-
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పేరుతో యూపీహెచ్సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం చంద్రబాబు హయాంలో యూపీహెచ్సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు. ఇంతలోనే.. ఎంతో మార్పు సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు. అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఖరీదైన పరీక్షలు ఉచితం గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. చంద్రబాబు పాలనలో ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉండేది. దీంతో అప్పట్లో ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల పాలనలో పూర్తిగా చక్కబెట్టింది. ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులను ఉంచేలా చర్యలు తీసుకుంది. 2019 ముందు ఏటా చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు చేసి మందుల సరఫరా చేపట్టింది. కొరతకు తావివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డబ్ల్యూహెచ్వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సరఫరాకు సంబంధించి 2018–19 సమయంలో రేట్ కాంట్రాక్ట్లో 608 గాను 229 మందులే ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్ట్లో ఉంటున్నాయి. రేట్ కాంట్రాక్ట్లో ఉన్న మందులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. పీహెచ్సీలు, విలేజ్క్లినిక్స్కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే అందుబాటులో ఉంచుతున్నారు. మందుల బడ్జెట్లో గణనీయమైన పెరుగుదల టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందుల కోసం బడ్జెట్ గణనీయంగా పెరిగింది. పెరిగిన బడ్జెట్ ప్రభుత్వాస్పత్రుల్లో పుష్కలంగా మందులు ఉంటున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వంలో 2015–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ. 216 కోట్లు మాత్రమే మందులకు వెచ్చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్లు వ్యయం చేశారు. దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏటా రూ. 200 కోట్లకు పైగా అదనంగా మందుల కోసమే ఖర్చు పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి వైద్య సేవల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.700 కోట్ల మేర మందుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్/కర్నూలు(హాస్పిటల్): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారికి శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలకు గుంటూరు జీజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో జనవరి 17న గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తాగడం వల్ల ఏర్పడిన ఈ రాళ్లను జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగించారు. సుమారు రూ.1.50 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ తెలిపారు. బాలిక ఛాతీలో కణితి తొలగింపు కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మ(15)కు ఛాతీలో గుండె పక్కన గడ్డ వచ్చింది. గుండె వెనుక భాగంలో న్యూరో ఫైబ్రోమా అని పిలిచే ఈ గడ్డ నరాల నుంచి వస్తోందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంది. ఇలా చేస్తే బాలిక కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఆ బాలిక పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉన్నందున వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ తొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించినట్లు కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్వోడీ డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి మీడియాకు వెల్లడించారు. -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
CM Jagan: ‘నాడి’ పట్టిన నేత
సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు. గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. నాడు ప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన సిబ్బంది కొరత.. వెరసి ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. నేడు సర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. ♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059 ♦ వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198 ♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది ♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు ♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు ♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు– రూ.13,169.86 కోట్లు ♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు ♦ కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. ♦ కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు. ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 ♦ మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసింది 86,690 మంది ♦ సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు ♦ కేటరాక్ట్ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి నాడు–నేడులో పనులు.. ♦ రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. ♦ రూ.664.96 కోట్లతో పీహెచ్సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. ♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. ♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్/జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్సీల బలోపేతం చేశారు. ♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. ♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేశారు. 17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ♦ రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు. ♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. ♦ కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. ♦ వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం. ♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 108 సేవలకు ఊపిరి.. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. ♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. ♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది. ♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు. ♦ ఇలా అంబులెన్స్ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది. -
బోధనాస్పత్రులపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చివేసిన ప్రభుత్వం... రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లోనూ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 పాత బోధనాస్పత్రులకు ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులను వైద్యశాఖ నియమించనుంది. వీరికి సహాయకులుగా మరో 88 మందిని నియమిస్తుంది. ఈ మేరకు కొత్తగా 99 పోస్టులను ఇటీవల సృష్టించింది. ఎవరి బాధ్యతలు ఏమిటంటే... ♦ సాధారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యపరమైన (క్లినికల్) అంశాలను మెడికల్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. నాన్–క్లినికల్ (ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన అంశాలు) వ్యవహారాలపర్యవేక్షణకు సీఈవో/జీఎం ఆపరేషన్స్/అడ్మినిస్ట్రేటర్ హోదాలో మరొకరు ఉంటారు. ♦ ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్, నాన్ క్లినికల్ రెండింటి పర్యవేక్షణ బాధ్యత సూపరింటెండెంట్ చూస్తున్నారు. ♦ ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మెడికల్ సూపరింటెండెంట్లను వైద్యపరమైన వ్యవహారాలకు పరిమితం చేస్తారు. ♦ పరిపాలన కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. జేడీ నేతృత్వంలో ముగ్గురు ఏడీలతోపాటు అసిస్టెంట్ ఇంజినీర్, ఫెసిలిటీ మేనేజర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్ వంటి సహాయక సిబ్బంది పనిచేస్తారు. వీరు ఆస్పత్రిలో భవనాల నిర్వహణ, సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, ఉద్యోగుల హాజరు, జీతభత్యాలు, ఇతర నాన్ క్లినికల్ అంశాలను చూస్తారు. ♦ సూపరింటెండెంట్లకు ఇప్పటివరకు ఉన్న ఆస్పత్రి నిర్వహణ భారం తొలగిపోయి రోగుల సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం లభిస్తుంది. వైద్యుల హాజరు, ఐపీ, ఓపీ, సర్జరీ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపే లక్ష్యంగా... ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలు పెంచి మంచి వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఈ క్రమంలో మన ఆస్పత్రులకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్కేర్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందడమే లక్ష్యంగా వైద్యశాఖ అడుగులు వేస్తోంది. ఈ దశగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటికే విశాఖపట్నంలోని ఛాతీ, మెంటల్ కేర్ ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించింది. మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్–క్వా‹Ù) గుర్తింపు పొందాయి. ఎన్–క్వాష్ గుర్తింపులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడానికి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసింది. మానవ వనరుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తోంది. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, తగినన్ని మందులు, ఇతర వనరులు సమకూర్చింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019 అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారు. దీంతో 2018–19లో 1,22,626 సేవలు మాత్రమే నమోదు కాగా 2022–23లో ఏకంగా 4,42,929కు చేరాయి. దీంతో అదే మేర ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిధులు పెరిగాయి. ఆరోగ్యశ్రీ కింద 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.200 కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందించగా.. గత సంవత్సరం ఈ మొత్తం ఏకంగా రూ.350 కోట్లకు పెరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఆరోగ్యశ్రీ కింద అత్యధిక సేవలు అందిస్తూ విశాఖపట్నంలోని కేజీహెచ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత విజయవాడ, కర్నూలు ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల వాటా పెంచడానికి ప్రత్యేక చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు తావులేకుండా ఏకంగా 50 వేలకు పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఎప్పుడు ఖాళీ అయిన పోస్టులను అప్పుడే వెంటనే భర్తీ చేస్తోంది. దీనికి తోడు నాడు–నేడు కింద ఆస్పత్రులకు కొత్త భవనాలు సమకూర్చడంతో పాటు పాత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్యను వీలైనంత తగ్గించాలని వైద్య శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను గణనీయంగా పెంచడం ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద నమోదవుతున్న వైద్య సేవల్లో 69 శాతం మేర ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో, 31 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల వాటాను మరింతగా పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సేవల పెంపునకు ప్రత్యేక చర్యలు.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను మరింత పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు ఇన్సెంటివ్ నిధుల చెల్లింపునకు చర్యలు చేపట్టాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గతంతో పోలిస్తే మెరుగుపడ్డ సేవలు.. బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి. వీటిని మరింతగా పెంచడానికి ఆస్పత్రులకు విభాగాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. గతేడాది నిర్వహించిన కేసుల కంటే ప్రస్తుత ఏడాది 20 శాతం ఎక్కువ కేసులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – డాక్టర్ నరసింహం, డీఎంఈ ఆరోగ్యశ్రీ సేవలు వేల నుంచి లక్షల్లోకి.. ఇక వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 2018–19తో పోలిస్తే వేల నుంచి ప్రస్తుతం లక్షల్లోకి పెరిగాయి. అప్పట్లో ఏడాదికి 16 వేలు మాత్రమే ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు ఉండేవి. వీటికి సంబంధించి నిధుల వాటా కేవలం రూ.34.94 కోట్లు మాత్రమే ఉండేది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. 2022–23లో ఏకంగా రూ.151 కోట్ల విలువ చేసే వైద్యాన్ని 2.05 లక్షల కేసుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించారు. -
‘స్టెమీ’తో గుండె సేఫ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. గుండె జబ్బులు, కేన్సర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీణులకు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది. రెండో దశ పైలెట్ ప్రాజెక్టును వచ్చే నెల 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ (సీటీవీఎస్) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్లాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్లాబ్స్ను సమకూర్చింది. గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులపై ఫోకస్ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాణాపాయం నుంచి కాపాడతారిలా.. స్టెమీ అంటే గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటు. దీనికి గురైన బాధితుడికి వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్)ను ఇవ్వగలిగితే ప్రాణాల ను కాపాడవచ్చు. నగరాలకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ చికిత్స అందుబాటులో ఉండదు. సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి ప్రభుత్వం స్టెమీ పేరుతోనే కార్యక్రమాన్ని చేపట్టింది. వచ్చే నెలలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్లలోని హబ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్డియాలజిస్టులు, క్యాథ్లాబ్ సౌకర్యం ఉన్న ఈ మూడు ఆస్పత్రులను హబ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఆ జిల్లాల పరిధిలోని 48 స్పోక్స్ (ఏపీవీవీపీ ఆస్పత్రులు)ను అనుసంధానం చేసి సామాన్యులు, గ్రామీణులకు హార్ట్ కేర్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఛాతీనొప్పి, గుండెపోటు లక్షణాలతో స్పోక్స్కు వచ్చిన వారికి వెంటనే టెలీ–ఈసీజీ తీస్తారు. ఆ ఫలితం హబ్లో ఉన్న కార్డియాలజిస్ట్కు వెళుతుంది. గుండె రక్తనాళం ఎంతశాతం పూడిపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా అనేది కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. వెంటనే స్పోక్ వైద్యుడికి తగిన సూచనలు చేస్తారు. అవసరమైతే రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఉచితంగా బాధితులకు ఇస్తారు. ఇదంతా 40 నిమిషాల్లోనే జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఆ తర్వాత తదుపరి చికిత్స కోసం హబ్కు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారు. ప్రజలకు అవగాహన కల్పిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్వోల ద్వారా గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. గుండెపోటుకు గురైన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్కు తరలిస్తారు. బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స లభిస్తుంది. తద్వారా మరణాలు కట్టడి అవుతాయి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ కమిషనర్ మందులు, పరికరాలు సమకూరుస్తున్నాం మూడు జిల్లాల్లో స్పోక్స్ ఆస్పత్రులను గుర్తించాం. వాటిలో స్టెమీ ప్రోటోకాల్స్కు అనుగుణంగా అవసరమైన మందులు, వైద్య పరికరాలను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సమకూరుస్తున్నాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్స్పై శిక్షణ ఇచ్చాం. – డాక్టర్ వెంకటేశ్వర్, ఏపీవీవీపీ కమిషనర్ -
ఆ డాక్టర్లపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయడంతోపాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోందని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో వైద్యులు దీర్ఘకాలం సెలవులో ఉండడం, అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం వంటివి సమర్థనీయం కాదని, అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. నూరుశాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా ఆస్పత్రుల వారీగా, సిబ్బంది వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంపానల్ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై క్వాలిటీ చెక్ చేయాలని చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సంబంధించి ఉద్యోగులు నెలనెలా చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా సొమ్మును కూడా ప్రతి నెల సకాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమయ్యేవిధంగా చూడాలని ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్ను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని ప్రభుత్వ డాక్టర్లను గుర్తించి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, తదుపరి చర్యలకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్రెడ్డి, ఆరి్థకశాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి మంజుల, ఏపీవీవీపీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, డీఎంఈ నర్సింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా రాతలు ఊహాజనితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు. నెల క్రితం ఒంగోలు జీజీహెచ్కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
మందుల పైనా మాయదారి రాతలు
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు అంటే నరకానికి నకళ్లు. మంచాలు, బెడ్లు, దుప్పట్లు, వైద్యులు, ఇతర సిబ్బంది ఉండే వారు కాదు. కంపు కొట్టే వార్డులు, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఆస్పత్రులు ఉండేవి. చిన్నపాటి మందు బిళ్లలకు కూడా కొరతే. అన్ని మందులూ బయట కొనుక్కోవాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్పత్రుల రూపురేఖలే మార్చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అధునాతన వైద్య సౌకర్యాలతో తీర్చిదిద్దారు. నిరంతర వైద్య సేవలందేలా వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించారు. మందులకు కొరతే లేదు. ఏ మందు కావాలన్నా ప్రభుత్వాస్పత్రుల్లో దొరుకుతుంది. మొత్తంగా వైద్య రంగం ముఖచిత్రాన్నే మార్చిన సీఎం వైఎస్ జగన్. అందుకే ఇప్పుడు ప్రజలంతా నిర్భయంగా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అధ్వానంగా ఉన్న ఆస్పత్రులు ఈనాడు అధిపతి రామోజీరావుకు కనిపించలేదు. ఎందుకంటే.. ఆయనకు అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు అద్భుతంగా కనిపించాయి. మరి ఇప్పుడు.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు నిరంతర వైద్యసేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులపై అబద్ధాలు ఆచ్చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత అంటూ అసత్య కథనాన్ని ప్రచురించారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే... కొరతకు తావివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. జీఎంపీ, డబ్ల్యూహెచ్వో ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో 608 రకాల మందులకుగాను 229 రకాలే సరఫరా చేసేవారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 357 రకాలకు గాను 232 మాత్రమే అందుబాటులో ఉండేవి. రీఎజెంట్స్ అసలు సరఫరా చేసేవారే కాదు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అరకొరగా సరఫరా చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో 608 రకాల మందులకు గాను 566 రకాలు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా చేస్తున్నారు. మిగిలిన 42 మందులు డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల ద్వారా నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 377 కు గాను 326, రీఎజెంట్స్ 449 కు గాను 172 అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ వినియోగం ఉన్న మందులు, రీఎజెంట్స్, సర్జికల్ కన్జ్యూమబుల్స్ను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఎమ్మార్పీపై 35.60 శాతం డిస్కౌంట్తో సరఫరా చేస్తున్నారు. రీఎజెంట్స్ను రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో తొలిసారి ఈ ప్రభుత్వంలోనే సెంట్రల్ టెండర్ విధానం ద్వారా సరఫరా చేస్తున్నారు. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో తొలి రెండు క్వార్టర్స్కు డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద బోధన, జిల్లా ఆస్పత్రులకు రూ.14.59 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 3.44 కోట్లు వినియోగించారు. భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఏపీఎంస్ఐడీసీ మందులు, సర్జికల్స్ నిల్వలను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో ఉంచుతోంది. ప్రస్తుతం 13 డ్రగ్ స్టోర్స్లలో వచ్చే మూడు నెలలకు సరిపడా రూ.117.10 కోట్ల విలువైన మందులు, సర్జికల్స్ నిల్వ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో మందుల కొరత అంటూ రామోజీరావు కథనాలు ప్రచురించడం ప్రభుత్వ వైద్య రంగం పట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలనే కుట్రకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 229 రకాల మందులు అందుబాటులో ఉండి, ఇతర వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ప్రభుత్వాస్పత్రులకు జనాలు పోటెత్తుతున్నారని ఇదే ఈనాడులో ప్రచురించారు. గతంతో పోలిస్తే గణనీయంగా మందులు, సర్జికల్స్, మానవ వనరులు పెరిగిన సందర్భంలో నేడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని రాతలు రాయడం దిగజారుడుతనానికి నిదర్శనమని వైద్య రంగ నిపుణులు వాపోతున్నారు. బడ్జెట్ గణనీయంగా పెరుగుదల టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ పుష్కలంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2015–18 మధ్య మందుల కోసం రూ. 1080 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ.235.94 కోట్లు చొప్పున రూ.1,315.94 కోట్లు ఖర్చు చేశారు. అదే 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మందుల కోసం రూ.2,229.99 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ. 458.33 కోట్లు వెచ్చించింది. ఇలా 2019–23 మధ్య రూ.2,688.32 కోట్లు ఖర్చు చేశారు. అంటే గత ప్రభుత్వం కన్నా రూ.1372.38 కోట్లు అదనంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వెచ్చించింది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టి వెళ్లిన రూ. 150 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో రూ. 8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 5 వైద్య కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల్లో వసతుల కల్పనతో పాటు పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులను కూడా బలోపేతం చేశారు. గ్రామాల్లో ప్రతి 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటిలోనే 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వైద్య శాఖలో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఇప్పటి వరకు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. -
లెవల్–1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరు
సాక్షి, అమరావతి : ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణ, నివారణకు సీఎం వైఎస్ జగన్ ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వైద్యం కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అన్ని ప్రాంతాల్లో 50 కి.మీ పరిధిలోనే వైద్య సదుపాయాలను కల్పించేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్ను రాష్ట్ర వైద్యశాఖ రూపొందించింది. తొలిదశ కింద.. గుంటూరు జీజీహెచ్లోని క్యాన్సర్ విభాగాన్ని లెవల్–1 సెంటర్గా, కర్నూలు, విశాఖపట్నంలో లెవల్–2 క్యాన్సర్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. రెండో దశలో కాకినాడ, అనంతపురం జీజీహెచ్లలోని విభాగాలను లెవెల్–2 క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధిచేస్తుంది. ఇందుకుగాను రూ.119.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అధునాతన పరికరాల ఏర్పాటు గుంటూరు, కర్నూలు, విశాఖ క్యాన్సర్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తోంది. నాట్కో సహకారంతో గుంటూరు జీజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీ అందించడానికి ఆధునిక వైద్య పరికరాల్లో ఒకటైన లీనియర్ యాక్సిలేటర్ (లినాక్) ఇక్కడ అందుబాటులో ఉంది. దీనిని లెవెల్–1 సెంటర్గా అభివృద్ధి చేపట్టడానికి వీలుగా పెట్ స్కాన్ మిషన్ను సర్కార్ సమకూరుస్తోంది. మరోవైపు.. రూ.120 కోట్లతో కర్నూలులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు వచ్చేనెలలో పూర్తవుతాయి. విశాఖపట్నంలో ఇప్పటికే భవనం అందుబాటులో ఉంది. ఈ రెండు చోట్లకు లినాక్, హెచ్డీఆర్ బ్రాకీ, సీటీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలుకు అధికారులు పర్చేజింగ్ ఆర్డర్లు(పీఓ) ఇచ్చారు. అదే విధంగా.. సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజీ పరికరాల కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పరికరాలను సమకూర్చే ప్రక్రియ పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. అనంతపురం, కాకినాడల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అండగా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు.. టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా.. క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులపైనే మెజారిటీ శాతం ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పన, ఆయా ఆస్పత్రుల బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అలాగే, క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. గత ఏడాది క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం పథకం కింద ఏటా రూ.600 కోట్లు ఖర్చుచేశారు. ప్రణాళికాబద్ధంగా క్యాన్సర్కు కళ్లెం క్యాన్సర్కు వైద్యం, వ్యాధి నియంత్రణ చర్యల విషయంలో ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే ఇందుకు మెరుగైన వైద్యం అందాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించాం. ఈ ఏడాది ఆఖరుకు లెవల్–1 సెంటర్గా గుంటూరు.. లెవల్–2 కేంద్రాలుగా కర్నూలు, విశాఖపట్నం క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. మరోవైపు.. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్ను ప్రారంభించాం. దీని పరిధిలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులను తీసుకొచ్చి చికిత్స విషయంలో నిర్దేశిత ప్రొటోకాల్స్ను పాటించేలా చూస్తున్నాం. క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించాం. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ -
ఖాళీలు కనపడొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంకానున్న ఐదు కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని సీఎం పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య శాఖలో పోస్టుల భర్తీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇతర కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్షించిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఐఏఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు భర్తీ.. ప్రభుత్వాస్పత్రులను వేధించే ప్రధాన సమస్య మానవ వనరుల కొరత. దీనికి చెక్ పెట్టేలా ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టాం. ఈ నియామకాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుండాలి. ఎప్పటికప్పుడు ఖాళీ అయిన పోస్టులను గుర్తించి భర్తీ చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలి. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఏదైనా పోస్టు ఖాళీ అయితే నాలుగు వారాల్లో భర్తీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులపై ట్రాకింగ్ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలి. అప్పుడే ప్రివెంటివ్ కేర్లో ఆశించిన లక్ష్యాలను సాధించగలం. కార్యక్రమం అమలులో పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్ల పాత్ర ఎంతో కీలకం. మధుమేహం, రక్తపోటు, ఇతర నాన్ కమ్యూనికబుల్, కమ్యూనికబుల్ జబ్బుల బాధితులకు మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్ వద్ద వీరికి చికిత్స అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. విలేజ్ క్లినిక్ల స్థాయిలో కంటి పరీక్షలు చేపట్టాలి. క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. టీబీ నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయడం ద్వారా బాధితులను గుర్తించాలి. వారికి మంచి చికిత్స అందించే దిశగా అడుగులు వేయాలి. క్యూ ఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత పొందిన కుటుంబాల్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ కార్డులు అందజేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టాలి. సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి చోటా ఫోన్ నంబర్లు ప్రదర్శించాలి. వాటిని సకాలంలో పరిష్కరించాలి. 1.39 కోట్ల మందికి ఫ్యామిలీ డాక్టర్ సేవలు గతేడాది అక్టోబర్ 22 నుంచి ఇప్పటివరకు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 1,39,97,189 మందికి సేవలందించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 35,79,569 మంది రక్తపోటు, 24,31,934 మంది మధుమేహం బాధితులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సీహెచ్వో) శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ ఎయిడ్, పాముకాటు, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. సికిల్సెల్ అనీమియా నివారణలో భాగంగా ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దంత వైద్యులు ప్రతినెలా పీహెచ్సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టీబీ నివారణపైనా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరో 3 మెడికల్ కాలేజీలు.. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నందా్యలలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 కొత్త వైద్య కళాశాలలు పాడేరు, పులివెందుల, ఆదోనిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన కళాశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రఘురామరెడ్డి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి, డీఎంఈ నరసింహం పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రతిష్టకు ఆస్పత్రులు వన్నెతేవాలి
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యరంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తానికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు బాగుండాలని సీఎం జగన్ ఆశిస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె మంగళవారం మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగైదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించాలని సూచించారు. రోగి ఆస్పత్రిలో వైద్యం పొందాక డిశ్చార్జి అయినప్పుడు సంతోషంతో ఇంటికి వెళ్లాలని, సేవల పట్ల సంతృప్తి వ్యక్తపరచాలని చెప్పారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ లేనిదీ అధికారులు తరచూ చూడాలని చెప్పారు. తనిఖీల్లో అవకతవకలు వెలుగు చూస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల్లో పింక్ కలర్ కర్టెన్లు ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళా వార్డుల వద్ద క్లోజ్డ్ డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని, పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ నిధులతో, సీఎస్ఆర్ సహకారాన్ని తీసుకుని, 16 బోధనాస్పత్రుల్లో ఇన్సినిరేటర్స్ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్చార్జీలను రూ.80కి పెంచిన నేపథ్యంలో మెనూలో మార్పు రావాలన్నారు. గిరిజన ప్రాంతాలు, ఒడిశాకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు విశాఖ, విజయనగరం ఆస్పత్రుల్లో మహాప్రస్థానం వాహనాలను పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీటీ, ఎమ్మారై యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలన్నారు. ఈవెనింగ్ క్లినిక్లను బోధనాస్పత్రుల్లో పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ఉదయం ఓపీలకు హాజరైన రోగుల వైద్యపరీక్షల ఫలితాల పరిశీలన, ఇతర సేవలను ఈవెనింగ్ క్లినిక్లలో అందించాలని ఆమె సూచించారు. డీఎంఈ డాక్టర్ నరసింహం పాల్గొన్నారు. -
‘Andhra Pradesh: ఉన్నత’ వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో 48 వేలకుపైగా వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ఒక్కో ఆస్పత్రిని యూనిట్గా తీసుకుని క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో మానవ వనరులపై ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల పురోగతి, కరోనా తాజా పరిస్థితులను పరిశీలించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిబ్బందిపై ప్రతి సమీక్షలోనూ వివరాలివ్వాలి.. ప్రభుత్వాస్పత్రులను నాడు – నేడు ద్వారా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడింది. రోగుల తాకిడికి సరిపడా నియామకాలను చేపడితే సగం సమస్యలకు తెర పడుతుంది. మానవ వనరులపై ఆడిట్ నిర్వహించిన అనంతరం గుర్తించిన ఖాళీలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు మందులు సరిపడా స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి సమీక్షలోనూ నాకు వివరాలు అందచేయాలి. పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్పీసీ) అత్యంత పకడ్బందీగా అమలు కావాలి. నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) మేరకు వైద్యులు గ్రామానికి వెళ్లి సేవలు అందించాలి. జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ ఫలానా గ్రామానికి ఫలానా రోజు వస్తారనే వివరాలను ముందుగానే వెల్లడించాలి. ఆయా తేదీల్లో గ్రామానికి డాక్టర్ వస్తున్నట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలందరికీ తెలియచేయాలి. దీనివల్ల డాక్టర్ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందగలుగుతారు. ఎఫ్పీసీని మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేలా జిల్లాల్లో సమర్థులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. రక్తహీనత నివారణ.. నేత్ర పరీక్షలు గర్భిణులు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్త హీనతతో బాధపడే గర్భిణులను గుర్తించి తప్పనిసరిగా పౌష్టికాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈమేరకు కంటి డాక్టర్లకు షెడ్యూల్ రూపొందించి నెల, రెండు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయాలి. దృష్టి సంబంధిత సమస్యలున్న వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. ఎమర్జెన్సీ సీపీఆర్పై శిక్షణ విలేజ్ క్లినిక్లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (సీహెచ్వో) విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కరిక్యులమ్ను సిద్ధం చేయాలి. సీహెచ్వోలకు సరఫరా చేసే వైద్య పరికరాల వినియోగంపై బోధనాసుపత్రుల్లో శిక్షణ ఇవ్వాలి. వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో సమీక్షించాలి. దంత సంరక్షణ, ఈఎన్టీ, వృద్ధాప్య సమస్యలతోపాటు సీపీఆర్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వైద్య సేవలు అందించాలో శిక్షణ ఇప్పించాలి. వీటితోపాటు గ్రామాల్లో పాము కాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా శిక్షణ ఉండాలి. 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఏకంగా మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు. 2023–24 విద్యాసంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2024–25లో మరో 350 మెడికల్ సీట్లు అదనంగా రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 1,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 23 రోజుల్లో 20.25 లక్షల మందికి వైద్య సేవలు ఏప్రిల్ 6వతేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా గత నెల 28 నాటికి గ్రామాల్లో 20,25,903 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రక్తపోటుతో 4.86 లక్షల మంది, మధుమేహంతో 2.70 లక్షల మంది బాధ పడుతుండగా 4.43 లక్షల మంది ఈ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్యం, మందులు అందజేస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్ బాధితులు 4,649 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 1,761 మంది, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 7,042 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. పూర్తిగా అదుపులో కోవిడ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి దేశంలో 23వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 24 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లో 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు పని చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టుల్లో టెస్టులు చేస్తున్నామని, మందులు, మాస్క్లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, ఎండీ మురళీధర్రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో మెరుగైన వైద్య సేవలు
-
హరీష్ రావును అభినందిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సాక్షిలో ‘సర్కార్ సర్జరీ.. సూపర్’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త క్లిప్ను ట్విటర్లో షేర్ చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణమని కొనియాడారు. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద1539 కిడ్నీ, 51 కాలేయ మార్పిడి సర్జరీలు జరిగినట్లు తెలిపారు. హార్ట్ ట్రాన్స్ప్లంట్ జరగడం.. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లంట్ సెంటర్ ఏర్పాటు అదే విధంగా బేరియాట్రిక్ సర్జరీలు కూడా చేయడం అభనందనీయమన్నారు. ఇందుకు కృషి చేస్తున్న మంత్రి హరీష్రావు, వైద్య బృందానికి అభినందనలు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణం 👏 1539 కిడ్నీ, 51 లివర్, హార్ట్ Transplants జరగడం, State Organ Transplant Centre ఏర్పాటు అదే విధంగా Bariatric surgeries కూడా చెయ్యడం… https://t.co/NBDNQAmVJI pic.twitter.com/S9MClqz6X9 — KTR (@KTRBRS) March 12, 2023 -
సర్కార్ సర్జరీ సూపర్.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం
సాక్షి హైదరాబాద్ : భాగ్యనగరంలోని ప్రభుత్వాస్పత్రులు ఆధునిక చికిత్సలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా’కు అనే స్థాయి నుంచి ‘పోదాం పద సర్కారు దవాఖానాకు’ అనే దశకు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా క్లిష్టమైన ఆపరేషన్లను సైతం చేస్తూ రోగులకు పునర్జన్మనిస్తున్నాయి. నిష్ణాతులైన వైద్య బృందాలతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కొంతకాలంగా అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఉస్మానియా, గాందీల్లో పూర్తి ఉచితంగా నిమ్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా తక్కువ మొత్తంలో ఆపరే షన్లు చేస్తున్నారు. కుటుంబసభ్యుల అవయవదానం, జీవన్దాన్ ద్వారా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వాటిల్లో కొన్నింటిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 8 నెలల చిన్నారికి అరుదైన వైద్యం జగిత్యాల జిల్లాకు చెందిన నారాయణ, ప్రేమలత దంపతులది మేనరిక వివాహం. వారి 8 నెలల పాప నిస్ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో నిలోఫర్కు వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే నాలుగోది కాగా, భారత్లో మొదటిదని వైద్యులు తెలిపారు. లక్షలు ఖరీదుచేసే ఆపరేషన్ను రూపాయి కూడా తీసుకోకుండా 28 మంది వైద్యులు దాదాపు 18 గంటలపాటు సర్జరీ పూర్తి చేసి తమ పాపకు మళ్లీ జీవం పోశారని ఆ చిన్నారి తల్లి పేర్కొంది. 2 నెలల్లో 70 కిలోలు తగ్గింపు గుడిమల్కాపూర్కు చెందిన శివరాజ్సింగ్ కుమారుడు మునీందర్సింగ్ ఐదేళ్ల ప్రాయం నుంచి అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నాడు. 23 ఏళ్లకు దాదాపు 220 కిలోలతో నడవలేని స్థితికి చేరాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియాలో చేర్పించారు. చిన్నతనం నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తోపాటు శ్వాస సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. 2 నెలల్లోనే దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. ‘నన్ను చూసి చాలా మంది హేళన చేసేవారు. ఉచితంగా సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు’అని మునీందర్సింగ్ సంతోషంగా చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో.. బోరబండకు చెందిన మల్లెల వాణి కాలేయంలో కుడివైపు పెద్ద కణితితో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతాయనడంతో ఆమె ఉస్మానియాకు వెళ్లింది. సాధారణంగా ఎడమ వైపు కణితి ఏర్పడే అవకాశం ఉండగా వాణికి కుడివైపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేయడంతో రోగి వారంలోనే కోలుకుంది. ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రోజువారీ పని చేసుకుంటూ జీవిస్తున్న తనకు ఆపరేషన్ ఉచితంగా చేయడం పూర్వజన్మ సుకృతమని వాణి పేర్కొంది. ఆరోగ్యశ్రీతో గుండె మార్పిడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు కుమారుడు వరుణ్తేజ్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఆ స్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వరుణ్తేజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్కు వస్తే ఆపరేషన్ చేస్తామనడంతో కుటుంబసభ్యులు వరుణ్ను తీసుకెళ్లారు. ఒక్కరోజుకే అక్కడ రూ.10 వేలు ఖర్చవడంతో బంధువుల సలహా మేరకు వారు నిమ్స్ను ఆశ్రయించారు. కార్డియో థొరాసిక్ విభాగం వైద్యులు వరుణ్తేజ్కు ఆరోగ్యశ్రీ కింద గత నెల 28న గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశామని నిమ్స్ సీటీ సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ అమరే‹శ్ మాలెంపాటి తెలిపారు. ఒకే నెలలో 15 కిడ్నీల మార్పిడి దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా యురాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాలను మంత్రి హరీశ్రావు ఇటీవలే అభినందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కిడ్నీ మార్పిళ్లు 839 (నిమ్స్), 700 (ఉస్మానియా) కాలేయ మార్పిళ్లు 25 (నిమ్స్), 26 (ఉస్మానియా) జరిగాయి. నిమ్స్లో గుండె (10), ఊపిరితిత్తుల మార్పిడి (01) శస్త్రచికిత్సలు జరిగాయి. దక్షిణాదిలోకెల్లా రికార్డు.. స్కోలియోసిస్ (గూని)తో ఇబ్బంది పడేవారికి చేసే వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టమైనది. సుమారు 12–14 గంటలు పడుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ రోగి రెండు కాళ్లు చచ్చుబడే ప్రమాదముంటుంది. నిమ్స్లో మూడేళ్లుగా 200 మందికి ఈ సర్జరీలు చేశారు. గత ఏడాదిలో ఏకంగా 80 సర్జరీలు నిర్వహించి దక్షిణాదిలో రికార్డు సొంతం చేసుకుందని ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగేష్ తెలిపారు. నిజాం కాలంలో బొక్కల దవాఖానా (ఆర్థోపెడిక్)గా ప్రారంభమైన నిమ్స్ నేడు వేర్వేరు సర్జరీలకు వేదికైందన్నారు. ఏడాదికి హిప్, నీ రీ ప్లేస్మెంట్లు 350, వెన్నెముక 80, ట్రామా 3వేలు, ఆంకాలజీ 60 చొప్పున సర్జరీలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోందని నాగేశ్ తెలిపారు. 18 గంటలపాటు శ్రమించి.. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య (61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్. ఏడాది క్రితం కాళ్లు, చేతులు వాచిపోవడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. సత్యమయ్యకు హెపటైటీస్ బి, లివర్ సిర్రోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలన్నారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్డెడ్ అవడంతో అవయవదానానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. గాందీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ గాందీలో రూ.35 కోట్లతో స్టేట్ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 4 ఆత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, స్టెప్డౌన్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒకేచోట గుండె, మూత్రపిండాలు, తుంటి, కీళ్ల మార్పిడి, ఊపిరితిత్తులు, కాలేయం శస్త్రచికిత్సలు, కాక్లియర్ వంటి కృత్రిమ అవయవాల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రెండోదశలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం. –ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
డాక్టర్లు, సిబ్బంది ఖాతాలకే ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల్లో నాణ్యతను మరింతగా పెంపొందించడంపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) సొమ్మును నేరుగా వైద్యులు, వైద్య సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావులేకుండా పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, అన్ని ప్రభుత్వాస్పత్రులను నెట్వర్క్ ఆస్పత్రులుగా నోటిఫై చేయడం వంటి ప్రభుత్వ చర్యలతో ఆరోగ్యశ్రీ సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు భారీగా పెరిగాయి. మొత్తం క్లెయిమ్లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని ఇంకా పెంచడం ద్వారా ప్రభుత్వాస్పత్రులకు ఎక్కువ నిధులు రాబట్టి, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రోత్సాహకాల జమలోనూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద ఒక ఆపరేషన్ చేస్తే.. దానికి వచ్చే క్లెయిమ్ మొత్తంలో 25 శాతం ప్రోత్సాహకం కింద హెల్త్ కేర్ స్టాఫ్కు వస్తుంది. ఈ మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కేటాయిస్తారు. ఇప్పటివరకూ ఈ సొమ్మును ఆస్పత్రుల సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉండే ఖాతాల్లో జమ చేస్తున్నారు. అనంతరం వాటిని వైద్యులు, సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంలో కాలయాపన జరుగుతోంది. దీంతో నేరుగా, వైత్యులు, సిబ్బంది ఖాతాల్లోనే ఈ సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది బ్యాంక్ ఖాతాల వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల నుంచి డీఎంఈలో ప్రారంభం ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు నేరుగా సిబ్బంది ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ఈ నెల నుంచి డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తున్నాం. అనంతరం ఏపీవీవీపీ ఆస్పత్రులకూ విస్తరిస్తాం. జనవరి వరకు పాత విధానంలో చెల్లింపులు ఉంటాయి. ఏ నెలకు ఆ నెల ప్రోత్సాహకాలు నేరుగా వ్యక్తిగత ఖాతాల్లో ట్రస్టు నుంచి జమ అవుతాయి. ఈ విధానంతో వైద్యులు, సిబ్బందిలో నూతనోత్తేజం వస్తుందని భావిస్తున్నాం. తద్వారా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. – డాక్టర్ వినోద్కుమార్, డీఎంఈ -
అమ్మ పాలకూ బ్యాంక్
అమ్మ పాలు అమృతం కంటే విలువైనవి. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు అద్భుతమైన ఔషధంలా పని చేస్తాయి. మరో విషయం ఏమంటే.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు కలుగుతుంది. తల్లి పాల నుంచి బిడ్డకు విటమిన్లు, ప్రొటీన్లు లభించడమే కాకుండా.. తల్లి స్పర్శ, వాత్సల్యపూరిత ఆలింగనం వల్ల బిడ్డ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో భరోసా కలుగుతుంది. అంత గొప్ప విశిష్టత కలిగిన తల్లి పాలకు కొందరు బిడ్డలు దూరం కావాల్సి వస్తోంది. తల్లి పాలు దొరక్క నవజాత శిశువులు అక్కడక్కడ మరణిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కాకినాడ జీజీహెచ్లో తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు కాబోతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఇప్పుడు అంతకంటే గొప్ప దానం మరొకటి రాబోతోంది. అదే తల్లి పాల దానం చేయవచ్చు. తల్లి పాలు దానం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఔను.. తల్లి పాలను సైతం ఇకనుంచి దానం చేయొచ్చు. తల్లి పాలకు దూరమైన బిడ్డలకు ప్రాణ భిక్ష, ఆరోగ్య భిక్ష కల్పించవచ్చు. రక్తదానం మాదిరిగా అమ్మ పాలను దానంగా స్వీకరించి నిల్వ చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ‘మదర్ మిల్క్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) పీడియాట్రిక్ విభాగం పైఅంతస్తులో 8 గదులతో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘సుశేణ హెల్త్ ఫౌండేషన్’ మధ్య ఇందుకు సంబంధించి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్కుమార్ దేశంలోనే 8వ మదర్ మిల్క్ బ్యాంక్ను ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫౌండేషన్ రూ.కోటితో మూడు విడతల్లో దీని నిర్మాణం చేపడుతోంది. తల్లి పాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం. వీటి ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల కొందరు.. శరీరాకృతి మారిపోతుందనే అపోహతో మరికొందరు.. తల్లి పాలు రాక ఇంకొందరు పిల్లలు చనుబాలకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా పోత పాలతో బిడ్డ ఆకలి తీరుస్తుండటం వల్ల బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తున్నాయి. తల్లి నుంచి పాలు సేకరిస్తున్న దృశ్యం (ఫైల్) బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను.. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా ప్రసవాలు జరిగే టాప్–5లో ఉన్న కాకినాడ జీజీహెచ్ను ‘సుశేణ’ హెల్త్ ఫౌండేషన్ ఎంపిక చేసుకుంది. నవజాత శిశువు నుంచి రెండేళ్ల బిడ్డ వరకు ఈ బ్యాంక్లో పాలు ఇస్తారు. తల్లి బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను సేకరించి అవసరమైన పిల్లలకు అందిస్తారు. హెచ్ఐవీ, వీడీఆర్ఎల్ (వెనెరియల్ డిసీజ్ రీసెర్చ్ లేబొరేటరీ టెస్ట్), హెపటైటిస్ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే తల్లి పాలు తీసుకుంటారు. కాగా, ఇక్కడ తల్లుల చనుబాల పరిమాణం పెంచేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. మసాజ్ థెరఫీ, న్యూట్రిషనల్ ట్రీట్మెంట్ (పోషకాలతో కూడిన వైద్యం), మదర్కేర్ (బిడ్డను హత్తుకుని పాలిచ్చే) తరహాలో తల్లులకు బిడ్డలను కనీసం గంటపాటు హత్తుకుని ఉండేటట్టు ఈ బ్యాంక్లోని ప్రత్యేక వార్డులో నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా ఈ బ్యాంక్లో రెండు, మూడు రోజులు ఉంచి తల్లులకు అవగాహన వచ్చాక ఇంటి వద్ద ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించి పంపేస్తారు. స్వచ్ఛంద దాతలు జీజీహెచ్ మిల్క్ బ్యాంక్కు వచ్చి పాలు దానం చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితం. తొలి దశలో సేకరించిన పాలను నిల్వ చేయకుండా వెంటనే అవసరమైన శిశువులకు పట్టిస్తారు. రెండో దశలో పాలను నిల్వ చేస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు వాటిని పాడవకుండా భద్రపరుస్తారు. ఇందుకు ప్రత్యేక యంత్రాలు జీజీహెచ్లో సిద్ధమయ్యాయి. తొలి దశ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో మిల్క్ పాశ్చరైజేషన్ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏపీలో తొలి బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకున్నాం. రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడ జీజీహెచ్లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంతో ఇటీవలనే ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమవుతోంది. – రమేష్ లక్కర్సు, కన్సల్టెంట్ ప్రోగ్రాం మేనేజర్, సుశేణ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి విస్తృతం చేస్తాం ఈ సేవలను విస్తృతం చేసేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం. మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు జీజీహెచ్లో పరిస్థితులు ఉండటంతో సుశేణ ఫౌండేషన్ ముందుకొచ్చింది. – డాక్టర్ హేమలతాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ శిశువుల ప్రాణాలకు రక్ష కాకినాడ జీజీహెచ్లో ప్రతి నెలా 700 నుంచి 800 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుడుతున్న నవజాత శిశువుల సంఖ్య 75 నుంచి 85 మధ్య ఉంటుంది. కిలో కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారు 10 మంది ఉంటున్నారు. ఈ బ్యాంక్ శిశువుల ప్రాణ రక్షణకు తోడ్పడుతుంది. – ఎంఎస్ రాజు, హెచ్వోడీ, పీడియాట్రిక్, జీజీహెచ్, కాకినాడ -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4.83 కోట్ల ఓపీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022 తెలిపింది. 2021లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ 4.23 కోట్లుగా నమోదవగా 2022లో అది 4.83 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అలాగే 2021లో ఇన్–పేషెంట్ (ఐపీ) సేవలు 14.16 లక్షలుగా ఉండగా 2022లో అవి 16.97 లక్షలకు పెరిగాయని పేర్కొంది. 2021లో 2.57 లక్షలు జరగ్గా 2022 నాటికి సర్జరీల సంఖ్య 3.04 లక్షలకు పెరిగిందని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు... ►2022లో ఒకేసారి 8 వైద్య కాలేజీల ప్రారంభం. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభించే పనులు. గతేడాది అదనంగా 200 పీజీ సీట్లు. ►ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలో మొదటి స్థానం... లక్ష జనాభాకు ఏడు పీజీ మెడికల్ సీట్లతో దేశంలో రెండో స్థానం. ►మాతృత్వ మరణాల రేటు 56 నుంచి 43కు (జాతీయ సగటు 97) తగ్గుదల. ►శిశుమరణాల రేటు జాతీయ స్థాయిలో 28 ఉండగా రాష్ట్రంలో 21. ►సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 8,200 పడకలు అందుబాటులోకి తెచ్చేలా పనులు ప్రారంభం. ►గతేడాది 515 డయాలసిస్ పరికరాలతో 61 కొత్త డయాలసిస్ కేంద్రాలు మంజూరు. గతేడాది 50 లక్షలు దాటిన డయాలసిస్ సెషన్స్ సంఖ్య. ►కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ మొదటి దశలో భాగంగా 9 జిల్లాల్లో పంపిణీ ప్రారంభం. ►కంటివెలుగు రెండో దశ ప్రారంభం. ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 శాతంగా ఉన్న ప్రసవాల రేటు ఇప్పుడు 61 శాతానికి పెరుగుదల. ►గతేడాది జరిగిన 5.40 లక్షల ప్రసవాల్లో 61 శాతం అంటే 3.27 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహణ. ►ఇన్ఫెక్షన్ల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు. ►రోగాలను ముందే గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహణ. బీపీ, షుగర్ రోగులకు కిట్లు అందజేత. ►కరోనా బూస్టర్ డోసు పంపిణీ 47 శాతం (జాతీయ సగటు 23 శాతం) పూర్తి. ►ఇప్పటివరకు 11 వేల కొత్త పడకలు అందుబాటులోకి వచ్చాయి. 27,500 పడకలకు ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాటు. ►డైట్ చార్జీలు రూ. 40 నుంచి రూ. 80కి పెంపు. ►రోగి సహాయకుల కోసం 18 పెద్దాసుపత్రుల్లో రూ. 5కే భోజన పథకం ప్రారంభం. -
Andhra Pradesh: క్వాలిటీ వైద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. ఇందులో భాగంగానే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద ఆస్పత్రుల బలోపేతానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తద్వారా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం’ అని మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం సందర్భంగా 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలకు కార్యరూపం ఇస్తూ అడుగులు ముందుకు వేశారు. ఫలితంగా మన రాష్ట్రంలోని అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాష్) గుర్తింపు దక్కింది. ఏకంగా 443 ప్రభుత్వాస్పత్రులకు ఎన్క్వాష్ గుర్తింపుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 209 ఆస్పత్రులతో రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో కేరళ (134), నాలుగో స్థానంలో హరియాణ (121), ఐదో స్థానంలో తెలంగాణ (114) ఉన్నాయి. ఎన్క్వాష్ అంటే.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016 నుంచి అత్యున్నత ప్రమాణాలతో రోగులకు నాణ్యమైన సేవలందించే ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాష్) గుర్తింపు ఇవ్వడం ప్రారంభించింది. ఆస్పత్రిలోకి రోగి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని బయటకు వెళ్లేంత వరకు అన్ని స్థాయిల్లో సదుపాయాల కల్పనను పరిగణనలోకి తీసుకుంటారు. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రు(డీహెచ్)లకు ఎన్క్వాష్ గుర్తింపు ఇస్తారు. పీహెచ్సీల్లో 6 విభాగాల్లో 1,600 రకాల అంశాలను.. ఏరియా, సీహెచ్సీ, డీహెచ్లలో 18 విభాగాల్లో 6,625 అంశాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు రోగి సింక్ వద్దకు వెళ్లి చేతులు కడుక్కునే తీరు, ఆహారం తీసుకునే విధానం, వారికి మందులు ఇచ్చే విధానం తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తారు. ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోసిŠట్క్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 70 శాతానికి పైగా పాయింట్లు సాధించిన ఆస్పత్రులకు ఎన్క్వాష్ గుర్తింపు ఇస్తారు. అప్పట్లో 26 ఆస్పత్రులకే ఎన్క్వాష్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నామ మాత్రంగా కేవలం 26 ఆస్పత్రులకు మాత్రమే ఎన్క్వాష్ గుర్తింపు ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకాం చుట్టారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడిచిన మూడున్నరేళ్లలోనే ఏకంగా 417 ఆస్పత్రులకు ఎన్క్వాష్ గుర్తింపు లభించింది. వీటిలో 391 పీహెచ్సీలు, 25 సీహెచ్సీలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి నెలలోగా 200 వరకూ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్లకు ఎన్క్వాష్ గుర్తింపు కోసం వైద్య శాఖ దరఖాస్తు చేయనుంది. కాగా, ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్సీలను అభివృద్ధి చేయడం కోసం రూ.664.96 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు, శిథిలావస్తలో ఉన్న పీహెచ్సీ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్, ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి సైన్ బోర్డులు, రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు, మరుగుదొడ్లు, ఆస్పత్రికి వచ్చిన రోగులు కూర్చోవడానికి కుర్చీలు ఇలా అన్ని రకాల వసతులు సమకూరాయి. ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది అనేదానికి గత మూడున్నరేళ్లలో ఏకంగా 391 పీహెచ్సీలకు ఎన్క్వాష్ గుర్తింపు రావడమే నిదర్శనం అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, పలు సూపర్ స్పెషాలిటీ, గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తోంది. మానవ వనరుల కొరతకు చెక్ పెడుతూ వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీ చేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాగా పెరిగారు. ‘లక్ష్య’ గుర్తింపులో రెండో స్థానం మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ప్రసూతి సేవలకుగాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపు విభాగంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంసీహెచ్ వర్క్షాప్లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు ప్రదానం చేసింది. ఆస్పత్రుల్లో ప్రసూతి సేవల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు లక్ష్య గుర్తింపు వస్తుంది. నెలకు వంద, అంత కంటే ఎక్కువ ప్రసవాలు జరిగే ఆస్పత్రులకు ఈ గుర్తింపు పొందడానికి అర్హత ఉంటుంది. కాగా, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్లలో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు ఈ గుర్తింపు ఇస్తారు. మన రాష్ట్రంలో 40 ప్రభుత్వాస్పత్రులకు ఇప్పటి వరకు లక్ష్య గుర్తింపు లభించింది. ఎన్క్వాష్, లక్ష్య ఇతర కేంద్ర వైద్య శాఖ ఇచ్చే గుర్తింపు పొందిన ఆస్పత్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభిస్తాయి. ఆస్పత్రి వాతావరణంతో రోగి ప్రభావితం ఆస్పత్రుల్లోని వాతావరణం రోగులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ సరిగా ఉండదు. వసతుల కొరత ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు రావడానికి మొగ్గు చూపరు. ఈ క్రమంలో వాటి రూపురేఖలు మార్చడం ద్వారా సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా తయారైన ఆస్పత్రులన్నీ ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా తయారవుతున్నాయి. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తగ్గుతుంది. శుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం రోగులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. – డాక్టర్ యాదల అశోక్బాబు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రత్యేకాధికారి విలేజ్ క్లినిక్లకూ ఎన్క్వాష్ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు నాడు–నేడు కింద ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఎన్క్వాష్ గుర్తింపు కలిగిన ఆస్పత్రులు మన రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లకు కూడా ఎన్క్వాష్ గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం 10,032 విలేజ్ క్లినిక్లు నెలకొల్పింది. దశల వారీగా వీటికి ఎన్క్వాష్ కోసం దరఖాస్తు చేస్తున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఎన్క్వాష్ గుర్తింపు సంవత్సరం ఆస్పత్రులు 2017–18 4 2018–19 22 2019–20 46 2020–21 కరోనా కారణంగా సర్టిఫికేషన్ ప్రక్రియ ఆపేశారు 2021–22 306 2022–23 65 (మరో 23 ఆస్పత్రులకు అసెస్మెంట్ పూర్తి. ఫలితాలు రావాల్సి ఉంది.) ––––––––– -
ఇక పక్కాగా ఇన్ఫెక్షన్ల కట్టడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన మ్యాన్యువల్ను విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రి రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు తోడ్పడతాయని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, ఇటీవల మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు ఇన్ఫెక్షన్కు గురై మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, రోగుల చికిత్సలకు ఉపయోగించే పరికరాలను స్టెరిలైజ్ చేయడం, పీపీఈ కిట్లు వాడటం, లాండ్రీ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి చేయడం వంటివి చేపట్టాలని మార్గదర్శకాల్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమైన మార్గదర్శకాలు... ►రోగుల మూత్ర నమూనాలు, ఆసుపత్రుల్లోని నీటి నమూనాలు, వెంటిలేటర్లపై ఉన్న రోగుల మందుల నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబ్లో పరీక్షించి వాటి ఫలితాలపై ఆసుపత్రి అంటువ్యాధుల నియంత్రణ కమిటీ తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ►రోగులకు అందించే ఆహారాన్ని ప్రతి 4 నెలలకోసారి పరీక్షించాలి. ►తాగునీటిలో ఉండే బ్యాక్టీరియాపై నెలవారీ నిఘా చేపట్టాలి. పేషెంట్ కేర్ యూనిట్లు, హాస్పిటల్ కిచెన్, క్యాంటీన్లు, హాస్టళ్ల నుంచి ల్యాబ్లో ప్రతి నెలా ఒకసారి తాగునీటి పరీక్ష నిర్వహించాలి. ►వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులకు చేతి శుభ్రత శిక్షణా కార్యక్రమాన్ని నెలకోసారి తప్పనిసరిగా నిర్వహించాలి. ►బయో వ్యర్థాల నిర్వహణ, పారబోత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. సెంట్రల్ స్టోరేజీ ఏరియాలో బయోమెడికల్ వ్యర్థాలను నిల్వ చేయడానికి సురక్షితమైన, వెంటిలేషన్ ఉన్న ప్రాంతం కేటాయించాలి. ఆయా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ►అంటువ్యాధుల తీవ్రత ఉన్నప్పుడు రోగులు, సిబ్బంది, సందర్శకుల రాకపోకలను తగ్గించాలి. రోగులను ఐసోలేషన్లో ఉంచాలి. వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. ►అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్న సమయంలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. ►ఒకేసారి అవుట్బ్రేక్ జరిగితే వ్యాప్తిని గుర్తించి ప్రమాదంలో ఉన్నవారెవరో తెలుసుకోవాలి. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే మందులు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మందులు ఎట్టి పరిస్థితు ల్లోనూ బయటకు రాయ కూడదని, డిశ్చార్జి అయిన రోగు లకు ప్రభుత్వ ఆసు పత్రుల్లోనే మందులు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి అవస రమైన మందులు ఆసుపత్రు లకు సకాలంలో అందించాలన్నా రు. సోమవా రం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధి లోని ఆసు పత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన 56 టిఫా స్కానింగ్ సేవలు గర్బిణులకు అందేలా చూడాలని సూచించారు. సి సెక్షన్ల శాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కు వగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. అనవసర సి సెక్షన్ల వల్ల కలిగే నష్టాన్ని కౌన్సెలింగ్ ద్వారా వివరించాలన్నారు. సి సెక్షన్ లేదా సాధా రణ డెలివరీ చేయాలా వద్దా అనేది పూర్తిగా డాక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలని ఆయన చెప్పారు. డైట్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది రోగు లు, వారి సహాయకులతో మర్యాదగా ప్రవర్తించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement