-
నవ వసంతంలో అందరికీ మేలు జరగాలి
గన్¸పౌండ్రీ (హైదరాబాద్): క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలలో పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటికి ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన మూడు జలాశయాలైన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్లలో గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సరఫరాను సమీక్షించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ‘వేసవి కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించి జిల్లాలకు తగు నిధులను కూడా విడుదల చేసినట్లు సీఎస్ తెలిపారు. తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు. నిరంతర నీటి సరఫరా కొనసాగింపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని తాగునీటి సమస్యను మన రాష్ట్రానికి కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన వార్తా కథనాలు రాయడం సరికాదన్నారు. ఏప్రిల్ రెండో వారం అనంతరం రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ను చేపడతామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో కూడా సరిపడా నీటి సరఫరా చేస్తున్నామని, వాణిజ్య అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు వెల్లడించారు. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులతో గురువారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలా పనిచేశారో.. అదే స్ఫూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కూడా వివిధ శాఖలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయన్నారు. ఇప్పటివరకు పోలీసు శాఖ రూ.10 కోట్ల నగదు, పలు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను నిల్వ చేసేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ కేంద్రాలపై కూడా నిఘా ఉంచామన్నారు. మద్యం అక్రమ రావాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి మద్యం నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె. జైన్ పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ)గా రాష్ట్ర మా జీ డీజీపీ మహేందర్రెడ్డి నియమితులయ్యా రు. అదేవిధంగా కమిషన్లో పది మంది సభ్యు ల నియామకానికి అవకాశం ఉండగా.. ప్రభు త్వం చేసిన ప్రతిపాదనల మేరకు ఐదుగురిని సభ్యులుగా నియమించడానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ని యమితులైన చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఆరే ళ్ల పాటు ఉంటుంది. అయితే 62 ఏళ్లు పైబడిన వారు పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించి.. సెర్చ్ కమిటీ వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా చర్యలు వేగవంతం చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో కమిషన్ చైర్మన్గా వ్యవ హరించిన బి.జనార్ధన్రెడ్డి డిసెంబర్లో రాజీ నామా చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో పీఎస్సీల పనితీరును అధ్యయనం చేయాల్సిందిగా సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా యూపీఎస్సీ చైర్మన్తో సమావేశమై టీఎస్పీఎస్సీ నిర్వహణకు సలహాలు సూచనలు కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటి పరిశీలనకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తుల వడపోత అనంతరం సెర్చ్ కమిటీ చైర్మన్, సభ్యుల కోసం కొన్ని పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. కాగా ఈ మేరకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1962 డిసెంబర్ 3న ఆయన జన్మించారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు. టీఎస్పీఎస్సీ టీమ్ ఇదే చైర్మన్: ఎం.మహేందర్రెడ్డి(రిటైర్డ్ ఐపీఎస్) సభ్యులు: అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమిర్ ఉల్లా ఖాన్, (రిటైర్డ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్), ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబడి రామ్మోహన్రావు, పాల్వాయి రజినీకుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల బయోడేటాలు పేరు: ఎం.మహేందర్ రెడ్డి స్వస్థలం : ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కిష్టాపురం గ్రామం పుట్టిన తేదీ : 1962 డిసెంబర్ 3 సామాజికవర్గం: రెడ్డి (ఓసీ) విద్యార్హతలు: ఆర్ఈసీ వరంగల్ నుంచి బీటెక్ (సివిల్), ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ హోదా: రిటైర్డ్ డీజీపీ (2022 డిసెంబర్) (1986 బ్యాచ్ ఐపీఎస్) పేరు: అనితా రాజేంద్ర స్వస్థలం : రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ పుట్టిన తేదీ : 1963 ఫిబ్రవరి 04, బీసీ–బీ (గౌడ) విద్యార్హతలు: బీకాం, ఎంఏ, ఎల్ఎల్ఎం హోదా: రిటైర్డ్ ఐఏఎస్ పేరు: అమిర్ ఉల్లా ఖాన్ స్వస్థలం : హైదరాబాద్ సామాజికవర్గం : ముస్లిం వయస్సు: 58 ఏళ్లు అనుభవం: యూఎన్డీపీలో పనిచేస్తున్నారు. ఉర్దూ వర్సిటీ, నల్సార్, ఐఎస్బీ, ఎంసీఆర్హెచ్ఆర్డీలో విజిటింగ్ ప్రొఫెసర్. హోదా: ఇండియన్ పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా పేరు: పాల్వాయి రజనీకుమారి స్వస్థలం : సూర్యాపేట పుట్టిన తేదీ: 06–05–1972, ఎస్సీ మాదిగ విద్యార్హతలు: ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ హోదా: టీచర్, వీడీఓ, మున్సిపల్ కమిషనర్ పేరు: వై.రామ్మోహన్రావు స్వస్థలం : హైదరాబాద్ పుట్టిన తేదీ : 1963 ఏప్రిల్ 4 సామాజికవర్గం : ఎస్టీ–ఎరుకల విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ హోదా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్కో పేరు: డాక్టర్ నర్రి యాదయ్య స్వస్థలం: మల్లారెడ్డిగూడెం, యాద్రాది భువనగిరి జిల్లా పుట్టిన తేదీ : 1964–4–10 సామాజికవర్గం: బీసీ–బీ(కురుమ) విద్యార్హతలు: ఎంటెక్ , పీహెచ్డీ హోదా: సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్, కూకట్పల్లి -
17 నాటికి డేటా ఎంట్రీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అభయహస్తం దరఖాస్తుల మొత్తం డేటా ఎంట్రీ ఈనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహ ణ, దరఖాస్తుల డేటా ఎంట్రీపై జిల్లా కలెక్టర్లతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సీఎస్ అభినందించారు. ఈనెల 6 వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి 17 నాటికి పూర్తి చేయాలన్నారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. నేడు టీవోటీలకు శిక్షణ డేటా ఎంట్రీకి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రైనీ ఆఫ్ ట్రైనర్ (టీవోటీ)లకు 4వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీవోటీలు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏవిధంగా చేయా లన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని చెప్పారు. డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. 2వ తేదీ నాటికి 57 లక్షల దరఖాస్తులు మంగళవారం నాటికి దాదాపు 57 లక్షల దరఖాస్తులు అందాయని సీఎస్ తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని కూడా సీఎస్ స్పష్టం చేశారు. టెలి కాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు. -
జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. కేబినెట్ లోని మంత్రులందరికీ ఉమ్మడి పది జిల్లాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులను తలా ఓ జిల్లాకు ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్లో ప్రాతిని ధ్యం దక్కని హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, ఆదిలా బాద్కు సీతక్క, నిజామాబాద్కు జూపల్లి కృష్ణా రావు, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్బాబులను ఇన్చార్జి మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) లను కూడా పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మండళ్ల పునరుద్ధరణ ద్వారా ప్రతి మూడు నెలలకోసారి ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ఇన్చార్జి మంత్రులను ప్రజాపాలన కార్యక్రమాల అమలును సమన్వయం చేసేందుకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. -
తెలంగాణలో 9మంది ఐఏఎస్లకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది ఐఏఎస్లకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఉత్వర్వుల్లో సంతకం చేశారు. తాజా పోస్టింగ్లలో.. హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్గా పి శ్రీజా, జనగాం అడిషనల్ కలెక్టర్గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్గా లెనిన్ వట్సల్ టోప్పో, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్గా కదివరన్ ఐఏఎస్లను నియమించారు. అలాగే.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత గంగువార్లను నియమిస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. -
విద్యుత్ శాఖలో భారీ మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సర్కారు విద్యుత్ శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. ఆయా విద్యుత్ సంస్థల సారథ్య బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారుల (నాన్ ఐఏఎస్)ను తొలగించి.. ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్తోపాటు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఇన్చార్జి డైరెక్టర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని ఇంధనశాఖ కార్యదర్శిగా నియమించారు. అంతేగాక రాష్ట్ర విద్యుత్ శాఖలో కీలకమైన తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్కో, జెన్కోలకు సీఎండీగా దాదాపు పదేళ్లు కొనసాగిన డి.ప్రభాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. దీంతో సర్కారు కొత్త సీఎండీని నియమించింది. ముర్తుజా రిజ్వీ 2013 జూలై 2 నుంచి 2014 జూలై 19 వరకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా వ్యవహరించారు. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్కు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు కీలకమైన ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది. గత ఎనిమిదేళ్లుగా ఈ పోస్టులో కొనసాగిన సి.శ్రీనివాసరావుకు ఉద్వాసన పలికింది. డిస్కంలకు యువ అధికారులు: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు అధిపతులుగా యువ ఐఏఎస్ అధికారులను సర్కారు నియమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషార్రఫ్ అలీ ఫారూఖీని.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్రెడ్డిని నియమించింది. ఐటీ–ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సందీప్కుమార్ ఝాను ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా బదిలీ చేసింది. టీఎస్ఎన్పిడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్రావు తన పదవికి రాజీనామా చేయగా, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఇప్పటివరకు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో రఘుమారెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆయనను తప్పించారు. ఇక కేంద్ర డెప్యుటేషన్ నుంచి తిరిగొచ్చి వెయిటింగ్లో ఉన్న కాటా ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్లో ఉన్న బి.గోపికి వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొత్త డైరెక్టర్లు కూడా..! రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కొత్త సీఎండీలను నియమించిన ప్రభుత్వం.. త్వరలో కొత్త డైరెక్టర్లను సై తం నియమించనున్నట్టు చర్చ జరుగుతోంది. ప్ర స్తుతం ట్రాన్స్కోలో నలుగురు, జెన్కోలో ఆరుగు రు, టీఎస్ఎస్పీడీసీఎల్లో ఏడుగురు, టీఎస్ఎన్పి డీసీఎల్లో ఆరుగురు డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వారిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి, మరికొందరు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్థల్లో నిర్దేశిత సంఖ్యకు మించి డైరెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న డైరెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిసింది. -
2024లో 27 సాధారణ సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని ఆదివారాలు, అన్ని రెండో శనివారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశించారు. 2024 జనవరి 1న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం (ఫిబ్రవరి 10) రోజును పనిదినంగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 25 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా 5 సెలవులను మాత్రమే వినియోగించాలని కోరారు. తమ ఇష్టాలకు అనుగుణంగా మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకి సంబంధించిన ఐచ్చిక సెలవును ఉద్యోగులు వాడుకోవచ్చని తెలిపారు. అయితే దీనికోసం పైఅధికారికి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు వర్తించవని స్పష్టం చేశారు. సంబంధిత సంస్థలే సెలవులపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయన్నారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పర్వదినాల సెలవులను తర్వాత మారుస్తామని తెలిపారు. -
సలహాదారులకు ఉద్వాసన..
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం నియమించిన సలహాదారుల పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్శర్మ, డీజీపీగా కొనసాగిన అనురాగ్ శర్మలు ఇంతకాలం సలహాదారులుగా కొనసాగుతున్నారు. వారి పదవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పదవులు కోల్పోతున్న వారిలో రాజీవ్శర్మ (ప్రభుత్వ ముఖ్య సలహాదారు), అనురాగ్శర్మ (శాంతిభద్రతలు, నేర నిరోధక సలహాదారు), ఏకే ఖాన్ (మైనారిటీ సంక్షేమం సలహాదారు), జీఆర్ రెడ్డి (ఆర్థిక సలహాదారు), ఆర్.శోభ (అటవీ వ్యవహారాలు), సోమేశ్కుమార్ (ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు), డాక్టర్ చెన్నమనేని రమేశ్ (వ్యవసాయ ముఖ్య సలహాదారు) ఉన్నారు. వీరి పదవీ కాలం శుక్రవారంతోనే ముగిసిందని సీఎస్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
సీఆర్పీఎఫ్ పహారాలో ‘సాగర్’
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పహారాలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే నవంబర్ 30 నాటి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి స్పష్టం చేయగా గత నెల 28కి ముందున్న పరిస్థితిని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏమాత్రం రాజీ లేకుండా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల దాహార్తి తీర్చేలా తాగునీటి అవసరాల కోసం రెండో రోజు శుక్రవారం కూడా 3,300 క్యూసెక్కుల నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఏపీ ప్రభుత్వం గురువారం స్వాధీనం చేసుకుని కుడి కాలువకు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా శుక్రవారం ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్లతో కలిసి రెండు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. హక్కులు కాపాడుకోవడానికే.. తాము శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం 500 మంది పోలీసులను పంపి సాగర్లో సగం స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకుని ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిందని తెలంగాణ సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండోసారి అని చెప్పారు. సాగర్ కుడి కాలువకు నీటిని తరలించడం వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. దీనిపై ఏపీ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో అక్టోబర్ 6న కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయిస్తే అదే రోజు అక్రమంగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్కు తెలంగాణ సర్కారు నీటిని తరలించిందని ప్రస్తావించారు. దీనివల్ల శ్రీశైలంలో తమకు కేటాయించిన నీటిలో 17 టీఎంసీలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసే సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని తెలంగాణ తన అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేయకుండా హక్కులను హరిస్తోందన్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికే సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నామని తేల్చి చెప్పారు. తెలంగాణ సర్కార్ తీరుతో వివాదాలు కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్ సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించగా తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటోందని, ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతోందని ప్రస్తావించారు. తెలంగాణ సర్కార్ చర్యల వల్లే గెజిట్ నోటిఫికేషన్ అమలులో జాప్యం జరుగుతోందని, దీనివల్లే వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని తేల్చి చెప్పారు. తాను శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వెళ్తే తెలంగాణ సర్కార్ తనను ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలోకి అనుమతించలేదని వెల్లడించారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ తెలంగాణ సర్కార్ కృష్ణా జలాలను వాడుకుంటోందని, ఇదే వివాదానికి కారణమవుతోందని ఆనంద్మోహన్ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు.. సాగర్ డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న ఏపీ జలవనరుల శాఖ, పోలీసు సిబ్బందిని అడ్డుకున్న ఘటనకు సంబంధించి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)పై రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై పల్నాడు జిల్లా విజయపురి సౌత్ పోలీస్స్టేషన్లో గురువారం రాత్రి కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చలు రెండు రాష్ట్రాల సీఎస్ల వాదనలు, కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, కృష్ణా బోర్డు ఛైర్మన్ అభిప్రాయాలను విన్న తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ బల్లా దీనిపై స్పందించారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ సాగర్పై స్టేటస్ కో కొనసాగుతుందని ప్రకటించారు. ఈలోగా ఈ వివాదంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటిదాకా సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు దిశానిర్దేశం చేశారు. కొనసాగుతున్న నీటి విడుదల రెండో రోజు సాగర్ కుడికాలువ ద్వారా 3,300 క్యూసెక్కులు దిగువకు సాక్షి, నరసరావుపేట, మాచర్ల, విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ భూభాగంలో ఉన్న 13 క్రస్ట్గేట్లు, హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనపర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నీటి హక్కులపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కుల నీటి విడుదల రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం 5వ గేటు నుంచి 2,000 క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1,300ల క్యూసెక్కుల విడుదలను కొనసాగిస్తూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. సాగర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి నేతృత్వంలో సుమారు 1,300 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తును పరిశీలించారు. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
సీఈసీ పర్యటనకు వివరాలతో సిద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్తోపాటు, కమిషన్ సభ్యులు వచ్చే నెల 3వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. 5వ తేదీవరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సభ్యులు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఈసీ పర్యటన నేపథ్యంలో సీఎస్ శుక్రవారం సచివాలయంలో సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు తమ మూడు రోజుల పర్యటనలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని సీఎస్ అధికారులకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున వాటికి సంబంధించిన అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, అధికారులు అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని ఆమె సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల వివరాలను నివేదికల్లో పొందుపరచాలని, సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి దివ్యాంగుల కోసం వీల్చైర్లు కొనుగోలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలని చెప్పారు. అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఏఈఆర్ఓ), ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సమీకృత సరిహద్దు చెక్పోస్టుల వివరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అందుబాటులో ఉంచాలని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో సీఈవో వికాస్ రాజ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబరు 3న తెలంగాణకు సీఈసీ రాక..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీ బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ ఆదేశించారు. ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి.. సచివాలయంలో శుక్రవారం అధికారులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి సన్నద్ధతను ఈసీకి వివరించాలని చెప్పారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున పోలింగ్కు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని వివరాలను ఏకరూపంగా అందించాలని స్పష్టం చేశారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో కల్పించనున్న కనీస వసతుల వివరాలు ఇవ్వాలని సీఎస్ చెప్పారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్ ఛైర్లను సమకూర్చుకొని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఏఈఆర్ఓ, ఈఆర్ఓ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన సమీకృత చెక్ పోస్టుల వివరాలను ఈసీకి అందించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి అదేశించారు. ఇది కూడా చదవండి: నాడు ఎన్టీఆర్ను ఓడించిన నేత.. నేడు బీఆర్ఎస్కు రాజీనామా -
ఇంకా రుణమాఫీ అందని రైతులు..1.6 లక్షలు రాష్ట్ర ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వీరికి వెంటనే రుణమాఫీ సొమ్ము అందజేయాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో హరీశ్రావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ... రుణమాఫీకి సంబంధించి ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యక్రమంలో రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లు ఆర్థికశాఖ విడుదల చేసిందన్నారు.17.15 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయన్నారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లు క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లు మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు ఆయనకు అధికారులు వివరించారు. చర్చించిన అనంతరం మూడు పరిష్కారమార్గాలు కనుగొన్నారు. ఆధార్ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం, దీనివల్ల సుమారు మరో లక్షమందికి రుణమాఫీ డబ్బు అందుతుంది. ఎన్పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు. మిగతా 16 వేల మందికి సంబంధించి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని మంత్రి హరీశ్రావు తెలిపారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి గ్రీవెన్స్సెల్ రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేయాలి.. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రైతులు ముందుగా బ్యాంకుస్థాయిలో సంప్రదిస్తారు..అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరపున జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ను నియమిస్తామన్నారు. కొత్త రుణాలు మంజూరు చేయాలి రుణమాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని మంత్రి హరీశ్రావు అన్నారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని చెప్పారు. రుణమాఫీ పొందినవారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యూవల్ పూర్తి కావాలన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9,654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యూవల్పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణమాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబంధిత అన్ని సమస్యలు పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. -
బ్యాంకర్లతో మంత్రి హరీష్ సమీక్ష.. రుణమాఫీలపై కీలక ఆదేశం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో రైతులకు గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతుల రుణమాఫీపై ఆర్థికమంత్రి హరీష్ రావు బ్యాంకర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో రైతుల రుణమాఫీపై మంత్రి హరీష్ రావు మరోసారి అధికారులతో భేటీ అయ్యారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్ష(99,999)రూపాయలలోపు రైతుల రుణాలను మాఫీ చేశారు. ఈ సందర్బంగా రుణాలు మాఫీ కాని రైతులపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని మంత్రి హరీష్ ఆదేశించారు. అలాగే, రుణమాఫీ పొందే రైతులు సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్ఫ్రీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.99,999 వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు.. 10.79 లక్షల రైతులకు.. రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి.. ప్రతి వారం కొంత మొత్తాన్ని జమ చేస్తోన్న రాష్ట్ర సర్కార్.. ఖజానాకు వస్తోన్న ఆదాయం ప్రకారం చెల్లింపులు చేస్తోంది. ఈ మేరకు పన్నేతర ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సెప్టెంబర్ రెండో వారంలోగా.. ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్వార్! -
హైదరాబాద్లో మెట్రో విస్తరణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి అవసరం ఉందన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్పై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం అని పేర్కొన్నారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే మెట్రోను విస్తరించక తప్పదన్నారు. విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా బలోపేతం కావాలన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలన్నారు. 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరిన్ని కోచ్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్పాత్లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇక, మెట్రో రైల్ భవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: లోక్సభలో బండి సంజయ్ భావోద్వేగ కామెంట్స్ -
వైన్ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లకు ఏ4 (వైన్) షాపులకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లైసెన్సుల జారీకి సంబంధించిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన జీఓ నంబరు 86 ప్రకారం పాత పాలసీలోని నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి, నవంబర్ 30, 2025 వరకు మద్యం విక్రయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇందుకు లాటరీ పద్ధతినే పాటిస్తారు. దరఖాస్తు ఫీజు కూడా గతంలో లాగానే రూ.2లక్షలుగా ఉంటుంది. ఎక్సైజ్ ఫీజు శ్లాబులూ, ఇతర నిబంధనలన్నీ గత పాలసీ మేరకే ఉంటాయి. గతంలో మాదిరిగానే గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో ఎన్ని షాపులు కేటాయించాలో బుధవారమే నిర్ణయించారు. ఈ షాపుల సంఖ్య ప్రకారం గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రాలు నిర్వహించి ఏ షాపులు ఏ ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. ఇతర షాపులకు కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు ఇస్తారు. లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గతంలో నిర్వహించిన విధంగానే జరుగుతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపుల కేటాయింపు ద్వారా ఈసారి కూడా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలు ఇలా... ♦ లైసెన్సులకు గత పాలసీ మాదిరిగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.2లక్షలు దరఖాస్తు కోసం చెల్లించాలి. లాటరీ వచి్చనా రాకపోయినా ఆ డబ్బులు ప్రభుత్వానికే జమవుతాయి. ఒకరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. ♦ రెండేళ్ల పాటు మద్యం విక్రయించుకునే ఫీజు గతంలోలాగే ఉంచారు. పాత స్లాబుల ప్రకారమే ఫీజులు నిర్ధారించారు. 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.50 లక్షలు, 5–50వేల జనాభా వరకు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు, 5 నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులకు రూ.1.10 కోట్లు ఎక్సైజ్ ఫీజుగా నిర్ణయించారు. ♦ జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబు, జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులకు కూడా వర్తిస్తుంది. ♦ లైసెన్స్ ఫీజు ప్రతి ఏడాది ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే రెండేళ్లలో 12 సార్లు ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ కింద మొత్తం ఫీజులో 25 శాతానికి ఇస్తే సరిపోతుంది. ♦ గతంలో మాదిరిగానే దరఖాస్తుతోపాటు ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం ఉండదు. ♦ మద్యం విక్రయాల ద్వారా లైసెన్సీలకు కమిషన్ (మార్జిన్) కూడా గతంలో ఉన్న విధంగానే నిర్ణయించారు. వార్షికఫీజు కంటే 10 రెట్ల టర్నోవర్ వరకు 27 శాతం మార్జిన్ ఇస్తారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20 శాతం, బీర్లపై 20 శాతంగా మార్జిన్ నిర్ధారించారు. పదిరెట్ల టర్నోవర్ దాటిన తర్వాత మాత్రం అన్ని బ్రాండ్లకు 10శాతం మార్జిన్ మాత్రమే ఇస్తారు. ♦ పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5లక్షలు చెల్లించాలి. వాకిన్స్టోర్ కావాలంటే మరో రూ.5లక్షలు చెల్లించాలి. ♦ జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయింపబడని షాపులకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. -
10,696 మంది తరలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముంపునకు గురైన 108 గ్రామాల నుంచి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉప్పొంగడంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని, అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి 600 మందిని, మంథనిలోని గోపాల్పూర్ ఇసుక క్వారీ లో చిక్కుకున్న 19 మంది కార్మికులను సుర క్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఆర్మీ హెలికాప్టర్ను మోరంచపల్లికి పంపించి అక్కడ చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. మరో 4 హెలికాప్టర్లు, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. డీజీపీ అంజనీ కుమార్తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని అన్ని పీహెచ్ సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుప త్రులను 24 గంటలు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, బూరు గుంపాడుకు హెలికాప్టర్ను వెంటనే పంపిస్తున్నామని తెలిపారు. ప్రయా ణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్లు... వరద ప్రభావిత జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వ ం నియమించింది. ములుగుకు కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్, నిర్మల్కు ముషా రఫ్ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లికి సంగీత సత్యనారాయణ, ఆసిఫా బాద్కు హన్మంతరావును కేటాయించింది. వరద చూసేందుకు వెళ్లి చిక్కుకుంటున్నారు వర్షాల నేపథ్యంలో ప్రజలు నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలపై ప్రయాణించ వద్దని సీఎస్ సూచించారు. చాలాచోట్ల వరద పరిస్థితులను చూసేందుకు వెళ్లినవారు అనూ హ్యంగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్.. సహాయ, పునరావాస కార్యక్రమాల పర్య వేక్షణకు ముగ్గురు సీనియర్ అధికారులతో సచివాలయంలో 7997950008, 7997 959782, 040 – 23450779 అనే ఫోన్ నంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని సీఎస్ తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లా ముత్యాలధార జలపాతంలో చిక్కుకుపో యిన 80 మంది పర్యాటకులను బుధవా రం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సురక్షి తంగా బయటకు తెచ్చామని తెలిపారు. -
కరుణించిన వరుణుడు
సాక్షి నెట్వర్క్: గత కొన్ని రోజులుగా రాష్ట్రానికి ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. ఆందోళనలో ఉన్న అన్నదాతను ఆనందంలో ముంచెత్తుతూ ఎండుతున్న చేలకు ఊపిరి పోశాడు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి దాకా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఇన్ని రోజులు బోసిపోయిన చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. వాగులు, వంకలు వరదతో ఉరకలెత్తుతున్నాయి. పలుచోట్ల వాగులు అలుగుపారుతున్నాయి. వివిధ ప్రాజెక్టుల్లోకి క్రమంగా ప్రవాహాలు చేరుతున్నాయి. వాగుల్లో వరద ఉధృతి: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి–చెల్పాక గ్రామానికి మధ్యలో ప్రవహిస్తున్న దయ్యాలవాగు (జంపన్నవాగు)తోపాటు వెంకటాపురం (కే) మండలంలోని కంకలవాగు, రాచపల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కన్నాయిగూడెం మండలంలోని దొంగలగుట్ట వాగు రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా ఏడాగుల కలయికతో హనుమంతుని వాగు పొంగి పొర్లుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆవతలి వైపున ఉన్న వివిధ గూడేల్లోని గర్భిణులను ముందస్తుగా ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణహిత పరవళ్లు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది గోదావరితో కలిసి పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సాయంత్రం కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తడిసి ముద్దయిన ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 8.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కుమురం భీం (ఆడ) ప్రాజెక్టులో ఒక గేటును 0.10 మీటర్ల మేర పైకెత్తి 208 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.629 టీఎంసీల నీరుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, భీమ్గల్, సిరికొండ, నవీపేట్, తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కమ్మర్పల్లి మండలంలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణం నుంచి రాజంపేట మండలం మీదుగా మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డుపై కొండాపూర్ శివారులో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా తాత్కాలికంగా వేసిన రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద కొడప్గల్ మండలంలో పోచారం గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఉన్న కాజ్వేపై భారీగా వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి: సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. -
భారీగా ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది వెయిటింగ్లో ఉన్న అధికా రులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. సీని యర్ ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, శైలజా రామయ్యర్ల సేవలను ఎంసీఆర్ హెచ్ఆర్డీ, యువజన సర్వీసుల శాఖలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వెయిటింగ్లో ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్గా పోస్టింగ్ ఇవ్వగా, 1997 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ను యు వజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శాట్స్ ఎండీగా, ఆర్కి యాలజీ డైరెక్టర్గా ఆమెకు అదనపు బాధ్య తలు అప్పగించింది. అలాగే వెయిటింగ్లో ఉన్న అధికారులు హరిచందన, వర్షిణి, హై మావతి, నిఖిల, సత్యశారదాదేవి, అరుణ శ్రీలకు పోస్టింగ్లు ఇచ్చింది. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్గా పనిచేస్తున్న ప్రియాంకా ఆలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా నియమించింది. అదే విధంగా ములుగు అద నపు కలెక్టర్గా ఉన్న ఇల త్రిపాఠికి అదే జిల్లా కలెక్టర్గా, సిద్దిపేట అదనపు కలెక్టర్ ము జమిల్ఖాన్కు పెద్దపల్లి కలెక్టర్గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న అనుదీప్ దురిశెట్టికి హైదరాబాద్ కలెక్టర్గా పదోన్నతి కల్పించింది. పెద్దపల్లి కలెక్టర్గా ఉన్న సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీగా, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా నియమించింది. జగిత్యాల అద నపు కలెక్టర్గా ఉన్న మంద మకరందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్గా బాధ్యతలు అప్పగించింది. ప్రభు త్వం మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లను ఈసారి బదిలీ చేయడం గమనార్హం -
34 ఏళ్ల సర్వీసులో ఇంత ప్రగతి చూడలేదు
సాక్షి, హైదరాబాద్: గత 9 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని, దేశంలో మరే రాష్ట్రం సాధించని అభివృద్ధిని తెలంగాణ సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ ప్రణాళికలేనని చెప్పారు. తన 34 ఏళ్ల సర్వీసులో రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గతంలో చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వ హించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో సీఎస్ మాట్లాడారు. జూబ్లీహిల్స్లో 2014కి ముందు వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, వాటర్ ట్యాంకర్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. అప్పట్లో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్లు రూపొందించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్ర మలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరి పాలన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. హరితహారంలో నాటిన 90 శాతం మొక్కలు మనుగడ సాధించడం ఒక అద్భుతమని శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రసూతి మరణాల్లో గణనీయమైన తగ్గుదల సాధించామని, ఇమ్యూనైజేషన్ పెరిగిందని, వైద్యారోగ్య రంగంలో అద్భుతాలు చవిచూశామని ఆమె వివరించారు. కార్య క్రమంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తమ శాఖల విజయాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. డీజీపీ అంజనీకుమార్, పీసీసీ ఎఫ్ డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగమయ్యను..
-
పరీక్ష కేంద్రాల పరిసరాల టవర్లపై నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. ఇప్పుడున్న భద్రతతోపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. విద్య, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి జరిగే పరీక్షల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో చురుకైన, సమర్థులైన అధికారులనే ఈ కార్యక్రమానికి ఎంపిక చేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం సూచించింది. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం అన్ని జిల్లాల నుంచి కొంతమంది అధికారుల పేర్లు తెప్పించింది. పరీక్ష కేంద్రాల సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై కసరత్తు చేసింది. ప్రత్యేక బృందాలతో రాష్ట్రస్థాయి నెట్వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశ్నపత్రాల చేరవేత నుంచి జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించే వరకూ గట్టి నిఘా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, పోలీసు అధికారులు సాంకేతిక కోణంలో నిఘాను పెంచుతున్నారు. అనుమానిత కేంద్రాల వద్ద సెల్ఫోన్ టవర్ల ద్వారా అవసరమైన సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్కు అందే కీలకమైన సమాచారం విశ్లేషించి, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెల్ఫోన్ టవర్స్పై నిఘా పెంచి కాల్స్ను గుర్తించాలని నిర్ణయించారు. లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎస్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతీ జిల్లాలో ప్రత్యేక బృందాలు ♦ టెన్త్ పరీక్షల కోసం ప్రతీ జిల్లాలో ప్రత్యేక అధికారుల బృందాన్ని గురువారం ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ ఉన్నతాధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. పరీక్ష కేంద్రాలు, అందులో పనిచేస్తున్న సిబ్బంది, ఫ్లయింగ్ స్వా్కడ్స్, ఇన్విజిలేటర్లపై వీరి ఆజమాయిషీ ఉంటుంది. జిల్లా పరిధిలో పరీక్షల కేంద్రాలకు వీరి ద్వారా అవసరమైన సమాచారం వెళ్తుంది. తనిఖీ బృందాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెప్పించుకునే ప్రత్యేక అధికారం వీరికి ఉంటుంది. ♦ తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. జిల్లాల్లో వివిధ జోన్లుగా విభజించి వీరికి బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రం నుంచి సమాచారం తెలుసుకుని, అవసరమైన సంకేతాలివ్వడం, అనుమానం ఉంటే తక్షణమే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వీరి బాధ్యత. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సిట్టింగ్ స్వా్కడ్స్ ఉండగా లీకేజీల నేపథ్యంలో మరికొన్ని ప్రత్యేక స్వా్కడ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విద్యాశాఖ జిల్లాస్థాయి అధికారులుంటారు. డివిజన్ల వారీగా వీరు విధులు నిర్వర్తిస్తారు. మరోవైపు పోలీసు శాఖ నుంచీ ప్రత్యేక ఫ్లయింగ్ స్వా్కడ్ ఏర్పాటు చేశారు. ఇవి జిల్లాస్థాయిలో బృందాలుగా వెళ్లి పనిచేస్తాయి. సమస్యాత్మక కేంద్రాల విశ్లేషణ రాష్ట్రంలోని 2,652 పరీక్ష కేంద్రాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సాధారణ కేంద్రాల జాబితాను తయారు చేశారు. రాజకీయంగా సమస్యలున్న ప్రాంతాల్లోని కేంద్రాల వివరాలను ప్రత్యేకంగా సేకరించారు. అక్కడ అనుమానాస్పద కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? కొత్త వ్యక్తులు వస్తున్నారా? అనే వివరాలు సేకరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య తెలిపారు. -
రైతులకు సాయంపై తక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ శాంతికుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్తో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు.. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు జారీ చేయాలని సూచించారు. త్వరలో పోడు పట్టాల పంపిణీ రాష్ట్రంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధతపై సీఎం సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి, 1.55 లక్షల మంది అర్హులకు పట్టాలు అందించేందుకు పాస్ బుక్కులు ముద్రించి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దీంతో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి రూపాయలు మంజూరు శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement