-
ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. అన్నిజిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలన్నారు. గురవారం సీఎం రేవంత్ రెడ్డి.. గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాకు అడ్డాగా మారిందని తెలిపారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. రెండు రోజుల తర్వాత అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత వారం ఆకస్మిక తనిఖీలు చేస్తే 83 లారీల్లో 22 లారీలకు అనుమతి లేదన్నారు. దాదాపు 25 శాతం ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సీఎం రేవంత్ తెలిపారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె!
చిలుకూరు: చిలుకూరు గ్రామానికి చెందిన కొడారు శ్రీనివాస్రావు(41) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడికి కుమారులు లేరు. కుమార్తె మౌనిక మాత్రమే సంతానం. కొడుకులు లేకపోవడంతో మౌనిక తన తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఈ ఘటనను చూసి పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టారు. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం వలిగొండ: మండలంలోని ఎదుల్లగూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాలమణి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు భర్త, కుమారుడు, కూమార్తె ఉన్నారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాక్టర్ల అపహరణ ఆత్మకూరు(ఎం): వ్యవసాయ బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు ఆత్మకూరు(ఎం) మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన తుమ్మల మహేందర్రెడ్డి ట్రాక్టర్ ఇంజన్తో పాటు లింగరాజుపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన శ్రీశైలం ట్రాక్టర్ ట్రాలీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీంతో బాధితులు బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇసుక డంపు సీజ్ నూతనకల్: మండల పరిధిలోని గుండ్లసింగారం ఆవాసంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బుధవారం సీజ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లసింగారం గ్రామ శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తోడి మామిడి తోటలో నిల్వ చేశారని వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని సుమారు 80ట్రిప్పుల ఇసుకను నిల్వ చేసినట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూవృద్ధుడి మృతి రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన అల్లం ముత్తయ్య(75) ఈనెల 2న తన మేనకోడలు ఊరైన పేరందేవిగూడేనికి ఆటోలో వెళ్తూ చిన్న సూరారం వద్ద దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా నల్లగొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముత్తయ్య తలకు, రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి రెండో కుమారుడు అల్లం రామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సింగం రామ్మూర్తి తెలిపారు. -
టీడీపీ హయంలో ఇసుక దోపిడీకి బరి తెగించిన బాబు
-
ఇసుక కుంభకోణం కేసు: చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, గుంటూరు: ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ఖజానాకు నష్టం కలగజేసిన సీఐడీ అభియోగాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరగగా.. ఈ నెల 22వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని ముందస్తు బెయిల్ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ తన అభియోగాల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి ఇసుక కుంభకోణం సాగించారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నాగం పన్నారంటూ.. ఆధారాలతోసహా బయటపెట్టింది. -
ఇసుకలో నొక్కేశారు..అందుకే కేసు: బొత్స
సాక్షి, విజయనగరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లాలో సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా బొత్స మాట్లాడారు. రాష్ట్రంలో పేదలందరినీ అభివృద్ధి చేయాలని సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ ఎంతో మానవత్వం ప్రదర్శించారని చెప్పారు బొత్స. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దండుకున్నారన్నారు. ఇసుకలో అవినీతి జరిగినందునే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఇసుక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మాణాలు చేపట్టామని బొత్స తెలిపారు. -
టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు
-
ఉచితమంటూ.. ముసుగు దోపిడీ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు మహిళా సంఘాల ముసుగులో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి ఖజానాకు కన్నం వేశారు. ఒకే ఇసుక బిల్లుపై అక్రమంగా తరలించిన వేలాది టన్నులను అధిక ధరలకు విక్రయించి దోచుకున్నారు. మహిళ సంఘాల పేరుతో ఇసుక దందాపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో 2016 మార్చి 4న అప్పటి సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం పేరుతో దోపిడీకి టీడీపీ నేతలకు రాచబాట వేశారు. అప్పటివరకు ఇసుక సరఫరా కోసం బుకింగ్ చేసుకుని డబ్బులు కట్టిన వారికి రూ.47.50 కోట్లను వెనక్కి చెల్లించలేదు. ఆ డబ్బులకు లెక్కలు చెప్పలేక గత ప్రభుత్వం నీళ్లు నమిలిందని 2018లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక పేర్కొంది. తద్వారా టీడీపీ నేతల ఇసుక దోపిడీని ఎండగట్టింది. ఎల్లో గ్యాంగ్ కనుసన్నల్లో రీచ్లు మహిళా సాధికారత పేరుతో రాష్ట్రంలో ఇసుక రీచ్ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు అప్పగిస్తూ 2014లో గత సర్కారు ఇసుక విధానాన్ని ప్రకటించింది. ఇసుక విక్రయాల కోసం రాష్ట్ర స్థాయిలో సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ శాండ్ మైనింగ్ ఫెసిలిటీ ఏజెన్సీస్(డీఎస్ఎంఎఫ్ఏ)లను ఏర్పాటు చేశారు. వాటి పర్యవేక్షణలో ఇసుక అమ్మకాలకు పోర్టల్ ఏర్పాటైంది. ఇసుక కోసం పోర్టల్లో బుక్ చేసుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే మహిళా సంఘాలు ఇసుకను సరఫరా చేసేలా రూపొందించిన విధానం కాగితాలకే పరిమితమైంది. మహిళా సంఘాల ముసుగులో టీడీపీ నేతలు ఇసుక రీచ్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. పోర్టల్లో ఇసుక కోసం బుక్ చేసుకున్న ఒకే బిల్లుపై వేలాది టన్నులు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో 2016 మార్చి 4న దాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. అప్పటివరకు ఇసుక కోసం పోర్టల్లో బుక్ చేసుకుని సరఫరా చేయని వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం 2016–17లో సెర్ప్ రూ.35.52 కోట్లను విడుదల చేయగా రూ.13.57 కోట్లను రీఫండ్ చేశారు. అంటే మిగతా డబ్బులు మిగుల్చుకున్నట్లు స్పష్టమవుతోంది. 2017 ఫిబ్రవరిలో ఇసుక బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేసేందుకు మరో రూ.25.55 కోట్లను సెర్ప్ విడుదల చేసింది. వాస్తవానికి రీఫండ్ కోసం అప్పటికే విడుదల చేసిన నిధులు మిగిలి ఉండగా మళ్లీ డబ్బులు విడుదల చేయడాన్ని కాగ్ తప్పుబట్టింది. రీఫండ్కి సంబంధించి రూ.47.5 కోట్లకు లెక్కలు చెప్పాలని అడిగితే గత సర్కారు నీళ్లు నమిలిందని కాగ్ స్పష్టం చేసింది. దీన్ని బట్టి టీడీపీ నేతలే ఇసుక బుక్ చేసుకుని ఒకే బిల్లుపై వేలాది టన్నులు అక్రమంగా తరలించి డబ్బులు కాజేసినట్లు స్పష్టమవుతోంది. -
చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే అడ్డగోలుగా దోచేశారు..
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నిబంధనలను ఉల్లంఘించి, జీవనదులను విధ్వంసం చేసి.. పర్యావరణాన్ని చావుదెబ్బ తీస్తూ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తేల్చి చెప్పింది. కృష్ణా నదీ గర్భంలో ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు నివాసముంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో పొక్లెయినర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. వందలాది ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను స్మగ్లర్లు తరలిస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని మండిపడింది. ఈ మేరకు 2019 ఏప్రిల్ 4న స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని 2016 మార్చి 4 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఇసుక స్మగ్లర్లు విజృంభించారు. అప్పటి నుంచి ఒక్క ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో ఎనిమిది చోట్ల రోజూ 34 వేల టన్నుల ఇసుకను పొక్లెయిన్లతో తవ్వి 2,500 ట్రక్కుల్లో తరలించి.. ఒక్కో ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయించి రూ.1.25 కోట్ల చొప్పున ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్ల ముఠా ఆర్జించిందని ఎన్జీటీ తేల్చింది. శ్రవణ్కుమార్ అనే న్యాయవాది వేరే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఏడాదికి రూ.పది వేల కోట్లను స్మగ్లర్లు సంపాదిస్తున్నారని చెప్పడాన్ని ఎన్జీటీ ఎత్తిచూపింది. అక్రమంగా ఇసుకను తవ్వడం ద్వారా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని.. అందుకు రూ.వంద కోట్ల జరిమానాగా చెల్లించాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రూ.100 కోట్లను ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలు చేయాలంటూ 2019 ఏప్రిల్ 4న పేర్కొంది. అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీ సర్కారే. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలోనే 8 చోట్ల అక్రమంగా ఇసుకను తవ్వి, తరలించి, విక్రయించి ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్లు దోచేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి, చిత్రావతి సహా జీవనదులు, వాగులు, వంకల్లో ఇసుకను అడ్డగోలుగా దోచేయడం ద్వారా ఇంకెన్ని రూ.వేల కోట్ల దోచుకొని ఉంటారో అంచనా వేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి, తరలించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ 2016లో ఎన్జీటీలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని ఆదేశిస్తూ 2017 ఫిబ్రవరి 23న ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కానీ.. ఎన్జీటీ ఆదేశాలను తుంగలో తొక్కిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు దన్నుగా నిలిచింది. ఇదే అంశాన్ని రైతులు మరోసారి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. కృష్ణా నది గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిగ్గు తేల్చాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లను 2018 డిసెంబర్ 21న ఎన్జీటీ ఆదేశించింది. సీపీసీబీ, పీసీబీలకు చెందిన ఏడుగురు అధికారులతో విచారణ కమిటీని నియమించింది. బాబు జమానాలో లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు చంద్రబాబు జమానాలో తవ్వినకొద్దీ లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు బయటపడ్డాయి. చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగించి, ఇసుకను తరలించింది. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులైన దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, నక్కా ఆనందబాబు, జవహర్, చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, పెందుర్తి వెంకటేష్, బూరుగుపల్లి శేషారావు, ముళ్లపూడి బాపిరాజు, శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య, కొమ్మాలపాటి శ్రీధర్, శ్రీరాం తాతయ్య, ఆలపాటి రాజా తదితరులు ఇసుక అక్రమాల్లో చెలరేగిపోయారు. ఈ ముఠా అంతా ఇసుక ద్వారా దోపిడి చేసిన మొత్తంలో నెలవారీ కమీషన్లు ఏకంగా రూ.500 కోట్లు లోకేశ్కు ముట్టజెప్పేవారనేది బహిరంగ రహస్యం. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతోపాటు తమ్మిలేరు తదితర నదులు, ఏరుల్లో సైతం అడ్డు అదుపులేకుండా పెద్ద ఎత్తున ఇసుక దందా సాగించారు. స్వయం సహాయక బృందాల పేరుతో టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దందా నడిపారు. ఇసుక విధానంపై ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీఓలు ఇచ్చారు. వాస్తవానికి ఉచితంగా ఇసుక ఎవరికీ అందలేదు. అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు. పొరుగు రాష్ట్రాలకు సైతం పెద్ద ఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. అడ్డుకున్న వారిపై టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధితులనే తప్పు పట్టడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. దోపిడీ గుట్టు రట్టు చేసిన కమిటీ ఎన్జీటీ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో కృష్ణా నది గర్భంలో ఇసుకను తవ్వుతున్న ప్రాంతంతోసహా ఎగువన మరో ఏడు రీచ్లను 2019 జనవరి 17, 18న క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. ఆ తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా 2019 జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. నివేదికలో ప్రధానాంశాలు.. ► ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అనుమతి లేకుండా.. నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది చోట్ల భారీ ప్రొక్లెయిన్లు, మర పడవల ద్వారా రోజుకు సుమారు 34,650 టన్నుల ఇసుకను తవ్వుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను రోజూ 2,500 ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే రోజుకు ఇసుక అక్రమ అమ్మకాలతో రూ.1.25 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికి ఈ 8 రీచ్ల నుంచే రూ.450 కోట్ల చొప్పున కొల్లగొట్టారు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల జీవనది కృష్ణా విధ్వంసమైంది. కృష్ణా నది గర్భంలో 25 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అందువల్ల ప్రవాహ దిశ మారే అవకాశం ఉంది. వరద గట్లు, భవానీ ద్వీపం దెబ్బతిన్నాయి. ► ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించిన ఎన్జీటీ.. ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలిచిన అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రూ.వంద కోట్లను జరిమానాగా విధించింది. ► ఇసుక దందా గురించి 2016 నుంచి హిందూ వంటి జాతీయ పత్రికలతోపాటు టీవీ ఛానెళ్లు వరుస కథనాలను ప్రసారం చేయడాన్ని ఎన్జీటీ తన తీర్పులో ప్రస్తావించింది. ఇసుక స్మగ్లర్లు తవ్వేసిన గుంతల్లో పడి.. ఇష్టారాజ్యంగా ట్రక్కులు నడపడం వల్ల వాటి కింది పడి 14 మంది చనిపోవడాన్ని ఎత్తిచూపింది. ఇసుక స్మగ్లర్లు అడ్డగోలుగా దోచేస్తున్నా.. దానికి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడంలో ఔచిత్యం ఏమిటని చంద్రబాబు సర్కార్ను నిలదీసింది. -
ఇసుక దందాపై కొరడా
ఎంత ఇసుక అందుబాటులో ఉంది.. ఎంత ఇసుక తవ్వుతున్నాం.. ఎంతకు అమ్ముతున్నాం.. అనే సమాచారం ఏదీ రికార్డుల్లో చూపించాల్సిన అవసరం లేకుండా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా తెరపైకి తీసుకువచ్చిందే ‘ఉచిత ఇసుక విధానం’. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితం అని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్లు అన్నింటినీ చంద్ర బాబు తనతోపాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. తద్వారా వారి దోపిడీకి అంతేలేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండ్ కో రూ.10 వేల కోట్లు కొల్లగొట్టింది. సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కొరఢా ఝళిపించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి, సాగించిన ఇసుక కుంభకోణంపై కేసు నమోదు చేసింది. ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా బరితెగించి సాగించిన ఇసుక దోపిడీ గుట్టు రట్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నిన పన్నాగం ఆధారాలతోసహా బట్టబయలు అయ్యింది. 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాక, చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది విభ్రాంతి పరుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ–1గా పీతల సుజాత (టీడీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రి), ఏ–2గా చంద్రబాబు (అప్పటి ముఖ్యమంత్రి), ఏ–3గా చింతమనేని ప్రభాకర్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే), ఏ–4గా దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో జల వనరుల శాఖ మంత్రి)తోపాటు మరికొందరిని ఏ–5గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి తెలుపుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 120 బి, 409 రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (1) (డి) రెడ్విత్ 13 (2) ప్రకారం అభియోగం నమోదు చేశారు. అంతులేని బాబు ధన దాహం పదేళ్ల తర్వాత 2014లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి బరితెగించారు. ఆ క్రమంలో ఆయన కన్ను రాష్ట్రంలో ఇసుక రీచ్లపై పడింది. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడాలని పన్నాగం రచించారు. అందుకోసం 2014 నుంచి 2016 వరకు ఓ విధానాన్ని తీసుకువచ్చి, అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆయన ధన దాహం తీరలేదు. దాంతో మరింతగా బరితెగించి ఇసుక దోపిడీ సాగించేలా వ్యూహం పన్నారు. అందుకోసం ప్రభుత్వ ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అనంతరం కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావించారు. ‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలుగానీ, ఆంక్షలు గానీ విధించదు’ అని చెప్పారు. ఈ మేరకు 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకువచ్చారు. మెమో 3066తో కనికట్టు ► ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో గత ప్రభుత్వ పెద్దలు మాయాజాలం చేసి, భారీ అవినీతికి పాల్పడ్డారు. కొత్త ఇసుక విధానాన్ని తీసుకువస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో నంబరు 3066’ను జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. ► రాష్ట్రంలో సహజ వనరులకు సంబంధించి, అందులో రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆర్థిక వనరుకు సంబంధించి కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం ఒక మెమో ద్వారా కథ నడిపించడం చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా నిలిచింది. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ► అప్పటి వరకు కూలీలతో ఇసుక తవ్వకాలు సాగుతుండగా.. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తీసుకువచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి.. అమ్ముకోసాగింది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత.. రోజుకు ఎంత ఇసుక తవ్వుతున్నారు.. ఎంతకు అమ్ముతున్నారు.. ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోందన్న లెక్కలకు అంతూపొంతూ లేకుండా పోయింది. ► శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఇసుకదోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా, ఈ కుట్రలో అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. ► అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహశీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని మరీ దాడికి పాల్పడటం అప్పట్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇది పచ్చ ముఠాల బరితెగింపునకు నిదర్శనం. అంతగా తహశీల్దార్పై దాడికి పాల్పడిన తన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అప్పటి సీఎం చంద్రబాబు సమర్థించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు. టీడీపీ పెద్దల జేబులోకి రూ.10 వేల కోట్లు 2016 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక దోపిడీ విలువ ఎంతన్నది నిగ్గు తేల్చడం గనుల శాఖ అధికారులకే అంతుపట్టడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదాయం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్ చార్జీలు, డిస్ట్రిక్ట్ మైన్స్ ఫండ్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఆ ప్రకారం 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. అంటే చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతన్న అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్భీతిగా నిబంధనలు బేఖాతరు వేల కోట్ల రూపాయల ఇసుక దందా కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. కేవలం ఒక ‘మెమో’తో ఇసుక దోపిడీకి పాల్పడటం ఆయన కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. ఆ మేరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. దాంతోపాటు మరో రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కచ్చితంగా పాటించాలి. ► ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ (మార్గదర్శకాలు) అనుసరించాలి. ► అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ► ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా తీసుకువచ్చిన ‘ఇసుక విధానం’ కోసం ఈ మూడు విధానాల్లో ఏ ఒక్కటీ పాటించ లేదు. అంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించ లేదు. కొత్త విధానం కోసం ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. అప్పటి కేబినెట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించ లేదు. -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
ఇసుకాసురుడు ‘నారా’సురుడే..!
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శలు చేశారు. వంశధార, నాగావళి, పెన్నా నదుల్లో ఇసుకను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ప్రతీ నెల ఇసుక మీద నారా లోకేష్ ముడుపులు తీసుకునేవాడు అని అన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీపీటీ(పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా, ఇసుక పాలసీపై పూర్తి గణాంకాలతో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ- సీఎం జగన్ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక పాలసీ, తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని వివరించారు. ఇసుకపై బాబు, లోకేశ్ల ఓవరాక్షన్ ఇసుక తవ్వకాలు, అక్రమాలంటూ చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. అనుమతులున్న ఓపెన్ రీచ్ల దగ్గరకు కూడా వెళ్లి సెల్ఫీలంటూ వాళ్లు ఓవర్ యాక్షన్ చేయడం అందరూ చూస్తున్నారు. ఇసుక దోపిడీపై మాకు గడువిచ్చామని.. 48 గంటల్లో సమాధానం చెప్పకపోతే.. తదుపరి చర్యలుంటాయని రంకెలేస్తున్నారు. అనుమతులున్న ఇసుక రీచ్ల దగ్గరకు పోయి టీడీపీ నేతలు ధర్నాలు చేయడాన్ని చూశాం. అందుకే, ఈ సందర్భంలో ఇసుక పాలసీకి సంబంధించి ఎవరి హయాంలో ఏం జరిగిందనేది నేను పీపీటీ ద్వారా వివరిస్తున్నాను. బాబు హయాంలో 19 జీవోలతో దోపిడీ ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. బాబు ఐదేళ్ల పాలనలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగాయి. ఇసుక పాలసీకి సంబంధించి ఆయన హయంలో దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా జీవోలను మార్చుకుని మైనింగ్ దోపిడీ ఎలా చేశారనేది.. అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయమేంటి..? ఇప్పుడున్న ఆదాయమేంటనేది మేమూ పీపీటీ ద్వారా వివరిస్తున్నాం. పేరుకే ఉచితం.. బ్లాక్ మార్కెట్ తో రాష్ట్ర ఖజానాకు సున్నం చంద్రబాబు ఇసుక పాలసీపై మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆయన నోటి వెంట ఇసుక దోపిడీ గురించి మాటలు వినిపిస్తుంటే.. దొంగే.. దొంగా దొంగా.. అని కేకలేసినట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు కృష్ణానది కరకట్ట మీదనున్న చంద్రబాబు ఇంటి వెనుకే కృష్ణా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరగలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. మొదట్లో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక సప్లై అన్నాడు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నాడు. పేరేమో ఉచితమన్నాడు గానీ.. ఇసుక బ్లాక్మార్కెట్ ను అమాంతం పెంచి ప్రభుత్వ ఖజనాకు సున్నంపెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పుకోవాలి. నాడు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే.. సామాన్యులకు ఇసుక దొరక్క, టీడీపీ నేతలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. టీడీపీ హయాంలో నెలవారీ మామూళ్ళు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల్ని జరిపారు. నెలవారీగా తమకు ఆదాయవనరుల్లో ఇసుకను ఒక భాగంగా చేసుకున్నారు కనుకే.. పశ్చిమగోదావరి జిల్లాల్లో అప్పట్లో తహశీల్దార్ వనజాక్షి గారు ఇసుక అక్రమ తవ్వకాల్ని అడ్డుకుంటే ఆమెపై దాడిచేశారు. ప్రభుత్వ అధికారిణి అని కూడా చూడకుంటా ఆమెను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చిపడేశాడు. అప్పట్లో వారిద్దర్నీ రాష్ట్ర సచివాలయానికి పిలిపించుకుని రాజీ చేసింది ఈ చంద్రబాబు కదా..? మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బాధితురాల్నే బెదిరించి రాజీచేసిన నీచుడు చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. లోకేశ్కు ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం చంద్రబాబు హయాంలో, ఇసుక అక్రమ తవ్వకాలపై, ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా అది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరుల్ని పెట్టి కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, గోదావరి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేశారు. ఇదంతా చంద్రబాబు కొడుకు లోకేశ్ కనుసన్నల్లోనే జరిగిందని.. ఆయనకు ఇసుక దోపిడీకి సంబంధించి ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం కట్టి మరీ ఇసుకమాఫియా ముఠా వ్యాపారం చేసిందని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలుసు. బాబు హయాంలో ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా శ్రీకాకుళం దగ్గర్నుంచి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ కూడా జరిపింది. అప్పట్లో ఇసుక తవ్వకాలపై ఆధారాలు రుజువైనందునే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్జీటీ తీర్పు సైతం వచ్చింది. దాదాపు రూ.100 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ఇంటి వద్ద కరకట్ట పక్కన జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధారాల్ని కూడా అప్పట్లో ఎన్జీటీ పరిగణలోకి తీసుకుంది. మరి, ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు..? పారదర్శక ఇసుక పాలసీని సీఎం జగన్ తెచ్చారు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఇసుకను బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునే మెరుగైన పారదర్శక ఇసుక పాలసీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేశాం. ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నాం. సీఎం జగన్ ఇసుక తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది నూతన పాలసీని తేవడం జరిగింది. ఇసుకపై 04.09.2019న మెరుగైన నూతన పాలసీని తెచ్చారు. ఆ తర్వాత ఈ పాలసీపై 17.07.2020న మంత్రుల సబ్కమిటీ నియమించి ప్రజాభిప్రాయసేకరణ చేసి ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. దీంతో మరింత మెరుగైన ఇసుక విధానంపై 12.11.2020న జీవో.నెం. 78ను జారీ చేశాం. పాలసీ అమలును పరిశీలిస్తూనే.. నిబంధనల్లో మార్పులు చేస్తూ మరలా 16.04.2021న జీవో నెం. 25ను తెచ్చాం. ప్రస్తుతం ఇదే జీవో ద్వారా ఇసుక పాలసీని కొనసాగిస్తున్నాం. కేంద్రప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే టెండర్లు ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో టీడీపీ మాదిరిగా మేము దొంగచాటుగానో.. ఎవరికీ తెలియకుండానో టెండర్లు ప్రక్రియను పూర్తిచేయలేదు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంటీసీ) ద్వారా టెండర్లును ఆహ్వానించడం, నిర్వహణ, పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేలా అవకాశమిచ్చాం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి.. అత్యధిక బిడ్ కోట్ చేసిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి టెండర్ను ఖరారు చేయడం జరిగింది. చంద్రబాబు,రామోజీ టెండర్లలో పాల్గొనలేదేం..? ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు, రామోజీరావులు అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు..? రామోజీ కూడా పెద్ద వ్యాపార వేత్తనే కదా.. మరి ఆ టెండర్లో పాల్గొంటే.. ఎంత పారదర్శకంగా ఇసుక టెండర్ ప్రక్రియ జరుగుతుందో స్వయంగా తెలుసుకునే వారు కదా..? ఇలాంటి పారదర్శక పాలసీని చంద్రబాబు గతంలో ఏనాడైనా తెచ్చాడా..? అని నిలదీస్తున్నాను. దీనిపై దమ్ముంటే చంద్రబాబు, రామోజీ సమాధానం చెప్పాలి. టన్ను రూ. 475కే.. ఇంత పారదర్శకంగా ఇసుక పాలసీని తెస్తే చంద్రబాబు, పచ్చమీడియా కలిసి రోజుకో పిచ్చి ప్రేలాపన చేస్తుంది. రకరకాలుగా ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయి. ఇసుక నూతన పాలసీ ప్రకారం ఒక కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఎక్కడ తవ్వకాలు జరిపినా అదే కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ అక్కడ తవ్వుతుంది..? ఇక్కడ తవ్వుతుంది..? అన్న వాదనలకు ఆస్కారం ఎక్కడుందని అడుగుతున్నాం. ఈ కంపెనీ ప్రస్తుతం టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై వారు రూ.100 కలుపుకుని టన్ను ఇసుకను రూ.475కు అమ్ముకుంటున్నారు. వారు కలుపుకుంటున్న రూ.100లోనే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయం మొత్తాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. మరి, టీడీపీ నేతలు, చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఇసుకకు సంబంధించి ఏదో జరిగిపోతుందని ఎందుకు ఆరోపణలు చేస్తుంది..? అని అడుగుతున్నాను. ఇసుక సొమ్మంతా బాబు, లోకేష్ జేబుల్లోకే... ఇసుక నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం వస్తుంది. అంటే, ఐదేళ్లకు రూ.3825 కోట్లు జమ అవుతున్నాయి. మరి, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఏమయ్యాయి..? ఎక్కడ జమ అయ్యాయి..? లోకేశ్ జేబులోనా... చంద్రబాబు జేబులోనా..? అని నిలదీస్తున్నాను. ఇంత ఆదాయం ప్రభుత్వం కోల్పోయినప్పుడు ప్రశ్నిస్తానన్న నేతలు గానీ.. మీడియా గానీ ఎందుకు కళ్లుమూసుకుంది. అప్పట్లో టెండర్లు ఎందుకు పిలవలేదు..? ఇలాంటి మెరుగైన పారదర్శక విధానాన్ని చంద్రబాబు ఎందుకు తేలేదు..? దీనిపై వారు సమాధానం చెప్పాలి. ఇసుక తవ్వకాల అక్రమాలపై ఉక్కుపాదం ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమాలు ఎక్కడైనా జరిగితే... ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు కఠిన చట్టాల్ని సైతం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకునేలా వ్యవస్థను నడిపిస్తున్నాము. అటువంటివారికి రూ.2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని తెచ్చాం. అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలన్నా టోల్ఫ్రీ నెంబర్ 14500ను అందుబాటులో ఉంచి ప్రచారం కూడా చేయిస్తున్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ద్వారా ఇప్పటికే 18వేల కేసులు నమోదు చేశాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేయడం జరిగింది. చాలామందికి శిక్షలు కూడా పడటం జరిగింది. మరి, చంద్రబాబు హయాంలో ఇలాంటి కఠిన చట్టాలు అమలు చేయడం, జరిమానాలు, శిక్షలు విధించడం చేశారా..? నాడు ఆయన హయాంలో పట్టాభూముల్లో కూడా ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుని అమ్ముకున్న దాఖలాలున్నాయి. ఇసుక కొరత లేకుండా చూస్తున్నాం... ఇసుక కొరత, అక్రమ తవ్వకాలు అంటూ.. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని మేం ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అండగా ఉన్నారు. వర్షాకాలంలో కూడా ఎక్కడా ఇసుక కొరత రాకుండా అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టి.. ఎండాకాలంలోనే స్టాక్యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచేలా ఆదేశాలిచ్చారు. కనుకే, ఇప్పటి వరకు మాకు ఇసుక దొరకడం లేదని ఎవరూ చిన్నపాటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఇసుక కొరత రాష్ట్రంలో లేనేలేదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై చెక్పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘాను కట్టుదిట్టం చేశాం. చంద్రబాబుకు బంపర్ఆఫర్ ఇసుకపై చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంబంధంలేని అంశాలతో శిరోముండనం అంటూ ముడేస్తాడు. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇసుకకు ఏం సంబంధం ఉంది. ఆయన మతిచలించి మాట్లాడుతున్నాడు..? ఒక్కపక్కన లోకేశ్ ఏమో ఇసుక దోపిడీ రూ.4వేల కోట్లంటాడు. చంద్రబాబునేమో రూ.40వేల కోట్ల ఇసుక అక్రమాలంటాడు. కనుక, ఈ ఆరోపణలన్నీ పక్కనబెడితే.. ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు ఇస్తే ఇసుక కాంట్రాక్ట్ను మొత్తం చంద్రబాబుకే అప్పగిస్తాం. ఆయనకు ఇది మా బంపర్ ఆఫర్. బాబూ.. వాస్తవాలివిగో.. ఈ నాలుగున్నరేళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70 కోట్ల టన్నులు ఇసుకను తవ్వితే మొత్తం రూ.2300 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. బాబు అడుగుతున్న జీఎస్టీ లెక్కలతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాక్టు సంస్థ కేంద్రానికి చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 136 స్టాక్ పాయింట్లు ఉంటే.. వాటిల్లో ఇప్పుడు సుమారు 64 లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. ప్రస్తుతం 110 ఓపెన్రీచ్ల్లో సుమారు 77 లక్షల టన్నుల తవ్వకాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లున్నాయి. కానీ, వరదలు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల తవ్వకాలు నిలిచిపోయాయి. 42 డీసెల్టింగ్ పాయింట్లలో జరుగుతున్న ఇసుకకు సంబంధించి 90 లక్షల టన్నులకు అనుమతులున్నాయి. మైనింగ్ ఆదాయంలో పురోగతి మైనింగ్ రెవెన్యూ విషయానికొస్తే జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలు మెరుగైన ఫలితాల్ని తెచ్చిపెట్టాయి. చంద్రబాబు పాలనలో కంటే ఇప్పుడు మైనింగ్ రెవెన్యూలో చాలా పురోగతిని సాధించామని చెబుతున్నాం. 2018–19లో అంటే చంద్రబాబు హయాంలో రూ.1950 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తే.. 2022–23 నాటికి అంటే, ఇప్పుడు జగన్ గారి హయాంలో రూ.4756 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఏపీఎండీసీ విషయానికొస్తే చంద్రబాబు ఉన్నప్పుడు (2018–19) రూ.833 కోట్లు వస్తే.. మా హయాంలో (ప్రస్తుతం) రూ.1806 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. -ఇలా మేము ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సంస్కరణలతో ముందుకు పోతున్నాం. మరోవైపు చంద్రబాబు మాత్రం అసత్యాల్ని అల్లుతూ ప్రభుత్వంపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు అధికారం లేదనే తీవ్రమైన ఫ్రస్టేషన్తో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఉన్నాడు. -ఇసుక తవ్వకాలపై గతంలో పవన్కళ్యాణ్, లోకేశ్లు కూడా మాట్లాడినప్పటికీ.. వారిద్దరికీ ఈ విషయంపై అంతగా అవగాహన ఉండదు కనుక పెద్దగా పట్టించుకునేదిలేదు. చంద్రబాబు ఊహాజనితమైన లెక్కలతో ఆరోపణలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని.. ఇలాగే మాట్లాడితే.. ప్రజల చేతుల్లో పరాభవం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. జేపీ కాంట్రాక్టు కాలపరిమితి ఏడాది పెంపు జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాదికి పొడిగించాం. ఆ ఉత్తర్వులతోనే ప్రస్తుతం జేపీ సంస్థ తవ్వకాలు జరుపుతుంది. సబ్ కాంట్రాక్టు అగ్రిమెంట్లతో ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదు. ప్రభుత్వంతో కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీ, వారికి అనుబంధంగా ఇతర సంస్థలకిచ్చిన సబ్కాంట్రాక్టుల వ్యవహారాలు కూడా మా దృష్టికి రాలేదు. ఇది కూడా చదవండి: వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన అభ్యర్థి -
ప్చ్.. అవినీతిని గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ప్రజెంటేషన్ ల మీద ప్రజెంటేషన్ లు ఇచ్చేస్తున్నారు. మొత్తం మీద తనకు రాజకీయ సలహా సంస్థ ఏమి చెబితే అది చేస్తున్నట్లు ఉన్నారు. కాకపోతే అప్పడప్పుడు పప్పులో కాలు వేస్తున్నారనిపిస్తుంది. ఉదాహరణకు ఇసుకాసురుడు జగన్ అంటూ ఇచ్చిన ప్రజెంటేషన్ తీసుకోండి. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా?లేదా? అన్నది పక్కనబెడితే, ఆయన చెప్పిన విషయాలు వింటే అవన్నీ ఆయన ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయన్న సంగతి మర్చి పోయి మాట్లాడేస్తున్నారని స్పష్టం అవుతుంది. ఎవరైనా కాస్త ఆలోచనపరులు ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. సహజంగానే తెలుగుదేశం మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు విపరీతమైన ప్రాముఖ్యతను ఇచ్చి ఆయన ప్రజెంటేషన్ ను ప్రచారం చేశాయి. వాటిలో వచ్చిన వార్తలను చదివితే కొన్ని సందేహాలు వచ్చాయి. అన్నిటికన్నా ముందుగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారిక నివాసానికి సమీపంలోనే అనుమతులు లేకుండా ఇష్టారీతిన ఇసుక తవ్వి తరలించినందుకు హరిత ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించిందా? లేదా? అంటే దాని అర్దం అక్కడ జరిగిన ఇసుక తవ్వకాలలో ఆయనకు వాటా ఉందని ఒప్పుకుంటారా?. ఆయన టరమ్లో ఇసుకను పేరుకు ఉచితంగా ఇచ్చారు తప్ప, ప్రజలకు ఒరిగింది పెద్దగా ఏమీ లేదు. తెలుగుదేశం నేతలు ఇసుక మాఫియాగా మారి ప్రజలను వేధించడం కూడా ప్రభుత్వ ఓటమికి ఒక కారణం అని అందరికి తెలుసు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎలాగైతే అరాచకాలు చేసి అప్రతిష్టపాలయ్యారో, అదే మాదిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కూడా బదనాం చేయాలన్న లక్ష్యంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. ✍️ ఏ ప్రభుత్వం ఉన్నా ఇసుకను అక్రమంగా తవ్వితే తప్పు పట్టవలసిందే. ఈ ప్రభుత్వం అతీతమని ఎవరూ చెప్పరు. కానీ.. ప్రతిపక్ష నేతగా ఉన్నవారు కనుక తోచిన కాకిలెక్కలు చెప్పి జనాన్ని మాయ చేయాలనుకోవడమే పెద్ద తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఎపిలో ఇసుక కొత్త విధానం తీసుకురావడానికి గాను కొద్దికాలం ఇసుక తవ్వకాలను ఆపితే..ఇంకేముంది.. రాష్ట్రంలో అభివృద్ది అంతా ఆగిపోయిందని ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. ఎవరు ఎలా చనిపోయినా దానిని ఇసుక లేకపోవడం వల్ల జరిగిన ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. ఆ విషయాలు అప్పట్లోనే సాక్ష్యాలతో సహా వెలుగులోక వచ్చాయి. తదుపరి ప్రభుత్వం ఇసుక విదానం తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టి. కొంత నిర్దిష్ట రేటు పెడితే దానిపై కూడా విమర్శలు చేశారు. ఏడాదికి ఇప్పుడు 700 కోట్లకు పైగా ప్రభుత్వాన్ని ఆదాయం ఇసుక ద్వారా సమకూరుతోంది. అందరికి అందుబాటులో ఇసుక నిల్వలు ఉంచారు. గతంలో ఇలా ఎన్నడూ తేలికగా దొరికేది కాదు. అదే సమయంలో బలహీనవర్గాలవారి ఇళ్లకు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు నిలిపినప్పుడు గగ్గోలు పెట్టిన ప్రతిపక్షం, ఇప్పుడు అందరికి ఇసుక అందుబాటులో తేవడంపైన ద్వజమెత్తుతోంది. ఇందులో అవినీతి ఉందని, తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ప్రభుత్వం నిర్దిష్ట విదానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా టెండర్ పిలిచి ఒక సంస్థకు ఇసుక తవ్వకం, అమ్మకం బాధ్యతలు అప్పగించింది. ఆ సంగతి దాచిపెట్టి ఆ ప్రైవేటు సంస్థకు ఏదో నేరుగా జగన్ పిలిచి కాంట్రాక్టు ఇచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఆయన కాకిలెక్కలు చూద్దాం. ✍️ నాలుగేళ్లలో ఇసుక పేరుతో నలభైవేల కోట్ల దోపిడీ జరిగిందని చంద్రబాబు అంటున్నారు. నలభై కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వారని ఆయన అంటున్నారు. పోనీ కొద్ది సేపు దీనిని నిజం అని అనుకుంటే చంద్రబాబు గతంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని అంగీకరిస్తారా?. ఏపీలో అసలు ఇసుకే దొరకడం లేదని, తద్వారా అభివృద్ది నిలిచిపోయిందని చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇబ్బడి,ముబ్బడిగా ఇసుక ఎపిలో దొరుకుతోందని చెప్పినట్లే కదా?ఆ మేరకు రాష్ట్రంలో భవన నిర్మాణం, ఇతర నిర్మాణ పనులు, అభివృద్ది జరుగుతున్నట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది కదా?. అంతేకాదు. నిజంగానే నలభై కోట్ల టన్నుల ఇసుక నాలుగేళ్లలో తీసి ఉంటే, చంద్రబాబు పాలన ఐదేళ్లలో అసలు లెక్కాపత్రం లేకుండా సాగిన ఇసుక తవ్వకాలలో అంతమేర దోపిడీ జరిగినట్లు ఆయన చెప్పకనే చెబుతున్నారు కదా? ఆ రోజుల్లో ఒకసారి పొరపాటున ఈనాడు పత్రిక లోపలి పేజీలో ఇసుక దోపిడీ ఎలా సాగుతోందో.. టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు రాయకుండా ఇచ్చిన కథనాన్ని ఆయన ఒప్పుకున్నట్లే కదా?. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రైవేట్ టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేశారా? లేదా?. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక రీచ్ లు తీసుకుని ,వారికి తృణమో,పణమో అప్పగించి మొత్తం ఇసుకను దోచేసిన మంత్రులు కూడా టిడిపి పాలనలో ఉన్నారు కదా?. ఆ అనుభవంతోనే చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారా? అప్పుడు అలా జరిగింది కనుక, ఇప్పుడు ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారా?. ✍️ ఎక్కడైనా ఒకటి,అరా జరిగితే దాని గురించి ప్రతిపక్ష నేతగా విమర్శించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కాని అడ్డగోలు ఆరోపణలు చేయడం వల్ల ఆయన చెప్పేవాటికి విలువ లేకుండా పోతుంది కదా! ఇప్పటికే ఈనాడు వంటి పత్రికలు రాస్తున్న అడ్డగోలు కథనాలను ఎవరూ నమ్మడం లేదు. చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, టీడీపీ నేతలు ఇష్టానుసారం దోచుకున్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. చంద్రబాబు ఇప్పుడు కాకిలెక్కలు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఇసుక రీచ్ లో రోజుకు పదివేల టన్నుల ఇసుక తవ్వకం జరుగుతోందని ,దానిని స్వయంగా చూశానని ఆయన అంటున్నారు. దాని వెనుక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉన్నారని ఆయన ఆరోపించారు నిజానికి ఒక రీచ్లో రోజుకు పదివేల టన్నుల ఇసుక తీయడం ఎంతవరకు సాధ్యమో ఆయనకే తెలియాలి. అక్కడ పెద్ద కొండలా తీసి పోశారని ఆయన అన్నారు. అందులో తప్పు ఏమి ఉంది? వానాకాలంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇసుక నిల్వ చేస్తే నష్టం ఏమిటి?. నలభై కోట్ల టన్నులు, నలభైవేల కోట్ల రూపాయలు అంటూ చెబుతున్నవన్ని పిచ్చి లెక్కలే అని తేలిపోతోంది. ఈయనకు ఇది అలవాటే. గతంలో జగన్ పై కక్ష కట్టి కేసులు పెట్టిన సందర్భంలో ఎంత ఆరోపణ చేయాలన్నదానిపై పార్టీలో చర్చ జరిగిందట. అప్పుడు మాజీ ఎంపీ మైసూరారెడ్డి రెండు,మూడువేల కోట్లు అందామని సూచించారట. దానికి నో చెప్పిన చంద్రబాబు ‘‘లక్ష కోట్లు’’ అని ఆరోపిస్తూ ప్రకటన చేయాలని అన్నారట. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో మైసూరానే టీవీ చర్చలలో చెబుతుండేవారు. ఇదే కాదు.. దేనినైనా అతిగా చెప్పడం , తన గురించి అతిశయోక్తులు చెప్పుకోవడం ఆయనకు అలవాటే. ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు మరోసారి ఇసుక పై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా ఉంది. తద్వారా తన పాలనలో జరిగిన అక్రమాలన్నింటిని ఆయనే గుర్తు చేసినట్లు అనిపించడం లేదూ! :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఇసుకాసురులు.. భారీగా ఇసుక అక్రమ రవాణా
వనపర్తి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటూ అధికారులు ఇరవై రోజులుగా బిజీగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఉదయమంతా కృష్ణానది నుంచి ఇసుకను తోడి రాంపూర్, రంగాపూర్ శివారులోని పొలాల్లో నిల్వ చేయటం, అర్ధరాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్లలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తెర వెనుక ఉంటూ దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలో ఎంత తవ్వినా.. ఎగువ నుంచి వరద వస్తే మట్టి, ఇసుక కొట్టుకొస్తుండటంతో గుంతలన్నీ మూసుకుపోతాయి. దీంతో ఏటా వేసవిలో ఈ ప్రాంతాల నుంచి భారీగా ఇసుకను తోడుతూ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కుబడి చర్యలేనా? గతంలోనూ ఇదే ప్రాంతంలో పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఇసుక డంపులను సీజ్ చేసినా.. ఏనాడు ప్రభుత్వం వేలం వేయలేదు. తూతూమంత్రంగా ఇసుక డంపులను సీజ్ చేయటం, తర్వాత వదిలేయటంతో అక్రమార్కులు సైతం ఇందుకు అలవాటు పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసినట్లు పత్రికల్లో వార్తలు రాయించుకోవటం మినహా చేసేదేమీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీజ్ చేసిన కొన్నాళ్లకు డంపులను అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు విక్రయించుకోవటం పరిపాటిగా మారిందనే వాదనలు లేకపోలేదు. ఇసుక నిల్వలు సీజ్.. రంగాపూర్ శివారులోని ఇసుక డంప్లను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీఓ పద్మావతి మంగళవారం రంగాపూర్, రాంపూర్ శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మూడు భారీ ఇసుక డంపులు గుర్తించి సీజ్ చేశారు. మొత్తంగా ఇటీవల అధికారులు సీజ్ చేసిన ఇసుక సుమారు వెయ్యి ట్రాక్టర్ల వరకు ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కలిసొచ్చిన పుష్కర రోడ్లు.. కృష్ణా పుష్కారాల సమయంలో నిర్మించిన రోడ్లు అక్రమార్కులకు కలిసొచ్చిన అంశంగా చెప్పువచ్చు. ప్రజల సౌకర్యార్థం వేసిన రోడ్లు వాహనాలు (జేసీబీ, ట్రాక్టర్లు) నేరుగా నది వరకు వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. పెబ్బేరు మండలం రాంపూర్ శివారు నుంచి గద్వాల జిల్లా గుర్రంగడ్డ ప్రాంతానికి వంతెన నిర్మాణానికి గుర్తించిన ప్రాంతం నుంచి జేసీబీ సాయంతో నదిలో పెద్దఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ దందాకు సహకరిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది జోక్యం చేసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలరోజులుగా విచ్ఛలవిడిగా ఇసుక రవాణా పెబ్బేరు మండలంలోని కృష్ణానది కేంద్రంగా సాగుతూ.. ఇతర జిల్లాలకు సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు.. మంగళవారం నాలుగు ఇసుక డంప్లతో పాటు ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉన్న విషయం మా దృష్టికి రాలేదు. – పద్మావతి, ఆర్డీఓ, వనపర్తి -
మంచిర్యాల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా
జిల్లా కేంద్రంలోనూ... జిల్లా కేంద్రంలో గోదావరి రోడ్డు, పాత మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి తెల్ల వారు జామున, రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గోదావరి రోడ్డు కాలనీ వాసులు కొందరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెల్లవారు జామున కూలీలతో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతూ పట్టణంలో నిర్మాణాలు జరిగే ప్రాంతానికి చేరవేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిపై పోలీసులు, గనుల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అయినా జరిమానాలు కట్టి అక్రమ రవాణా సాగిస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గోదావరి పుష్కరఘాట్ నుంచి నేరుగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. చెన్నూరు పట్టణం, హాజీపూర్, వేంపల్లి, గుడిపేట గోదావరి తీరాల నుంచి గ్రామాల్లోనూ ఇసుక రవాణా జరుగుతోంది. దండేపల్లి మండలం కాసిపేట గోదావరి తీరంలో బ్యాక్ వాటర్ తగ్గినప్పుడల్లా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు గోదావరి తీరం వెంట నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరిలో ఇసుక ఖాళీ అవుతోంది. నగదుగా మారి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. జిల్లాలోని నదీ తీర గ్రామాల్లో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భారీ యంత్రాలను నదిలో దించి ఇసుకను తోడుకుపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతేడాది అధిక వర్షాలతో దొరకని ఇసుక.. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు మండు వేసవిలోనూ నది నిండుగా ఉంది. దీంతో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. స్థానిక అవసరాల కోసం హాజీపూర్ మండలం వేంపల్లిలో అధికారులు ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. అయితే వర్షాలు కురిసి నీరు రావడంతో అక్కడ ఇసుక తీయడం లేదు. జిల్లాలో గోదావరి పొడవునా ఇసుక లభించని పరిస్థితి నెలకొంది. అవసరం మేరకు అనుమతి.. ఈ క్రమంలో టీఎస్ఎండీసీ(తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అవసరం మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తోంది. కాళేశ్వరం ముంపు ప్రాంతంగా ఉన్న నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మేటలు తోడేందుకు గతేడాది మార్చిలో టెండర్లు పిలిచి కొత్త అగ్రిమెంట్లు చేశారు. ఇందులో కొన్ని పట్టాభూముల్లో ఉన్నాయి. ఇక కోటపల్లి మండలం కొల్లూరులో మాత్రమే ప్రస్తుతం ఒక ఇసుక రీచ్ నడుస్తోంది. దూర భారంతో రీచ్కు రాని లారీలు.. అయితే కొల్లూరు రీచ్ దూరంగా ఉండడంతో హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల వారికి ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదు. ఎండ తీవ్రత కూడా రవాణాకు ఆటంకంగా మారుతోంది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు మాత్రం ఇక్కడి నుంచే ఇసుక రవాణా జరుగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం పగటిపూటనే ఇసుక రవాణా చేయాలి. ‘అదనపు’ బకెట్ దందా... ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇచ్చిన కొల్లూరు క్వారీలో యథేచ్చగా అదనపు బకెట్ దందా కొనసాగుతూనే ఉంది. వినియోగదారులు టీఎస్ఎండీసీ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్న క్యూబిక్ మీటర్ల మేరకు లారీల్లో ఇసుక నింపాలి. అయితే కాంట్రాక్టర్లు, జేసీబీ ఆపరేటర్లు, అక్కడి సిబ్బందిని మేనేజ్ చేస్తూ లారీల్లో జేసీబీ అదనపు బకెట్ ఇసుక నింపుతున్నారు. అదనంగా పోసిన ఇసుకకు డబ్బులు అక్కడే వసూలు చేస్తున్నారు. చలానా రూపంలో కట్టినవి మాత్రం టీఎస్ఎండీసీకి జమ అవుతున్నాయి. అదనపు బకెట్ ఇసుకతో వాహన పరిమితి మించి ఓవర్లోడ్తో ఇసుక లారీలు వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో కట్టిన చలానా ప్రకారమే వేబ్రిడ్జిలో ఇసుక తూకం వేయాలి. అయితే ఈ నిబంధనలేమి అమలు కావడం లేదు. రీచ్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అదనపు బకెట్ దందా ఆగడం లేదు. రోజూ పరిమితి మించి గోదావరి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఓవర్లోడ్తో వెళ్తున్న లారీలతో చెన్నూరు, జైపూర్, ఇందారం వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ‘సాక్షి’లో కథనం రావడంతో టీఎస్ఎండీసీ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో మళ్లీ అదనపు బకెట్ దందా ఊపందుకుంది. -
ఇసుక దోపిడీ రూ.100 కోట్లు.. పట్టించుకోని టీఎస్ఎండీసీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నకిలీ వే బిల్లులతో రీచ్ల నుంచి ఇసుక అక్రమ మార్గంలో తరలిపోతోందని వరంగల్ కమిషనరేట్ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలంగా రెండున్నరేళ్లలో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆదాయం పక్క దారి పట్టినట్లు తెలుస్తోంది. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలోనే నకిలీ వే బిల్లుల దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కొందరు ఇసుక రవాణాదారులు, టీఎస్ఎండీసీ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ములుగు నుంచి తీగలాగితే... రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34 యాక్టివ్ ఇసుక రీచ్ల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక లభ్యత ఉన్నచోట స్థానికులకు భాగస్వామ్యం కల్పించి టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 6 ఇసుక రీచ్లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి నిత్యం 300 నుంచి 600 లారీలు లోడింగ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం ములుగు జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఇసుక లారీని వరంగల్లో పోలీసులు తనిఖీ చేశారు. నకిలీ వేబిల్లులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ను విచారించగా.. యజమానికి 8 లారీలు ఉన్నాయని, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో యజమాని చెప్పిన చోటుకు వెళ్లి లోడింగ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకోకుండా నేరుగా లోడింగ్ చేసుకోవడం,, డబ్బులు చెల్లించడమేంటని పోలీసులకు అనుమానం వచ్చి టాస్్కఫోర్స్ అధికారులకు కేసును అప్పగించారు. రూపాయి చెల్లించకుండా 30 టన్నుల ఇసుక ములుగు, ఏటూరు ప్రాంతంనుంచి వచ్చే ఇసుక లారీలపై పోలీసులు నిఘా పెట్టారు. వరంగల్, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, జనగాం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి దాదాపు 40 లారీలను స్వాదీనం చేసుకున్నారు. 12 టైర్ల లారీలో 26 టన్నుల ఇసుక నింపుకుంటే రూ.10,500 చెల్లించాల్సిన కొందరు లారీ యజమానులు నకిలీ వేబిల్లులతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 26 నుంచి 30 టన్నులు తీసుకెళ్లినట్లు తేలింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి 16 లారీలు, 65 నకిలీ వే బిల్లులు, 16 టీఎస్ఎండీసీ స్టాంపులు, 1 లాప్ టాప్, 11 సెల్ఫోన్లు, రూ. 41,000ల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక కొందరు టీఎస్ఎండీసీ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి క్వారీ వద్ద టీఎస్ఎండీసీకి చెందిన సూపర్వైజర్ ఉంటారు. వీరి ప్రమేయం లేకుండా ఇసుక లారీ బయటకు వెళ్లే ప్రసక్తే ఉండదు. కొందరు అధికారులు, క్వారీ నిర్వాహకులు, లారీల యజమానులు కలిసే అక్రమ దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 3 నెలల్లో 1800 లారీల ఇసుక అక్రమ తరలింపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచే మూడు నెలల్లో 1800 లారీల ఇసుక ఎలాంటి సొమ్ము చెల్లించకుండా తరలినట్లు పోలీ సు విచారణలో తేలగా, రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 యాక్టివ్ రీచ్ల నుంచి రూ.100 కోట్లకు పైగా వి లువచేసే ఇసుక తరలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
సూర్యాపేటజిల్లా తుంగతుర్తిలో ఇసుక మాఫియాపై స్థానికుల ఆగ్రహం
-
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి/ కాకినాడ: కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్లు పొందినట్లు చెప్పుకుంటూ.. జిల్లాల వారీగా అక్రమ విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివిధ జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందిందినట్లు చెప్పారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ‘జేపీవీఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అక్రమార్కులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా వివధ పేర్లతో కాకినాడ జిల్లా పరిధిలో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తాం.’ అని గట్టి హెచ్చరికలు జారి చేశారు. అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎస్ఈబీ ఏర్పాటు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగిందన్నారు ఎస్పీ. ఎస్.ఇ.బి అధికారులు జిల్లాలో నిత్యం వాహన తనిఖీలు చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు, అక్రమ రవాణా నిర్మూలన కొరకు SEB అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని నిర్భయంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చునని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఖండించిన జేపీవీఎల్.. కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్లు పొందారని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను జేపీవీఎల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటిసి ద్వారా నిర్వహింపచేసిన టెండర్లలో జయప్రకాశ్ పవర్ వెంచర్స లిమిటెడ్ (జేపీవీఎల్) ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకుంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడుతూ జేపీవీఎల్ సాంకేతికంగానూ, ఆర్థికంగానూ తన సామర్థ్యంను చాటుకుని ఈ టెండర్లలో కాంట్రాక్ట్ పొందింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని నిబంధనలను జేపీవీఎల్ సంస్థ పాటిస్తోంది. జేపీవీఎల్ సంస్థ విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో వ్యాపార అనుభవం కలిగిన సంస్థ. జేపీవీఎల్ సంస్థకు ఎటువంటి రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా జేపీవీఎల్ సంస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను, తప్పుడు వార్తలను జేపీవీఎల్ సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని పత్రిక ప్రకటన విడుదల చేశారు జేపీవీఎల్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్. ఇదీ చదవండి: పారదర్శకంగా ఇసుక విధానం -
ఇసుక పేరుతో దోచుకున్న వ్యక్తి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: మేనిఫెస్టోలో హామీలు అమలు చేయని వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసులో దొరికిన నేత చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గతంలో చంద్రబాబు తన అనుచరులకు దోచిపెట్టారు. టీడీపీ ప్రభుత్వం ఇసుక పేరుతో దోచుకుంది. ఇసుక కాంట్రాక్టు, మైనింగ్ విషయంలోనూ పారదర్శకంగా ఇస్తున్నాము. మేనిఫెస్టోలో హామీలు అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 98 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. సీఎం వైఎస్ జగన్ పారదర్శక పాలన అందిస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీకి సంబంధం ఏంటి?. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు’ అని విమర్శలు చేశారు. -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. 12 ట్రాక్టర్లతో బీభత్సం
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను ట్రాక్టర్లతో బద్దలుకొట్టింది. 12 మంది ట్రాక్టర్ డ్రవైర్లు టోల్ రుసుం చెల్లించకుండానే మెరుపువేగంతో దూసుకెళ్లారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా ట్రాక్టర్లను వేగంగా నడుపుతూ ముందుకెళ్లారు. ఆగ్రాలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. #WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, belonging to the sand mafia, break toll barricading and speed past, in Saiyan Police Station area in Agra on 4th September. (Source: CCTV) pic.twitter.com/p2mfPseths — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022 ఈ ఘటనపై ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరీ స్పందించారు. వారం క్రితం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 51 ట్రక్కులను సీజ్ చేసి కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో మాఫియా మకాం మార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే హైడ్రాలిక్ ట్రాలీలతో టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఘటనపై ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు ఎస్ఎస్పీ వివరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులందరూ ధోల్పూర్ ప్రాంతానికే చెందినవారని, అక్కడి పోలీసుల సహకారంతో అందర్నీ పట్టుకుంటామన్నారు. చదవండి: బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం -
అక్రమ దందాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ప్రభుత్వం మరింత పటిష్టపరుస్తోంది. గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర దందాలను మరింత సమర్థంగా కట్టడిచేసేందుకు సెబ్కు సాంకేతిక సాధన సంపత్తిని సమకూరుస్తోంది. నేరపరిశోధనలో కీలకమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) పరిధిలోకి సెబ్ను తీసు కొచ్చింది. మరోవైపు గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాలు, నేరస్తుల డేటాను సమగ్రంగా రికార్డు చేయనుంది. తాజా విధాన నిర్ణయంతో శాంతిభద్రతల పోలీసు విభాగం, సెబ్లను అనుసంధానించనుంది. సమర్థంగా నేరపరిశోధన, నేరాల కట్టడి నేరపరిశోధనలో సీసీటీఎన్ఎస్ అత్యంత కీలక విభాగం. వివిధ నేరాలు, ఆ కేసుల పరిశోధన, ఆ నేరాలకు పాల్పడిన వారి వివరాలు అన్నింటినీ సీసీటీఎన్ఎస్లో సమగ్రంగా రికార్డు చేస్తారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భద్రపరిచే ఈ వ్యవస్థ నేరపరిశోధనలో పోలీసు అధికారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇటువంటి వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసింది. అనంతరం కేంద్ర హోంశాఖ ఇదే వ్యవస్థను జాతీయస్థాయిలో నెలకొల్పింది. అటువంటి సమర్థమైన సీసీటీఎన్ఎస్ పరిధిలో ప్రస్తుతం శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు విభాగమే ఉంది. గంజాయి, అక్రమ ఇసుక, అక్రమ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాల కట్టడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన సెబ్ను సీసీటీఎన్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని పోలీసు శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, ఆ నేరస్తుల వివరాలన్నీ సీసీటీఎన్ఎస్లో నమోదు చేస్తారు. ఆ నేరస్తుల స్వభావం, నేరాల చరిత్ర, పెండింగ్లో ఉన్న కేసులు తదితర సమాచారమంతా సెబ్ అధికారులకు అందుబాటులోకి వస్తుంది. ఆ కేసుల పరిశోధన కోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేరస్తులు, సిండికేట్లతో ఉన్న సంబంధాలు, వ్యాపార, ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ పోలీసులకు అందుబాటులోకి వస్తాయి. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో వ్యవస్థీకృతమైన ముఠాలు అక్కడి నుంచి మన రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి దందాలకు పాల్పడుతున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై ప్రస్తుతం సెబ్ దాడులు చేసి కేసులు నమోదు చేస్తోంది. తాజాగా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి రావడంతో ఇతర రాష్ట్రాల్లోని ముఠాలపై కూడా కేసులు నమోదు చేసేందుకు, అక్రమ దందాను మూలాలతోసహా పెకలించేందుకు మార్గం సుగమమైంది. కేసు దర్యాప్తునకు దేశంలోని ఏ ప్రాంతాలకు వెళ్లాలో తెలియడంతోపాటు సంబంధిత రాష్ట్రాల పోలీసు, దర్యాప్తు సంస్థల సహకారం పొందడం సులభతరమవుతుంది. పోలీసు, సెబ్ వ్యవస్థల అనుసంధానం అక్రమ దందాలను అరికట్టడంతో పోలీసు, సెబ్ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీసీటీఎన్ఎస్ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్ కూడా చేరింది. అంటే సీసీటీఎన్ఎస్లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్ పోలీసుస్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీనే సెబ్కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అదే రీతిలో జిల్లాస్థాయిలో ఎస్పీల పర్యవేక్షణలోనే ఏఎస్పీల నేతృత్వంలో సెబ్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసు, సెబ్ విభాగాల మధ్య సాంకేతిక అంశాల్లో కొంత సందిగ్ధత ఉంది. ప్రస్తుతం ఈ రెండు విభాగాలు కూడా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి చేరడంతో వాటిమధ్య పూర్తి సమన్వయం సాధించినట్లయింది. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ను సమర్థంగా కట్టడిచేసేందుకు అవకాశం ఏర్పడిం ది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగను న్నాయి. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేర స్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. -
మట్టిమాఫియా దాడి ఘటనలో కొత్త ట్విస్ట్
-
ఎస్ఐ అవినీతి ‘గట్టు’
గట్టు: ఓ ఎస్ఐ అవినీతి గుట్టు రట్టయింది. ఇసుక తరలించేందుకు, జాతరలో జూదానికి అనుమతిచ్చేందుకు మామూళ్లు తీసుకున్నారనే వ్యవహారం తాజాగా రచ్చకెక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై సీఐ విచారణ చేపట్టారు. గత నవంబర్ 24న గట్టులో జాతర నిర్వహించారు. ఆ సమయంలో జూదానికి అనుమతి ఇవ్వాలంటూ నిర్వాహకులు పోలీస్ జీపు డ్రైవర్గా పనిచేస్తున్న భీమేష్ సాయం కోరారు. దీంతో ఆయన వారి తరఫున ఎస్ఐ మంజునాథరెడ్డితో సెటిల్మెంట్ కోసం ఫోన్లో మాట్లాడారు. ఎస్ఐ రూ.50వేలు డిమాండ్ చేయగా.. రూ.40వేలు ఇస్తానని సదరు డ్రైవర్ చెప్పారు. ఈ డబ్బులు పైఅధికారులకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చుకోవాలో ఎస్ఐ వివరించారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇసుక వ్యవహారంలో.. ఇదిలాఉండగా, మండలంలోని ఇందువాసికి చెందిన ఓ ఇసుక ట్రాక్టర్ను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలించడానికి ఇది వరకే ఎస్ఐకి రూ.20వేలు ఇచ్చానని గ్రామానికి చెందిన నర్సప్ప తెలిపారు. డబ్బులు తీసుకుని తిరిగి పట్టుకోవడాన్ని ఆక్షేపిస్తూ కొంతమంది ట్రాక్టర్ల యజమానులు గురువారం పెద్దఎత్తున పోలీస్స్టేషన్కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఇసుక తరలింపునకు ప్రత్యేక అనుమతుల పేరుతో ప్రతి నెలా ట్రాక్టర్ల యజమానుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. అవినీతి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో గద్వాల సీఐ బాష గట్టు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఎస్ఐ మంజునాథరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. భీమేష్తోపాటు మరికొందరిని విచారించారు. ఇసుక అనుమతుల వ్యవహారంపైనా ట్రాక్టర్ల యజమానులతో ఆరా తీశారు. ఉన్నతాధికారులకు వసూళ్ల వ్యవహారంతో సంబంధం లేదని బాష చెప్పారు. -
నిజామాబాద్: ఇసుక మాఫియా ముఠా దాడి.. వీఆర్ఏ మృతి
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుకు మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా ముఠా.. సోమవారం రాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రయత్నించారు. (చదవండి: ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..!) వీరిని అడ్డుకునేందుకు వీఆర్ఏ గౌతమ్ ప్రయత్నించగా.. ఇసుక మాఫియా ముఠా వీఆర్ఏను చితకబాదింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీఆర్ఏ గౌతమ్ను ప్రభుత్వ ఆసుస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. దీంతో వీఆర్ఏ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. చదవండి: తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం -
ఇసుక మాఫియాకు అడ్డాగా తెలంగాణ: వైఎస్ షర్మిల
సాక్షి, కామారెడ్డి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో పర్యటించారు. మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు (అంజవ్వ, జ్యోతి, గంగోత్రి, ప్రశాంత్) మృతిచెందగా.. బాధిత కుటుంబాన్ని, బంధువులను పరామర్శించారు. అనంతరం మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలతో గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. క్వారీ నిర్వాహకులు నిబంధనల ప్రకారం మంజీరా నదిలో మూడు మీటర్లలోపు ఇసుక తొవ్వాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా 10 మీటర్ల వరకు తవ్వుతున్నారని వైఎస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్టారీతిన గుంతలు తీయడం వల్లనే వాటిలో నీళ్లు నిండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు అతి వేగంగా నడపడంతో గ్రామానికి చెందిన ఓ యువకుడి కాలు కూడా విరిగిందని తెలిపారు. చదవండి: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, టాప్ 10 ర్యాంకులు వీరికే అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తూ కోట్లు దండుకుంటున్నారని, నిబంధనలను విరుద్ధంగా వాగులు, నదులను తోడేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు గుంతల్లో పడి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబంలో నలుగురు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదని, వీరి మృతికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజీరా నదిని అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. -
తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్య వ్యక్తిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్మధ్య నెలరోజుల పాటు సాగిన సంకక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చరణ్జిత్ సింగ్ చన్నీని కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో చన్నీ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణమే సాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు రైతు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. స్వయంగా రిక్షా పుల్లర్ని అయిన తాను వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాకపోవడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి కాంగ్రెస్ పెద్దలు, పలువురు నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా శుభాకాంక్షలు అందజేశారు. #WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7 — ANI (@ANI) September 20, 2021 Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab. — Narendra Modi (@narendramodi) September 20, 2021
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement