నువ్వు నీలా ఉండు అని చెప్పింది | Sakshi
Sakshi News home page

నువ్వు నీలా ఉండు అని చెప్పింది

Published Thu, Oct 12 2023 1:05 AM

nupur sanon reacts on her sister advice - Sakshi

రవితేజ టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. ఈ చిత్రంలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో మయాంక్‌ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నూపుర్‌ సనన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఎవర్నైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సాహసించే మార్వాడి అమ్మాయి సారా పాత్రను చేశాను. ఈ చిత్రంలో నా వేషధారణ మోడ్రన్‌గా ఉంటూనే ట్రెడిషనల్‌గా ఉంటుంది. తెలుగులో చేసిన తొలి సినిమా ‘టైగర్‌ నాగేశ్వర రావు’తోనే నాకు సారాలాంటి చాలెంజింగ్‌ రోల్‌ దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల మందిని ఆడిషన్‌ చేశాక, ‘సారా’ పాత్రకు నన్ను ఎంపిక చేశారు వంశీగారు. సెట్స్‌లో ఆయన చెప్పినట్లు నటించాను. ప్రస్తుతం నవాజుద్దిన్‌ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ‘నువ్వు నీలా ఉండు’ అని అక్క (హీరోయిన్‌ కృతీ సనన్‌) సలహా ఇచ్చింది. ‘మిమి’ సినిమాలో అక్క నటన నాకు కన్నీళ్లు  తెప్పించింది. మా అక్క తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య వంటి స్టార్లతో సినిమాలు చేసింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement