ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): అఖిల భారత సహకార వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ఆకుల వీర్రాజు తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో శుక్రవారం సహకార వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో సహకార వారోత్సవాలను విధిగా నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలను, సహకార బ్యాంకుల ఇస్తున్న రుణాలు, రాయితీలపై అవగాహన కల్పించాలన్నారు. రామదాసు సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 14న ఉమ్మడి జిల్లాలోని అన్ని సహకార సంస్థల్లో సహకార పతాకాలను ఆవిష్కరించాలన్నారు. సహకార వారోత్సవాలను ఆరోజు 14న కాకినాడ డీసీసీబీలో చైర్మన్ ఆకుల వీర్రాజు ప్రారంభిస్తారన్నారు.
ఈ వరి రకాలు
సాగు చేయవద్దు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రబీలో పీఆర్ 126, ఎస్ఎల్10 వరి రకాలను సాగు చేయవద్దని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం ప్రకటనలో కోరారు. ఎక్కువ మంది రైతులు ఈ రకాల సాగుకు సన్నద్ధమవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ రకాలను సాగు చేస్తే ధాన్యాన్ని ప్రైవేటుగా మాత్రమే అమ్ముకోవాల్సి ఉంటుందని, ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. అలాగే రైతులు వరినాట్లకు బదులు విత్తనాలు వెదజల్లే పద్ధతిని అలవాటు చేసుకోవాలని సూచించారు. దీనిద్వారా నీటి వినియోగం, కూలీ ఖర్చులు, ఏడు రోజుల పంట కాలం తగ్గించుకోవచ్చన్నారు.
17న కులగణనపై
రౌండ్ టేబుల్ సమావేశం
సీటీఆర్ఐ (రాజమహేంధ్రవరం): రాజమహేంద్రవరంలోని హోటల్ మంజీరాలో ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, చైర్మన్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు హాజరవుతారన్నారు.
ఉపాధి హామీ
పనుల్లో నాణ్యత
సామర్లకోట: ఉపాధి హామీ పనుల్లో మరింత నాణ్యత పెరిగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని డ్వామా అదనపు కమిషనర్ అశోక్కుమార్ అన్నారు. డ్వామా రాష్ట్ర స్థాయి రీసోర్సు పర్సన్లకు స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రంలో మూడు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధుల్లో 50 శాతం కేటాయించే ముఖ్యమైన పనులను గుర్తించాలన్నారు. అధికారులు తరచూ ఉపాధి పనులను పర్యవేక్షించాలని, మస్తర్లను పరిశీలించాలని అన్నారు.