-
అసుర సంహారం
స్త్రీ శక్తి అన్నది పురుషులు ఎప్పటికీ జీర్ణించుకోలేని మాట. అయితే అది మగవారి జీర్ణశక్తికి సంబంధించిన విషయంగానే మనం పరిగణించాలి. స్త్రీ రాణించడం, స్త్రీ పోరాడడం అన్నవి ఎప్పటికీ గొప్ప సంగతులు. పరిమిత అవకాశాల్లోంచి ఆమె రాణిస్తుంది. పరిమిత ఆయుధాలతోనే సాధిస్తుంది. ఆమె తొలి పోరాటం తల్లి గర్భంలో! బతికి బయటపడేందుకు స్త్రీ శిశువు చేసే పోరాటాన్ని మించిన యుద్ధం మానవ జన్మలోనే లేదు. ముందుకు ఒక చిన్న అడుగు వెయ్యడం కూడా స్త్రీ లక్ష్య సాధనలో గొప్ప విజయమే! అంతగా ఆమె సంప్రదాయపు సంకెళ్లకు బందీ. అంతగా ఆమె తన దేహధర్మాలకు బందీ. అంతగా ఆమె.. మగవాడు తెచ్చిపెట్టే ఉత్పాతాలకు, తలనొప్పులకు బందీ. ఇన్ని బంధనాల్లోంచి ఒక స్త్రీ విజేతగా నిలబడిందీ అంటే బయటి శక్తులతో ఎంతగా పోరాడి ఉండాలి! తనతో తను ఆమె ఎంతగా పోరాటం చేసి ఉండాలి! లోపలి నుంచి ఎన్ని శక్తుల్ని కూడగట్టుకుని ఉండాలి! స్త్రీ విజయం సాధించిందీ అంటే ఆ దారిలో ఒక దుష్టసంహారం జరిగిందనే. దీనర్థం ఆమె పోరాడి గెలిచిందనీ. పోరాడితేనే ఆమె గెలుస్తుందనీ! అందుకే స్త్రీ గెలుపు లోకానికి వేడుక. పెద్ద సెలబ్రేషన్. దుర్గమ్మ అయినా, ఏ కాలపు అమ్మాయి అయినా. గురువు ద్రోణాచార్యుడు పక్షికి బాణాన్ని గురిపెట్టమన్నప్పుడు అర్జునుడు పక్షి కన్ను మాత్రమే చూడగలిగాడు. పక్షి తోక, పక్షి ముక్కు, పక్షి ఇతర శరీర భాగాలేవీ అర్జునుడికి కనిపించలేదు. భేష్ అన్నాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడూ ఇంటికో అర్జునుడు ఉన్నాడు. స్మార్ట్ఫోన్ అతడి పక్షికన్ను. న్యూస్ పేపర్ అతడి పక్షి కన్ను. స్పోర్ట్స్ చానల్ అతడి పక్షి కన్ను. ఎందులో ఉంటే అందులోనే ఒకే కాన్సన్ట్రేషన్తో ఉండిపోతాడు. గృహిణికి అలా కుదరదు. తను ఫోన్లో ఉన్నా, పేపర్లో ఉన్నా, టీవీలో ఉన్నా.. మిగతావాటిపైన కూడా ఒక కన్నేసి ఉంచాలి. పాలు పొంగుతున్నాయేమో చూడాలి. పిల్లాడు ఎందుకేడుస్తున్నాడో చూడాలి. ఇంటాయనకు ఏం కావాలో చూసుకుంటూ ఉండాలి. ఆవేళ్టి లక్ష్యాల పక్షికన్నులన్నింటి పైనా ఒక కన్ను వేసి వాటిని ఎప్పుటికప్పుడు ఛేదిస్తూ ఉండాలి. అమ్మాయిలు ర్యాంకులు కొట్టేస్తున్నారంటే చదువొక్కటే వాళ్ల పక్షికన్ను అయిందని కాదు. ఇంట్లో అనుకూలంగా లేని పరిస్థితుల్ని, దారిలో వెంబడించే చికాకుల్ని ఓర్పుగా సంహరించి గెలుస్తున్నారని. మహిళలు ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నారంటే ప్రతిభను నిరూపించుకోవడం ఒక్కటే వాళ్ల పక్షికన్ను అయిందని కాదు. ఒత్తిళ్లను, వేధింపులను నేర్పుగా సంహరించి నెగ్గుకొస్తున్నారని. పరిధి పెరిగే కొద్దీ స్త్రీని వెనక్కి లాగే శక్తులు పెరుగుతాయి. వాటన్నిటినీ జయించి ముందుకు వెళ్లాలి కాబట్టే స్త్రీ విజయానికి అంత గౌరవం. అంత విలువ. దుర్గమ్మ దుష్టసంహారం చేసింది. రాణి రుద్రమ్మ శత్రుసంహారం చేసింది. ఆ స్ఫూర్తి ఏ అమ్మాయిలో, ఏ మహిళలో కనిపించినా ఈ సమాజం ఆమెకు చేతులెత్తి నమస్కరించాలి. ఆమె విజయాన్ని షేర్ చేసుకోవాలి. ప్రేరణ పొందాలి. షెర్లీ పాల్... కీచక సంహారం రెండేళ్ల క్రితం వరకు షెర్లీ పాల్(45) అంధేరిలోని ఎం.ఎ. హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు. 2014లో ఆమె ఉద్యోగం పోయింది. అందుకు కారణం... అక్కడే పనిచేస్తున్న యోగేశ్ యాదవ్ అనే అసిస్టెంట్ టీచర్పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం. 2013లో యోగేశ్ యాదవ్ ఆ స్కూల్లోని 40 మంది టెన్త్ విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. అతడి వేధింపుల గురించి బాధిత విద్యార్థినుల ద్వారా వినికూడా, స్కూలు యాజమాన్యం స్కూలు ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయంతో విషయాన్ని దాచి ఉంచింది. బైట పెట్టకండని విద్యార్థిలను కూడా హెచ్చరించింది. కానీ షెర్లీ పాల్ ఊరుకోలేదు. సాక్ష్యాధారాలతో సహా పోలీసు కేసు పెట్టారు. కోర్టు అతడిని మూడు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మూడు నెలల తర్వాత యాజమాన్యం మళ్లీ అతడిని ఉద్యోగంలోకి తీసుకుంది. తమ అదేశాలను ధిక్కరించి అతడి మీద ఫిర్యాదు చేసినందుకు షెర్లీని మాత్రం ఉద్యోగంలోంచి తొలగించింది! ఈ చర్య అక్రమం అని షెర్లీ రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. ఇన్నాళ్లూ జీతం లేకపోవడం అమెను ఆర్థికంగా కుంగదీసింది. దానికి తోడు అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కొనలేని స్థితి. అయినా ఆమె మనోధైర్యం సడలలేదు. వాయిదాలకు వెళ్లారు. పోరాడారు. తన వైపు వాదనను వినిపించారు. ఇటీవలే కోర్టు తీర్పు వచ్చింది... ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని. బాధిత విద్యార్థినులు బ్యాచ్ కంప్లీట్ అయి వెళ్లిపోయినా, ఆమెను వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. నిధి దూబె... భయ సంహారం నిధి దూబె వయసు 25 ఏళ్లు. గర్భిణి. నాలుగో నెల. భర్త ముఖేశ్ కుమార్ దూబె అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు! భారత సైన్యంలో అతడు సిపాయి. భర్త చనిపోయిన రెండో రోజే నిధిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు మెట్టినింటివాళ్లు. దుఃఖాన్ని దిగమింగుకుని ఇండోర్ నుంచి సాగర్లోని పుట్టింటికి చేరింది. అక్కడే సుయాష్కు జన్మనిచ్చింది. వాడిని తల్లి రక్షణలో ఉంచి తిరిగి ఇండోర్ వెళ్లిపోయింది. ఎంబీఏ చేసింది. ఏడాదిన్నర పాటు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసి, తిరిగి సాగర్ వచ్చింది. భర్త పనిచేస్తూ చనిపోయిన చోటే తనూ బతుకును వెతుక్కోవాలనుకుంది! సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలకు దరఖాస్తు చేసింది. పగలు ఆర్మీ స్కూల్లో పాఠాలు చెప్పింది. రాత్రి తన పరీక్షలకు చదువుకుంది. పరీక్ష రాసింది. ఫెయిల్ అయింది. మళ్లీ రాసింది. మళ్లీ ఫెయిల్ అయింది. మళ్లీ మళ్లీ మళ్లీ రాసింది. ఆఖరికిగా ఐదవ ప్రయత్నంలో పాస్ అయింది. పది రోజుల క్రితమే సెప్టెంబర్ 30న చెన్నైలో ట్రైనింగ్కి నిధి ఎంపికయింది. అనోయర... తిమిర సంహారం అనోయర 18 ఏళ్ల అమ్మాయి. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ దీవుల్లోని ఒక పేద కుటుంబంలో పుట్టింది. పేదరికం ఆమెను పసిగా ఉన్నప్పుడే పనిమనిషిగా మార్చింది. అప్పుడే అక్రమ రవాణాకు గురైంది. ఎలాగో తప్పించుకుంది. ఇప్పుడు బాలలను కాపాడేందుకు పాటు పడుతోంది! బాల్య వివాహాలకు, బాల కార్మిక వ్యవస్థకు, బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తోంది. మొదట ఆమె తన గ్రామస్థులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ‘ముందు నీ జీవితాన్ని చక్కదిద్దుకో. తర్వాత మా పిల్లల్ని దిద్దుదువు గాని’ అన్నారు. అనోయర నిరుత్సాహపడలేదు. ‘సేవ్ ద చిల్డ్రన్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకుని ప్రజల్లోకి వెళ్లింది. ప్రస్తుతం అనోయర ఒక్కో గ్రూపులో 10 నుంచి 20 వరకు కార్యకర్తలు ఉండే 80 గ్రూపులను ఒక సైనిక దళంలా నడిపిస్తోంది. అంతా కూడా బాలల జీవితం బుగ్గిపాలు కాకుండా సమాజంలో చైతన్యం తెస్తున్నారు. వీళ్ల ప్రతినిధిగా అనోయర ఇప్పటికే రెండు సార్లు (గత ఏడాది, ఈ ఏడాది) ఐక్యరాజ్య సమితికి వెళ్లొచ్చారు. అక్కడికి వచ్చిన మిగతా దేశాల ప్రతినిధులతో తన అనుభవాలను పంచుకున్నారు. స్త్రీలు సంఘటితంగా ఉన్నప్పుడే సమాజంలో అవకాశాలు మెరుగుపడతాయని అనోయరా చెప్పే మొదటి పాఠం. స్త్రీ చదువుకున్నప్పుడు అవకాశాలు తమంతట తామే ఆమె కోసం వెతుక్కుంటూ వస్తాయన్నది ఆ తర్వాత పాఠం. - మాధవ్ శింగరాజు -
అవని కల్యాణం
హిందూ జీవన విధానంలోని వైవిధ్యానికీ, బహుముఖ ఆరాధనా రీతులకి తిరుగులేని రుజువు దసరా పండుగ. ఈ పదిరోజులు పూజలు అందుకునే దుర్గ, మహిషాసురమర్దని, శక్తి- ఎలాంటి భావనతో, కల్పనతో ఆమె ఆరాధనకు ఉపక్రమించినా, అదంతా శాక్తేయం ద్వారా భారతీయతను స్పృశించిన విశిష్ట ఆధ్యాత్మిక ధార. అన్నింటి ఫలశ్రుతి ఒక్కటే - చెడు ఎప్పటికీ విజయం సాధించలేదు. ఎప్పటికైనా మంచి మాత్రమే గెలిచి తీరుతుంది. దుర్గతిని నాశనం చేసే మహోన్నత శక్తి కాబట్టి ఆమె దుర్గ. దుర్గ అంటే దుర్గం- అభేద్యమైనదని కూడా అర్థం. ఆసేతుశీతాచల పర్యంతం దసరాకు పూజించే అమ్మవారు దుర్గ. ఆమెకు అనేక నామాలు. పార్వతి, కాళిక, శక్తి, సతి, అంబిక, జగద్ధాత్రి, భవాని, అంబిక, అన్నపూర్ణ, తార- ఏ పేరైనా అమ్మవారిదే. అలాగే ఆమెకు అనేక రూపాలు. ఆ దేవతామూర్తికి పది చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క పరమార్థం. ఈ భావనలన్నీ కొన్ని చింతనల సమాహారం. అవన్నీ మనిషికి తన మీద తనకు విశ్వాసం పెంచేవే. చెడు మీద పోరాటానికి సదా సంసిద్ధంగా ఉంచడానికి ఉపకరించేవే. అతి భయానకంగా... పరమ ప్రసన్నంగా... దేవదానవులకు వందల ఏళ్లపాటు యుద్ధం జరిగిందని పురాణాలు చెబుతాయి. ఈ యుద్ధంలో దానవ గణాలను నడిపించినవాడే మహిషాసురుడు. అయితే ఇతడికి శివుడి వరం ఉంది. ఏ పురుషుడికీ అతడిని సంహరించే శక్తి లేని రీతిలో మహిషాసురుడు బోళాశంకరుని నుంచి వరం పొందాడు. ఇటు దేవతల సేనాని ఇంద్రుడు. దేవతలను ఓడిస్తే స్వర్గం మహిసారునిదే. ఈ యుద్ధంలో ప్రతికూల శక్తిని దట్టించుకున్న దానవులదే పైచేయి అయిన సందర్భంలో పార్వతి వచ్చి దేవతల పక్షాన నిలిచింది. సృష్టి, స్థితి, లయల కు ఆమె ప్రతిరూపమైంది. ఒకసారి భయానకంగా, ఒకసారి ప్రసన్నంగా, మరొకసారి అగ్నిజ్వాలలు ఉమిసే జ్వాలాముఖిలా కనిపించే ఆమె ముఖ వర్చస్సు శివుని ప్రసాదమే. శ్రీమహావిష్ణువు ఆమె పది చేతులుగా మారాడు. మానవాళి జీవన విధానాన్ని శాసించే బ్రహ్మదేవుడు ఆమె పాదపద్మాలై నడిపించాడు. ఆమె కళ్ల నుంచి వర్షించే అగ్నిశిఖలను సాక్షాత్తు అగ్నిదేవుడే కూర్చాడు. సృష్టిలోని భూమి, ఆకాశం, నీరు, వాయువు, సూర్యాస్తమయాలు ఆమెలో భాగమైనాయి. ఆ పదిచేతులలో కనిపించే ఆయుధాలు ఆయా దేవతామూర్తులు అందించినవే. చెడుకు విష్ణు చక్రం... సుస్థిరతకు శంఖం అమ్మవారి చేతులలో కనిపించే ఆయుధాల పరమార్థం గురించి తెలుసుకోవడం మంచి అనుభవం. కుడివైపున ఉన్న ఐదు చేతులలో పైన ఉన్న చేతి చూపుడు వేలుకు తగిలించి ఉంటుంది విష్ణుచక్రం. ఇది ధర్మరక్షణకు ప్రతీక. చెడును సంహరిస్తుంది. మంచికి అండగా నిలుస్తుంది. తరువాత - శంఖం. ఇది ఎడమవైపు ఉన్న ఐదు చేతులలో మొదటి చేతిలో కనిపిస్తుంది. ఇది ఓంకారనాదానికి ప్రతీక. ప్రతికూలతను పెంచే భావాలను దూరంగా ఉంచేదే పంచాక్షరి. అంటే తన భక్తులకు అమ్మవారు ప్రశాంతి, సుస్థిరతలను అనుగ్రహిస్తుంది. శంఖం పూరించడంలోని భావం ఇదేనని చెబుతారు. ఆ మహాశక్తికి సూర్యభగవానుడు బహూకరించినవే ధనుర్బాణాలు. ఎడమ వైపు చేతుల వరసలో రెండోచేతిలో ఇవి కనిపిస్తాయి. ఆమెను విశ్వసించేవారికి జీవితంలో అడ్డంకులు ఎదురుకావు అన్న సందేశం ఈ ధనుర్బాణాల ద్వారా వినిపిస్తుంది. గుణగణాల సమతూకం... త్రిశూలం అమ్మవారికి కుడివైపు రెండో చేతిలో గొప్ప కరవాలం కనిపిస్తుంది. అయితే ఇది అజ్ఞానాన్ని తెగ నరకాలన్న సందేశాన్ని సునిశితంగా అందిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని చీల్చి వెలుగు వైపు కూడా వెళ్లడానికి తోడ్పడుతుంది. ఈటె మరొక ఆయుధం. ఇది శుభాన్ని ఇచ్చి, ప్రతికూల శక్తులను తుదముట్టిస్తుంది. దండం- ఈ ఆయుధం వెనుక ఉంచిన ఉద్దేశం ఆసక్తిదాయకంగా కనిపిస్తుంది. శత్రువు శక్తియుక్తులను బలహీనం చేసేదే దండం. త్రిశూలం అమ్మవారి కూడివైపు నాలుగో హస్తంలో అలరారుతూ ఉంటుంది. మనిషిలోని సత్వరజస్తమో గుణాలకు త్రిశూలం ప్రతీక. జీవనం సాఫీగా సాగాలంటే ఆ మూడు గుణాలు సమతూకంలో ఉండాలని చెప్పడమే ఆ ఆయుధాన్ని పట్టించడంలోని అసలు ఆశయం. స్త్రీ శక్తికి మహోగ్రరూపమే అమ్మవారు శక్తి కేంద్ర బిందువుగా అనేక గాథలూ, కథలూ అవతరించాయి. శివపురాణం, మార్కండేయ పురాణం, దేవీ భాగవతం అమ్మవారి గురించి బీభత్స, కరుణ రసాలతో కూడిన ఘట్టాలను ఆవిష్కరించాయి. మరెన్నో గ్రంథాలు కూడా అమ్మవారి ఉద్భవం గురించి చెప్పాయి. ఇవన్నీ కూడా పురుషుని సాయం లేకుండా, రాక్షస గణాలపై ఒక స్త్రీశక్తి మహోగ్రంగా సాగించిన భీకర యుద్ధం గురించి రమణీయంగా వెల్లడిస్తాయి. దుర్గ అంటే పార్వతి నుంచి రాలిన చర్మమని ఒక కథ. శుంభ, నిశుంభలతో పార్వతీదేవి సమరం చేసినప్పుడు ఆమె శరీరం రాలిపోయిందని, అదే దుర్గగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే చెడు మీద తాను సాగిస్తున్న పోరాటంలో సహకారం అందించేందుకు పార్వతి కొన్ని శక్తులకు జన్మ నిచ్చిందనీ, కాళి అలాంటి శక్తేనని మరొక కథనం. ఇవన్నీ అమ్మవారికి ఎన్ని రూపాలు ఇచ్చినా, ఆమెకు నిర్దేశించిన లక్ష్యం మాత్రం ఒక్కటే- దుర్గుణాల నుంచి ఈ సకల జగతిని రక్షించిన చైతన్యంగానే వ్యాఖ్యానించాయి. వీటికి పరాకాష్ట- మహిషాసుర మర్దనం. కమలమూ దుర్గమ్మ ఆయుధమే! విశ్వ కల్యాణానికి బెడదగా తయారైన ప్రతికూల శక్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదన్న సంకేతం అమ్మవారి ఒక చేతిలో కనిపించే పిడుగు లేదా ఉరుము అందిస్తున్నది. అలాగే పోరాటం ఆరంభించిన తరువాత విశ్వాసం వదులుకోకూడదు. అంటే వెనుకడుగు వేయరాదన్న సందేశం కూడా ఈ పిడుగులో ఉంది. కమలం కూడా ఒక చేతిలో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వికాసానికీ, తద్వారా సాధ్యమయ్యే ఆత్మ వికాసానికి ప్రతీక. దానవులతో జరిగిన యుద్ధంలో ఆమె ధరించిన కవచం చేసి ఇచ్చినవాడు విశ్వకర్మ. నిజమే- అమ్మవారు ప్రధానంగా సమరానికి అధిష్టానదేవత. అదే సమయంలో జ్ఞానరూపిణి. ఈ రెండే ఆ రూపాలలో, ఆమె చేతిలోని ఆయుధాల ద్వారా వ్యక్తమవుతోంది. కొన్ని విగ్రహాలలో అమ్మవారు త్రినేత్రిగా కనిపిస్తుంది. అలాగే పదికి మించిన ఆయుధాలు కూడా కనిపిస్తాయి. జగన్మాత... జగద్ధాత్రి... మహాకాళి అమ్మవారికి ఎన్నో పేర్లు అని కదా! మార్కండేయ పురాణంలో ఆమెకు దుర్గ, దశభుజి, సింహవాహన, మహిషాసురమర్దని, జగద్ధాత్రి, కాళి, ముక్తకేశి, తార, చిన్నమస్తిక వంటి పేర్లతో ప్రస్తావించడం కనిపిస్తుంది. మధు, కైటభులతో యుద్ధం చేసినప్పుడు ఆమె పేరు మాయ. నవదుర్గలుగా కూడా నవరాత్రులలో ఆమెను ఆరాధిస్తారు. ఆ విధంగా అత్యున్నత శక్తికి అమ్మవారిని ప్రతీకగా నిలుపుకున్న విషయం అవగతమవుతుంది. దేవీమహాత్మ్యం మహామాయ, మహాశక్తిగా పిలిచింది. - డాక్టర్ గోపరాజు నారాయణరావు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement