Sakshi News home page

‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’

Published Thu, Apr 27 2023 4:35 PM

TS High Court Hearing On Avinash Reddy Anticipatory Bail Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా, సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు.

‘‘వివేకాను దస్తగిరే హత్య చేశాడు.. అలాంటప్పుడు దస్తగిరి స్టేట్‌మెంట్‌ను ఎలా పరిగణలోకి తీసుకుంటారు.. గూగుల్‌ టేకౌట్‌ ఎలా ఆధారం అవుతుంది?.  అవినాష్‌ను లక్ష్యంగా చేసుకొనే దర్యాప్తు జరుగుతోందని అవినాష్‌ తరఫు న్యాయవాది అన్నారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి జమ్మలమడుగు వెళ్తున్నట్టు 5గురు సాక్షులు స్టేట్ మెంట్ ఇచ్చారు, కానీ అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి నేరుగా వివేకా ఇంటికి వచ్చాడని CBI చెబుతుంది" అని లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 

‘‘ఢిల్లీలో దస్తగిరి 2 నెలల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నాడు. కస్టడీ ముగియగానే దస్తగిరి బెయిల్‌ పిటిషన్‌ వేశాడు. అప్రూవర్‌గా సీబీఐ దస్తగిరిని మార్చింది. దస్తగిరి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ఎక్కడా అపోజ్‌ చేయలేదు. దస్తగిరిని ముందుగానే ప్లాన్‌ చేసి అవినాష్‌రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సీబీఐ చెప్పిన వాటికి దస్తగిరి అంగీకరించి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి బెయిల్‌లో మెరిట్స్‌ పరిగణలోకి తీసుకోలేదు. హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయడం నేనెక్కడా చూడలేదు.’’ అని అవినాష్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

చదవండి: వివేకా కేసు: వీడియో రిలీజ్‌ చేసిన ఎంపీ అవినాష్‌ 

‘‘దస్తగిరి యాంటీసిపేటరి బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదు. అక్కడ ఇక్కడ విన్న మాటలను బట్టి అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఇక్కడ విన్న మాటలు ఎప్పుడూ ఎవిడెన్స్‌ కాదు. దస్తగిరి మొదటి స్టేట్‌మెంట్‌లో గంగిరెడ్డి సహా ఐదుగురు పేర్లు మాత్రమే చెప్పారు. తర్వాత ఇచ్చిన మరో స్టేట్‌మెంట్‌లో కొత్తపేర్లు తెరపైకి తెచ్చారు. అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ వద్ద లేవు.’’ అని అవినాష్‌ తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు.

"గూగుల్ టేకౌట్ అనేది ప్రత్యేక యాప్ ఏం కాదు, గూగుల్ టేకౌట్ అక్యూరసీ 2000 మీటర్లు ఉంటుంది. ఇక్కడ 50 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఏ కోర్టులు గూగుల్ టేక్ అవుట్ ను ఆధారంగా పరిగణించవు. గూగుల్ టేక్ ఔట్ ఎప్పుడూ కచ్చితమైన ప్రదేశాన్ని చూపించదు. 15-20  మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. గూగుల్ టేకౌట్  కు ఎలాంటి శాస్త్రీయత లేదు"

"హత్య జరిగిన రాత్రి 1.58 కి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఏ2 సునీల్ యాదవ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ చెబుతోందని సి.బి.ఐ అంటోంది. కానీ హత్యకు ముందు రోజు రాత్రి నుంచి ఉదయం 9 గంటలవరకు దస్తగిరి, సునీల్ యాదవ్ కలిసే ఉన్నాము అని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక వేళ సునీల్ యాదవ్ లొకేషన్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉంటే దస్తగిరి టేకౌట్ కూడా అక్కడే ఉండాలి కదా"  అని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

‘‘అవినాష్‌ కోసం మా నాన్న ప్రచారం చేశారని సునీతనే చెప్పారు. ఇంకా సిబిఐ ఆరోపిస్తున్న రాజకీయ కోణంలో హత్యకు మోటివ్‌ ఎక్కడుంది? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా  సిబిఐ ఎప్పుడయినా ఇంటరాగేషన్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఈ ఆదేశాలు ఇస్తే మేం తూచా తప్పకుండా పాటిస్తామని" అవినాష్‌ న్యాయవాది నివేదించారు. 

వాదనల అనంతరం అవినాష్ రెడ్డి పిటిషన్‌ను రేపు మధ్యాహ్నం 3.30గంటలకు హైకోర్టు  వాయిదా వేసింది.


Advertisement

What’s your opinion

Advertisement