దుమ్ముగూడెం: బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ఐటీడీఏ ఇన్చార్జ్ డీడీ, ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ తల్లిదండ్రులను కోరారు. దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం, నారాయణపేట, సింగవరం, గుర్రాల గుంపు తదితర గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరిగి చదువు ప్రాముఖ్యతను చిన్నారుల తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలను గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా గ్రామ పెద్దలు, యువత తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా లిఖిత అనే బాలిక.. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, తాను భద్రాచలం గురుకులంలో ఐదో తరగతి పూర్తి చేసి ఆరో తరగతిలో ప్రవేశించానని చెప్పగా, డేవిడ్రాజ్ ఆ బాలికను అభినందిచారు. కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, ఆర్లగూడెం, నారాయణపేట ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రామారావు, నాగేశ్వరరావు, ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు, డిప్యూటీ వార్డెన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.