Sakshi News home page

పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 'దిల్‌ రాజు' సాయం

Published Sun, Feb 4 2024 9:00 AM

Dil Raju Help To Padma Shree Kondappa - Sakshi

అంతరించిపోతున్న ఆ కళకు అతడే చివరి వారసుడు. బుర్రవీణను భుజాన మోస్తూ.. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలకు తగ్గట్లు వాయిద్యం వాయిస్తూ.. పాటలు పాడుతూ అందరినీ అబ్బురపరిచారు దాసరి కొండప్ప. వాయిద్యం, పాట మాత్రమే తెలిసిన అతడిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన ఒలియ దాసరి కుటుంబీకుడైన కొండప్పది ఎంతో నిరుపేద కుటుంబం.. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఆయనది.

తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యంతో భిక్షాటన చేస్తూ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వైరల్‌ అయింది. కానీ కొన్ని సంవత్సరాలుగా తిరుమలరావు అనే వ్యక్తి ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పాటలు పాడి తన కళకు గుర్తింపు సంపాదించారు.

ఈ క్రమంలో ఆయన కళను గుర్తించిన ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తన కూతురు నిర్మించిన బలగం చిత్రంలో ఒక పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ అనే పాటకు తన గాత్రాన్ని అందించాడు కొండప్ప. తాజాగా కొండప్పను తన ఆఫీస్‌కు దిల్‌ రాజు పిలుపించుకున్నారు. ఆపై ఆయన్ను సన్మానించి గౌరవించారు. దిల్‌ రాజుతో పాటు బలగం డైరెక్టర్‌ వేణు తదితరులు కొండప్పను అభినందించారు. అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని కొండప్పకు అందించారు. ఆ డబ్బును కొండప్ప కోసం మాత్రమే వాడాలని సూచించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

Advertisement

What’s your opinion

Advertisement