Sakshi News home page

IPL 2024 MI VS GT: హార్దిక్‌ను ఆటాడుకున్న గుజరాత్‌ అభిమానులు

Published Mon, Mar 25 2024 12:59 PM

IPL 2024 MI VS GT: Crowd Chants Hardik, Hardik As Dog Enters Ground, Video Goes Viral - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌ పంచన చేరిన హార్దిక్‌ పాండ్యాపై అతని మాజీ ఫ్రాంచైజీ అభిమానులు పీకల దాకా కోపాన్ని పెంచుకున్నారు. ఈ విషయాన్ని వారు నిన్నటి మ్యాచ్‌ సందర్భంగా బహిర్గతం చేశారు. అహ్మదాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో నిన్నటి మ్యాచ్‌ జరుగుతండగా గుజరాత్‌ అభిమానులు హార్దిక్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మ్యాచ్‌ ప్రారంభం నుంచే వ్యంగ్యమైన కామెంట్లతో హార్దిక్‌కు చుక్కలు చూపించిన గుజరాత్‌ ఫ్యాన్స్‌.. ఓ దశలో దుర్భాషల దాకా వెళ్లారు. కొందరేమో హార్దిక్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా.. ఖాళీ బాటిల్స్‌ విసిరారు. 

నిన్నటి మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ టైమ్‌ ఎంత బ్యాడ్‌గా ఉండిందంటే.. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఫ్యాన్స్‌కు హార్దిక్‌పై అక్కసును వెల్లగక్కేందుకు మరో అస్త్రం దొరికింది. మ్యాచ్‌ జరుగుతుండగా.. మైదానంలో సడెన్‌గా ఓ కుక్క ఎంట్రీ ఇచ్చింది. కుక్క ఎంటర్‌ అవగానే అభిమానులు ఒక్కసారిగా హార్దిక్‌, హార్దిక్‌ అంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టారు. మాజీ అభిమానులు తనను టార్గెట్‌ చేయడంతో హార్దిక్‌ ఒకింత కలత చెందినట్లు కనిపించాడు. కుక్క మైదానంలో చక్కర్లు కొడుతూ కొడుతూ హార్దిక్‌ వద్దకు వచ్చినప్పుడు అభిమానుల అరుపులు శ్రుతి మించాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

గుజరాత్‌ అభిమానులు తమ ఫ్రాంచైజీని వీడినందుకు హార్దిక్‌పై కోపాన్ని వెల్లగక్కుతున్నారు. కొందరేమో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక హార్దిక్‌ను బూతులు తిడుతున్నారు. కొందరు హార్దిక్‌ను కుక్కతో పోలుస్తున్నారు. ఇంకొందరేమో కుక్కతో ఎందుకు పోలుస్తున్నారు. అది చాలా విశ్వాసంగా ఉంటుంది. హార్దిక్‌ను కుక్కతో పోల్చి దాన్ని తక్కువ చేయకండని కామెంట్స్‌ పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (45) మాత్రమే ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు పడగొట్టగా.. గెరాల్డ్‌ కొయెట్జీ 2, పియుశ్‌ చావ్లా ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్‌ శర్మ (43), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (46) రాణించినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గుజరాత్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఒమర్‌జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌,స్పెన్సర్‌ జాన్సన్‌, ఉమేశ్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మ తలో 2 వికెట్లు, సాయికిషోర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement