Sakshi News home page

‘బహిష్కరణ’పై చర్చ జరగాల్సిందే

Published Sun, Dec 3 2023 5:07 AM

Opposition seeks discussion on report on Mahua Moitra in Parliament - Sakshi

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్‌ కమిటీ చేసిన సిఫార్సులు.. అఖిలపక్ష భేటీలో వేడిపుట్టించాయి. ఆ సిఫార్సులపై లోక్‌సభలో తుది నిర్ణయం తీసుకు నేలోపే పార్లమెంట్‌లో వాటిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీ వాడీవేడీగా జరిగింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కాంగ్రెస్‌ నేతలు జైరామ్‌ రమేశ్, గౌరవ్‌ గొగోయ్, ప్రమోద్‌ తివారీలతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ్, డెరెక్‌ ఓబ్రియాన్, ఎన్సీపీ నేతలు ఫౌజియా ఖాన్‌ తదితరులు హాజరయ్యారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో మహువా మొయిత్రాను బహిష్కరించేందుకు వీలుగా లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ నివేదికపై పార్లమెంట్‌ తొలిరోజే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోస్తోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. బహిష్కరణపై తుది నిర్ణయం తీసుకునే ముందు నివేదికపై చర్చ చేపట్టాలని టీఎంసీ నేతలు డిమాండ్‌ చేశారు. సభలో చర్చ జరక్కుండానే ఎథిక్స్‌ కమిటీ నివేదిక బహిర్గతం కావడాన్ని వారు నిరసించారు.

మహువాపై బహిష్కరణ వేటు తీవ్ర శిక్ష: అధీర్‌ రంజన్‌
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలన్న యోచన అత్యంత తీవ్రమైనదని, దీని పర్యవసానాలు ఎన్నో రకాలుగా ఉంటాయని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి ఆగ్రహంవ్యక్తంచేశారు. పార్లమెంటరీ కమిటీ నిబంధనలు, ప్రక్రియలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నాలుగు పేజీల లేఖ రాశారు.

అఖిలపక్షానికి హాజరుకాలేకపోయిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్‌ఇండి యా విమానం శనివారం దారి మళ్లింపు కారణంగా పార్లమెంటు అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ హాజరుకాలేకపో యింది. ఉదయం 8.10 నిమిషాలకు ఢిల్లీ రావాల్సిన విమానా న్ని విజిబిలిటీ లేని కారణంగా జైపూర్‌ మళ్లించారు. ఇదే విమానంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణించారు. విమానం దారి మళ్లింపు కారణంగా ఉదయం పార్లమెంటు లైబ్రరీ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకాలేకపోయారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement