-
ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు: డిసీజ్ ‘ఎక్స్’
కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయిన ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి ఇచ్చిన పేరు డిసీజ్ ‘ఎక్స్’ (Disease X). నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి X ఎప్పుడైనా ,ఎక్కడైనా పెరుగుతుంది. లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు. దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని, మరో విధంగా చెప్పాలంటే డిసీజ్ X తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్ అమేష్ అడాల్జా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కొత్తది కాదని 2018 నుండి ఎక్స్ వ్యాధి గురించి చర్చ ఉందని అమేష్ అడాల్జా తెలిపారు. వైరస్ ద్వారా రావచ్చు. లేదా ఒక జంతు జాతి నుండి మానవునికి వ్యాపించి కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే మహమ్మారిగా మారవచ్చు అని అంచనావేశారు. 90 శాతం సాధారణ జలుబు లేదా న్యుమోనియాగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. టీకాలు, యాంటీవైరల్లు, మోనోక్లోనల్ యాంటీ బాడీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే మహమ్మారిని నిలువరించడం అంత సులభం అవుతుందన్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్వో, సీడీసీ, యూరోపియన్ సీడీడీ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కరోనామహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని, వాటిలో కొన్ని ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
గరళ కంఠ భారతం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది. వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానం భారత్దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్ సీజన్లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్తక్, యూపీలోని మీరట్ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది. ఐక్యూ ఎయిర్ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి. కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్ మీటర్కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, క్యూబిక్ మీటర్కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్లో క్యూబిక్ మీటర్కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం. దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్ విద్యుత్తే అన్నది గమనార్హం. ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం. అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి. సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్ నివేదిక మనకు మరో మేలుకొలుపు. -
రంజాన్ ఉపవాసాలపై డబ్యూహెచ్ఓ మార్గదర్శకాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది. తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది. (చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!) -
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
కోవిడ్ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?
మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. 2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఎక్స్ ఎంత ఘోరంగా ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. జంతువుల నుంచి.. డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
డిసెంబరులో కరోనాతో 10 వేలమంది మృతి!
కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రత్యేకించి కరోనా జెఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్, అమెరికాలో కరోనా వేవ్ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో కూడా గడచిన 50 రోజుల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలోనే పెరిగాయి. ఇటీవలి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో జనం జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మరింతగా విస్తరించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గత డిసెంబర్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది మరణించారని పేర్కొన్నారు. 50 దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా 42 శాతం మేరకు పెరిగిందన్నారు. భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,422. దీనికిముందు అంటే బుధవారం కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా రోజుకు సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. -
అలెర్ట్, కోవిడ్-19 అడ్వాన్స్ విత్డ్రాపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం?!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో చందాదారుల ఆరోగ్య అవసరాల్ని తీర్చేలా కోవిడ్ అడ్వాన్స్ అనే ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్ను ఈపీఎఫ్ఓ త్వరలో తొలగించనుంది. దీంతో కోవిడ్ అడ్వాన్స్ పేరుతో రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్ను ఉపసంహరించుకోవడం అసాధ్యం. వారం రోజుల క్రితం రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని సంబంధిత అధికారులు అనధికారికంగా వెల్లడించారు. కోవిడ్ అడ్వాన్స్ పేరుతో ఇందులో ప్రముఖంగా భారత్లో తొలిసారి కరోనా విజృంభణ మొదలైన సమయంలో ఈపీఎఫ్ఓ మనీ విత్ డ్రాలో మార్పులు చేసింది. చేసిన మార్పులకు అనుగుణంగా చందారులు కరోనా చికిత్సతో పాటు సంబంధిత అనారోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు వీలుగా కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఉన్న కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరాల్ని తీర్చుకోవచ్చు. ప్రాణాల్ని కాపాడింది ఈ నిర్ణయం సబ్స్క్రైబర్లు కోవిడ్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహాయ పడింది. పలువురు కోవిడ్కు చికిత్స చేయించుకుని ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. అయితే సుమారు ఏడెనిమిది నెలల క్రితం కోవిడ్-19పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) విధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో ఈపీఎఫ్ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రీటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ తీసుకునే సదుపాయన్ని తొలగించనుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ, సాఫ్ట్వేర్లో నాన్ రిఫండబుల్ కోవిడ్ అడ్వాన్స్ నిబంధనను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా చందాదారులు ఇకపై దరఖాస్తు చేసుకోలేరని అధికారి తెలిపారు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది కాగా, కొవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదుతో అనవసరైమన కొనుగోళ్లు, ఇతర అవసరాలకు వినియోగించుకునే వారికి ఈపీఎఫ్ఓ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపునుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేదని, ఇప్పటికే ఆలస్యం అయిందని అంటున్నారు. రిటైర్మెంట్ పొదుపు నుంచి కోవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదును ఆరోగ్యం కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని తెలిసినప్పటికీ కోవిడ్ ఉపసంహరణను ముగించడానికి వారికి ఇంత సమయం పట్టిందని ఆర్థికవేత్త కేఆర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఏ ఏడాది ఎంత విత్డ్రా చేశారంటే ఈపీఎఫ్ 2020-21లో 6.92 మిలియన్ల మంది చందాదారులకు రూ .17,106.17 కోట్లు, 2021-22 లో 9.16 మిలియన్ల లబ్ధిదారులకు రూ .19,126.29 కోట్లు, 2022-2023లో 6.20 మిలియన్ల మంది లబ్ధిదారులకు రూ .11,843.23 కోట్ల నగదను అందించింది. 4 రోజుల్లో 6లక్షలు విత్డ్రా మార్చి 28, 2020 నుండి కోవిడ్ అడ్వాన్స్ నిబంధన అమల్లోకి వచ్చింది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి వరకు (మార్చి 31, 2020) నాలుగు రోజుల్లో 33 మంది లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 6 లక్షల్ని విత్ డ్రా చేసుకున్నారు. కోవిడ్ అడ్వాన్స్ రూ.48,075 కోట్లు 2022-23 ఈపీఎఫ్ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 నుండి మూడు ఆర్థిక సంవత్సరాల్లో 22 మిలియన్లకు పైగా చందాదారులు కోవిడ్ అడ్వాన్స్ పొందారు. ఈ మొత్తం విలువ రూ .48,075.75 కోట్లు. -
జేఎన్.1పై WHO కీలక ప్రకటన
జెనీవా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో.. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ప్రకారం.. జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది. జేఎన్.1 వేరియెంట్ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ ఇంతకు ముందే చెప్పింది. వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. మరింత ఆందోళన కలిగించేది అని అర్థం. అంటే.. ఆ వేరియెంట్కు త్వరగా వ్యాప్తి చెందడం, చికిత్సకు కష్టతరం కావడం, లక్షణాలు తీవ్రంగా ఉండడం ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా.. డెల్టా, ఒమిక్రాన్లాగా ఇది గ్రీకు భాష ద్వారా ఓ కొత్త పేరు పెట్టడానికి వీలుంటుంది. అయితే జేఎన్.1 ఈ కేటగిరీ కిందకే వచ్చినా.. ప్రాణాంతకమైంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు వేరియెంట్లను(ఆల్ఫా, బీటా, గామా, డెల్టా) వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. తర్వాతి కాలంలో విజృంభిస్తున్న వేరియెంట్లను వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద డబ్ల్యూచ్వో మానిటరింగ్ చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: భారత్లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
ఇండియాలోనే రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువ? డబ్ల్యూహెచ్ఓ నివేదిక ఏం చెప్పింది?
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2010–2021 మధ్య రోడ్డు ట్రాఫిక్ దుర్ఘటనలు ఏటా 5 శాతం (లక్షా 19 వేలు) తగ్గాయి. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో సభ్యత్వం ఉన్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిపోతుండగా, భారత్లో మాత్రం 15 శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో 2010లో 1.34 లక్షలు సంభవించగా, 2021లో వాటి సంఖ్య 1.54 లక్షలకు పెరిగింది. రోడ్డు భద్రతలో ప్రపంచ పరిస్థితి–2023 అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నార్వే, డెన్మార్క్, జపాన్, రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు 50 శాతం తగ్గించగలిగారు. మరో 35 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 30 నుంచి 50 శాతం వరకూ తగ్గిపోయాయి. 2019 నాటికి ప్రపంచంలో ఐదు నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, యువతీయువకుల మరణాలకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని, అన్ని వయసులవారి హఠాన్మరణాలకు 12వ ప్రధాన కారణం రోడ్డు దుర్ఘటనలేనని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మూడింట రెండు వంతుల మరణాలు పనిచేసే వయసులో ఉన్న వారికే సంభవించాయి. గడచిన దశాబ్దంలో ప్రపంచ జనాభా 140 కోట్లు (13%) పెరగింది. కాని, విశ్వవ్యాప్తంగా రోడ్డు దుర్ఘటనల్లో మొత్తం మరణాలు ఐదు శాతం తగ్గిపోయాయి. పదేళ్ల కాలంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. 2010–2021 సంవత్సరాల మధ్య ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. కాగా, ప్రతి లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు 79 నుంచి 47కు తగ్గింది. అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య 41% తగ్గినట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల మరణాలు 28 శాతం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవించాయి. 25% రోడ్డు చావులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, 19% ఆఫ్రికా ప్రాంతంలో, అమెరికా ఖండాల్లో 12%, తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో 11%, ఐరోపా ప్రాంతంలో కేవలం ఐదు శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. పేద, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువ. మోటారు వాహనాలకు రహదారులపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించేది పేద, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రతి పది మరణాల్లో తొమ్మిది ఈ పేద దేశాల్లోనే జరిగే రోడ్డు దుర్ఘటనల్లో సంభవిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే–పేద, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లో జనం వాడే మోటారు వాహనాలు సంఖ్య తక్కువ. అలాగే, ఈ దేశాల్లో ఉన్న రహదారుల సంఖ్య కూడా బాగా తక్కువ. రోడ్ల నాణ్యత కూడా అభిలషణీయ స్థాయిలో ఉండదు. సరైన మౌలిక సౌకర్యాలు, అవసరమైనన్ని మోటారు వాహనాలు లేని ఈ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశం ధనిక దేశాలతో పోల్చితే బాగా ఎక్కువ. ఈ బడుగు దేశాల్లో మోటారు వాహనాల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోడ్లపై తిరిగే మొత్తం మోటారు వాహనాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలపింది. ఈ నివేదిక వివరాలను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక శుక్రవారం ప్రచురించింది. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, చిన్న పిల్లల మరణాల వల్ల ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. రోడ్లపై మోటారు వాహనాల ప్రమాదాలు అరిక్టడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా, మరణాలకు కారకులైనా పెద్ద శిక్షలు వేయడం ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానం. ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
నుమోనియా కేసుల వ్యాప్తిపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: చైనాలో ఇటీవల నమోదైన శ్వాససంబంధ అనారోగ్య కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిన్నపిల్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఈ నుమోనియా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన ఆ దేశ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.‘దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో నుమోనియా కేసులు రావడం ఒక్కసారిగా తగ్గిపోయింది’అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చీఫ్ మీ ఫెంగ్ మీడియాకు తెలిపారు. నుమోనియా కేసుల నమోదు ఒక్కసారిగా పడిపోయిందని చైనా వెల్లడించడకంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కొవిడ్ భయాలు ఇంకా తొలగిపోని నేపథ్యంలో చైనాలో శ్వాససంబంధిత అనారోగ్య కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు రావడంతో అన్ని దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. భారత్లోనూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో నుమోనియా తరహా శ్వాసకోశ అనారోగ్య కేసుల నమోదు ఒక్కసారిగా పెరుగుతోందని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చైనా తెలిపింది. అయితే కేసుల నమోదుకు కొత్త వైరస్ కారణం కాదని వెల్లడించింది.కేసుల వ్యాప్తి వేగంగా ఉండటానికి కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడమే కారణమని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఇదీచదవండి..దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్ -
పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత
పిల్లల్లో పోషకాహార లోపం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రజారోగ్య సమస్య. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. బాల్యం వేగవంతమైన వృద్ధి దశలో పిల్లల ఎత్తు బరువు వంటి కీలక మైలురాళ్లు. పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ, వివిధ జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. స్టన్నింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం) అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువులేకపోవడం) వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు తక్కువ) లాంటివి కీలక అంశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 149 మిలియన్ల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు ఎదగలేదు. భారతదేశంలో వీరి వాటా దాదాపు మూడింట ఒక వంతు. ఐదేళ్లలోపు వయస్సున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్ కేటగిరీలో నమోదైనారు. సరియైన విజ్ఞానం లేకపోవడం, విద్యాపరమైన విజయాలు, ఉత్పాదకత కోల్పోవడం లాంటివి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో పాటు, ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇది పిల్లల జీవితంలో వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. పోషకాహార లోపాలు రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రవర్తనా సమస్యలు, ఎముకల ఆరోగ్యం క్షీణించడం, కండరాల్లో శక్తి లేకపోవడం లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. పిల్లలు ఎదగడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి సరైన పోషకాహారం అవసరమైన పునాదులేస్తాయి. పిల్లలకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వుతో పాటు కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, అర్జినిన్ వంటి సూక్ష్మపోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రోన్యూట్రియెంట్లు అవసరం. పిల్లల వృద్ధి, ఎగుదలలో పోషకాహార జోక్యం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గణేష్ కధే, మెడికల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్, అబోట్ న్యూట్రిషన్ బిజినెస్ తెలిపారు. తల్లిదండ్రులు వివిధ స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అబాట్, పోషకాహార లోపం పరిష్కారాల కోసం అబాట్ సెంటర్ను ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేయనుంది. నిపుణులు, భాగస్వాముల సహకారంతో, పిల్లలతో సహా, ఇతర జనాభా కోసం పోషకాహార లోపాన్ని గుర్తించడం, చికిత్స , నివారించడంపై దృష్టి ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ పెడ్రో అలార్కోన్ దీనిపై మరిన్ని వివరాలు అందిస్తూ స్టంటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం పాత్రను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఓవర్ నూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. పోషకాహార సప్లిమెంట్ పానీయాలను సేవించడం ద్వారా పోషకాహార లోపాన్ని పూరించు కోవచ్చు. అవసరమైన విటమిన్లు, ఖనిజాల స్వీకరణలో కూడా దోహద పడతాయి. ఇది పోషకాల స్వీకరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటిదే. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని పిల్లల శరీరాలు సంపూర్ణంగా స్వీకరిస్తాయని వివరించారు. పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్ జింక్ వంటి 50శాతం పోషకాలు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి లభిస్తాయి. కనుక ఈ విషయంలో పోషకాహార సప్లిమెంట్లు ద్వంద్వ పాత్రను పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇటీవలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8శాతం మంది పిల్లలు ఉన్నారని తేలిందని సికింద్రాబాద్, యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగాధిపతి DNB పీడియాట్రిక్స్ ప్రోగ్రాం హెడ్ డాక్టర్ డీరమేష్ తెలిపారు. గ్రామీణ తెలంగాణలో 33 శాతం మంది సరైన ఎదుగుదలకు తోడ్పడటానికి, పిల్లలకు ఐదు ఆహార సమూహాల నుండి వచ్చే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మంచి మిశ్రమం కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, పాల ఉత్పత్తులు, ఇంకా తృణధాన్యాలు వల్ల ఆరోగ్యకరమైన సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పిల్లలకు అందేలా తల్లిదండ్రులు ఆహారాన్ని అందించాలి. సమతుల్య ఆహారం, అవసరమైనప్పుడు పోషకాహార సప్లిమెంట్ డ్రింక్స్ లాంటి ఆకర్షణీయమైన కలయికతో పిల్లల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు, పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. -
మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గురించి తెలిసిందే. ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకోస్తోంది ప్రజల్లో. అలాంటిది మళ్లీ కరోనా రీపిట్ అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కరోన పుట్టినిల్లు అయినా చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న దేశం అది. పైగా చాలా ఏళ్ల పాటు కరోనా మహమ్మారి ఆ దేశాన్ని ఓ పట్టాన వదల్లేదు. కానీ ఇప్పుడూ తాజాగా మళ్లీ కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సాక్షాత్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేగాక ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు కూడా నివేదించారు. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లాంటి వైరల్ వ్యాధి ప్రభలంగా ఉంది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ ఔట్ పేషంట్ క్లినిక్లు లేవని జబ్బు పడిన పిల్లలతోనే ఆస్ప్రుత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు. కరోనా ఆంక్షాలను తొలగించాక దేశంలో శ్వాసకోశ వ్యాధులు అధికమైనట్లు డబ్ల్యూహెచ్ఓకి వెల్లడించారు. ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రం కాకుండా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోమని డబ్ల్యూహెచ్ఓ చైనా అధికారులను కోరింది. కోవిడ్-19 రూపాంతరం సార్క్ కోవిడ్-2.. ఇన్ఫ్లుఎంజా, మైక్రోప్లాస్మా న్యుమోనియా వంటి వ్యాధులకు దారితీస్తున్నట్లు కరోనా మహమ్మారి ప్రారంభంలోనే డబ్ల్యూహచ్ఓ హెచ్చరించింది. ఇప్పుడూ చైనా పిల్లల్లో అలాంటి వ్యాధుల సంక్రమణే ఎక్కువగా ఉండటంతో చైనా అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) ఆ వ్యాధుల పరిస్థితి, తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదించమని చైనా అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా ఉత్తర చైనాలో గత మూడు ఏళ్లలో సరిగ్గా ఇదే టైంలో సుమారు అక్టోబర్ మధ్య కాలంలో ఈ ఇన్ఫ్లుఎంజా వంటి వైరల్ అనారోగ్యాలు అధికమైనట్లు డబ్బ్యూహెచ్వో పేర్కొంది. ఇలాంటి అనారోగ్యం బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, టీకాలు వేయించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మాస్క్లు వంటివి ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని చైనా ప్రజలకు సూచించింది డబ్ల్యూహెచ్ఓ. భారత్లోనూ పెరుగుతున్న అంతు చిక్కని జ్వరాలు.. తమిళనాడులోకి కోయంబత్తూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడ జ్వరానికి సంబంధించిన కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లు అధికమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వైరల్ ఫీవర్లు బారిన పిల్లలు, పెద్దలు పడటమే గాక అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించమని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..) -
Israel-Hamas war: అల్–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు
ఖాన్ యూనిస్: అల్–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్–షిఫా నుంచి అంబులెన్స్ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. బందీల విడుదలకు యత్నాలు గాజాలో హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్ అల్–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్ గల్ఫ్ దేశమైన ఖతార్ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్ ప్రతినిధులు హమాస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి. -
భారత్లోనే టీబీ కేసులు అత్యధికం!: డబ్ల్యూహెచ్ఓ నివేదిక
దేశాల్లో క్షయ వ్యాధి కేసులు పెరుగుతున్నాయంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేప్(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు దేశాల వారిగా పెరుగుతున్న క్షయ వ్యాధి కేసుల, మరణాల సంఖ్యను నివేదికలో వెల్లడించింది. 2022లో ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు భారత్లోనే నమోదైనట్లు తన నివేదికలో వెల్లడించింది. సుమారు 30 దేశాల్లో దాదాపు 87 శాతం కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో దేశంలోనే దాదాపు 28 లక్షలకు పైగా కేసులు నమోదయ్యయని వారిలో సుమారు మూడు లక్షల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయినట్లు పేర్కొంది. మంగళవారం(నవంబర్ 07న) డబ్యూహెచ్వో అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా(10%), చైనా(7.1%), పాకిస్తాన్(5.7), నైజీరియా(4.5%), బంగ్లాదేశ్(3.6%) డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(3.0%) కేసులు ఉన్నట్లు తెలిపింది. ఐతే భారత్ ఈ టీబీ కేసులను తగ్గించడంలో కూడా పురోగతి సాధించనట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా, 2015లో ఒక లక్ష మందిలో సుమారు 258 రోగులు ఉండగా అది కాస్తా 2022లో 199కి పడిపోయింది. కానీ ఈ రేటు ఇప్పటికి ప్రపంచ సగటు ప్రతీ ఒక లక్ష మందికి 133తో పోలిస్తే చాలా అత్యధికంగా ఉందని పేర్కొంది. ఇక క్షయ వ్యాధి కారణంగా భారత్ మరణాలు 12%(అంటే ప్రతి వంద మందికి 12 మంది ఈ వ్యాధితో మరణించారు) మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య ప్రపంచ సగటు 5.8 కంటే ఎక్కువుగా ఉంది. కాగా, సింగపూర్లో అత్యల్పంగా మరణాలు సంభవించగా చైనా మాత్రం 4% మరణాలతో 14వ స్థానంలో నిలిచింది. నిజానికి ఈ క్షయ వ్యాధి నయం చేయగలిగనప్పటికి, నిర్థారించడంలో ఆలస్యమైతే మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ పరిస్థితి కోవిడ్ మహమ్మారి తర్వాత మరింత ఎక్కువైంది. అంతేగాదు దాదాపు 192 దేశాల్లో సుమారు 75 లక్షల మందికి పైగా ప్రజలు టీబీతో బాధపడుతున్నారంటూ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్వో వన్హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్ -
కడుపు కోతకు చెక్..!
సాక్షి, రాజమహేంద్రవరం: బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అదీ సహజ పద్ధతిలో జరిగితే తల్లీ, బిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహం అమ్మ కడుపును కోసేస్తోంది.. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్లు యథేచ్ఛగా చేసేస్తున్నారు. గర్భిణి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే శస్త్ర చికిత్స తప్పుకాదు. కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా శ్రస్త్ర చికిత్సలనే ప్రోత్సహిస్తున్నారు. సిజేరియన్కు రూ.40 వేల నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి(కోత కనబడని శస్త్ర చికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రుతలకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్ర చికిత్సలే చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ దుస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్య శాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్ల వల్ల కలిగే అనర్ధాలు, సహ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు పోత్రహించేందుకు ‘సీ–సేఫ్’ విధానాన్ని రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం సన్నద్ధమవుతోంది. ఇదీ సంగతి జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 300కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రాజమహేంద్రవరం జీజీహెచ్, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, కడియం పీహెచ్సీల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వైద్య శాఖ గణాంకాల ప్రకారం 50 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటిలో 80 శాతం శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే 50 శాతానికి పైగా అపరేషన్లు జరుగుతున్నాయి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండటంతో బాలింతలకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మార్చి 22 వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 22,648 ప్రసవాలు జరిగాయి. అందులో ప్రైవేటులో అత్యధికంగా 15,804, అందులో 10,433 సిజేరియన్లు జరిగాయి. 5,370 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,844 జరగ్గా.. కేవలం 3,552 శస్త్ర చికిత్సలు మాత్రమే చేశారు. అదీ హైరిస్క్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. 3,763 సాధారణ ప్రసవాలు జరిగాయి. నర్సులకు శిక్షణ సహజ ప్రసవాలు పెంచే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైఫరీ(ఎన్పీఎం) కోర్సులో శిక్షణ అందించారు. బ్యాచ్కు 30 మంది చొప్పున శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళలకు అవసరమైన వైద్యం ఎలా అందజేయాలో వివరించారు. హైరిస్క్లో ఉన్న గర్భిణులను గుర్తించడం, వారికి అందించాల్సిన వైద్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డులో పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. సీ–సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియనుల చేయాలన్నదే ‘సీ–సేఫ్’ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాతృశిశు మరణాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తుంది. సాధారణ కాన్పులే మేలు నవమాసాలు మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో శస్త్రచికిత్సలను ప్రోత్సహించడం తగదని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నార్మల్ డెలివరీ జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితిని బట్టి రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్ర చికిత్స చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ను ప్రోత్సహిస్తున్నారు. వైద్యుల్లో సైతం వేచి చూసే ధోరణి ఉండాలి. రోగుల ఒత్తిడి మేరకు శస్త్ర చికిత్సలను ప్రోత్సహించడం తగదు. గర్భం దాల్చినప్పటి నుంచి తేలికపాటి వ్యాయామాలు చేస్తే కాన్పు సమయంలో ఇబ్బందులు పడాల్సి అవసరం ఉండదని సూచిస్తున్నారు. జిల్లాలో మూడు నెలలుగా శస్త్ర చికిత్సలు, నార్మల్ డెలివరీలు ఇలా.. ఆస్పత్రి నెల సిజేరియన్లు నార్మల్ డెలివరీ ప్రభుత్వ జనవరి 236 251 ఫిబ్రవరి 253 250 మార్చి 215 244 ప్రైవేటు జనవరి 916 389 ఫిబ్రవరి 631 345 మార్చి 599 292 గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అవసరం లేకుండా చేపట్టే జిసేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకు గాను ప్రతి పీహెచ్సీ, గ్రామాల్లో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నా.ం ఈ క్రమంలో సీ–సేఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం... – డాక్టర్.కె. వెంకటేశ్వరరావు,జిల్లా వైద్య శాఖాధికారి -
పారాహుషార్!
అజ్ఞానం అనేక విధాల అపాయకరం. ఆరోగ్యం విషయంలో అది మరీ ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఆ సంగతి మన భారతీయులందరికీ మరోసారి గుర్తుచేసింది. మన దేశ జనాభాలో 18.83 కోట్ల మంది దాకా అధిక రక్తపోటు (హై బీపీ)తో బాధపడుతున్నారనీ, అయితే వారిలో కేవలం 37 శాతం మందికే తమ ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉందనీ వెల్లడించింది. అధిక రక్తపోటు ఉందని తేలినవారిలో నూటికి 30 మందే మందులు వాడుతున్నారనీ, వారిలోనూ 15 మందే దాన్ని నియంత్రణలో ఉంచుకుంటు న్నారనీ పేర్కొంది. బీపీ ఉన్నవారిలో కనీసం సగం మంది దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగినా... వచ్చే 2040 నాటికి గుండెపోటు, పక్షవాతం వల్ల సంభవించే 46 లక్షల మరణాలను మన దేశంలో నివారించవచ్చు. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న ఈ మాటలు భారత్లో ‘హై బీపీ’ పట్ల పేరుకున్న అశ్రద్ధను గుర్తుచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలోని ఈ లోటుపాట్లపై ప్రజలు, వారితో పాటు ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్త హైపర్టెన్షన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తొట్టతొలి నివేదిక ఇదే! 2019 నాటి డేటా ఆధారంగా ఈ ప్రపంచ సంస్థ చేసిన నిర్ధారణలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక బీపీతో బాధపడుతున్నారట! వారిలోనూ ప్రతి అయిదుగురిలో నలుగురు దాన్ని అదుపులో ఉంచుకోవట్లేదట! జీవనశైలిలో అనూహ్య మార్పుల వల్ల 1990 నుంచి 2019కి వచ్చేసరికల్లా బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి రెట్టింపై, 130 కోట్లకు చేరింది. పైకి లక్షణాలేవీ ప్రత్యేకంగా కనిపించని ‘సైలెంట్ కిల్లర్’ ఇది. అందుకే, గుండె జబ్బు, కిడ్నీలు దెబ్బ తినడం లాంటి ఇతర సమస్యలు తలెత్తినప్పుడు గానీ ఈ అధిక బీపీని పలువురు గుర్తించడం లేదని వైద్యులు వాపోతున్నారు. బీపీ ఉన్నట్టు తెలిసినా సరిగ్గా మందులు వాడక అశ్రద్ధ చేసి తల మీదకు తెచ్చుకుంటున్నవారు అనేకులు. భారత్లో గుండెపోటు, స్ట్రోక్లతో మరణిస్తున్న వారిలో నూటికి 52 మంది అనియంత్రిత అధిక బీపీ (140/90కి పైన)కి బలి అవుతున్నవారే! చౌకగా మందులతో అదుపు చేయవచ్చని తెలిసినా, పలు దేశాల్లో ఈ పెను ప్రమాదకారిపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని తమ పౌరులందరికీ పరీక్షలు జరిపి, ఉచితంగా చికిత్స అంది స్తున్నాయి. అయితే, అల్పాదాయ దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి, మనదేశంలో ప్రజల్లో అధిక బీపీ దుష్ఫలితాల్ని నియంత్రించేందుకు ‘ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్’ (ఐహెచ్సీఐ)ను 2017 నవంబర్లోనే కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే అసాంక్రమిక వ్యాధుల పరీక్షలు జరిపి, చికిత్స, మందులిచ్చి, 2025 నాటి కల్లా దేశంలో 7.5 కోట్ల మందికి బీపీ, షుగర్ల నుంచి సంరక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదట 5 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొద్ది జిల్లాల్లో మొదలైన ఈ ఆరోగ్య యజ్ఞం క్రమంగా 155 జిల్లాలకు విస్తరించింది. అయితే, ఈ ఏడాది జూన్ నాటికి 27 రాష్ట్రాల్లో దాదాపు 58 లక్షల మంది బీపీ రోగులకు మాత్రం చికిత్స అందించగలిగింది. నిరుడు ఇది ఐరాస అవార్డును అందుకున్న ప్రశంసనీయ ప్రయత్నం. కానీ, బీపీ బాధితుల సంఖ్య కోట్లలో ఉన్న దేశంలో చెరువు నీటిని చెంబుతో తోడితే సరిపోదు. డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక సైతం ముందుగా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. సమాజంలోని పేదవర్గాల్లో పలువురు అధిక బీపీ బాధితులు కొంతకాలం పాటు మందులు వాడి, పరిస్థితి కొద్దిగా కుదుటపడగానే మానేస్తున్నారట! కొన్ని అధ్యయనాలు వెల్లడించిన ఈ చేదు నిజం ఆందోళన రేపుతోంది. బీపీకి చికిత్స, మందులు మధ్యలో ఆపడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు ఎప్పటి నుంచో చెబుతున్నదే! అయినా మనం పెడచెవిన పెడుతున్నాం. ఈ ధోరణి మారాలి. 30 ఏళ్ళ వయసు నుంచే బీపీ చూపించు కోవాలనీ, 50వ పడిలో పడ్డాక తరచూ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరనీ వైద్యులిస్తున్న సలహాను పాటించడం మంచిది. అలాగే, రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సున్నా, భారత్లో 8 గ్రాముల దాకా తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజా నివేదిక సైతం హెచ్చరిస్తోంది. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానే యడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర లాంటి జీవనశైలి మార్పులతో, జీవితాంతం బీపీ మందులు మానకుండా వాడడం శ్రేయస్కరం. గణాంకాలు గమనిస్తే, గత 15 ఏళ్ళలో దేశంలోని చిన్న పట్నాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం బీపీ సమస్య విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని లోటు సైతం అక్కడి సమస్యను పెంచు తోంది. మచ్చుకు, గ్రామీణ బిహార్ లాంటి చోట్ల ఆరోగ్య సేవకుల్లో మూడోవంతు మందికి మాత్రమే సరైన బీపీ చికిత్స తెలుసట! అంతర్జాతీయ పరిశోధకుల సర్వే నిరుడు తేల్చిన దిగ్భ్రాంతికరమైన నిజమిది. జిల్లా, గ్రామస్థాయుల్లో ప్రజారోగ్య సేవకుల నైపుణ్యం పెంచి, డాక్టర్ల, నర్సుల కొరతను అధిగమించడం ద్వారా ప్రభుత్వ బీపీ కార్యక్రమాన్ని మెరుగుపరచవచ్చని నిపుణుల సూచన. ఏమైనా, డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక ఇస్తున్న సందేశాన్ని మన విధాన నిర్ణేతలు వెంటనే చెవి కెక్కించుకోవాలి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి పంథా మార్చి, కొత్త వ్యూహాలను అనుసరించడమే ఏ సమస్యకైనా అసలైన ఔషధం. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ చీఫ్ -
మందులకు భారీగా వ్యయం
సాక్షి,అమరావతి: వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోగులకు సరఫరా చేసే మందుల విషయంలోనూ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మందుల సరఫరాకే ఏకంగా రూ.2,230 కోట్లను ఖర్చుచేసింది. గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలుగల మందులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తీవ్ర కటకట ఉండేది. ఆ పరిస్థితులకు చెక్ పెడుతూ సరఫరా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు, మందుల బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. దీంతో ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. రూ.200 కోట్ల నుంచి రూ.500కోట్లకు పెంపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా కోసం ఏటా సుమారు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసేవారు. ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి సరిపడా మందుల బడ్జెట్ ఉండేది కాదు. కేవలం 229 రకాల మందులను మాత్రమే అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో ఆస్పత్రుల్లో మందులకు తీవ్ర దుర్భర పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. ఆస్పత్రుల్లో మందుల కోసం బడ్జెట్ను పెంచింది. ఏటా రూ.500 కోట్ల మేర బడ్జెట్ను కేవలం మందుల సరఫరాకే వె చ్చిస్తోంది. అంతేకాక.. మందుల సంఖ్యను 608కు పెంచింది. ఇలా 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం మందుల సరఫరాకే రూ.2,230 కోట్ల మేర ఖర్చుచేశారు. దీన్నిబట్టి పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపునకు పైగా ఈ ప్రభుత్వం మందుల కోసం ఖర్చుచేసినట్లు స్పష్టమవుతోంది. విలేజ్ క్లినిక్స్లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 172, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్స్కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన పెద్ద ఆస్పత్రులకు అక్కడి అవసరాలకు అనుగుణంగా నిరంతరం సరఫరా చేస్తున్నారు. గ్రామ స్థాయిలోనే 105 రకాల మందులు.. ఇక గ్రామస్థాయిలోనే 105 రకాల మందులను విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేకూరుస్తోంది. గత టీడీపీ హయాంలో జ్వరం, దగ్గు, తలనొప్పి వస్తే డోలో, పారాసెటిమాల్ కూడా లభించని దుస్థితి గ్రామాల్లో ఉండేది. ఈ పరిస్థితులకు చెక్పెడుతూ ఏకంగా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ రూపంలో మినీసైజ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. వీటిలో 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, ఏకంగా 105 రకాల మందులు ఉంటున్నాయి. దీంతో థైరాయిడ్, యాంటి థైరాయిడ్, రక్తంలో కొలె్రస్టాల్ సాంద్రతను తగ్గించే మెడిసిన్, హృదయనాళ సంబంధిత సమస్యలకు వాడే మందులు, యాంటి టీబీ మెడిసిన్, యాంటి లెప్రసీ మెడిసిన్, యాంటి ఎపిలెప్సీ మెడిసిన్, ఇతర ఔషధాలు గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్యులు వెళ్తున్నారు. మరోవైపు.. టెలీ మెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్లు ఇక్కడే లభిస్తున్నాయి. ఈ వైద్యుల ప్రి్రస్కిప్షన్ మేరకు విలేజ్ క్లినిక్స్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉచితంగా ప్రజలకు మందులు అందిస్తున్నారు. -
ఆడుతూ, పాడుతూ ‘అమ్మ’
వీఏవీ రంగాచార్యులు, సాక్షి సెంట్రల్ డెస్క్ : మాతృత్వంలోని కమ్మదనం గురించి ‘అమ్మ’కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అయితే బిడ్డకు జన్మనిచ్చి తల్లి అవ్వడం అనేది ఆ ‘అమ్మ’కు పునర్జన్మేనని చెప్పవచ్చు. అంటే ఓ మహిళ గర్భం దాల్చి.. తొమ్మిది నెలలపాటు శిశువును మోయడం ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డను బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడం మరోఎత్తు. ఈ క్రమంలో ఆ చివరి రోజు ఆ మహిళ పడే కష్టం, బాధ వర్ణణాతీతం. ఈ బాధ భరించలేక చాలా మంది సిజేరియన్ (ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) చేయించుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఎక్కువ ఫీజు వస్తుందని మారు మాట్లాడకుండా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది సరికాదని, ఇతరత్రా ఎలాంటి సమస్యలు లేకపోతే నార్మల్ డెలివరీ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గట్టిగా చెబుతోంది. దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పీహెచ్సీల్లో నార్మల్ డెలివరీకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రిస్క్ తీసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధంగా లేనందున అనవసర సిజేరియన్లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తూనే ఉంది. ఎపిడ్యూరల్ విధానం ఒక వరం అభివృద్ధి చెందిన దేశాల్లో, మన దేశంలో ఎగువ మధ్య తరగతి, ధనికులు ఇప్పుడిప్పుడే ఈ విధానం ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా దృష్టి సారిస్తున్నారు. ఎపిడ్యూరల్ అంటే ఇదొక రకమైన అనస్థీషియా. మామూలుగా శరీరంలో ఒక భాగానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు స్పైన్ (వెన్ను)కు మత్తు మందు ఇచ్చినప్పుడు ఆ భాగం నుంచి మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్లవు. అదే సమయంలో మెదడు నుంచి మోటార్ సిగ్నల్స్ రావు. అప్పుడు ఆ భాగానికి సంబంధించి కండరాలు వదులవుతాయి. సిజేరియన్ కోసమైతే ఇలా చేయాలి. నొప్పి తెలియకుండా నార్మల్ డెలివరీ చేయాలంటే ఇందులో ఒకదాన్ని ఆపి, మరొకదాన్ని పని చేయించాలి. వైద్యులతో ముందే చర్చించాలి కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారిలో చాలా మంది నొప్పి తట్టుకోలేక సిజేరియన్ చేసేయండని అడుగుతున్నారని, ఇలాంటి సమయంలో ఎపిడ్యూరల్ విధానం పాటించాలని డబ్ల్యూహెచ్వో సూచిస్తోంది. ఈ విధానానికి నిపుణుడైన అనెస్థీషియాలజిస్ట్ మాత్రమే అదనంగా అవసరం. అందువల్ల దాదాపు సిజేరియన్కు అయ్చే ఖర్చే అవుతుంది. ఇప్పటికే ఈ విధానం గురించి తెలిసిన వారు చాలా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులతో ముందుగానే చర్చించి తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి సూచనల మేరకు నిత్యం వ్యాయామం చేస్తూ ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. పురుటి నొప్పులు మొదలవుతాయనడానికి ముందుగానే ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరికి యాక్టివ్ లేబర్ కంటే (తీవ్రమైన నొప్పులు) ముందు నుంచే పెలి్వక్ (కండరాలు వదులయ్యేలా) ఎక్సర్సైజ్లు చేయిస్తారు. ఆ సమయంలో వేడి నీళ్లలో తడిపిన టవల్ ద్వారా ఒత్తిడి తేవడం, కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా చూస్తారు. ఇటీవల సినీ నటుడు రామ్చరణ్ సతీమణి ఉపాసన ఈ విధానంలోనే బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. కొన్ని ఆస్పత్రుల్లో ఐవీ అనాల్జీషియా, ఎంటొనాక్స్ (మాస్క్ ద్వారా గ్యాస్ ఇవ్వడం) తదితర పద్దతుల్లో కూడా నొప్పి లేకుండా ప్రసవాలు చేస్తున్నప్పటికీ ఎపిడ్యూరల్ మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సిజేరియన్ కంటే ఇదే మేలు కాబట్టి, దీని గురించి అందరికీ తెలియాలని డబ్ల్యూహెచ్వో కోరుకుంటోంది. స్పైన్ పై భాగంలోనే మత్తు స్పైన్లోపలికి కాకుండా పై భాగంలో ఉన్న పొరలోకి మత్తు మందును తక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేస్తారు. ఇలా చేస్తే అనాల్జీషియా (నొప్పి లేకపోవడం) మాత్రమే పని చేస్తుంది. అంటే మెదడుకు ఆ భాగం నుంచి నొప్పి సంకేతాలు వెళ్లనందున నొప్పి తెలియదు. మెదడు నుంచి యథావిధిగా మోటార్ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఆ భాగంలో కండరాలు యథావిధిగా పని చేస్తాయి. దీంతో గర్భసంచి చుట్టూ ఒత్తిడి పెరిగి, కొద్ది కొద్దిగా బేబీ బయటకు వస్తుంది. ఇందుకోసం సర్జరీలకు వాడేంత డోస్ కాకుండా తక్కువ డోసులో మత్తు మందు వాడతారు. అన్ని అనెస్థీషియాల్లాగే దీనికీ కొంత సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి రాదు. మామూలుగా కంటే ఓ గంట సమయం ఎక్కువ పడుతుంది. మంచి బెనిఫిట్ ఉంటుంది ఎపిడ్యూరల్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెయిన్ను బాగా తగ్గించవచ్చు. బెనిఫిట్ చాలా బావుంటుంది. చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే విధానం కొనసాగుతోంది. పూర్వపు రోజుల్లో ఈ విధానం పట్ల మన దేశంలో కొంత అపోహ ఉండేది. ఇప్పుడు విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఆ అపోహలు తొలగిపోయాయి. లేబర్లో మూడు దశలు ఉంటాయి. రెండవ దశ నుంచి ఇది స్టార్ట్ చేయాలి. కొంచెం బీపీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్ద సమస్యలు ఉత్పన్నం కావు. కాకపోతే తొమ్మిదవ నెల నుంచే గర్భిణిని ఇందుకు సమాయత్తం చేయాల్సి ఉంటుంది. ఈ విధానంపై కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశోధన కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పీజీ అనెస్థీసియా విద్యార్థులు పలు పేపర్లు కూడా ప్రెజెంట్ చేశారు. యువతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. గర్భిణికి అవగాహన ఉండి కోరితేనే చేస్తున్నారు. – ఎస్.మాణిక్యరావు, గైనకాలజీ హెచ్ఓడి, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి -
'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనం ఘెబ్రేయేసుస్ భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనియాడారు. జీ20 సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును ఇంతటి స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్యం విషయంలో భారత దేశం అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. నేనొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసం వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని చెబుతూ జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో మేము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు ఈరోజు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితుట్లకు తగట్టుగా స్పందించి సిద్దపడటం.. సురక్షితమైన, ప్రభావవంతమైన,నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ 19 మహమ్మారి ఎదుర్కున్న తీరులో విఫలమైన నేపథ్యంలో రాబోయే మహమ్మారి పట్ల మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తూ, తనకు అధికారాలు కావాలని కోరుతోంది. ప్రపంచ దేశాలను నిర్దేశించడానికి తనకు అధికారాలు పెంచడానికి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్ఆర్), ప్రపంచ మహమ్మారి ఒప్పందం హెచ్ఈఆర్పీ గురించి తన సభ్య దేశాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మూడు దారుల ద్వారా తన అధికారాలరను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్యం మీద తన గుత్తాధిపత్యం స్థాపించుకోవడానికి, కొనసాగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మే 2024 కల్లా పూర్తి కావాలని భావిస్తోంది. వీటి ద్వారా అన్ని దేశాలలో ఆరోగ్యంపై జాతీయ ప్రణాళికలను శాసించే విధంగా ఈ ఒప్పందాలను తయారు చేస్తున్నారు. ముసాయీదా ఒప్పందాల గురించి చర్చించడం ప్రారంభించారు. అయితే, ఇది కేవలం ఆరోగ్య రంగం కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం తదితర రంగాలకు కూడా తన ‘ప్రభావం’ విస్తరించే ప్రయత్నంలో డబ్ల్యూహెచ్ఓ ఉంది. దీని వెనుక ఉన్న శక్తులు బిల్ గేట్స్, క్లాస్ శ్వాబ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ) వంటి ప్రముఖులు ఉన్నారు. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని, ఒక కొత్త ప్రాపంచిక వ్యవస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. భారత దేశం కూడా ఈ చర్చలలో పాల్గొంటోంది. కానీ మన దేశంలో, పార్లమెంటులో దీనిపై చర్చ లేదు. కనీసం ప్రస్తావన కూడా చాల తక్కువ. పైగా చాలా మంది ప్రజలకు అసలు ఈ విషయం కూడా తెలియదు. ఈ విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అధికారులు. రౌండ్ టేబుల్ సమావేశం : డబ్యూహెచ్ఓ ప్రపంచ మహమ్మారి ఒప్పందం (Global Pandemic Accord): దేశ సార్వభౌమత్వానికి , పౌరుల హక్కులకు పొంచి ఉన్న విపత్తు తేదీ : 09-08-2023 సమయం : ఉదయం 10 - 2 గంటలకు ప్రదేశం : ఆడిటోరియం సెమినార్ హాల్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ & సోషల్ స్టడీస్ ( సెస్ ) బేగంపేట్, హైదరాబాద్ వక్తలు : ప్రొఫెసర్ కోదండరాం, డా. దొంతి నర్సింహ రెడ్డి, సరస్వతి కవుల ప్రెజెంటేషన్ తర్వాత ఓపెన్ ఫోరమ్ చర్చ. (చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!) -
మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి..డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!
మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న సమయంలో మరో వేరియంటే చాపకింద నీరులా వచ్చేస్తుంది. ఇంకా నేను ఉన్నానంటూ..మరో కొత్త వేరియంట్ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మహమ్మారి మొదలైన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు అంత ఈజీగా మర్చిపోలేం. అందర్నీ ఇంట్లో బందీలుగా చేసింది. ఇప్పుడూ మళ్లీ మరో రూపంలో ఆ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏంటీ కొత్త వేరియంటే..ఎక్కడ వ్యాపించింది? ఇంతవరకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి, దాని తాలుకా కేసులు చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు. ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంట్కి జులై 31న "ఎరిస్" అనే పేరుతో వేరియంట్గా వర్గీకరించారు. తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్ఎస్ఏ) పేర్కొంది. ఏది ఏమైనా ఈ మహామ్మారీ కేసులు పెరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు ఇయూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ డాక్టర్ మేరి రామ్సే. ప్రజలంతా ఈ వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, అలానే శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఈ కొత్త వేరింట్ కేసులను ట్రాక్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటమేగాక తమ రక్షణను వదులుకోవద్దని చెప్పారు. కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు అధికారులు. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!) -
'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్లో తయారైన సిరప్పై WHO అలర్ట్
భారత్లో తయారై.. ఇరాక్లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ (Cold Out) దగ్గు మందు సిరప్లో కలుషితమైన ఔదాలున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిందంటూ బ్లూమ్బెర్గ్ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ ల్యాబరేటరీ సంస్థ వాలిసూర్ ల్యాబ్ ఈ ఏడాది మార్చిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్కు చెందిన ఓ ఫార్మసీలో కొనుగోలు చేసిన కోల్డ్ అవుట్ సిరప్పై రీసెర్చ్ చేసింది. వాలిసూర్ పరిశోధనల్లో భారత్లో తయారైన ఈ దగ్గుమందులో 2.1% ఇథలీన్ గ్లైకాల్ (ఈజీ) నమూనాలు ఉన్నట్లు తేలింది. ఇది వినియోగించాల్సిన శాతం కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. తద్వారా సిరప్ వినియోగంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. గత ఏడాది మైడెన్ ఫార్మా తయారు చేసిన జలుబు, దగ్గుమందు సిరప్లలో ఇథలీన్ గ్లైకాల్ ఉంది. ఈ సిరప్ తాగి 70 మంది చిన్నారులు మరణించారు. అదే ఇథలీన్ గ్లైకాన్ తాజా వాలిసూర్ పరిశోధనలు జరిపిన సిరప్లో ఉన్నట్లు గుర్తించింది. జూలై 8న బ్లూమ్బెర్గ్ ఈ పరీక్ష ఫలితాలను డబ్ల్యూహెచ్వోతో పాటు, ఇరాక్, భారత అధికారులకు సమాచారం అందించింది.ఇక, డబ్ల్యూహెచ్వో సైతం వాలిసూర్ ఫలితాలపై అలెర్ట్ అయ్యింది. వాలిమర్ రీసెర్చ్ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఇరాక్ ప్రభుత్వం ఈ సిరప్లను విక్రయిస్తే హెచ్చరికలు జారీ చేస్తామని వెల్లడించింది. సిరప్ ఫలితాలపై ఇరాక్ ఓ ఇంటర్వ్యూలో, సిరప్ ఫలితాలపై ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బాడర్ మాట్లాడుతూ.. ఔషధాల దిగుమతి, అమ్మకం, పంపిణీకి మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను కలిగి ఉన్నాయని అన్నారు. కానీ ఇండియన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ ఫలితాలపై స్పందించేందుకు నిరాకరించారు. ఇరాక్లో లభ్యమైన వాలిసూర్ ల్యాబ్ కొనుగోలు చేసిన ఈ సిరప్లను చైన్నైకి చెందిన ఫోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ జర్మనీ, కెనడాతో సహా 50 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే, ఆ సిరప్ తయారీని సంస్థ పుదుచ్చేరికి చెందిన షారున్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని సమాచారం. ఈ సంస్థ గురించి, కోల్డ్ అవుట్ సిరప్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. ఆ దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదు. గత ఏడాది భారత్ హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు గతేడాది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పిల్లల మరణాలకు సిరప్లలోని ఇథిలీన్ గ్లైకాల్ కారణమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తాజాగా, భారత ఫార్మా కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మైడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు,జలుబు మందు సిరప్లపై వివిధ రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు. చదవండి👉 కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో -
ఎవరు?
నటుడు, దర్శక–నిర్మాత జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీసిన తాజా చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్స్ గా నటించారు. రెడ్డెమ్మ బాలాజీ.కె నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా రెడ్డెమ్మ బాలాజీ.కె మాట్లాడుతూ–‘‘ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘హూ’. ఈ మూవీలో జేడీ చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్ చంద్.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement