Sakshi News home page

బడా బిల్డర్‌నంటూ బిల్డప్

Published Sat, Feb 15 2014 9:20 AM

బడా బిల్డర్‌నంటూ బిల్డప్

 రాంగోపాల్‌పేట,న్యూస్‌లైన్: అందమైన దుస్తుల్లో వస్తాడు.. బడా బిల్డర్‌నంటూ బిల్డప్ ఇస్తాడు..లక్షల్లో స్టీల్ (ఇనుపచువ్వలు) కొనుగోలు చేస్తాడు..ఇలా రెండుమూడుసార్లు నమ్మకం కలిగించి.. కోట్లు అప్పు చేస్తాడు..చెక్కులిచ్చి తప్పించుక తిరుగుతుంటాడు.. చివరకు గట్టిగా నిలదీస్తే బెదిరి స్తాడు..సుమారు నాలుగైదు దుకాణాల్లో స్టీల్ కొనుగోలు చేసి రూ.13 కోట్ల మేర ముంచిన ఘరానా మోసగాడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాం డ్‌కు తరలించారు.

సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం..అడ్డగుట్ట తుకారాంగేటుకు చెందిన మురారిశెట్టి లక్ష్మణ్‌గుప్తా (36) రాణిగంజ్‌లోని గంజి కాంప్లెక్స్‌లో అలంకృత స్టీల్‌ట్రేడర్స్ పేరుతో స్టీల్ సరఫరా చేసే కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. ఆఫీసును అందంగా ముస్తాబు చేసి బడా బిల్డర్‌నని బిల్డప్ ఇచ్చుకుంటాడు. పథకం ప్రకారం తాను ఎంచుకున్న స్టీల్ డీలర్ దగ్గరకు వెళ్లి ‘తాను బడా బిల్డర్‌ను.. పెద్దపెద్ద భవనాలకు స్టీల్‌ను సరఫరా చేస్తానంటూ’ పరిచయం చేసుకుంటాడు. ఇలా ఒకేసారి పది నుంచి ఇరవై లక్షల రూపాయల స్టీల్ కొనుగోలు చేసి అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తాడు. మిగతా సొమ్ము మీ దగ్గరే ఉంచుకోండని చెబుతాడు.

ఇలా ఒకటి రెండుమార్లు కొనుగోలు చేసి సదరు వ్యాపారికి నమ్మకం కలిగిస్తాడు. ఇక ఆ తర్వాత డబ్బు అందలేదంటూ కోట్లలో స్టీల్‌ను అప్పుగా తీసుకొని.. అసలు ధరకంటే తక్కువ ధరకే  గుట్టుగా వేరేవారికి విక్రయిస్తాడు. ఇలా రాణిగంజ్‌లోని దుర్గా ఎంటర్‌ప్రైజెస్, ప్రొద్దుటూరు స్టీల్స్‌తోపాటు మరో డీలర్ దగ్గర స్టీల్ కొనుగోలు చేసి సుమారు రూ.3 కోట్లమే బాకీ పడ్డాడు. దీంతోపాటు నేరెడ్‌మెట్, బాలానగర్, రాజేంద్రనగర్ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో పలువురు డీలర్లను ఇదే తరహాలో సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశాడు.

లక్ష్మణ్‌గుప్త ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతోపాటు డీలర్లకు దొరకకుండా తప్పించుక తిరుగుతాడు. ఎవరికైనా దొరికి ప్రశ్నిస్తే వారినే బెదిరిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం ఇతని నైజం. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆయనపై మూడు కేసులు నమోదు కాగా.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టించి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈమేరకు లక్ష్మణ్‌గుప్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

What’s your opinion

Advertisement