-
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్లోనే ఉన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్లను సమన్వయం చేయడంలో, వారి టీమ్ల కోసం ఆఫీస్లో స్పేస్ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది. -
కాగ్నిజెంట్ మాజీ సీఈవో బర్త్డే విషెస్.. ఎవరికో తెలుసా?
ప్రత్యర్థి కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించుకుని వార్తల్లో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ మాజీ సీఈవో తాజాగా ఆ కంపెనీకి బర్త్డే విషెస్ చెప్పారు. కాగ్నిజెంట్ శుక్రవారం (జనవరి 26) నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగ్నిజెంట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మాజీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా ఒకరు. 2007 జనవరి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు కంపెనీ సీఈవోగా పనిచేసిన ఆయన ఆపై ఒక సంవత్సరం పాటు బోర్డు వైస్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. 1994 జనవరి 26న భారత్లోని చైన్నైలో కాగ్నిజెంట్ ఏర్పాటైంది. ఈ సంస్థకు ప్రస్తుతం ఎస్.రవికుమార్ సీఈవోగా ఉన్నారు. కాగ్నిజెంట్ 30వ వార్షికోత్సవం సందర్భంగా డిసౌజా లింక్డ్ఇన్లో ఓ పోస్టు పెట్టారు. సంస్థలో పనిచేసిన ప్రతి వ్యక్తి ప్రతిభకు, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. "హ్యాపీ బర్త్డే కాగ్నిజెంట్! 30 సంవత్సరాల క్రితం, సాంకేతిక సేవల పరిశ్రమను ఏదో ఒకరోజు తీర్చిదిద్దే లక్ష్యంతో చిన్న జట్టులో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈరోజు కాగ్నిజెంట్కు 30 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎదుగుదల, ఆవిష్కరణలు, ఎక్సలెన్స్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాను" అంటూ రాసుకొచ్చారు. -
పక్క కంపెనీల నుంచి లాగేసుకోవడం కరెక్టేనా? టెక్ సీఈవోల మాటలు ఇవే..
అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను కాగ్నిజెంట్కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం.. ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. మేము అదృష్టవంతులం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు. మాకేం డోకా లేదు "మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. నా పని మాత్రమే చేస్తున్నా.. “నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన. -
Poaching Row: ఐటీ కంపెనీల్లో అక్రమ వలసలు.. పెదవి విప్పిన కాగ్నిజెంట్ సీఎండీ
న్యూఢిల్లీ: ఇతర సంస్థల నుంచి అక్రమంగా అత్యున్నత అధికారులను ఆకట్టుకోవడం(పోచింగ్)వల్ల కంపెనీ బిజినెస్పై ఎలాంటి ప్రభావం పడబోదని ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల దేశీ ఐటీ కంపెనీల మధ్య అత్యున్నత అధికారుల అక్రమ వలస(పోచింగ్)లపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నంబియార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడేందుకు నిరాకరించిన నంబియార్ ఉద్యోగులతో గల కాంట్రాక్టు అమలుకు కంపెనీలు పట్టుబట్టడాన్ని సమర్ధించారు. ఇందుకు ఆయా కంపెనీలకు అధికారముంటుందని వ్యాఖ్యానించారు. అయితే నాన్పోచింగ్పై పరిశ్రమవ్యాప్తంగా వర్తించే నిబంధనలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ అధికారులను లేదా నిపుణులను తీసుకోవడాన్ని నివారించేందుకు నిబంధనలు వర్తింపచేయలేమని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ ప్రధానంగా నైపుణ్య ఆధారితంకావడమే దీనికి కారణమని తెలియజేశారు. నిపుణులతోనే నిర్మితమైన సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఉద్యోగ వలసలకు చెక్ పెట్టేందుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేమని వివరించారు. అయితే ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలకు వీలున్నట్లు తెలియజేశారు. పోచింగ్ సమస్య తమ కంపెనీపై ప్రభావాన్ని చూపబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమపైన సైతం ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాల మధ్య పోచింగ్ వివాదాలు తలెత్తిన విషయం విదితమే. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల.. తమ అధికారులను కాగ్నిజెంట్ అనైతిక పద్ధతుల్లో విధుల్లోకి తీసుకుంటున్నట్లు విమర్శించడంతో పరిశ్రమలో అలజడి తలెత్తింది. గతంలో ఇన్ఫోసిస్లో పనిచేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఇతర సంస్థల నుంచి 20 మంది సీనియర్ లీడర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ఇన్ఫోసిస్, విప్రోలో బాధ్యతలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఉద్యోగులతో కనీసం ప్రాథమిక స్థాయిలో నియామకాలలో సైతం ఎలాంటి సర్వీసు ఒప్పందాలు లేదా బాండ్లకు తెరతీయడంలేదని నంబియార్ వివరించారు. క్యాంపస్ల నుంచి ప్రధానంగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది స్వేచ్చా ప్రపంచమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఇన్ఫోసిస్కు మరో భారీ షాక్, వరుస ‘ఝలక్’ ఇస్తున్న ఉద్యోగులు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ తాజాగా యాక్సెంచర్లో చేరారు. తమ సంస్థలో చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టినట్లు యాక్సెంచర్ తెలిపింది. ‘‘భారత్లో కాగ్నిజెంట్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. నిబంధల్ని ఉల్లంఘించి తమ ఎగ్జిక్యూటీవ్లను సంస్థలో చేర్చుకుంటుంది. నాన్-కాంపిటీ క్లాజ్ను ఉల్లంఘిస్తూ ఉద్యోగులు సైతం కాగ్నిజెంట్లో చేరుతున్నారంటూ ’’ ఇటీవల విప్రో- ఇన్ఫోసిస్లు బెంగళూరు కోర్టును ఆశ్రయించాయి. జతిన్ దమాల్ రూ.25.15 కోట్లు చెల్లించాలి దీంతో పాటు నాన్-కాంపిటీ నిబంధనల ప్రకారం.. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు రాజీనామా అనంతరం తమ కాంపిటీటర్ సంస్థల్లో 10ఏళ్ల వరకు చేరకూడదు. అలా చేరితే నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనని అస్త్రంగా చేసుకున్న విప్రో.. నాన్-కాంపిటేట్ నిబంధన ఉల్లంఘించారంటూ విప్రో సంస్థ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ను రూ. 25.15 కోట్లు చెల్లించాలని కోర్టులో దావా వేసింది. మీకు మీరే.. మాకు మేమే అయినప్పటికీ ఆ రెండు సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు ఇతర సంస్థల్లో 10 ఏళ్ల పాటు చేరకూడదంటూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఎగ్జిక్యూటీవ్లు, ఇతర సీనియర్ స్థాయి ఉద్యోగులు మీకు మీరే.. మాకు మేమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్ధి కంపెనీల్లో చేరి భారీ ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ యాక్సెంచర్లో చేరడం అగ్నికి ఆజ్యం పోసినట్లైందని టెక్నాలజీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యాక్సెంచర్లో చేరడానికి ముందు మాథ్యూస్ 15 సంవత్సరాలకు పైగా ఇన్ఫోసిస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొక్యూర్మెంట్ గ్రూప్ హెడ్గా పనిచేశారు. తాజాగా ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. జనవరి 3న యాక్సెంచర్లో చేరారు. ఇన్ఫోసిస్, విప్రో వర్సెస్ కాగ్నిజెంట్ టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో ప్రత్యర్థి సంస్థ కాగ్నిజెంట్పై చర్యలు తీసుకుంటున్నాయి.కాగ్నిజెంట్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ కోర్టును ఆశ్రయించాయి. కాగ్నిజెంట్లో ఇటీవలి పునర్నిర్మాణం కింద, సంస్థ దాదాపు 20 మంది కొత్త ఎగ్జిక్యూటివ్లను నియమించుకుంది. వీరిలో డజను మంది ఇన్ఫోసిస్, విప్రో ఉద్యోగుల్ని చేర్చుకుంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విప్రో.. కాంట్రాక్టు ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్తో సహా కాగ్నిజెంట్లో చేరిన మాజీ ఉద్యోగులపై రెండు వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ తరుణంలో బిన్నీ మ్యాథ్యూ నిర్ణయం టెక్నాలజీ కంపెనీల్లో వ్యవహారం ఎటు ములుపు తిరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్ల కాంట్రాక్ట్లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్సీ టెక్నాలజీ, హెచ్సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. -
విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన
అన్ని పరిశ్రమలలోనూ కంపెనీల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం. అయితే ఇది ఐటీ కంపెనీల తారస్థాయికి చేరింది. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేరు. ఈ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్లోని నాన్-కాంపిటేట్ నిబంధన దీనికి కారణం. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్లో చేరిన తమ మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్ల కాంట్రాక్ట్లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్సీ టెక్నాలజీ, హెచ్సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష పోటీదారు కంపెనీలో చేరాడని విప్రో వాదిస్తోంది. -
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు భారీ ఊరట!
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు భారీ ఊరట దక్కింది. రూ. 4,300 కోట్ల పన్ను బకాయిలకు బదులుగా కంపెనీకి చెందిన రూ. 2,956 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ లిక్విడేట్ చేయడంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. పన్ను బకాయిల కోసం నాలుగు వారాల్లోగా రూ.1,500 కోట్లు చెల్లించాలని, ఆస్తి భద్రతగా పెట్టాలని జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షఫీక్లతో కూడిన డివిజన్ బెంచ్ కాగ్నిజెంట్ను ఆదేశించింది. ఈ షరతులను పాటించడంలో విఫలమైతే కంపెనీకి ఇచ్చిన మధ్యంతర స్టే రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 1,500 కోట్ల చెల్లించడానికి, ఆస్తిని భద్రతగా పెట్టడం కోసం బ్యాంకు డిపాజిట్లపై పెట్టిన తాత్కాలిక స్తంభనను విడుదల చేయాలని కోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారం 2017-18లో కాగ్నిజెంట్ చేపట్టిన రూ.19,000 కోట్ల షేర్ బైబ్యాక్కు సంబంధించినది. ఇది వాటాదారులకు మూలధన లాభాల పన్నును మాత్రమే ఆకర్షిస్తుందని కంపెనీ వాదించగా ఆదాయపు పన్ను శాఖ.. దీనిని సేకరించిన లాభాల పంపిణీగా పరిగణించి డివిడెండ్పై వేసినట్లుగా పన్ను విధించింది. -
కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు!
కంపెనీ మారిన మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్ (Jatin Dalal)కు భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఝలక్ ఇచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అంతే కాకుండా వడ్డీ కూడా కట్టాలని కోర్టులో దావా వేసింది. కాగ్నిజెంట్ (Cognizant) లో చేరిన తమ మాజీ సీఎఫ్వో జతిన్ దలాల్పై ఐటీ కంపెనీ విప్రో బెంగళూరులోని సివిల్ కోర్టులో ఇటీవల దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు తమకు లభించిన కోర్టు పత్రాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబర్ 29 నుంచి చెల్లింపు తేదీ వరకు 18 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాలని దలాల్ను కోరింది. అంతేకాకుండా దలాల్ తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా, తమ కస్టమర్లు లేదా ఉద్యోగులను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా జతిన్ దలాల్పై విప్రో శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయాలని కోర్టును కోరుతూ దలాల్ దరఖాస్తు చేసుకున్నారు. తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలా వద్దా అనే దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యవర్తిత్వం అనేది కోర్టులతో పని లేకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ మార్గం. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్లో దీనికి అవకాశం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. జతిన్ దలాల్ డిసెంబర్ 1న కాగ్నిజెంట్లో సీఎఫ్వోగా చేరారు. ఈ కేసులో మొదటి విచారణ నవంబర్ 28న జరిగింది. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి సూచించే అధికారం కోర్టులకు లభిస్తుంది. జతిన్ దలాల్కు విప్రోలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి ఆయన ఇక్కడ సీఎఫ్వోగా పనిచేశారు. 2019 నుంచి ప్రెసిడెంట్గా అదనపు బాధ్యతలను సైతం నిర్వహించారు. కాగ్నిజెంట్లో ఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత యూఎస్ లేదా యూకే వెళ్తారని తెలుస్తోంది. -
‘మా ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు?’.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఐటీ కంపెనీలు!
నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారంటూ ప్రముఖ దిగ్గజ టెక్ దిగ్గజ కంపెనీలు ఒకదానికొకటి నోటీసులు జారీ చేసుకుంటున్నాయి. ఇప్పుడీ నోటీసుల పర్వం ఐటీ జాబ్ మార్కెట్ను షేక్ చేస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీ పద్దతి అస్సలు బాగోలేదు.. మా కంపెనీ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు? అంటూ భారత్కు చెందిన టెక్ కంపెనీలు ఒక్కటై అమెరికా టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్కు వరుస నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే విప్రో.. కాగ్నిజెంట్కు నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఇన్ఫోసిస్ సైతం ఆ జాబితాలో చేరిపోయింది. ‘‘ కాగ్నిజెంట్ భారత్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థకు చెందిన సుమారు 20 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. అందులో సీఈఓ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ స్థాయిలో విధులు నిర్వహించే నలుగురు టాప్ ఎగ్జిక్యూటీవ్లు ఉన్నారు’’ అని ఆరోపిస్తూ కాగ్నిజెంట్కు నోటీసులు పంపింది. ఈ సందర్భంగా ‘‘ తాము కాగ్నిజెంట్కు పంపిన నోటీసులు ఆ సంస్థకు ఓ హెచ్చరికలాంటిది. ఆ సంస్థ 20 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని నియమించుకున్న తర్వాత ఆ కంపెనీ ఆడుతున్న డ్రామాలు బయటపడ్డాయి’’ అంటూ ఓ జాతీయ మీడియాతో ఇన్ఫోసిస్ ప్రతినిధులు మాట్లాడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రో వర్సెస్ కాగ్నిజెంట్ ఇటీవల, విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హక్ (Mohd Haque)లు కాగ్నిజెంట్లో చేరారు. వాళ్లిద్దరూ కాగ్నిజెంట్లో చేరిన రెండు రోజులకే విప్రో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. జతిన్ దలాల్,మహమ్మద్ హక్ మహమ్మద్ హక్ తన ఉద్యోగ ఒప్పందంలోని నాన్-కాంపిటీ క్లాజ్ను ఉల్లంఘించి తమ కాంపిటీటర్ కాగ్నిజెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లైఫ్ సైన్సెస్కు బిజినెస్ యూనిట్ హెడ్గా చేరారని కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా, హక్ తన నాన్ కాంపిటేట్ నిబంధన గడువు ముగియడానికి ముందే చేరడం చట్ట విరుద్దం అని కోర్టుకు విన్నవించుకుంది. అంతేకాదు, విప్రోను వదిలి కాగ్నిజెంట్లో చేరే సమయంలో తమ సంస్థకు చెందిన ఏడు ఫైళ్ల రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని మా ఐటీ బృందం కనిపెట్టింది. దీనికి తోడు విప్రో అఫీషియల్ మెయిల్ నుంచి తన వ్యక్తిగత మెయిల్కు కంపెనీ రహస్యాల్ని సెండ్ చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని కోర్టు ఫిర్యాదులో వెల్లడించింది. ఫిర్యాదు ప్రకారం.. హక్.. విప్రో లక్ష్యాల్ని, వ్యాపార వ్యహరాల్ని తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని అందించారు. రాజీనామాకు కొద్ది సేపటి ముందే చాలా తెలివిగా విప్రో రహస్యాల్ని మెయిల్స్కి పంపుకున్నారు అని వరుస ఆరోపణల్ని గుప్పిస్తూ వస్తోంది. కాగ్నిజెంట్కు ఇన్ఫోసిస్, విప్రో ఎగ్జిక్యూటీవ్ల క్యూ 2022 నుండి విప్రో , ఇన్ఫోసిస్ సంస్థల్లో సీనియర్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ ఎత్తున కాగ్నిజెంట్లో చేరారు. ముఖ్యంగా, సీఎఫ్ఓ నిలంజన్ రాయ్, ఈవీపీ రాజీవ్ రంజన్, అధ్యక్షుడు మోహిత్ జోషి, ఎండీ రవి కుమార్ వంటి కీలక వ్యక్తుల ఇన్ఫోసిస్ నుంచి కాంగ్నిజెంట్లో చేరడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదే విధంగా, విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్, గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మాన్, ఎస్వీపీ మొహమ్మద్ హక్, ఆశిష్ సక్సేనాతో పాటు ఇతర టాప్ ఎక్జిక్యూటీవ్లు సంస్థను వదిలి వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది కాగ్నిజెంట్తో పాటు ఇతర కాంపీటీటర్ సంస్థల్లో చేరారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణ కారణంగా విప్రో, ఇన్ఫోసిస్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ మాజీ ఉద్యోగులు, వారిని చేర్చుకున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాయి. అందులో కాగ్నిజెంట్ కూడా ఉంది. మూల కారకులు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ కాగ్నిజెంట్ ప్రస్తుత సీఈఓ రవికుమార్ గతంలో ఇన్ఫోసిస్లో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇన్ఫోసిస్ నుంచి బయటకొచ్చి సీఈఓగా కాగ్నిజెంట్లో చేరారు. అనంతరం ఇన్ఫోసిస్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా, నలుగురిని వైస్ ప్రెసిడెంట్లుగా మొత్తం 20 మంది ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న వారిని తన సంస్థలోకి ఆహ్వానించారు.ఈ అంశమే కాగ్నిజెంట్పై ఇన్ఫోసిస్, విప్రోలు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రేరేపించాయి. -
హైదరాబాద్లో ఆస్తులు అమ్మనున్న టాప్ ఐటీ కంపెనీ..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న కాగ్నిజెంట్.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు కాగ్నిజెంట్ ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్, చెన్నైలోని తన ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఇది నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ద్వారా నగదు సంపాదించడానికి సహకరిస్తుందని తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. రెండు సంవత్సరాల్లో రూ.3300 కోట్లు ఆదా చేసే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్ను, చెన్నైలోని సిరుసేరిలో 14 ఎకరాల క్యాంపస్ను విక్రయించాలని యోచిస్తోంది. రీస్ట్రక్చరింగ్లో భాగంగా తన వర్క్స్పేస్ను తగ్గించుకుని, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి హైబ్రిడ్ వర్క్ కల్చర్ను ఎంచుకుంది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్కల్చర్కు అనుగుణంగా హైబ్రిడ్వర్క్ మోడల్ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..! ఇటీవల ఐటీ సేవల రంగంలోని కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. వారి వ్యాపారాల్లో జనరేటివ్ ఏఐను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి కాగ్నిజెంట్లో 3,46,600 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ నికర లాభం 16 శాతం క్షీణించి 525 మిలియన్లకు చేరుకుంది. ఆదాయం దాదాపు 4.89 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. -
ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, కాగ్నిజెంట్ భాగస్వామ్యం
ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా జనరేటివ్ ఏఐ సేవలందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా వియానై సిస్టమ్స్ను స్థాపించారు. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ వినియోగదారులకు నేరుగా జనరేటివ్ ఏఐ సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో ఏఐ ప్లాట్ఫారమ్లు ఏఐ సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందించనున్నాయి. -
సీఎఫ్వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్లో ప్రత్యక్షం!
విప్రో (Wipro) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్ (Jatin Dalal)ను తమ సీఎఫ్వోగా నియమించుకుంది ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant). ఆయన ఇటీవలే విప్రో సంస్థలో సీఎఫ్వోగా రాజీనామా చేశారు. (లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్టాప్లూ తనిఖీ) ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ కంపెనీలో జతిన్ దలాల్ రెండవ హై ప్రొఫైల్ నియామకం. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎఫ్వో జాన్ సీగ్మండ్ నుంచి జతిన్ దలాల్ బాధ్యతలు స్వీకరిస్తారని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీలు మారుతున్న టాప్ ఎగ్జిక్యూటివ్లు ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ గత మార్చిలో వైదొలిగారు. ఆయన స్థానంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్లలో పనిచేసిన మోహిత్ జోషిని సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది టీసీఎస్. వచ్చే డిసెంబర్లో ఆయన విధుల్లో చేరన్నారు. (ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట) ఇక జతిన్ దలాల్ విప్రోలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ట్రెజరీ కార్యకలాపాలలో మేనేజర్గా చేరిన ఆయన ప్రెసిడెంట్, సీఎఫ్వో వరకూ ఎదిగారు. ఆయన నిష్క్రమించిన మరుసటి రోజే విప్రో షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి. 2015లో విప్రో సీఎఫ్వో అయిన జతిన్ దలాల్.. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి కోవిడ్ సమయంలో కంపెనీని విజయవంతంగా నడిపించారు. డిజిటల్ సేవలకు డిమాండ్ పెరగడంతో 2020, 2021 సంవత్సరాల్లో కంపెనీ షేర్లు వరుసగా 57 శాతం, 85 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత నిఫ్టీ IT ఇండెక్స్లో 55 శాతం, 60 శాతం వృద్ధిని సాధించింది. -
డివిడెండ్ పంపిణీ పన్ను కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: షేర్ల బైబ్యాక్కు సంబంధించి డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసిందిగా ఆదాయపన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) తాజాగా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియాకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కాగ్నిజెంట్ చేసిన అపీల్ను ఐటీఏటీ చెన్నై బెంచ్ కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు అనుమతిమేరకు చేపట్టిన రూ. 19,080 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ పథకంలో భాగంగా కాగ్నిజెంట్ డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉంటుంది. 2017–18 అసెస్మెంట్ ఏడాదిలో కంపెనీ యూఎస్, మారిషస్లోని తమ వాటాదారుల నుంచి 94,00,534 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 20,297 చొప్పున వీటిని సొంతం చేసుకుంది. కంపెనీ దాఖలు చేసిన రిటర్నులను పరిశీలించిన తదుపరి ఐటీ శాఖ రూ. 4,853 కోట్లకుపైగా డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉన్నట్లు డిమాండ్ చేసింది. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం మూలధన వినియోగం కారణంగా పన్ను చెల్లించవలసి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై కాగ్నిజెంట్ అపీల్కు వెళ్లింది. -
నాస్కామ్ చైర్పర్సన్గా రాజేశ్ నంబియార్
ముంబై: కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేశ్ నంబియార్ను తన చైర్పర్సన్గా నియమిస్తున్నట్లు టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్పర్సన్గా మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, నంబియార్ వైస్ చైర్పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంత్ మహేశ్వరి నుంచి నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నాస్కామ్ భారత్కు సంబంధించి ఐటీ, టెక్ ట్రేడ్ సంస్థ. ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ మధ్య సమన్వయం పెంపొందడానికి ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ‘‘నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు చైర్పర్సన్గా నియమితులు కావడాన్ని గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సంబంధిత అన్ని వర్గాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని తన నియామకం సందర్భంగా నంబియార్ పేర్కొన్నారు. -
ఆఫీస్కు రావడం తప్పనిసరి కాదు.. భిన్నంగా ఆ ఐటీ కంపెనీ తీరు
Return to office not mandatory: వర్క్ ఫ్రం హోమ్కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించడానికి అనేక ఐటీ కంపెనీలు నానా అవస్థలు పడుతుంటే తమ ఉద్యోగులు ఆఫీస్కు రావడం తప్పనిసరి కాదు అంటోంది ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో రవి కుమార్ స్వయంగా తెలిపారు. "ఉద్యోగుల్లో ఫ్రెషర్లు కూడా ఉన్న నేపథ్యంలో సమూహంగా పనిచేయడం అవసరమని మేము భావిస్తున్నాం. వారికి వారిని చేయి పట్టి నడిపించడం అవసరం. కానీ మేనేజర్లు, సీనియర్ ఉద్యోగులు ఆఫీస్కి రాకపోయినా ఎటువంటి ప్రభావం ఉండదు" అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ తాజా ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి తమ ఫ్లెక్సిబుల్ రిటర్న్ ఆఫ్ వర్క్ ఎక్కువ మంది మహిళలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఐటీ సేవల సంస్థలలో కాగ్నిజెంట్ రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించేందుకు అత్యంత దూకుడుగా ప్రయత్నిస్తోంది. ఓ పెట్టుబడిదారుల సదస్సులో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ, పెద్ద నగరాల్లో 80,000 సీట్లను తగ్గించి, టైర్-2 నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ వర్క్ఫోర్స్, రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించడం ద్వారా మార్జిన్లను పెంచడానికి 400 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్ను ప్రారంభించింది. Google Back To Office Offer: గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ! -
కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం
Cognizant appoints six women svps: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కార్యనిర్వాహక బృం దంలో ఏకంగా ఆరుగురు మహిళల్ని ఎంపిక చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవుల్లో మహిళలకు చోటు దక్కడం లేదడం లేదన్న ఆందోళన క్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థానాల్లో ఆరుగురు మహిళలను నియమించినట్లు జూలై 19న తెలిపింది. (న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ) వీరిలో కొందరికి పదోన్నతి లభించగా, మరికొందరిగా కొత్తగా నియమించుకుంది.తద్వారా బలమైన, విభిన్నమైన సంస్థను నిర్మించడం కొనసాగిస్తోందనే ప్రశంసలు వెల్లు వెత్తాయి. 2023లో జనవరిలో కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ నియామకం తరువాత జరిగిన ఈ పరిణామం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. మూడు కీలకమైన ఆవశ్యకాలపై దృష్టి సారించడంతో పాటు, నాయకత్వ స్థానాలతో సహా కాగ్నిజెంట్, విభిన్న ప్రతిభను పెంచడం తన ముఖ్య ప్రాధాన్యతలలో ఒకటి సీఈవో ప్రకటించారు ఈ సందర్భాన్ని సమిష్టిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమని పేర్కొన్న రవికుమార్. వైవిధ్యాన్ని ప్రోత్సహించడం సిస్టమేటిగ్గా ఉండాలి. మహిళా నిపుణులను రిక్రూట్ చేయడం, అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం, నిమగ్నం చేయడం, నిలుపుకోవడం వంటి వాటితో తాము మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) శైలజా జోస్యుల కీలక స్థానాల్లో ఆరుగురు మహిళలు ♦ హైదరాబాద్లోని కంపెనీ సెంటర్ హెడ్ శైలజా జోస్యుల ఎస్వీపీగా ప్రమోషన్ లభించింది. 2018లో కాగ్నిజెంట్లో చేరిన శైలజా ఇప్పుడు ఉత్తర అమెరికాలోని వాణిజ్య మార్కెట్లతో పాటు గ్లోబల్ డెలివరీ కోసం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) పరిశ్రమకు SVP, ఇంట్యూటివ్ ఆపరేషన్స్ & ఆటోమేషన్ (IOA)గా ఉన్నారు. చెన్నై తర్వాత 56,000 మంది అసోసియేట్లతో కాగ్నిజెంట్కు హైదరాబాద్ రెండో అతిపెద్ద డెలివరీ కేంద్రం. ♦ 2021లో కాగ్నిజెంట్లో చేరిన ఎలిసా డి రోకా-సెర్రా, SVP, EMEA జనరల్ కౌన్సెల్ అండ్ కాంట్రాక్ట్ లైఫ్సైకిల్ రిస్క్ మేనేజ్మెంట్ (CLRM)గా పదోన్నతి పొందారు. ♦ 2020లో కాగ్నిజెంట్లో చేరిన థియా హేడెన్ ఇప్పుడు ఎస్వీపీ. గ్లోబల్ మార్కెటింగ్. కాగ్నిజెంట్ బ్రాండ్, డిజైన్ , సృజనాత్మక సేవలు, సోషల్ మీడియా, ఆలోచనా నాయకత్వం , రీసెర్చ్కుహేడెన్ బృందం బాధ్యత వహిస్తుంది. ♦ ప్యాట్రిసియా (ట్రిష్) హంటర్-డెన్నెహీ ఎస్వీపీ (హెల్త్కేర్ ప్రొవైడర్/పేయర్ బిజినెస్ యూనిట్)గా పదోన్నతి పొందారు. హెల్త్కేర్ డెలివరీతో సహా అమెరికాలో ఆరోగ్య సంరక్షణ మొత్తం నిర్వహణకు ఆమె టీంమద్దతు ఇస్తుంది. ట్రైజెట్టో కొనుగోలులో భాగంగా ట్రిష్ 2015లో కాగ్నిజెంట్లో చేరారు. ♦ 2020లో కాగ్నిజెంట్కు రిజైన్ చేసిన అర్చన రమణకుమార్ జూలై 5న SVP, ఇండస్ట్రీ సొల్యూషన్స్ గ్రూప్ (ISG)గా తిరిగి కాగ్నిజెంట్లో చేరారు. ♦ సాండ్రా నటార్డోనాటో జూలై 17న కాగ్నిజెంట్లో పార్టనర్షిప్ అండ్ అలయన్స్ ఎస్వీపీగా చేరారు. కాగ్నిజెంట్కు ముందు, నటార్డొనాటో గార్ట్నర్తో 15 సంవత్సరాలు సీనియర్ ఈక్విటీ విశ్లేషకురాలిగా గా వివిధ వృత్తిపరమైన సేవల సంస్థలతో 11 సంవత్సరాల అనుభవం ఉంది. -
కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్ను తొలగించిన కాగ్నిజెంట్!
బ్రియాన్ హంఫ్రీస్ను సీఈవో పదవి నుంచి తొలగించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. స్టాక్ ఎక్సేంజీ ఫైల్స్లో ఈ విషయాన్ని వెల్లడించిన కంపెనీ.. హంఫ్రీన్ తొలగింపుకు గల స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. ఈ ఏడాది కాగ్నిజెంట్ బోర్డ్ సభ్యులు సంస్థ వేగంగా పురోగమించడం, వ్యాపార కార్యకలాపాల్ని వేగవంతం చేయడం, ఆదాయ వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించింది. కాబట్టే సీఈవో పదవీ బాధ్యతల్లో మార్పులు అవసరమని తాము విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ బోర్డ్ ఛైర్మన్ స్టీఫెన్ జె రోహ్లెడర్ తెలిపారు. సీఈవో పదవి నుంచి తొలగించడంతో జనవరి 12 నుంచి మార్చి 15 వరకు కాంగ్నిజెంట్లో సలహాదారులుగా పనిశారు. హంఫ్రీస్ సీఈవో పదవి నుంచి తొలగించడంతో ఆయన స్థానాన్ని భారత్కు చెందిన టెక్ జెయింట్ ఇన్ఫోసిస్కు ప్రెసిడెంట్గా పనిచేసిన రవికుమార్ భర్తీ చేసిన విషయం తెలిసిందే. తొలగింపులకు కారణాలు హంఫ్రిస్ను ఫైర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదాయం పడిపోవడం, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు సంస్థను విడిచిపెట్టడం, వార్షిక ప్రాతిపదికన అట్రిషన్ రేటు పెరిగిపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. తగ్గిన పరిహారం సీఈవోగా బాధ్యతలు నిర్వహించే సమయంలో హంఫ్రీస్కు చెల్లించే పరిహారం భారీగా తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 2021తో పోలిస్తే 2022లో హంఫ్రీస్ పరిహారం 9 శాతం తగ్గిందని ప్రకటన హైలైట్ చేసింది. నాన్ ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు సైతం 4 మిలియన్ల నుండి 1.7 మిలియన్లకు తగ్గాయి. చదవండి👉 భారత్లో తయారైన ఆ దగ్గుమందు కలుషితం.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు
కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపును అందిస్తోంది. 18 నెలల్లో ఇది మూడవ వేతన పెంపు. పెరుగుతున్న అట్రిషన్ కంపెనీకి తలనొప్పిగా మారింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా కంపెనీ షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. (apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!) వేతన పెంపునకు సంబంధించిన లెటర్లను ఉద్యోగులు ఈ వారంలో అందుకుంటారని కంపెనీ వారికి పంపిన ఈ-మెయిల్స్లో పేర్కొంది. సంవత్సరాంతపు పనితీరు సమీక్షలను అనుసరించి ఆరు నెలల ముందుగానే ఈ మెరిట్ పెంపును అందిస్తున్నామని, 18 నెలల్లో ఇది మూడో మెరిట్ పెరుగుదల అని కంపెనీ సీఈవో రవికుమార్ వివరించారు. జనవరిలో డైరెక్టర్లు అంతకంటే పైస్థాయివారికి ఇచ్చిన పెంపుతో కలిపి 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు వేతన పెంపును అందుకుంటున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు నిరంతర శిక్షణ, నైపుణ్యం, వృత్తిపరమైన అభివృద్ధిలో కంపెనీ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే అమలు చేస్తున్న ఈ వేతన పెంపు కంపెనీ వన్-టైమ్ టూ-మెరిట్ సైకిల్ పెంపులో భాగం. ఈ వేతన పెంపును గత సంవత్సరమే ప్రకటించారు. 2022 అక్టోబర్లో, ఆపై 2023 ఏప్రిల్లో వేతన పెంపుదల ఉంటుందని కంపెనీ గతంలోనే పేర్కొంది. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. -
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని సంస్థలు రెడీ బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్లో డీలా రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలు ఇలా ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. 2023లో రెట్టింపునకు ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది. -
ఐటీలో ‘ఫేక్’ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం చేరింది. యాక్సెంచర్ బాటలో కాగ్నిజెంట్.. తమ ఉద్యోగుల్లో బ్యాక్గ్రౌండ్ చెకింగ్లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్గ్రౌండ్ చెకింగ్లో తేలింది. బ్యాక్గ్రౌండ్ చెక్ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు. అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, ముంబై: ప్రపంచ మాంద్యం భయాలు, మూన్లైటింగ్ వివాదాల మధ్య ఐటీ నిపుణులకు కంపెనీలు తీపి కబురు అందిస్తున్నాయి. ప్రధానంగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచినట్టు ధృవీకరించింది. తన సిబ్బందికి 10 నుంచి 13 శాతం జీతాల పెంపును అందించినట్టు ప్రకటించింది. దీంతోపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులు 20-25శాతం ఇంక్రిమెంట్లు పొందినట్టు తెలిపింది. ఇన్ఫీ, టీసీఎస్, విప్రో,తోపాటు కాగ్నిజెంట్ సంస్థలు తమ ఉద్యోగులకు దాదాపు 10శాతం వేతనాలు పెంపును దిశలో ఉండటం విశేషం. ఇంక్రిమెంట్లు ఉద్యోగి గ్రేడ్పై ఆధారపడి ఉంటాయయనీ, సీనియర్ మేనేజ్మెంట్ జీతాలు ఎక్కువగా ఉన్నందున తక్కువ మొత్తంలో పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. తగ్గుతున్న అట్రిషన్ రేట్లతో, ఇన్ఫోసిస్ వినియోగ స్థాయిలను పెంచడం, పార్శ్వ నియామకాలు, ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వేతన వ్యయాలను నియంత్రించ డానికి ప్రయత్నిస్తోంది. ఇన్ఫోసిస్తోపాటు, టీసీఎస్, విప్రో, ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా తన ఉద్యోగులకు 10 శాతం వరకు వేతనాలు పెంచనుందట. అక్టోబర్ మాసంనుంచి ఈ పెంపు వర్తించనుందని తెలుస్తోంది. కాగా కరోనా సంక్షోభకాలంలో ముఖ్యంగా 2021లో ఐటీ కంపెనీల బంపర్ జీతాల పెంపు, కౌంటర్ ఆఫర్లతో ఉద్యోగులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది జనవరి, జూలైలో రెండు పెంపులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 345,218 మంది నిపుణులకు ఉపాధి కల్పించిన ఇన్ఫీ, అధిక వ్యయాలను నియంత్రించుకోవాలని చూస్తోంది. -
ఐటీ ఉద్యోగులు:పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్! ఆఫీస్కు రాలేం!
దిగ్గజ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరగుతుందని, అదే సమయంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలైనంత సమయం దొరుకుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ను తిరస్కరిస్తున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మ్యాప్స్కు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేయడాన్ని తిరస్కరిస్తున్నారు. సుమారు 200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని, ఆఫీస్కు రాలేమని ఖరాకండీగా చెబుతున్నారు. అంతేకాదు ఆఫీస్ టూ రిటర్న్ అంటే ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలను భరించలేమని వాపోతున్నారు. పైగా గూగుల్ తమని (గూగుల్ మ్యాప్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని) ఒకలా, గూగుల్ ఉద్యోగుల్ని మరోలా ట్రీట్ చేస్తుందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్(ఏడబ్ల్యూ)కు దాఖలు చేసిన పిటీషన్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్ను ఏడబ్ల్యూ యూనియన్ సభ్యులు సైతం సమర్ధిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో కాగ్నింజెంట్కు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గూగుల్ కోసం పని చేస్తున్నారు. ఆయితే ఆ ఉద్యోగుల్ని గూగుల్ ఇంటి వద్ద నుంచి పనిచేయడం ఆపేయాలని, జూన్ 6 నుంచి ఆఫీస్కు రావాలని గూగుల్ ఆదేశించింది. దీంతో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు, విజృంభిస్తున్న కరోనాతో పాటు పలు కారణాల్ని ఉదహరిస్తూ వర్క్ ఫ్రమ్ హోంను కొనసాగిస్తామని, ఆఫీస్కు రాలేమని ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..గూగుల్లో పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులు రీటర్న్ టూ ఆఫీస్ పాలసీని వ్యతిరేకిస్తే గూగుల్ సదరు ఉద్యోగుల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తుందంటూ న్యూయార్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కాగ్నిజెంట్ ఏమంటుందంటే! రిటర్న్ టూ ఆఫీస్ పాలసీ అనేది ఉద్యోగులు, క్లయింట్ రిక్వైర్ మెంట్పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు భద్రతే మాకు ముఖ్యం. తరువాతే మిగిలిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటాం. అందుకే ఉద్యోగుల్ని కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆఫీస్కు రావాలని కోరుతున్నామని కాగ్నిజెంట్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జెఫ్ డెస్మారైస్ తెలిపారు. మాకూ ఉద్యోగుల ఆరోగ్యమే ముఖ్యం! గూగుల్కు చెందిన ఉన్నతాధికారిణి కోర్టేనే మాన్సిని మాట్లాడుతూ..మాకు ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ముఖ్యం. కాంట్రాక్ట్ ఉద్యోగులైన సరే వాళ్లకి గూగుల్లో తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే సంస్థ ఆఫీస్ రిటర్న్ టూ పాలసీని అమలు చేశాం. సప్లయర్స్ (కాగ్నిజెంట్) ఈ పాలసీని ఎలా అమలు చేయాలో నిర్ణయించుకుంటారని కోర్టేనే మాన్సిని స్పష్టం చేశారు. చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్కు రిజైన్ చేశాడు! -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! బోనస్లు,ప్రమోషన్లు..అబ్బో ఇంకా ఎన్నెన్నో!
ప్రపంచ దేశాలకు చెందిన ఐటీ కంపెనీల్ని అట్రిషన్ రేటు విపరీతంగా వేధిస్తుంది. వచ్చిపడుతున్న ప్రాజెక్ట్లను పూర్తి చేయలేక..ఆఫర్లని, లేదంటే తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ఉద్యోగాల్ని ఉన్న ఫళంగా వదిలేస్తుంటే..ఆ ఉద్యోగుల్ని నిలుపుకోలేక ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్ దిగ్గజాలు అట్రిషన్ రేట్ తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. కోవిడ్-19 కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా అవకాశాలు విసృతంగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులు తమకు వస్తున్న అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లను అందుకుంటున్నారు. దీంతో ఐటీ సెక్టార్ను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజాలు డిజిటల్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అట్రిషన్ రేట్ తగ్గిస్తూ, స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా విప్రో, కాగ్నిజెంట్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, ఎంఫసిస్లాంటి సంస్థలు ఉద్యోగులకు స్పెషల్ బోనస్లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ స్టాక్స్(ఈఎస్ఓపీఎస్) భాగస్వామ్యం ఇవ్వడం, ఉన్న జాబ్లో స్మార్ట్గా చేసేందుకు సిల్స్, లేదంటే మరో విభాగానికి చెందిన ప్రాజెక్ట్ చేసేలా ప్రత్యేకంగా క్లాసుల్ని నిర్వహించడం, ఉన్న సంస్థలో చేస్తున్న జాబ్ నచ్చక ఇబ్బంది పడుతుంటే..అదే సంస్థలో వారికి నచ్చిన విభాగంలో పనిచేసేలా ప్రోత్సహించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునేలా అనుమతి ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ లేదంటే ఎక్కడి నుండైనా పనిచేసేలా ఉద్యోగులకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. తద్వారా అట్రిషన్ రేట్ను పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు సైతం ఈ ఆఫర్లకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement