టైటానిక్ షిప్ శకలాలని చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే జలాంతర్గామి కథ విషాదాంతమైంది. నీటి అడుగున పీడన తీవ్రత పెరగడం వల్ల ఈ టైటాన్ పేలిపోయి, అందులోని ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలని గుర్తించారు. ఇప్పుడు ఈ విషయమై టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్పందించాడు.
'ఈ విషయం(సబ్ మెరైన్ పేలిపోవడం) జీర్ణించుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందే సదరు ఓషియన్ గేట్ కంపెనీకి చాలామంది ఇంజినీర్లు లెటర్స్ రాశారు. మీరు చేస్తున్నది చాలా విపరీతమైన ప్రయోగం అని ఆయా లేఖల్లో పేర్కొన్నారు' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చారు.
'టైటాన్ సబ్ మెరైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లొచ్చాను. అక్కడ 13వేల అడుగుల లోతు ఉంటుంది. సబ్ మెరైన్ పై చాలా ఒత్తిడి పడుతుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఆచూకీ దొరకడం అసాధ్యం. ఇది సాహసంతో కూడిన ప్రయాణం. టైటానికి షిప్ దగ్గర్లో ఏదో తెలియని శక్తి ఉంది. అక్కడ మిస్ అయితే దొరకడం కష్టమని నేను ముందే ఊహించాను. ఎందుకంటే నాక్కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చాడు.