Sakshi News home page

నవ వధువు ఎంత పనిచేసింది. పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయింపు.. భర్త అదృశ్యం

Published Tue, Apr 11 2023 2:15 PM

Bride Elopes with Lover After 3 Days Of Marriage Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: వివాహమైన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో నవ వధువు పరారయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు, ప్రశాంత్‌కుమార్‌ సోదరులు. వీరికి తండ్రి లేడు. బతుకు తెరువు కోసం తల్లి అంజనమ్మ కువైట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో సోదరులిద్దరూ అనంతపురానికి వలసవచ్చి నగర శివారులోని కురుగుంట వైఎస్సార్‌ కాలనీ నివాసముంటున్నారు.

తిమ్మరాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, ప్రశాంత్‌కుమార్‌ డిగ్రీ పూర్తయి ఇంటివద్దనే ఉంటున్నాడు. గత నెల 9న ఓ యువతితో తిమ్మరాజుకు వివాహమైంది. ఈ పెళ్లి ఇష్టంలేని ఆమె పెళ్లైన మూడో రోజే అంతకు ముందు తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. నవ వధువు కనిపించకపోయే సరికి కంగారుపడ్డ తిమ్మరాజు, బంధువులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన తిమ్మరాజు ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు ప్రశాంత్‌కుమార్‌ పలుచోట్ల వెతికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం అనంతపురం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తే.

Advertisement

What’s your opinion

Advertisement