విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపుదల చేయాలని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. గురువారం హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు’ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువ అవుతోందని, దీంతో సర్కార్ స్కూళ్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుదలకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హనుమకొండ జిల్లాలో 337 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 13, 838 మంది విద్యార్థులు నమోదు అయ్యారని, 293 ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల్లో 40,901మంది నమోదు అయ్యారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువ కావడానికి పలు కారణాలున్నాయన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. అలాగే, ఉపాధ్యాయులకు టీచర్ ఎల్జిబులిటీ టెస్టు (టెట్) ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్రకార్యదర్శి కె సోమశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మౌలిక వసతులు పెంపుదల చేయాలన్నారు. సమావేశంలో టీఎస్యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు ఎం సదాశివరెడ్డి, మేకరి దామోదర్, ప్రధాన కార్యదర్శులు పెండెం రాజు, సి సుజన్ప్రసాద్రావు, జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నాదేవి, బాధ్యులు ఎస్ జ్యోతి, ఏ రావు, మల్లిక్, కె మోజెస్, సీహెచ్ లింగారావు, కె సదానందం, కె రమేష్, కె రవీందర్, బి వెంకటేశ్వర్రావు, గుండు కరుణాకర్, సత్యనారాయణ, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి