Sakshi News home page

Maharashtra: పెన్షన్‌ సొమ్ము కోసం భర్తకు నిప్పు!

Published Sun, Dec 10 2023 9:41 AM

woman sets husband on fire over his pension - Sakshi

ప్రపంచంలో అంతకంతకూ అడుగంటుతున్న మానవత్వానికి ఉదాహరణగా నిలిచే ఉదంతం మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. స్థానిక కళ్యాణ్ నగర్‌లో ఓ భార్య.. భర్త పెన్షన్‌ కోసం అతనికి నిప్పంటించి, హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరో ఇద్దరి సహకారంతో ఈ మహిళ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. 61 ఏళ్ల భర్తకు నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన నేరంపై సదరు మహిళపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 

బాధితుని కుమార్తె స్నేహితులైన ఇద్దరు యువకులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కాగా ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అతని భార్య.. అతనికి నెలనెలా వచ్చే పెన్షన్‌ విషయమై గొడవ పడేది.  అలాగే ఆ ఇద్దరు యువకులు తమ ఇంటికి రావడంపై అతను అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. 

తన ప్రాణాలకు ఆ యువకుల వలన ముప్పు ఉందని బాధితుడు గతంలో ఆ యువకులిద్దరిపై  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం..  అతని భార్యతో పాటు ఆ ఇద్దరు యువకులు అతనికి నిప్పంటించారు. దీనిని గమనించిన పొరుగింటివారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి:  ‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్‌లో ఇంత అవసరమా?’

Advertisement

What’s your opinion

Advertisement