కై లాస్నగర్: ఎన్నికల విధులు సమర్థవంతంగా ని ర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు గణేశ్ బాపురావు పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని ఎన్నికల ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం, వ్యయ బృందం, సి–విజిల్, మీడియా సెంటర్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. వాటి నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల పర్యవేక్షణ పారదర్శకంగా ఉండాలన్నారు. సి–విజిల్, 1950 టోల్ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులు రిజిస్టర్లో రోజువారీగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, స్టాటిక్స్ బృందాలకు సమాచారం అందించి వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం మీడియా సెంటర్ను సందర్శించి ఎంసీఎంసీ విధులు, రోజువారీ ప్రకటనలు, పెయిడ్ న్యూస్, తదితర రికార్డులను పరిశీలించారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సోషల్ మీడియాసెల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎఫ్ఎం రేడియో, లోకల్ కేబుల్ చానల్స్లో వచ్చే రాజకీయ ప్రకటనలు, ప్రచారాల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోవాలని ఎంసీఎంసీ సభ్యులకు సూచించారు. అనంతరం ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, శ్యామలాదేవి, ఆర్వో స్రవంతి, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఈడీఎం రవికుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బోథ్లో..
బోథ్: బోథ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు జీబీ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. ఎన్నిక ల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్పాయ్తో చర్చించారు.
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
పర్యవేక్షణ పారదర్శకంగా ఉండాలి
ఎన్నికల సాధారణ పరిశీలకులు జీబీ పాటిల్