని మన్నించి వారికి న్యాయం చేసిన సీఎం జగన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట రామిరెడ్డి, గౌరవాధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం 2. సీఎం జగన్కు కృతజ్ఞతలు డీడీవో బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేసిన సీఎం జగన్కి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – బత్తుల అంకమ్మరావు, విప్పర్తి నిఖిల్ కష్ణ, డాక్టర్ బీఆర్ కిషోర్ (గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం) 3. ధన్యవాదాలు సీఎం సార్.. ఒకేసారి 1.34 లక్షల కొత్త సచివాలయాల ఉద్యోగాల నియమాకం చేపట్టడంతో పాటు.. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రతి సమస్యపై అత్యంత సానుకూలంగా స్పందిస్తున్న సీఎం జగన్కు ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. – ఎండీ జానిపాషా, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ -
దశాబ్దాల దందాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల స్మగ్లింగ్లు, దందాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఉదాశీన చట్టాలను అవకాశంగా చేసుకుని దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ తదితర దందాలపై కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కు సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు అప్పగించింది. ఏళ్ల తరబడి సాగుతున్న దోపిడీ చట్టంలో లొసుగులను అవకాశంగా చేసుకుని రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందా దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైంది. ఇంతవరకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై రాష్ట్ర మైనింగ్, మినరల్స్ నియంత్రణ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ఎవరైనా వరుసగా 2సార్లు పట్టుబడితే ఆ చట్టం ప్రకారం జరిమానా విధించి విడిచిపెట్టేవారు. మూడోసారి దొరికితే కేసు పెట్టేందుకు అవకాశం ఉంది. అది కూడా స్థానిక పోలీసులకు అప్పగించాలి. అంతేగానీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారం ఉండదు. అదే ప్రాతిపదికన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏర్పాటుచేసిన ‘సెబ్’కు కూడా కేసులు పెట్టేందుకు సాంకేతికంగా అడ్డంకులు తలెత్తాయి. మద్యం అక్రమ రవాణా విషయంలోనూ ఎక్సైజ్ చట్టం ప్రకారం నమోదుచేసే కేసులు ఎలాంటి ప్రభావం చూపించడంలేదు. ఇక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆన్లైన్ జూదం దందాపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదుకూ అవకాశంలేదు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్పై కూడా అటవీ చట్టాల కింద పెట్టే కేసులు స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సరిపోవడంలేదు. ఇటువంటి వ్యవస్థీకృత లోపాలతో రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందాలు యథేచ్ఛగా సాగుతూ అటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతోపాటు ఇటు సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కూడా స్మగ్లర్లకు ఊతమిచ్చింది. కొరఢా ఝళిపించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని రకాల స్మగ్లింగ్ దందాలను నిర్మూలించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యుక్తమైంది. అందుకోసం ‘సెబ్’కు విశిష్ట అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఆయా దందాల్లోని పాత్రధారులు, సూత్రధారులపై ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కఠిన శిక్షలు విధించేలా చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం.. ►రాష్ట్రం ఒక యూనిట్గా ‘సెబ్’ కమిషనరేట్ను గుర్తించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న ‘సెబ్’ స్టేషన్లను పోలీస్స్టేషన్లుగా గుర్తిస్తూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ‘సెబ్’కు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్, ఎక్సైజ్, అటవీ శాఖలు విడివిడిగా కూడా నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది. ►ఇప్పటికే గనుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ‘సెబ్’ దాడులు నిర్వహించి నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది. ఆ కేసులను స్థానిక పోలీసులకు అప్పగించాల్సిన అవసరంలేదు. జరిమానాలతో కేసులను సరిపెట్టరు. దీంతో.. ప్రజాధనం లూటీ, సహజ వనరుల దోపిడీ కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు సంక్రమించాయి. ► హోం, ఎక్సైజ్ శాఖలు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో అక్రమ మద్యం, గంజాయి దందాలకు పాల్పడే వారిపై కూడా ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. ►ఇక ఎర్రచందనం స్మగ్లర్లపై ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తూ అటవీ శాఖ కూడా ఉత్తర్వులు జారీచేయనుంది. ► అలాగే, ఆన్లైన్ జూదాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుగా ఐటీ శాఖ త్వరలో నోటిఫికేషన్ను జారీచేయనుంది. ►గుట్కా దందాపై కఠిన చర్యలకు వీలుగా వైద్య–ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. -
భారం మోపి బురద!
సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది. విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ఐదేళ్లూ అప్పుల కొండ ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. భారమైనా భరిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది. తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది. అప్పటిలా కనీస చార్జీలు లేవు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు. ఇక సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ సంక్షేమ రంగంవైపు అడుగులు.. విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం నాటివే ‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్ పంపిణీ నెట్వర్క్ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
హైదరాబాద్ మేయర్ పవర్స్ ఎంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ మేయర్ ఎవరా అన్న చర్చలు చోటు చేసుకోగా, ప్రస్తుతం మేయర్కున్న పవరేమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. మేయర్ పదవి కోసం ఎందరెందరో పోటీపడటం.. తీవ్ర స్థాయిలో పైరవీలు చేయడం.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం మేయర్ అభ్యర్థిని ప్రకటించేందుకు ఆచితూచి వ్యవహరించడం.. చివరి నిమిషం వరకు అభ్యర్థిని వెల్లడించకుండా తీవ్ర ఉత్కంఠ రేపడం.. సీల్డు కవరుకు మొగ్గు చూపడం తదితర కారణాలతో మేయర్ అధికారాలపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారి కమిషనర్ కాగా, కమిషనర్ అధికారాలేమిటి..మేయర్ అధికారాలేమిటి..అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఎవరేం చేయవచ్చునంటే.. మేయర్ పవర్ ఇలా.. జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్యసమావేశాలను ఏర్పాటు చేయడం. సదరు సమావేశాలకు మినిట్స్ రూపొందించడం. సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష వహించి సభ నిర్వహించడం. సర్వసభ్య సమావేశాల్లో రూ. 6 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలపడం. వారం వారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికీ అధ్యక్షత వహించడం. జీహెచ్ఎంసీకి సంబంధించి ఏ కొత్త పాలసీని అమలు చేయాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరం. రూ.3 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలిపే అధికారం స్టాండింగ్ కమిటీకి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు, ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేసే సమయాల్లో కమిషనర్ మేయర్ను సంప్రదించాలి. ప్రమాద ఘటనల్లో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వరకు నష్టపరిహారంగా చెల్లించేందుకు పవర్ ఉంటుంది. కమిషనర్ అధికారాలిలా.. జీహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు కమిషనర్ సర్వోన్నతాధికారి. పనులు చేసేందుకు రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు చేసే అధికారం. అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం. ఆస్తిపన్ను విధింపు, వసూళ్లు..ఇతరత్రా ఫీజుల వసూళ్లు. అవసరాన్ని బట్టి రూ.5 లక్షల వరకు పనుల్ని నామినేషన్లపై ఇవ్వవచ్చు. ప్రభుత్వంతో సంప్రదింపులు..ప్రభుత్వ నిర్ణయాల అమలు బాధ్యత. పాలకమండలి నిర్ణయాలు ప్రభుత్వానికి తెలియజేయడం. పాలకమండలిలో ఆమోదించిన బడ్జెట్ను ప్రభుత్వానికి నివేదించడం. నిర్ణయాలు తీసుకునే అధికారం మేయర్, పాలకమండలిది కాగా, వాటిని అమలు చేసే బాధ్యత కమిషనర్, అధికారులది. చదవండి: మేయర్ ప్రేమ కథ: ఒప్పించాం.. ఒక్కటయ్యాం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement