-
‘నీట్’పై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రవేశ పరీక్ష సందర్భంగా లోపాలు తలెత్తడం... ఫలితాల వెల్లడి సమయంలో మార్కుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.దేశవ్యాప్తంగా వందలాది మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అసలు నీట్ ఫలితాలు ఇవే ఉంటాయా? వాటిని రద్దు చేస్తారా? మళ్లీ నీట్ పరీక్ష ఏమైనా పెడతారా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. మరోవైపు నీట్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. రద్దు ఉండకపోవచ్చని... దానివల్ల విద్యార్థులు మరింత నష్టపోతారని అధికారులు అంటున్నారు. ఎన్టీఏపై విమర్శల వెల్లువ మే 5న నీట్ పరీక్ష జరగ్గా, ఫలితాలను జూన్ 14న ప్రకటిస్తామని ఎన్టీఏ ముందుగానే ప్రకటించింది. కానీ జూన్ 4న దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే... అదే రోజు చడీచప్పుడు కాకుండా నీట్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అంత హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచి్చందనే విమర్శలు వస్తున్నాయి. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆరోజు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది. అలాగే ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ముందే అవకాశం కలి్పంచారు. అయితే, ఆలిండియా ర్యాంకులు.. మార్కులు.. ఫలితాల సమగ్ర సమాచారాన్ని మాత్రం ఆరోజు మరింత ఆలస్యం చేసి ఇచ్చారు. ఇలా అనుమానాలకు తావిచ్చేలా ఎన్టీఏ వ్యవహరించిందన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్లోనూ ఆలస్యం ఇక పలువురు విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు ఇచి్చన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నీట్ పరీక్ష సమయం 3 గంటల 20 నిమిషాలు. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్ పత్రాలు తదితర కారణాల నేపథ్యంలో సమయం వృథా అయ్యిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, ఛతీస్గఢ్, హరియాణ న్యాయస్థానాల్లో రిట్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను ఎన్టీఏ సమీక్షించి వారికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. అలాగైతే దేశంలో అనేకచోట్ల విద్యార్థులకు ఆలస్యంగా పరీక్ష పేపర్ ఇచ్చారు. వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.హైదరాబాద్ మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఒక రూంలో ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడకపోవడంతో ఆలస్యం చేశారు. తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరి వారికెందుకు గ్రేస్ మార్కులు కలపలేదని ప్రశి్నస్తున్నారు. -
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్- యూజీ పరీక్ష- 2024లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్ధుల తరుపున ఇదే అంశంపై పార్లమెంట్లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67మంది ప్రథమ ర్యాంక్ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్ పరీక్షల కారణంగా 24 లక్షమంది విద్యార్ధులు, వారి కుటుంబాలను నాశనం చేసింది. ఒకే పరీక్షా కేంద్రంలోని 6 మంది విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్ధులకు టెక్నికల్గా సాధ్యం కాని విధంగా మార్కులు వచ్చాయి. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అయినప్పటికీ నీట్ పేపర్ లీక్ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బలమైన ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేపర్ లీకేజీలు కాకుండా ఉండేలా చట్టం చేస్తే.. పేపర్ లీకేజీల నుంచి విద్యార్ధులను పేపర్ లీక్ నుండి విముక్తి చేస్తామని హామీ ఇచ్చాము అని ఆయన అన్నారు.లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో మీ వాయిస్గా మారుతా. మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హామీ ఇస్తున్నాను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్గఢ్లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్లోని సూరత్తోపాటు చండీగఢ్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
NEET Row: గ్రేస్ మార్కులపై ఎన్డీఏ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 ఫలితాలపై రగడ కొనసాగుతున్న వేళ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. విద్యార్థులకు అదనంగా కలిపామని చెబుతున్న గ్రేస్ మార్క్లను సమీక్షించడానికి అంగీకరించింది. ఇందుకోసం విద్యాశాఖ ఓ కమిటీ వేసిందని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు.నీట్ యూజీ పరీక్ష నిర్వహణ.. ఫలితాల వెల్లడిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘‘సుమారు 1,500 మందికి ఇచ్చిన గ్రేస్మార్క్ల్ని సమీక్షించేందుకు విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం తర్వాతఘ ఆ 1,500 మంది ఫలితాలను సవరించే అవకాశం ఉంటుంది. అయితే.. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదు. ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపించదు’’ అని అన్నారాయన. అలాగే.. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు.ఇక.. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, సమీక్ష అనంతరం ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించే నిర్ణయం కూడా కమిటీ సిఫారసులను బట్టి ఉంటుందన్నారు.‘‘ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించి నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించాం. మొత్తం 4,750 కేంద్రాల్లో 6 కేంద్రాలకే ఈ సమస్య పరిమితం అయింది. అలాగే, 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, అందులో 1,600 మంది విషయంలోనే సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదు. ఏ పరీక్ష కేంద్రంలో కూడా పేపర్ లీకేజీ జరగలేదు’’ అని ఎన్ టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.విమర్శలు ఇలా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం అనుమానాలకు తావిచ్చింది. దీనితో తోడు ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యమయ్యే పని కాదన్నది చాలామంది వాదన. దీని గురించి ఎన్ఈటీని ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని చెబుతోంది. కొంతమంది విద్యార్థులకైతే 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చామని అంటోంది. ఇప్పుడు విమర్శల నేపథ్యంలో ఆ మార్కులనే సమీక్షించబోతోంది. ఇక పరీక్ష నాడు ప్రశ్నాపత్రాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాము తక్కువ టైంలో పరీక్ష రాయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. అయితే కేవలం ఆరు సెంటర్లలో మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైందని ఎన్ఈటీ ఇప్పుడు అంటోంది. మరోవైపు గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది NTA చెప్పకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే.. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా రాజకీయ విమర్శలకు తావిచ్చింది. -
ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్గా..!
‘నీట్’ ఎగ్జామ్లో ఆలిండియా టాప్ ర్యాంకర్గా నిలవడం సామాన్యం కాదు. ముంబైలో ఓ బేకరి వర్కర్ కుమార్తె అయిన అమీనా ఆరిఫ్ పది వరకూ ఉర్దూ మీడియంలో చదివింది. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంతో ఇబ్బంది పడింది. అయినా నీట్ 2024లో 720 కి 720 తెచ్చుకుని టాప్ ర్యాంకర్గా నిలిచింది. ఆమె స్ఫూర్తిదాయక కథనం...‘మెహనత్ కర్నా హై... మోటివేట్ రెహనా హై (కష్టపడాలి... ప్రేరణతో ఉండాలి) అని చెప్పింది అమీనా ఆరిఫ్ తన విజయం గురించి. వైద్యవిద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’లో 2024 సంవత్సరానికి 720 మార్కులకు 720 మార్కులతో టాప్ 1 ర్యాంకు సాధించింది అమీనా. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాస్తే వారిలో 67 మందికి టాప్ 1 ర్యాంకు వచ్చింది. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో మిగిలిన వారితో పోల్చితే అమీనా గెలుపు కాస్త భిన్నమైనది. ఎందుకంటే 10వ తరగతి వరకూ ఆమె ఉర్దూ మీడియంలో చదివింది.బేకరి వర్కర్ కుమార్తె..ముంబై పశ్చిమ శివార్లలో ఉండే జోగేశ్వరి ప్రాంతం అమీనాది. తండ్రి బేకరీలో పని చేస్తాడు. అక్కడ ఉన్న మద్నీ హైస్కూల్ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పేరు గడించింది. ఉర్దూ మీడియంలో బోధన సాగే ఆ స్కూల్లోనే అమీనా పది వరకు చదివింది. ఆ తర్వాత పార్లెలోని మితిబాయి కాలేజీలో బైపీసీలో చేరింది. ‘అంతవరకూ ఉర్దూ మీడియంలో చదవడం వల్ల బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదవడం కష్టమైంది. ఇంగ్లిష్లో నా వెనుకంజ నా చదువునే వెనక్కు నెట్టకూడదని గట్టిగా కష్టపడ్డాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి.మళ్లీ ప్రయత్నించి..‘అమ్మా నాన్నా నన్ను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. లాక్డౌన్ వల్ల మొదటిసారి నీట్ రాసినప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేంత ర్యాంక్ రాలేదు. నిస్పృహ చెందకుండా ప్రయత్నించాను. ఈసారి కోచింగ్ తీసుకున్నాను. ఆరు గంటలు కోచింగ్, ఇంట్లో మరో నాలుగైదు గంటలు సెల్ఫ్ స్టడీ... ఇలా సాగింది నా కృషి.కోచింగ్ సెంటర్లో మాక్ టెస్ట్లు రాసేటప్పుడు 700 మార్కులకు తరచూ 620 వచ్చేవి. అప్పుడే అనుకున్నాను... కచ్చితంగా 700 దాటుతానని ముందే అనుకున్నాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు వచ్చిన ర్యాంక్కు దేశంలోని ఏ మెడికల్ కాలేజీలో అయినా సీట్ వస్తుంది కానీ అమీనా మాత్రం ఢిల్లీ ఎయిమ్స్లో చదవాలనుకుంటోంది. -
ఏ ర్యాంక్కు ఎక్కడ మెడికల్ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్ల వరకూ సీట్లు లభించాయి. -
నీట్లో మెరిసిన రైతుబిడ్డలు
కర్నూలు: నీట్ పీజీ ఫలితాల్లో రైతు బిడ్డలు ప్రతిభ చూపారు. మంగళవారం సాయంత్రం వచ్చిన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నూరు హుసేని, చెన్నూరు హుసేనమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమార్తె రజియా అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేయాలన్న సంకల్పంతో నీట్ పరీక్షలు రాయగా 571 మార్కులు వచ్చాయి. ఆలిండియా స్థాయిలో 5248వ ర్యాంకు వచ్చింది. చిన్నపిల్లల వైద్యనిపుణురాలిగా మంచి పేరు తెచ్చుకుని పేదలకు సేవచేయాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు. -
లంక సిస్టర్స్.. ఇద్దరూ డాక్టర్స్..!
పెనుగొండ(పశ్చిమగోదావరి): ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వరరావు కుమార్తెలు సాయి తేజస్వి, ఐశ్వర్య ఈ ఘనత సాధించారు. ఇప్పటికే బీడీఎస్ పూర్తిచేసిన సాయితేజస్వి, నీట్ (ఎండీఎస్)లో జాతీయస్థాయిలో 1048 ర్యాంకు సాధించింది. చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? అక్క స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఈ ఏడాది నీట్లో జాతీయస్థాయిలో 7395 ర్యాంకు సాధించింది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
TS: రాష్ట్రంలో నీట్ అర్హులు 36,795 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్రం నుంచి 36,795 మంది నీట్ పరీక్షలో అర్హత సాధించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. నీట్ జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు.. తెలంగాణ రాష్ట్రంలో టాప్ ర్యాంకర్గా నిలిచారు. జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించిన చప్పిడి లక్ష్మీచరిత రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయి 41వ ర్యాంకర్ జీవన్కుమార్రెడ్డి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. తొలి 50 స్థానాల్లో.. 28 మంది బాలురు, 22 బాలికలు ఉన్నారు. అర్హత కటాఫ్ మార్కులను ఓపెన్ కేటగిరీలో 117, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు 93 మార్కులు, పీడబ్ల్యూడీ జనరల్కు 105 మార్కులుగా నిర్ణయించారు. ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎవరైనా విద్యార్థుల పేర్లులేకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, తర్వాత కౌన్సెలింగ్ సందర్భంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పొరపాటున కొందరు ర్యాంకర్ల పేర్లు ఇతర రాష్ట్రాల పరిధిలోకి వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో టాప్ వెయ్యి ర్యాంకర్లు ఆలిండియా సీట్లలో చేరే అవకాశం ఉందని.. మిగతావారు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో చేరుతారని కాళోజీ వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఎంబీబీఎస్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 215 రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 215 సీట్లు కేటాయించినట్లు కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్నగర్, సిద్దిపేట మెడికల్ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, మిగతావి ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే ఇందులో సగం సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా అర్హులైన వారితో భర్తీ చేస్తామని.. మిగతా సీట్లను ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 5,965 సీట్లు ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి 5,965 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15శాతం సీట్లను ఆలిండియా కోటా కింద జాతీయస్థాయిలో భర్తీ చేస్తారు. వాటిలో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు ఏవైనా మిగిలితే.. వాటిని రాష్ట్రానికి అప్పగిస్తారు. వచ్చేనెల రెండో వారంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ప్రకటన జారీచేసే అవకాశం ఉందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. -
Tamil Nadu: ‘నీట్’లో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఈ ఏడాది నీట్ ఉత్తీర్ణత తగ్గింది. కేవలం 51.3 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. టాప్ 50 జాబితాలో ఇద్దరు తమిళనాడు విద్యార్థులకు చోటు దక్కింది. వివరాలు.. వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం గత నెల నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు రాష్ట్రం నుంచి 1,32,167 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 67,787 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 51.3 శాతానికి పరిమితమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల ఉత్తీర్ణత మరీ తక్కువగా ఉంది. అయితే, దేశవ్యాప్తంగా టాప్ 50లో తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులకు చోటు దక్కించుకోవడం గమనార్హం. మదురైకు చెందిన త్రిదేవ్ వినాయక(ఓబీసీ కేటగిరిలో –705 మార్కులతో) 30వ స్థానం, హరిణి అనే విద్యార్ధిని జనరల్ కేటగిరిలో 702 మార్కులతో 43వ స్థానం దక్కించుకోవడం విశేషం. కాగా నీట్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆవడి సమీపంలో ఓ విద్యార్థిని మరణించగా, తిరుత్తణిలో మరో విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నీట్ తప్పిన విద్యార్థులకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని, వారితోనే ఉండాలని, అవసరం అయితే, ప్రభుత్వం 104, 1100 నెంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ తీసుకోవాలని అధికారులు సూచించారు. యువతి బలవన్మరణం తిరువళ్లూరు: నీట్ పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో ఓ యువతి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ ఇంది రా నగర్కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అముద కుమార్తె లక్ష్మీ శ్వేత(19) ప్లస్–2 పూర్తి చేసి రెండేళ్లుగా నీట్కు ఆన్లైన్ క్లాసుల ద్వారా కోచింగ్ తీసుకుంటోంది. గత నెలలో రాసిన నీట్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షల్లో అర్హత మార్కులు సాధించకపోవడంతో ఆవేదనకు గురై ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీట్ ఫలితాలు విడుదల 9.93 లక్షల మంది ఉత్తీర్ణత
-
NEET UG 2022: నీట్లో తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు మెరుపులు మెరిపించారు. బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధార్థరావు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. రాష్ట్రానికి చెందిన చప్పిడి లక్ష్మీచరిత 37వ ర్యాంకు, కె.జీవన్కుమార్రెడ్డి 41వ ర్యాంకు, వరం అదితి 50వ ర్యాంకు, యశస్వినిశ్రీ 52వ ర్యాంకు సాధించారు. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి బాలికల కేటగిరీలో చూస్తే.. చప్పిడి లక్ష్మీచరిత జాతీయ స్థాయిలో 14వ ర్యాంకులో నిలిచారు. ఇక ఎస్టీ కేటగిరీలో జాతీయ టాపర్గా తెలంగాణకు చెందిన ముదావత్ లితేష్ చౌహాన్, రెండో ర్యాంకును గుగులోతు శివాని సాధించారు. లవోడ్య బృంద ఐదో, బూక్యా అనుమేహ ఆరో ర్యాంకులు సాధించారు. ఓబీసీ కేటగిరీలో చూస్తే.. యశస్వినీశ్రీ ఎనిమిదో ర్యాంకు పొందారు. తెలంగాణ నుంచి నీట్ కోసం 61,207 మంది రిజి్రస్టేషన్ చేసుకోగా.. 59,296 మంది పరీక్ష రాశారు. ఇందులో 35,148 మంది నీట్కు అర్హత సాధించారు. గతేడాది అర్హుల సంఖ్య 28,093 మందే కావడం గమనార్హం. ఐదో ర్యాంకు సాధించిన విద్యార్థి తమ కాలేజీలో చదువుకున్నాడని శ్రీచైతన్య కూకట్పల్లి బ్రాంచి డీన్ శంకర్రావు తెలిపారు. ఏపీకి చెందిన దుర్గ సాయి కీర్తితేజ 12వ, ఎన్.వెంకటసాయి వైష్ణవి 15వ జాతీయ ర్యాంకులు సాధించారు. -
‘నీట్’లో ఏపీ విద్యార్థులు 61.77% ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. నీట్ యూజీ పరీక్షలను దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 17న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 17.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,93,069 మంది (56.27 శాతం) అర్హత సాధించారు. ఏపీ నుంచి 61.77 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 65,305 మంది పరీక్షకు హాజరు కాగా, 40,344 మంది అర్హత సాధించారు. రాజస్థాన్కు చెందిన విద్యార్థిని తనిష్క 715 స్కోర్ సాధించి, 99.99 పర్సంటైల్తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఢిల్లీకి చెందిన వి. ఆశిష్బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేష్ నాగభూషణ్ మూడో ర్యాంకు, రూచ పవాషే నాలుగో ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన ఇ.సిద్దార్థ్ రావు ఐదో ర్యాంక్ సాధించారు. ఏపీకి చెందిన ఎం. దుర్గ సాయి కీర్తి తేజ 12వ ర్యాంక్, ఎన్.వెంకటసాయి వైష్ణవి 15వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. జి.హర్షవర్ధన్ నాయుడు 25వ ర్యాంకు సాధించాడు. చదవండి: (‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల) ఆంధ్రప్రదేశ్లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ ఇలా కోటాలు కలిపి 5,060 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 సీట్లు (ఈడబ్ల్యూఎస్ అదనపు సీట్లు కలిపి) ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ (కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి. అత్యల్పంగా ఒంగోలు రిమ్స్లో 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో ఆల్ ఇండియా కోటా 325 సీట్లు, రాష్ట్ర కోటాలో 1,890 సీట్లు భర్తీ చేస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. కాగా 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1400కు పైగా బీడీఎస్ సీట్లు ఉన్నాయి. -
ర్యాంకు లక్ష వచ్చినా తెలంగాణలో సీటు.. నీట్ నిపుణుల విశ్లేషణ ఇదే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. వారంలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నీట్ ర్యాంకులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో చాలామంది జాతీయ స్థాయిలో తమ ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారని, కానీ రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకులు తక్కువగానే ఉంటాయని నీట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: ‘నిమ్స్ డైరెక్టర్కు అపోలోలో చికిత్సా?’ వారి అంచనా ప్రకారం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అటువంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ జారీచేస్తామని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదని వివరించాయి. కొత్తగా 6 ప్రభుత్వ కాలేజీలు.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,965 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,600 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల మూడు ప్రైవేటు కాలేజీలకు సంబంధించి అడ్మిషన్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిల్లోని 450 ఎంబీబీఎస్ సీట్లను తీసేస్తే 3,150 సీట్లు ఉంటాయి. అయితే ఎంఎన్ఆర్ కాలేజీకి దాదాపు అనుమతి వచ్చినట్లేనని కాళోజీ వర్గాలు అంటున్నాయి. కాబట్టి అవి 150 కలిపితే 3,300 సీట్లు అవుతాయి. మరోవైపు ఈసారి ప్రభుత్వం రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి మెడికల్ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. దీంతో వాటిల్లో 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా మొత్తం 16 ప్రభుత్వ కళాశాలల్లో 2,665 సీట్లు ఉండనున్నాయి. ఇక రామగుండం, మంచిర్యాల కాలేజీలకు కూడా అనుమతులు వస్తే వాటి ద్వారా మరో 300 సీట్లు పెరుగుతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: నీట్–అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు. ఈ ఏడాది నీట్–యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షకు 17.64 లక్షల మంది హాజరయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.17 లక్షల మంది, మహారాష్ట్ర నుంచి 1.13 లక్షల మంది, రాజస్తాన్ నుంచి 82,548 మంది అర్హత పొందారు. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఓయో బంపరాఫర్..విద్యార్థినులకు మాత్రమే!
దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్ ఎగ్జామ్-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి ఏడాది జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు వ్యయ ప్రయాసలకు ఓర్చి కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలోనే పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్ సెంటర్ నుంచి నుంచి వెనుదిరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్ అందిస్తుంది. అందులో వైఫై, ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్జ్యూమర్) శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు. విద్యార్ధినులు ఓయో డిస్కౌంట్ పొందాలంటే! ♦ఓయో యాప్ను డౌన్లోడ్ చేయాలి ♦ఆ యాప్లో నియర్ బై ఐకాన్పై క్లిక్ చేయాలి. ♦ఆ ఆప్షన్పై ట్యాప్ చేస్తే ఎగ్జామ్ సెంటర్కు సమీపంలో ఉన్న ఓయో రూమ్స్ లిస్ట్ కనబడుతుంది. ఆ లిస్ట్లో మీకు కావాల్సిన ఓయో రూమ్స్ హోటల్ను సెలక్ట్ చేసుకొని 'నీట్ జేఎఫ్' కూపన్ కోడ్ను ఎంటర్ చేయాలి ♦ఆ తర్వాత బుక్ నౌ ఆప్షన్ క్లిక్ చేసి 40శాతం పేమెంట్ చేసి ఓయో రూంను వినియోగించుకోవచ్చు. -
నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థినికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్
అల్లవరం (కోనసీమ జిల్లా): పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా విడుదల చేసిన పీజీ నీట్ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్ సాధించి విశాఖపట్నంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్లోనూ 9.3 గ్రేడ్ సాధించి ఎంసెట్లో 180వ ర్యాంక్ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించింది. ఎంబీబీఎస్లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)– చండీగఢ్ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు. -
అలాంటప్పుడు విదేశాల్లో ఎందుకు చదువుతున్నారు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జోషి మాట్లాడుతూ.. విదేశాల్లో మెడిసిన్ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 60 శాతం మంది చైనా, రష్యా, ఉక్రెయిన్లకు వెళ్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది చైనాలో విద్యను అభ్యసించేందుకే మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, విదేశాల్లో మెడిసిన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలు పాస్ అయితేనే వారికి భారత్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఇదిలా ఉండగా మంత్రి వ్యాఖ్యలపై విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. దేశంలో మెడికల్ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. నీట్లో తాము అర్హత సాధించినప్పటికీ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో తామకు నష్టం జరుగుతోందన్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్ చదివిన డాక్డర్లు మాత్రం ఉండి ఉంటే దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పత్రిపక్ష నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. -
ఏపీ నీట్ ర్యాంక్లు విడుదల
సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్ యూజీ–2021 రాష్ట్రస్థాయి ర్యాంకులను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో జాబితాను ఉంచింది. ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్కు అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వీసీ డాక్టర్ శ్యామ్ప్రసాద్ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్ చేపడతారు. ఈ ప్రక్రియ జరగడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 11 మందికి 100లోపు ర్యాంక్లు రాష్ట్రం నుంచి నీట్కు హాజరైన వారిలో 39,388 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో తొలి వందలోపు ఆల్ ఇండియా ర్యాంక్లను 11 మంది సాధించారు. వీరిలో ఎనిమిది మంది జనరల్ అభ్యర్థులు, ముగ్గురు ఓబీసీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. ఆలిండియా ర్యాంకులు 100లోపు సాధించిన వారు.. విద్యార్థి ర్యాంకు చందం విష్ణు వివేక్ 13 గొర్రిపాటి రుషిల్ 15 పి. వెంకట కౌశిక్ రెడ్డి 27 కేతంరెడ్డి గోíపీచంద్ రెడ్డి 36 టి. సత్యకేశవ్ 41 పరుచూరి వెంకటసాయి అమిత్ 47 పి. కార్తీక్ 53 ఎస్. వెంకటకల్పజ్ 58 కె. చైతన్య కృష్ణ 71 పి. సాకేత్ 84 వి. నిఖిత 89 కటాఫ్ మార్కులు ఇలా.. జనరల్ కేటగిరీ 138 జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీ 122 బీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూడీతో కలిపి) 108 -
నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్–2021 యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ర్యాంకుల జాబితా సమాచారం నిమిత్తమేనని, వర్సిటీకి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వివరించింది. నీట్–21 యూజీ అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అడ్మిషన్ల షెడ్యూల్ ఖరారైన తర్వాత కాళోజీ వర్సిటీ కౌన్సెలింగ్ చేపట్టనుంది. నీట్ కటాఫ్ స్కోర్ వివరాలు: జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 138 మార్కులు ♦ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 108 మార్కులు ♦పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 122 మార్కులు -
పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..
న్యూఢిల్లీ: 2021లో నీట్లో ఉత్తీర్ణత సాధించిన చాలా మంది విద్యార్థులలో మోలార్బండ్లోని సర్వోద్య కన్యా విద్యాలయానికి చెందిన రితిక కూడా ఒకటి. కాకపోతే తను ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సొంతంగానే పేపర్ అయ్యి మెరిట్ ర్యాంకును సాధించింది. రితిక తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి బదర్పూర్లో ఒక చిన్న ఇంట్లో నివసిస్తోంది. తన తండ్రి ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ పని చేస్తూ వారు జీవనాన్ని సాగించేవాళ్ళు. కోవిడ్ లాక్డౌన్ మూలాన రితిక తండ్రి ఉపాధిని కోల్పోయాడు.దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో రితిక ఇంట్లో మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కూడా లేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెకు ఆండ్రాయిడ్ ఫోన్, పుస్తకాలు అవసరమైన తరుణంలో వాటిని కొనడానికి కూడా డబ్బులు లేవని ఆ పరిస్థితుల్లో తన పెళ్లి కోసం ఇంట్లో దాచిన నగలు అమ్మి అవి కొన్నట్లు చెప్పింది. చివరకు అన్ని కష్టాలను దాటుకొని ఆమె 500 మార్కులు సాధించి ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా 3,032 ర్యాంక్ను సాధించింది. నీట్లో మంచి స్కోర్ (93%) సాధించడంతో తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది. తను ప్రైవేట్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేని కారణంగా యూట్యూబ్ క్లాసులు, కొన్ని పుస్తకాల నుంచి సొంతంగా పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చాలా సహాయం చేసినట్లు చెప్పింది రితిక. ఈ ఏడాది ఢిల్లీ పాఠశాలల నుంచి మొత్తం 436 మంది విద్యార్థులు నీట్లో ఉత్తీర్ణత సాధించారు. చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు -
‘జై భీమ్’ సినిమా సీన్ను రీపిట్ చేసిన తమిళనాడు యువతి..!
దేశంలోని చాలా అట్టడుగు వర్గాల గిరిజనుల నుంచి ఆడపిల్లలు ‘నీట్’ రాసి క్వాలిఫై కావడం గురించి విన్నామా? కాని తమిళనాడులో సంగవి చరిత్ర సృష్టించింది. కేవలం 10 వేల మంది ఉండే గిరిజన తెగ ‘మలసార్’ నుంచి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకుంది. ఆమె రేపో మాపో డాక్టర్ కోర్సులో చేరనుంది. అది ఒక్కటే కాదు... ఆమె తన ‘ఎస్.టి సర్టిఫికెట్’ కోసం ప్రభుత్వం కదిలే స్థాయిలో పోరాడింది. ఆమె చదువు గురించిన పట్టుదల ఇప్పుడు మొత్తం ఆ తెగకు మేలు చేసేలా కదలిక తీసుకువచ్చింది. ఆఫ్రికాను ఒకప్పుడు చీకటి ఖండం అనేవారుగాని మన దేశంలో నేటికీ అలాంటి చీకటి ఖండాల వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు కోయంబత్తూరుకు ఆనుకునే ఉన్న ఎం.నంజప్పనూర్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ప్రభుత్వానికి తెలియదు. నగర వాసులకూ తెలియదు. ఎందుకంటే అక్కడ తరాలుగా జీవిస్తున్నది మలసార్ అనే తెగకు చెందిన గిరిజనులు కాబట్టి. కేరళ, తమిళనాడులో మాత్రమే కనిపించే ఈ తెగ మొత్తం కలిపి 10 వేల మంది ఉండరు. వీళ్లది లిపి లేని భాష. నాలుగు ఆకులు, ప్లాస్టిక్ పట్టలు కట్టి పైకప్పుగా వేసుకుని జీవించే వీరి గురించి ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆ తెగలో ఇంటర్ పాసైన సంగవి అనే అమ్మాయి. ‘నీట్ – 2021’లో ఆ అమ్మాయి 202 మార్కులు సంపాదించింది. ఎస్.టి కేటగిరిలో అర్హత మార్కులు 108– 121 కాగా వాటిని దాటి 202 మార్కులు తెచ్చుకోవడం విశేషమే. ఇలా మలసార్ తెగ నుంచి ఈ ఎగ్జామ్ రాసి ఈ స్థాయిలో క్వాలిఫై అయిన మొదటి అమ్మాయి సంగవే. అందుకే ఇప్పుడు తమిళనాడు గిరిజన శాఖ మంత్రితో మొదలు అధికారులు ఆమెను కలిసి అభినందిస్తున్నారు. సర్టిఫికెట్ కోసం పోరాటం ఇప్పుడు ఓ.టి.టిలో ప్లే అవుతున్న ‘జైభీమ్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో పాములు పట్టుకుని బతికే గిరిజన తెగ వాసులు తమకు ఎస్.టి సర్టిఫికెట్ ఇమ్మని, చదువుకుంటామని అధికారి దగ్గరకు వస్తారు. దానికి అధికారి ‘మీరు ఎక్కడ ఉంటారు.. మీ అమ్మా నాన్నలకు అలాంటి సర్టిఫికెట్ ఉందా... మీ కులం పేరుతో మీకు పట్టాలు ఉన్నాయా.. రేషన్ కార్డులు ఉన్నాయా.. అవి లేకుండా కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వము’ అంటాడు. ఇప్పుడు సంగవి గురించి అధికారులు అదే అన్నారు. టెన్త్ వరకూ ఏ కుల సర్టిఫికెట్ లేకుండానే చదువుకున్న సంగవి ఇంటర్ కూడా అలాగే చదివి 2018లో నీట్ రాసి క్వాలిఫై కాలేదు. దాంతో పాలిటెక్నిక్లో చేరింది. ఎస్టి కోటాలో సీట్ ఇచ్చి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడానికి 10 రోజులు టైమ్ ఇచ్చారు సంగవికి. 10 రోజుల్లో ఆ సర్టిఫికెట్ను ఇవ్వడానికి అధికారులు అంగీకరించకపోవడంతో సంగవి చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదాపు సంవత్సరం పాటు సంగవి తన కేస్ట్ సర్టిఫికెట్ కోసం పోరాటం చేసింది. చివరకు 2020 కరోనా సమయంలో కొందరు ఎన్జివో కార్యకర్తలు వారి బస్తీకి వెళ్లినప్పుడు సంగవి గురించి విని ఆమె పోరాటాన్ని పత్రికలకు తెలియచేశారు. దాంతో ఏకంగా మంత్రే ఆమెను కలిసి సర్టిఫికెట్ అందజేశాడు. ఆ తర్వాత ఆమెకు నీట్ రాయాలని ఉందని తెలుసుకున్న ఆ ఎన్జివో కార్యకర్తలు కోచింగ్ ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ మార్కులు. తండ్రి కోరిక మలసార్ తెగలో తరతరాలుగా ఎవరూ చదువుకోలేదు. పది వరకు చదవడం గొప్ప. కాని సంగవి తండ్రి మునియప్ప ‘నువ్వు డాక్టర్వి కావాలమ్మా’ అని అనేవాడు. సంగవి ఇంటర్ చదువు ముగిశాక గత సంవత్సరం అతడు మరణించాడు. తల్లి వసంతమణికి చూపు సరిగా కనిపించదు. వాళ్లు ఉంటున్న ఇల్లు వానకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి ఇంట్లో ఉంటూ తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని పంతం పట్టింది సంగవి. ‘నా కోరిక విని నన్ను కోచింగ్లో చేర్చారు ఎన్జివో వాళ్లు. కోచింగ్ సెంటర్ వాళ్లు మెటీరియల్ ఇస్తే నేను దానిని ప్లాస్టిక్ కవర్లలో దాచి కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాన పడితే నా పుస్తకాలు తడిచిపోవడం ఆనవాయితీ’ అంది సంగవి. ఎస్టి సర్టిఫికెట్ కోసం సంగవి చేసిన పోరాటం వల్ల తమిళనాడులోని సంచార గిరిజనులకు ఒకటి రెండు రోజుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు సంగవికి మార్కులు రావడం వల్ల వారి పేటను సందర్శిస్తున్న అధికారులు ఆ పేటకు ఇళ్ల పట్టాలు ఇస్తామని రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వెళుతున్నారు. తీరని కష్టాలు నీట్లో సంగవికి వచ్చిన మార్కులకు ఎస్.టి కోటా వల్ల కాని తమిళనాడు ప్రభుత్వం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రత్యేక రిజర్వేషన్ల వల్లగాని తప్పక సీట్ వస్తుందని భావిస్తున్నారు. ‘అయితే ఆ చదువు నేను చదవాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది కదా. స్టాలిన్ సార్ నన్ను ఆదుకుంటారని భావిస్తున్నా’ అని సంగవి అంది. చదువు ఇంకా అందని వర్గాలు చదువే గెలుపు అని తెలుసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయం గ్రహించారు. వారి చదువే వారిని గెలిపిస్తుంది. అలాంటి చదువు వల్లే అట్టడుగు వర్గాలు తప్పక వికాసంలోకి వస్తాయి. ‘మావాళ్లంతా ఇప్పుడు నన్ను చూసి చదువుకోవాలనుకుంటున్నారు’ అంటున్న సంగవి మాట ఆ ఆశనే కల్పిస్తోంది. -
నిట్ 2021 ఫలితాల్లో సత్తాచాటిన నారాయణ విద్యాసంస్ధలు
-
Telangana: నీట్ టాప్ ర్యాంకర్ మనోడే...
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్–2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించాడు. ఇతనితో పాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ కూడా 720 మార్కులకు గాను, 720 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. తెలంగాణ విద్యార్థికి నీట్లో టాప్ ర్యాంక్ దక్కడం ఇదే మొదటిసారి. కాగా తెలంగాణకే చెందిన ఖండవల్లి శశాంక్ ఐదో ర్యాంకు సాధించాడు. ఇతనికి 715 మార్కులు వచ్చాయి. ఇలా దేశవ్యాప్తంగా టాప్ 20 ర్యాంకుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన బాలురు ఉండగా.. బాలికల టాప్ 20లో రాష్ట్రానికి చెందిన కాస లహరి (దేశవ్యాప్త ర్యాంకు 30), ఈమణి శ్రీనిజ (38), దాసిక శ్రీ నీహారిక (56), పసుపునూరి శరణ్య (60) ఉన్నారు. తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో నిలిచింది. ఈమె 143వ ఆల్ ఇండియా ర్యాంకు సా«ధించారు. ఎస్సీ కేటగిరీలో టాప్ 10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన మీస రోహిణ్ ప్రభు (451 ర్యాంకు) చోటు సంపాదించాడు. ఎస్టీ కేటగిరీలోని టాప్ 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన కేతవంత్ విజయ్చందర్ ఉన్నాడు. అతనికి జాతీయంగా 3,965 ర్యాంకు వచ్చింది. టాప్ ర్యాంక్ సాధించిన ముగ్గురికి కౌన్సిలింగ్ సమయంలో టై–బ్రేకింగ్ ఫార్ములాను అనుసరిస్తామని ఎన్టీఏ పేర్కొంది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in/ntaresults.nic.in వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు గతేడాది నీట్ కట్ ఆఫ్ 147 మార్కులుగా ఉంది. ఇప్పుడు అది 138కు తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కట్ ఆఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే, ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు ఆపై వచ్చినవారు గతేడాది ఈసారి కూడా ఒకేరకంగా ఉన్నారు. ఆ విధంగా మార్కులు సాధించినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాయాలి. ఇలా ఛాయిస్తో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ ఏడాది రెండు నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. ఈ కారణంగా చాలామంది నష్టపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 8,70,074 మందికి అర్హత సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో పలు నగరాల్లోని 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేల మంది దరఖాస్తు చేయగా, 97 శాతం మంది హాజరయ్యారు. చాలా రోజులకుగానీ ఫలితాలు విడుదల చేయలేదు. – దేశవ్యాప్తంగా 16,14,777 మంది నీట్ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 15,44,275 మంది హాజరయ్యారు. – అందులో బాలురు 7,10,979... బాలికలు 9,03,782 మంది ఉన్నారు. – మొత్తం పరీక్ష రాసినవారిలో ఓబీసీ కేటగిరీ వారు 42.97 శాతం మంది ఉన్నారు. – 202 పట్టణాలు, నగరాల్లో 3,858 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. – 8,70,074 మంది అర్హత సాధించారు. అందులో 4,94,806 మంది బాలికలు, 3,75,260 మంది బాలురు ఉన్నారు. 8 మంది ఇతరులు ఉన్నారు. అర్హత సాధించినవారిలో ఎక్కువగా ఓబీసీ కేటగిరీలో 3,96,772 మంది ఉన్నారు. ముందుగా విద్యార్థుల ఈ మెయిల్స్కు ఫలితాల సమాచారం పంపించారు. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సిలింగ్ నీట్ పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. – నీట్ ద్వారా అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నింటిలోనూ ఈ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఎయిమ్స్, పాండిచ్చేలోని జిప్మర్ మినహా అన్నింటిలో ఎంబీబీఎస్ సీట్లను నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. – దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్లోకి తీసుకున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. – నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంసీసీ.ఎన్ఐసీ.ఇన్’ వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. – ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. – నీట్ స్కోర్ కార్డ్లో వ్యక్తిగత వివరాలు, సబ్జెక్ట్ వారీగా మొత్తం మార్కులు, పర్సంటైల్ స్కోర్లు, ఆలిండియా ర్యాంక్, అర్హత స్థితి ఉంటాయి. దాంతోపాటు నీట్ కట్–ఆఫ్ స్కోర్లు కూడా ప్రకటిస్తారు. మెడికల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడానికి తప్పనిసరిగా కనీస నీట్ కట్–ఆఫ్ మార్కులను పొందాలి. – నీట్ ఫలితాలను ప్రకటించిన తర్వాత, కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తరపున డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) ఆలిండియా కోటా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), డీమ్డ్/సెంట్రల్ యూనివర్శిటీల సీట్ల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. – కటాఫ్, అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఆలిండియా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. కట్–ఆఫ్ కంటే ఎక్కువ స్కోర్ చేసిన వారు ఆలిండియా కోటా కౌన్సెలింగ్లో 15 శాతం సీట్లకు అర్హులు అవుతారు. 15 శాతాన్ని ఆలిండియా కోటా నీట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు. 85 శాతానికి ప్రవేశం కోసం, రాష్ట్రాలు వ్యక్తిగత కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. – దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు– 83,075 బీడీఎస్ సీట్లు – 26,949 ఆయుష్ సీట్లు– 52,720 నీట్ పరీక్షలో పర్సంటైల్, కట్ ఆఫ్ మార్కు ప్రకారం అర్హులైనవారు కేటగిరీ పర్సంటైల్ కట్ ఆఫ్ మార్కు అర్హులైన విద్యార్థులు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జనరల్/ఈడబ్ల్యూఎస్ 50 720–138 7,70,857 ఓబీసీ 40 137–108 66,978 ఎస్సీ 40 137–108 22,384 ఎస్టీ 40 137–108 9,312 -
నీట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం రూరల్/చిలకలపూడి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ–2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్రెడ్డి 23వ ర్యాంక్తో మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్లు సాధించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్లకు ర్యాంక్ కార్డులను పంపింది. 720కి 720 మార్కులు సాధించింది వీరే.. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in,http://taresults.nic.in/NTARESULTS&CMS/ వెబ్సైట్లలో చూసుకోవచ్చు. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్టీఏ విడుదల చేసింది. కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్మర్ తదితర సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు.. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ కటాఫ్ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కటాఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచ్చినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ ► నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ► అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ► దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ► నీట్లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు www.mcc.nic.in వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. ► ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. కౌషిక్రెడ్డికి పలువురి అభినందన నీట్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించిన కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కౌషిక్రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. కౌషిక్రెడ్డి తిరుపతి భారతీయ విద్యాభవన్లో పదో తరగతి చదివి 500కు గానూ 488 మార్కులు సాధించాడు. అనంతరం ఇంటర్మీడియెట్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి 985 మార్కులు పొందాడు. సమాజ సేవ చేస్తా.. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పటికీ.. సమాజానికి ఎక్కువ సేవ చేసేందుకు వైద్య రంగమైతే బాగుంటుందని ఎంబీబీఎస్ను ఎంచుకున్నా. వైద్య రంగం ఎంతో ఆసక్తికరమైందే కాకుండా సవాళ్లతోనూ కూడుకున్నది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా అధ్యయనం చేశా. ఏకధాటిగా చదవడం కంటే ప్రతి 45 నిమిషాలకు 10– 15 నిమిషాల విరామమిచ్చేవాడిని. టీవీ చూడటం, వీడియోగేమ్స్ వంటి వాటితో ఒత్తిడిని జయించాను. అమ్మ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, నాన్న హెచ్ఆర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వారిద్దరూ నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు. – మృణాల్ కుట్టేరి, నీట్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ న్యూరాలిజిస్ట్గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తా. ఆ తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి పేదలకు సేవలందించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్న లక్ష్మి,Ðð వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించగలిగాను. తెలంగాణ ఎంసెట్లో ఐదో ర్యాంకు, ఏపీ ఈపీసెట్లో ప్రథమ ర్యాంకు సాధించాను. – చందం విష్ణువివేక్, నీట్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు న్యూరో ఫిజీషియన్ అవుతా మాది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వట్టెం గ్రామం. నీట్లో ఐదో ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. హైదరాబాద్లో ఇంటర్మీడియెట్ చదివాను. రోజూ 10 గంటలు అధ్యయనం చేశాను. ఢిల్లీ ఎయిమ్స్లో చేరతాను. న్యూరో ఫిజీషియన్ అవుతా. అమ్మ.. సీనియర్ లెక్చరర్గా, నాన్న.. బిజినెస్ మెడిక్యూర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. – ఖండవల్లి శశాంక్, ఆలిండియా ఐదో ర్యాంకర్ చదవండి: మన పరీక్షలు ఎంత ‘నీట్’?
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
నైపుణ్యాన్ని వెలికితీస్తున్న చెస్ పోటీలు
ముగిసిన చెస్ పోటీలు
అన్నప్రాశన రోజే తిరిగిరాని లోకాలకు
పేరుపాలెం బీచ్లో సందడి
పచ్చిరొట్టగా జీలుగ సాగు
భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
క్రికెట్ జట్టు ఎంపిక
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
Advertisement