Sakshi News home page

సంస్కరణల సైరన్ ఎప్పుడు!

Published Sat, Apr 18 2015 12:30 AM

సంస్కరణల సైరన్ ఎప్పుడు!

వరుణ్ గాంధీ
 
ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి  వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే.
 
భారత ఆర్థిక వ్యవస్థనీ, ప్రభుత్వ పాలనా రంగాన్నీ తరచూ ఇక్కడి విశాల మైదానాలు అధిగమిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి, కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి; 1931 నాటికి దాదాపు 40 లక్షల మంది వాటిలో ఉద్యోగులుగా ఉండేవారు. 1980 దశకానికి కార్మిక సంఘాలలో చీలికల వల్ల, పారిశ్రామిక వివాదాల వల్ల- కార్మిక సంఘాలదే పైచేయి అయింది. అయితే ఇటీవల కార్మికశక్తి క్రమబద్ధీకరణ వృద్ధి వ్యతిరేక భావనకు చేరుకుంది. కానీ ఇప్పుడు కార్మిక వ్యవస్థకు సంబంధించి తరచూ జరుగుతున్న సంస్కరణలు మెరుగ్గా ఉన్నాయని అనిపిస్తుంది.

జన విస్ఫోటనం

ప్రపంచ కార్మికశక్తిలో దాదాపు 25 శాతం భార తదేశానిదే. 2025 నాటికి, 29 ఏళ్ల సగటు వయసు కలిగి, పనిచేయడానికి సిద్ధంగా ఉండే 30 కోట్ల మంది యువకులతో భారత జనాభా శక్తిమంతం కాబోతున్నది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం కార్మికశక్తి 49 కోట్లని అంచనా వేశారు. ఇది దేశ జనాభాలో దాదాపు 40 శాతం. అయితే వీరిలో కాయగూరల బండితో జీవనం గడిపే చిరువ్యాపారి మొదలు, వజ్రాల వ్యాపారి వరకు 93 శాతం అసంఘటిత రంగాలలోనే ఉన్నారు. కాబట్టి 2020 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోతున్న యువశక్తి లోటును భారత్ తీర్చబోతున్నది. ఆ సంవత్సరానికి ఐదుకోట్ల అరవై లక్షల యువ కార్మికుల లోటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉంటుందని అంచనా. కాని భారత్‌లో ఆ సంవత్సరానికే నాలుగు కోట్ల డెబ్బయ్ లక్షల యువకార్మికులు అదనంగా ఉంటారు.

అయినా ఇది అందరికీ అందివచ్చే అవకాశం కాదు. ఎందుకంటే గడచిన దశాబ్దంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (ఒక నిర్ణీతకాలంలో పెట్టుబడి పెరుగుదల రేటు) 0.5 శాతానికి వేగాన్ని తగ్గించుకుంది. కాబట్టి భారత కార్మికశక్తిలో ఉద్యోగార్హతను పెంపొందించడమే నేడు భారత మౌలిక విధానం ముందు ఉన్న పెద్ద సవాలు. వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు శ్రామికశక్తిని బదలాయించడం (12 కోట్ల నిపుణులైన కార్మికుల అవసరాన్ని గుర్తిస్తూ) అత్యవసరం. ఈ క్రమంలోనే ఉద్యోగావకాశాలు పెంచడం, సామాజిక భద్రత అనే అంశాలు కూడా పరిగణనలోనికి తీసుకోవలసినవే.

తక్కువ జీతాలు, పరిమిత భద్రత

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇప్పటికీ సగటు దినసరి వేతనాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ 2014 నాటి గణాంకాలను పరిశీలిస్తే అరక కూలి రోజుకు పురుషునికి రూ. 267.70, స్త్రీకి రూ. 187.17 చెల్లించినట్టు అర్థమవుతుంది. ఎలక్ట్రీషియన్లు రూ.367.16, నిర్మాణ రంగంలో పనిచేసే వారు రూ. 274.06 వంతున (సగటున) తీసుకుంటున్నారు. వ్యవసాయేతర రంగంలో పనిచేసే కార్మికులు మొత్తంగా సగటున రూ. 237. 20 వేతనానికి నోచుకుంటున్నారు. వడోదరలో కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న కార్మికునికి జౌళి పరిశ్రమ రూ. 6,488.09 చెల్లిస్తున్నది. అదే కోల్‌కతాలో రూ. 7,558. 52; చెన్నైలో రూ. 9,769.20 కొత్త కార్మికుడు ఆశించవచ్చు. వినియోగ ద్రవ్యో ల్బణమే ఈ తగ్గుదలకు కారణం. వినియోగదారుల ధరల సూచీలో రెట్టిం పయ్యే అంకెలు (2004లో 332, 2014లో 764) వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కార్మికులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మళ్లీ పరిశ్రమ లలో పనిచేసే కార్మికులలో మహిళల కష్టాలు వేరు. 1961 నాటి ప్రసూతి ప్రయోజన చట్టం, గర్భిణులకు ఇచ్చే క్రమబద్ధ వేతనాల ప్రయోజనం కూడా చాలా పరిమితంగానే ఉపయోగపడుతున్నాయి. 2012 సంవత్సరం వివరాలు చూస్తే, 84,956 కర్మాగారాలలో పనిచేసే మహిళలలో కేవలం 2,441 మంది మాత్రమే ఈ ప్రయోజనాలకు నోచుకున్నారు. భారతదేశంలో ఉన్న లక్షలాది కర్మాగారాలలో 3,289 చోట్ల మాత్రమే శిశు సంరక్షణ కేంద్రాలు (క్రెష్) ఏర్పాటు చేశారు. ఇలాంటివి గుజరాత్ మొత్తం మీద 58 మాత్రమే ఉండగా, అత్యధికంగా తమిళనాడులో 2,389 పనిచేస్తున్నాయి.

సామాజిక భద్రతకు సంబంధించిన లోటు కూడా కార్మికశక్తికి పెద్ద లోపంగా పరిణమించింది. రైల్వే కార్మికులు 1,082, గని కార్మికులు 32 ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఇందులో ఎక్కువ తీవ్రమైనవే కావడం విశేషం. రైల్వేలో రూ. 2.6 లక్షలు, గనులలో రూ.9 లక్షలు నష్టపరిహారంగా ఇస్తున్నారు. ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుం టున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి  వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే. ఇంకా చెప్పాలంటే, 12 శాతం కార్మికులకు ఇలాంటి సౌకర్యం ఒకటి ఉందన్న సంగతి కూడా తెలియదు.

తక్కువ ఉత్పాదకత, పనికిరాని తనిఖీ

నిబంధనలు, చట్రాల కారణంగా వ్యాపార సంస్థల ఆవిర్భావానికి ఆటంకాలు వచ్చి కార్మికులకు అవకాశాలు తక్కువ కావడం, ఇందుకు సిద్ధపడడం కూడా తగ్గుతోంది. 2012లో భారత కార్మికశాఖ కోటీ నలభై లక్షల దుకాణాలను, వాణిజ్య సంస్థలను తనిఖీ చేసింది. 89,520 ప్రాసిక్యూషన్లు ఆరంభించింది. 9.3 కోట్ల ఐఎన్‌ఆర్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా చండీగఢ్‌లో 56,103 వాణిజ్య సంస్థలు ఉండగా వాటిలో 26,841 సంస్థలను ప్రాసిక్యూట్ చేసిన ప్పటికీ వాటి నుంచి వసూలు చేసినది రూ. 40.4 లక్షలు మాత్రమే.
 వందకు మించిన కార్మికులు ఉంటే, ఆ పరిశ్రమకు లేదా సంస్థకు పారిశ్రామిక ఉద్యోగ (స్టాండింగ్ ఆర్డర్స్)చట్టం (1946) వర్తించి తీరుతుంది. వాటిలో కార్మికుల నియామకాలను, తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, సెలవులు వంటి అంశాలను పర్యవేక్షించేది ఈ చట్టమే. అయితే 2014 సంవత్సరం జనవరి-సెప్టెంబర్ మధ్య  పారిశ్రామిక వివాదాల కారణంగా 105 చోట్ల పని నిలిపివేసినట్టు నమోదయింది. దీనితో 3,60,535 మంది కార్మికులు, 17,88,613 పని దినాలను నష్టపోయినట్టు తేలింది.
 
ఫలితాన్ని ఇచ్చే విధానం కావాలి

దేశంలో కార్మికచట్టాలు ఎప్పుడూ పారిశ్రామికాభివృద్ధితోనూ, ఒడిదుడుకులు లేకుండా నడిచే వాణిజ్యంతో విభేదించే విధంగా ఉంటుంది. ఫలితాన్ని అందించే విధానమే మన కార్మిక రంగ సంస్కరణలలో విధిగా ఉండాలి. ఒడిదుడుకులు లేకుండా సాగే వాణిజ్యంతోను, వాణిజ్యాన్ని నిర్వహిం చడంలో నిర్వాహకులకు దోహదపడే విధంగాను ఆ సంస్కరణలు ఉంటే, మనకున్న మానవనరులను ఉత్పాదకత సంపద సృష్టిలో ఉపయోగించుకునే వీలు ఉంటుంది. కార్మికుల, చిన్న, మధ్యతరగతి వాణిజ్య సంస్థల క్షేమానికి ఉపయోగపడే రీతిలో ఉద్యోగ కల్పన విధానాన్ని రూపొందించుకోవాలి. కార్మిక చట్టాన్ని హేతుబద్ధం చేయడం కూడా అత్యవసరం.  ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాలను నిర్ధారించడం ఇందులో తొలి మెట్టు. కనీస వేతన నిర్ధారణ సంఘాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తూ, వార్షికంగా ఆ వేతనాలను సవరించడం అవసరం. కనీస వేతనాల నిబంధన లను ఉల్లంఘించకుండా చూడడం మరొకటి.
 
అప్రంటీస్ షిప్ చట్టం మారాలి


జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చెబుతున్నదానిని బట్టి వ్యవసా యేతర రంగాలలో పన్నెండు కోట్ల మంది నిపుణులు మన ఆర్థిక వ్యవస్థకు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో అప్రెంటిస్‌షిప్ చట్టానికి మార్పులను స్వాగతించాలి. నైపుణ్యాన్ని పెంచుకునే కాలాన్ని అనవసరంగా సాగదీసే పద్ధతి లేకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. మహిళలకు కూడా చట్టం తేవాలి. ఇందిరా క్రాంతి పథం, అంగన్‌వాడీ మహిళలు ఇప్పటికీ ఇలాంటి చట్టాల పరిధిలోకి రావడం లేదు. సమీకృత శిశు అభివృద్ధి సేవల వ్యవస్థకు చెందిన కార్మికులు ఇప్పటికీ పదవీ విరమణానంతర ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. పథకాల కోసం నియమించిన కార్మికులను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణించాలి. వారికి కూడా సామాజిక భద్రత పరిధిలో మంచి వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలి. ఇన్‌స్పెక్టర్ల వైఖరి వల్ల గడచిన మూడు దశాబ్దాలలో రిజిస్టరైన కర్మాగారాలలో  తనిఖీలు (1986లో 63 శాతం, 2011లో 18 శాతం) పడిపోయాయి. ఏడు కోట్ల డెబ్బయ్ లక్షల వాణిజ్య వ్యవస్థలలో కనీస వేతనాల చట్టం (1948) అమలు తీరును పర్యవేక్షిస్తున్న ఇన్‌స్పెక్టర్లు కేవలం 3,171 మంది. అంటే 2,428 సంస్థలకు ఒక ఇన్‌స్పెక్టర్ వంతున ఈ బాధ్యత నిర్వహిస్తున్నారన్నమాట. కర్మాగారాలకు వెళ్లడానికి నిర్ణీత సమయాలను ఎంపిక చేసుకుని, తనిఖీ వ్యవస్థను కేంద్రీకృతం చేయడం వల్ల ప్రతిభావంతంగా ఉంటుంది. 1981 నాటి ఐఎల్‌ఓ ఇన్‌స్పెక్టర్ల సమావేశంతో ప్రమేయం లేకుండా కార్మిక వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నిబంధనలను ఉల్లంఘించినవారి మీద విధించే జరిమానాను కనీసం రూ. 1,000కి పెంచాలి.

ఉద్యోగాల నుంచి కార్మికులను తొలగించడం సామాజికంగా వారికి ఎప్పుడూ గడ్డు అనుభవంగానే మిగులుతూ ఉంటుంది. ప్రస్తుత మన కార్మిక విధానం కార్మికుల సంఖ్యను వందకు పరిమితం చేస్తూ, కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడానికి తక్కువ అవకాశం కల్పిస్తున్నది. వీరికి ఎలాంటి ఉద్యోగ, సామాజిక భద్రత లేదు. కానీ ఈ అసంబద్ధ చట్టాన్ని పునర్ నిర్మించాలి. సామాజిక భద్రతను కల్పిస్తూ, పనితో అనుసంధానించిన వేతనాలు ఇస్తూ ఎక్కువ మంది కార్మికులను సంస్థలలో నియమించుకునే అవకాశం పారిశ్రామికవేత్తలకు కల్పించేటట్టు ఆ చట్టాన్ని రూపొందించాలి. లేఆఫ్‌లను సరళం చేయడం, ఇందుకు చాలినంత సమయంతో నోటీసు ఇచ్చే అవకాశం ఇవ్వాలి.  పట్టణీకరణ క్రమంలో తన వాణిజ్యం, కార్మికులు ఇద్దరి ఎదుగుదలకు అవసరమైన విధానం భారత్‌కు కావాలి. సామాజిక భద్రత, కార్మిక చట్టాలలో సరళతల మీద ఇది ఆధారపడి ఉంది. (వ్యాసకర్త ఎంపీ, కేంద్రమంత్రి మేనకా గాంధీ కుమారుడు)
 
 

Advertisement

What’s your opinion

Advertisement