-
సీఈవోలే టార్గెట్!
సాక్షి, హైదరాబాద్: ‘కంపెనీల సీఈవోలే టార్గెట్. ఇతరుల కన్నా కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు సైబర్ దాడుల నుంచి 12 రెట్లు అధిక ముప్పు ఎదుర్కొన్నారు. వారిపై సైబర్ దాడుల తీవ్రత 9 రెట్లు పెరిగి పోయింది’అని డేటా చోర్యంపై వెరిజాన్ అనే సంస్థ రూపొందించిన పరిశోధన నివేదిక హెచ్చరించింది. పని ఒత్తిడిలో ఉండే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు అనుమానాస్పద ఈ– మెయిల్స్ను తెరిచి సైబర్ దాడులకు గురవుతున్నారని వెల్లడించింది. ఇలాంటి 370 ఘటనలను విశ్లేషించగా, అందులో 248 సంఘటనలకు సైబర్ సెక్యూరిటీ లోపాలే కారణమని తేల్చింది. కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తరచుగా సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ బారిన పడుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన 73 దర్యాప్తు, ఇతర సంస్థల నుంచి 2018లో జరిగిన సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ విశ్లేషణాత్మక నివేదికను వెరిజాన్ రూపొం దించింది. బుధవారం ఇక్కడ జరి గిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ నివేదికను ఆవిష్కరించారు. మొత్తం 41,688 సైబర్ భద్రత ఉల్లంఘనలను విశ్లేషించగా, అందులో 2013 కేసులు భద్రత లోపాల వల్లే జరిగా యని నిర్ధారించింది. కార్యక్రమంలో వెరిజాన్ ఇండియా హెడ్ ప్రశాంత్, ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తఫా షేక్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జకీ ఖురేషి పాల్గొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. - ఇటీవల ర్యాన్సమ్వేర్ దాడులు పెరిగిపోయాయి. ర్యాన్సమ్వేర్ దాడుల వాటా 24 శాతానికి పెరిగింది. క్రిప్టోమైనింగ్ దాడులు అంత మాత్రమే. వాటి వాటా 2 శాతమే. - ఖర్చులు తగ్గించేందుకు క్లౌడ్ మెమొరీలో కంపెనీలు తమ సమాచారాన్ని షేర్ చేయడం, స్టోర్ చేస్తుండటంతో రిస్క్ పెరిగిపోయింది. దొంగిలించిన పాస్వర్డ్లతో క్లౌడ్ ఆధారిత ఈ–మెయిల్ ఖాతాలపై దాడులు పెరిగిపోయాయి. మిస్ కాన్ఫిగరేషన్ కారణంగా అనేక క్లౌడ్ ఆధారిత స్టోరేజ్పై దాడులు చోటు చేసుకుంటున్నాయి. - బిజినెస్ ఈ–మెయిల్స్, డేటా చౌర్యం ఆధారంగా జరిగిన ఆర్థిక దోపిడీ కేసులపై ఎఫ్బీఐ ఇంటర్నెట్ క్రైమ్ కంప్లైంట్ సెంటర్ తక్షణ చర్యలు తీసుకుంటోంది. అనుమానాస్పద ఈ–మెయిల్స్ ద్వారా జరిగిన దాడులకు సంబంధించిన సగానికి పైగా ఉదంతాల్లో 99 శాతం వరకు డబ్బులను ఎఫ్బీఐ రికవరీ చేసింది. - కంపెనీల హెచ్ఆర్ సిబ్బందిపై గతేడాది 6 రెట్లు దాడులు తగ్గాయి. - చిప్, పిన్ పేమెంట్ టెక్నాలజీ ఆధారంగా కార్డులతో జరిపే ఆర్థిక లావాదేవీలు అత్యంత సురక్షితమని తేలింది. వెబ్ ఆధారిత అప్లికేషన్లతో పోలిస్తే కార్డులతో జరిపే చెల్లింపుల్లో నేరాలు తగ్గాయి. రంగాల వారీగా సైబర్ నేరాలు.. విద్య: విద్యా సేవల రంగంపై ఆర్థిక పర సైబర్ నేరాలు 80% పెరిగాయి. ఇందుకు 35% మానవ తప్పిదాలే కారణం. వెబ్ ఆప్లికేషన్ల ఆధారంగా జరిగిన దాడులతో మరో 25% దాడులు జరిగాయి. దొంగిలించిన పాస్వర్డ్లతో క్లౌడ్ ఆధారిత ఈ–మెయిల్స్ హ్యాక్ చేయడం పెరిగింది. ఆరోగ్య రంగం: ఈ రంగంలోని సంస్థలు బయటి వ్యక్తుల కన్నా అంతర్గత వ్యక్తుల నుంచే ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇతర రంగాలతో పోల్చితే వైద్య రంగ డేటా 18 రెట్లు అధికంగా చౌర్యానికి గురవుతోంది. తయారీ రంగం: తయారీ రంగంలో సైబర్ గూఢచర్యం కంటే ఆర్థికపర దాడులే వరుసగా రెండో ఏడాది అధిక సంఖ్యలో కనిపించాయి. ఇది 68% వృద్ధి చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగం: సైబర్ గూఢచర్యం ఈ ఏడాది పెరిగింది. అయితే 47% ఉదంతాలను దాడులు జరిగిన ఏడాది తర్వాతే కనుగొన్నారు. రిటైల్: ఈ రంగంలో 2015తో పోల్చితే పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సైబర్ నేరాలు 10% తగ్గాయి. వెబ్ అప్లికేషన్ ఆధారిత ఆర్థిక దోపిడీ నేరాలు 13 రెట్లు పెరిగిపోయాయి. -
'ర్యాన్సమ్' రాక్షసి!
ర్యాన్సమ్వేర్..కంప్యూటర్ వాడుతున్న వారి గుండెల్లో ఇప్పుడు గుబులు పెట్టిస్తున్న పేరు. ఎప్పుడు.. ఏ కంప్యూటర్ను హ్యాక్ చేసి సమాచారాన్ని దొంగిలిస్తారో తెలియక బెంబేలెత్తుతున్నారు. సంస్థలకు సంబంధించిన డేటా తస్కరణకు గురైతే దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన డిస్కంలకు సంబంధించిన కంప్యూటర్లను ర్యాన్సమ్వేర్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. గడువులోగా ఆ సైబర్ నేరగాళ్లు 6 బిట్కాయిన్స్ (దాదాపు రూ.24 లక్షలు) డిమాండ్ చేస్తున్నారు. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే కంప్యూటర్లను బ్లాక్ చేస్తామని బెదిరిస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఈ నేరాలను కట్టడి చేయడం ఎలాగో తెలియక సైబర్ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. –సాక్షి, హైదరాబాద్ ‘కీ’లేకుండా అన్లాక్ కష్టమే.. కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడంలో) రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్–లాకింగ్కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్–సెమెట్రిక్ విధానంలో వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే నేరస్తులు ఈ విధానంలోనే లాక్ చేస్తారు. దీంతో వారి వద్ద ఉన్న ప్రైవేట్ కీ తెలిస్తే తప్ప ఆ కంప్యూటర్ అన్లాక్ కాదు. ఫార్మాట్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులకు మరో దారి లేక మనీప్యాక్, ఓచర్స్, ఈ–మనీ రూపాల్లో వారు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. నగదు తమకు చేరిన తర్వాత ఆ సైబర్ నేరస్తులు వైరస్ ప్రోగ్రామ్ ద్వారానే అన్ లాక్ కీ పంపిస్తున్నారు. దీన్ని వినియోగిస్తే మాత్రమే కంప్యూటర్/ల్యాప్టాప్ యథాప్రకారం ఓపెన్ కావడంతో పాటు అందులోని డేటా భద్రంగా ఉంటుంది. దర్యాప్తు, నిఘా సంస్థల పేరుతోనూ ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. ఇందులో కంప్యూటర్ మొత్తం లాక్ కావడంతో పాటు ఆ పని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్ చేసినట్లు స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ వైరస్ దానంతట అదే వెబ్క్యాప్ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లొకేషన్స్ తెరపై డిస్ప్లే చేస్తుంది. ‘మీ కదలికల్ని గమనిస్తున్నాం. చేసిన పొరపాటుకు పెనాల్టీ చెల్లించండి’ అంటూ కనిపిస్తుంది. ర్యాన్సమ్వేర్, బ్రౌజర్ లాకర్ వంటి వైరస్లను సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్స్, యాడ్స్ రూపంలో కంప్యూటర్లకు పంపిస్తున్నారు. ఉద్యోగార్థులకు సంబంధించిన ఈ–మెయిల్ ఐడీలను వివిధ ఉద్యోగ సంబంధిత వెబ్సైట్లు, అవివాహితులు, వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి మాట్రిమోనియల్ సైట్స్ నుంచి సైబర్ నేరస్తులు సంగ్రహిస్తున్నారు. అలా ఈ–మెయిల్ ఐడీలు సంగ్రహించే సైబర్ నేరస్తులు వాటికి అనుగుణంగా ఉద్యోగావకాశం, వివాహ సంబంధం, వృత్తి, వ్యాపారం పెంపొందించే మార్గాలంటూ టార్గెట్ చేసిన వారికి మెయిల్స్ పంపడం, యాడ్స్ రూపంలో పాప్అప్స్ ఇస్తున్నారు. వీటిని చూసిన వారు ఆకర్షితులవుతున్నారు. ఈ–మెయిల్, యాడ్లోని వివరాలు చూసేందుకు లింకు ఓపెన్ చేస్తే చాలు.. ఆ వైరస్ కంప్యూటర్/ ల్యాప్టాప్లోకి జొరపడుతోంది. లాక్ చేశామని చెబుతూనే ఈ ర్యాన్సమ్వేర్ వైరస్ కంప్యూటర్లో ప్రవేశించిన మరుక్షణం అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసి, సిస్టం మొత్తాన్ని లాక్ చేస్తుంది. మానిటర్పై ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’అనే మెసేజ్ కనిపిస్తుంది. దీన్ని అన్లాక్ చేయడానికి పాస్వర్డ్ మావద్ద ఉందని చెబుతూ.. 3 రోజుల్లో బిట్కాయిన్స్ చెల్లించాలని బెదిరి స్తారు. ర్యాన్సమ్వేర్ వైరస్తో లాక్ అయిన కంప్యూటర్/ల్యాప్టాప్ స్క్రీన్పై నిర్దేశించిన గడువుకు సంబంధించి కౌంట్డౌన్ కూడా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. డేటా భద్రంగానే ఉంది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్సైట్ హ్యాకింగ్కు గురైనా, సంస్థకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉందని సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం తెలిపారు. ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు, వెబ్సైట్ ఆధారిత సేవలకు విఘాతం కలిగిందన్నారు. వెబ్సైట్ పునరుద్ధరణకు టీసీఎస్ సంస్థ నిర్విరామంగా పనిచేస్తోందని, సాధ్యమైనంత త్వరగా వెబ్సైట్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. రాబిన్హుడ్ పేరుతో.. డిస్కం వెబ్సైట్ను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు దానికి రాబిన్హుడ్ పేరు పెట్టారని పోలీసులు గుర్తించారు. -
తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై ఆన్లైన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), హన్మకొండ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్), వైజాగ్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)ల అధికారిక వెబ్సైట్లపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ర్యాన్సమ్వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను హ్యాకర్లు తస్కరించారు. అనంతరం సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. తస్కరించిన డేటాను వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు మెయిల్ పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 4 డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్ ఉండడంతో డేటా భద్రత సమస్య తప్పింది. తిరుపతిలో డిస్కంల సర్వర్లు.. నాలుగు డిస్కంల ద్వారానే 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ సంస్థల వెబ్సైట్లను తిరుపతి కేంద్రంగా టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్(టీసీఎస్) నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని మెయిల్స్ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్ చొరబడి వెబ్సైట్లను హ్యాక్ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్లు హ్యాకింగ్కు గురికావడంతో 2 రోజులుగా ఆన్లైన్, పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. టీసీఎస్ నిర్వహిస్తున్న వెబ్సైట్లే లక్ష్యం.. హ్యాకర్లు టీసీఎస్ కంపెనీ నిర్వహిస్తున్న పలు సంస్థల వెబ్సైట్లపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఇండియన్ ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్ను సైతం హ్యాకింగ్కు పాల్పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనితో పాటు ఆంధ్రాబ్యాంక్ వెబ్సైట్ను సైతం టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హ్యాకింగ్ నిజమే.. తమ సంస్థ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ధ్రువీకరించారు. సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను టీసీఎస్కు అప్పగించామని, టీసీఎస్తో కలసి సంస్థ ఐటీ నిపుణులు వెబ్సైట్ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్ కారణంగా వెబ్సైట్ హ్యాక్ అయ్యిందన్నారు. ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్లైన్స్ వెబ్సైట్లను హ్యాక్ చేసిన దుండగులే తమ వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు భావిస్తున్నామన్నారు. తిరుపతిలో డిస్కంల వెబ్సైట్లకు సంబంధించిన డేటా బ్యాకప్ ఉందన్నారు. బ్యాకప్ బాధ్యత టీసీఎస్దే.. తమ సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు టీసీఎస్ చూస్తోందని, పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్రావు అన్నారు. ఇప్పటికే వెబ్సైట్లోని కొన్ని ఆప్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. డిస్కంల వెబ్సైట్లు హ్యాకింగ్కు గురికావడంపై హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేశామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. -
ఆయిల్ఫెడ్పై ‘ర్యాన్సమ్’ ఎటాక్
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన ర్యాన్సమ్ వేర్ ఎటాక్ రాజధానిలో మరోసారి వెలుగు చూసింది. ఆయిల్ ఫెడ్గా పిలిచే తెలంగాణ నూనె గింజల ఉత్పతిదారుల సహకార సమాఖ్య (తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) టార్గెట్గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. ఆన్లైన్ క్రిమినల్స్ డిమాండ్ చేసిన నాలుగు బిట్ కాయిన్లు (రూ.9,72,066) చెల్లించకపోతే సంస్థకు చెందిన డేటా క్రాష్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. భవిష్యత్లో ర్యాన్సమ్వేర్కు గురికాకుండా ఉండాలంటే మరికొంత చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శుక్రవారం ఫిర్యాదు అందుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయిల్ఫెడ్ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా లావాదేవీలకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ ఉండే సర్వర్ను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. నాలుగు రోజుల క్రితం యథావిధిగా ఈ సంస్థ సిబ్బంది తమ దైనందిన విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ర్యాన్సమ్వేర్ ఎటాక్ జరిగింది. ర్యాన్సమ్ వేర్ వైరస్లను సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్ రూపంలో పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ర్యాన్సమ్వేర్ వైరస్ కంప్యూటర్లలోకి ప్రశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయి సిస్టమ్స్తో సర్వర్ సైతం లాక్ అయింది. ఆయిల్ఫెడ్లోని కంప్యూటర్లలోని డేటా ఎన్క్రిప్షన్ నాన్–సెమెట్రిక్ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్ కీ’కు ట్రాక్ చేయడం ఐటీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ సంస్థలోని ఎవరికీ సాధ్యం కాలేదు. సైబర్ నేరగాళ్లు ఈ సంస్థ ఎన్క్రిప్టెడ్ డేటాను డీక్రిప్ట్ చేయడానికి నాలుగు బిట్ కాయిన్లు డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలా జరగకుండా రక్షణ కల్పించాలంటే మరికొంత ఇవ్వాలన్నారు. బిట్కాయిన్స్ కొనుగోలు, బదిలీ తదితరాలను గూగుల్ నుంచి తెలుసుకోవాలంటూ సందేశాన్నీ పంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఎటాక్ ఎక్కడ నుంచి జరిగింది? సైబర్ నేరగాళ్ళు ఏ విధానంలో డబ్బు చెల్లించిమని చెప్పారు? తదితర అంశాలను సైబర్ కాప్స్ ఆరా తీస్తున్నారు. పటిష్టమైన వ్యవస్థ లేకుంటే ర్యాన్సమ్వేర్కు పరిష్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ప్రాముఖ్యం కాకపోయినా... ఇలాంటి ప్రభుత్వరంగ సంస్థలు, సాఫ్ట్వేర్ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీఓ ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయడని వివరిస్తున్నారు. దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరహాలో నేరాలు చేసే వాళ్ళు బోగస్ సర్వీర్లు, ఐపీ అడ్రస్లు వినియోగిస్తుంటారు. దీంతో అలాంటి వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. -
ప్రపంచంపై మరో హ్యాకింగ్ పిడుగు
మాస్కో : సైబర్ నేరగాళ్లు ప్రపంచంపై మరోసారి మల్వేర్తో విరుచుపడ్డారు. ఎంత పటిష్టంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా.. హ్యాకర్లు మాత్రం అంతేస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ప్రపంచాన్ని బ్యాడ్రాబిట్ మల్వేర్ వణికిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, జపాన్లపై బ్యాడ్రాబిట్ తీవ్రస్థాయిలో దాడి చేసింది. స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరస్థులు.. మల్వేర్లతో హ్యాకింగ్ చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నారు. బ్యాడ్రాబిట్ ఎఫెక్ట్తో రష్యా, ఉక్రెయిన్లో విమానాలు నిలిచిపోయాయని రష్యన్ ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. హ్యాకర్లు.. మల్వేర్లతో ప్రపంచం మీద దాడి చేసే అవకాశముందని రెండు నెలల కిందటే అమెరికా నిఘా వర్గాలు.. ప్రకటించాయి. భారీగా ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతాయని.. అప్పట్లోనే అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. హ్యాకర్లు.. మౌలిక వసతుల కల్పన, రవాణా, ఇతర ఆర్థిక వ్యవస్థలపై దాడి చేస్తారని సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ లిపోవస్కీ గతంలోనే పేర్కొన్నారు. బ్యాడ్రాబిట్ ర్యాన్సమ్వేర్ రకానికి చెందిన వైరస్. ఈ వైరస్ పొరపాటున కంప్యూటర్లలో ప్రవేశిస్తే.. సిస్టమ్ వెంటనే లాక్ అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు. లాక్ ఓపెన్ చేసేందుకు బాధితుల నుంచి హ్యాకర్లు భారీ స్థాయిలో సొమ్మును డిమాండ్ చేస్తున్నారు. బ్యాడ్రాబిట్ లమ్వేర్ కారణంగా.. ఉక్రెయిన్లోని ఆడెస్సా ఎయిర్పోర్ట్లో విమానాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్యాసింజర్ల డేటాను అధికారులే స్వయంగా పరీక్షిస్తుండడం వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సైబర్ పోలీస్ చీఫ్ మాట్లాడుతూ.. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement