Sakshi News home page

భారత ఏఐ మోడల్‌ ఎలా ఉండాలి?

Published Wed, Sep 13 2023 12:26 AM

Sakshi Guest Column On Indian artificial intelligence model

కృత్రిమ మేధ విప్లవాన్ని అమెరికాలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు ముందుకు తోస్తూంటే, చైనాలో అది ప్రభుత్వ మద్దతుతో సాగుతోంది. మరి ఈ విషయంలో భారత్‌ ఏం చేయాలి? భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఒకదాన్ని తయారు చేయడం కష్టమేమీ కాదు.

కాకపోతే వీటికి పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా, చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్‌ఎల్‌ఎంలను ఉంచాలా? అన్నది ముందు నిర్ణయించుకోవాలి. మనం మూడో మార్గం అనుసరించడం మేలు. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. భారత్‌ తన జనరేటివ్‌ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. అందరి డిజిటల్‌ హితం కోసం దాన్ని ‘జన్  ఏఐ’ మోడల్‌గా తీర్చిదిద్దాలి.

వీడియోలు సృష్టించడంలో ఛాట్‌జీపీటీకి ఉన్న సామర్థ్యం ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు... పది కోట్ల మంది దాన్ని వినియోగించేలా చేసింది. ‘ద లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌’ (ఎల్‌ఎల్‌ఎం), అలాగే జనరేటివ్‌ ఏఐకి శక్తినిచ్చే విషయాలన్నీ... ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్  వంటివాటిని సమూలంగా మార్చేసే అద్భుత టెక్నాల జీలనడంలో సందేహం లేదు. అందుకే గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ కృత్రిమ మేధను ‘ఫైర్‌’(మంట) అని వర్ణిస్తే, మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ల సమూల మార్పునకు నాందిగా అభివర్ణించారు.

మరోవైపు గోల్డ్‌మాన్  శాక్స్‌ లాంటి సంస్థలు జనరేటివ్‌ ఏఐ కారణంగా రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తికి కనీసం ఏడు లక్షల కోట్ల డాలర్ల మొత్తం చేరుతుందని అంచనా వేస్తోంది. అయితే ఈ సానుకూల అంశాలతోపాటు ఉద్యోగాలు కోల్పోవడం, మానవ ప్రమేయం తగ్గిపోవడం వంటి కొన్నింటిపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఏఐ సూపర్‌ ఇంటెలిజెన్ ్సతో మనిషికి ముప్పు అన్న భావన కూడా పెరుగుతోంది. అలాగే వివక్ష, పర్యావరణ నష్టం, ప్రజాస్వామ్యానికి ముప్పు వంటి అంశాలూ చాలామందికి ఆందోళన కలిగిస్తున్నాయి. 

ప్రస్తుతానికి జనరేటివ్‌ ఏఐ విషయంలో కార్యకలాపాలు ఎక్కు వగా అమెరికా, చైనాల్లోనే జరుగుతున్నాయి. రెండింటిలోనూ వ్యవస్థల నిర్మాణం, ప్రపంచాన్ని చూసే దృష్టి పూర్తిగా వేరు. అమె రికాలో పెద్ద టెక్‌ కంపెనీలు ఏఐ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూండగా, చైనా భిన్నమైన మార్గంలో ప్రయాణిస్తోంది. చైనా కంపెనీలు ప్రభుత్వంతో కలిసి సొంత జనరేటివ్‌ ఏఐ మోడళ్లు తయారు చేస్తున్నాయి. సమాచారం, సందర్భాలు రెండింటినీ పరిగ ణనలోకి తీసుకునేలా చైనా తన జనరేటివ్‌ ఏఐ మోడళ్లను నిర్మిస్తోంది.

ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు ఎవరికివారు తమదైన రీతిలో వ్యవహరిస్తున్నారు. అది కూడా పరిమితమైన పరిధిలో. జనరేటివ్‌ ఏఐ నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా దాన్ని నియంత్రించడంపై యూరోపియన్  యూనియన్  దృష్టి పెట్టింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కూడా ఏఐ ఆధారిత పరిపాలన విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యిస్తోంది.

భారత్‌ స్థానమెక్కడ?
అంతా బాగానే ఉంది కానీ... ఏఐ ఆధారిత ప్రపంచంలో భారత్‌ స్థానమెక్కడ? మేమూ సొంతంగా ఎల్‌ఎల్‌ఎం ప్లాట్‌ఫామ్స్‌ సిద్ధం చేసుకుంటామని ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు వచ్చాయి. హడావుడి కూడా కనిపించింది కానీ... ఛాట్‌జీపీటీ çసృష్టికర్త, ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్  వీటిపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు. అయితే, భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఒకదాన్ని తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

భారతీయ భాషలు, కాంటెక్స్‌›్టతో కూడిన సమాచారాన్ని అందివ్వడం ద్వారా ఈ ఎల్‌ఎల్‌ఎంను వినూ త్నంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఇలాంటి ప్రయత్నం చేసేముందు మన లక్ష్యం, ఉద్దేశం ఏమిటన్నది స్పష్టం చేసుకోవడం చాలా ముఖ్యం. పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా? లేక చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్‌ఎల్‌ఎంలను ఉంచాలా? అన్నది తేల్చుకోవాలి. 

మాకైతే మూడో మార్గం మేలని అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. చాలా సాహసోపేతమైందే కావచ్చు. కానీ భారత్‌ తన జనరేటివ్‌ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. డిజిటల్‌ పబ్లిక్‌ గుడ్‌ కోస మన్నమాట. దీన్ని ప్రజల కోసం ‘జన్  ఏఐ’ లేదా ‘జెన్  ఏఐ’ అని పిలుచుకుందాం.

సామాజిక వృద్ధి కోసం...
భారత్‌ సృష్టించిన డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ‘ఇండియా–స్టాక్‌’ ఆధారంగా మొత్తం జనాభా స్థాయిలో డిజిటైజేషన్  సాధ్యం చేయ గలిగాం. ఫలితంగా 140 కోట్ల మందికి డిజిటల్‌ బయోమెట్రిక్‌ గుర్తింపులు, యూపీఐతో సులభతర చెల్లింపులు, ఆధార్‌ గుర్తింపులు,  ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం వంటి ఘనతలు ఎన్నింటినో సాధించగలిగాం. ఈ డిజిటల్‌ టెక్నాలజీల ఆధారంగా నిర్మించిన సేవల పుణ్యమా అని ఆరోగ్య రంగం కూడా ప్రజలకు మరికొంచెం చేరువైంది. లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ప్రభుత్వ సబ్సిడీల వంటివి సులువైపోయాయి.

దేశాద్యంతం సర్వసామాజిక వృద్ధి కూడా సాధ్య మైంది. ఇండియా స్టాక్‌ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న ఏపీఐల ఆధారంగా అసంఖ్యాకమైన స్టార్టప్‌లు వినూత్నమైన సేవ లను భారతీయ పౌరులకు అందుబాటులోకి తేగలిగాయి. ఇండియా స్టాక్‌ ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్ ్స, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఇతర దేశాలు కూడా ఈ వరుసలో ఉన్నాయి. నిజానికి భారత్‌ తన జీ–20 అధ్యక్ష స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా డిజిటల్‌ పబ్లిక్‌ గుడ్, ఇండియా స్టాక్‌లను ప్రపంచం మొత్తానికి వ్యాపించేలా చేస్తోంది.

అంతరాలు తొలగేలా...
ఇండియా స్టాక్‌ అసలైన సామర్థ్యం పౌరులందరికీ డిజిటల్‌ సేవలు అందించడం ద్వారా నిరూపితమైంది. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండటం వల్ల కంపెనీలు, స్టార్టప్‌లు దానికి ఎప్ప టికప్పుడు విలువను జోడించేందుకూ అవకాశం ఏర్పడింది. జనరేటివ్‌ ఏఐని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం. ఇండియా ‘భారత్‌ఎల్‌ఎల్‌ఎం’ పేరుతో సొంత జనరేటివ్‌ ఏఐ మోడల్‌ను తయారు చేసుకోవచ్చు. ఇండియా స్టాక్‌ ద్వారా సమాచారాన్ని అందివ్వడం ద్వారా మనకు మాత్రమే ప్రత్యేకమైన సమస్యలకు పరిష్కారాలు వెతకవచ్చు.

ఇండియా స్టాక్‌పై ఇంకో పొర మాదిరిగా కొన్ని ఎల్‌ఎల్‌ఎంల సమాహారంగా జన్  ఏఐని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ప్రజాసేవలో భాగంగా అందరికీ అందివ్వడం కీలకం. తద్వారా డిజిటల్‌ అంతరాన్ని తొలగించవచ్చు. జనాభా మొత్తానికి లాభాలు అందించవచ్చు. ఆధార్, యూపీఐ  మాదిరిగా అన్నమాట. వ్యక్తిగత గోప్యత, వివక్ష వంటి ఏఐ సంబంధిత ఆందో ళనలకు సమాధానం వెతికేందుకు కూడా ఈ ప్రయత్నం ఉపకరిస్తుంది. వైయక్తిక గోప్యత విషయంలో పాశ్చాత్యుల ఆలోచన దీనికంటే భిన్నమైంది. సమష్టితనం, సామాజిక గోప్యత, నమ్మకం వంటి భారతీయ దృక్పథాలను వాడుకుంటూ ఈ పని చేయవచ్చు. 

సానుకూల ప్రభుత్వం, ప్రపంచానికి నేతృత్వం వహిస్తున్న మన ఐటీ కంపెనీలు, ఐఐటీల వంటి సంస్థలు కలిసికట్టుగా ఈ ‘జన్  ఏఐ’ని సుసాధ్యం చేయగలవని మేము విశ్వసిస్తున్నాం. ఆ తరువాత భారతీయ కంపెనీలు భారత్‌ఎల్‌ఎల్‌ఎం నుంచి నిర్దుష్ట, లోపాలు సరిదిద్దిన ఎల్‌ఎల్‌ఎంలను అభివృద్ధి చేయవచ్చు. అందరికీ అందు బాటులో ఉండే ఏపీఐల సాయంతో స్టార్టప్‌లు కూడా ఎల్‌ఎల్‌ఎంలను వాడుకోవచ్చు. డిజిటల్‌ టెక్నాలజీలో ఇప్పుడున్న రెండు విప్లవా త్మకమైన విషయాలను భారత్‌ ఇలా జోడించవచ్చు. అంటే జనరేటివ్‌ ఏఐ, డిజిటల్‌ పబ్లిక్‌ గుడ్‌లను మేళవించడం అన్నమాట. తద్వారా ప్రపంచంలోని అన్ని జన్  ఏఐ మోడళ్లకు నమూనాగా భారతీయ మోడల్‌ను నిలబెట్టవచ్చు. 
జస్‌ప్రీత్‌ బింద్రా, టెక్‌ విస్పరర్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు,
మేనేజింగ్‌ డైరెక్టర్‌; సుధీర్‌ తివారీ, థాట్‌వర్క్స్‌ ఇండియా డిజిటల్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ గ్లోబల్‌ హెడ్‌ (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement

What’s your opinion

Advertisement