-
దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని 2023 సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ ఏడాదికిగానూ పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాకుండా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశిష్ట సేవలు అందించారని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ ఉదయం 10:30 కు పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళామందిరం లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేస్తామని, 25 వేల రూపాయల నగదు, శాలువా,జ్ఞాపికతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు. -
బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!
మన ఎదుగుదలకు ఇంత ఇచ్చిన సమాజానికి తిరిగి మనమేమి ఇస్తున్నాం? అన్న దృక్పథం నుంచి పుట్టిన సంస్థాగత కర్తవ్యమే కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్సార్). అలాంటి వ్యక్తిగత భావన మనిషి ఉత్కృష్ట ఆలోచన, ఉదారత నుంచి పుట్టే వితరణ. కానీ, కార్పొరేట్లకు ఇది వితరణశీలత మాత్రమే కాదు... సమాజంపట్ల వారి బాధ్యత! కానీ జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. కంపెనీల సీఎస్సార్ వ్యయానికి సంబంధించిన నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. చిత్తశుద్ధితో స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడమే నిజంగా కావాల్సింది! కార్పొరేట్ల సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ–సీఎస్సార్) ఒట్టి నినాదం కాకుండా దేశంలో దీన్ని చట్టబద్ధం చేసి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు! కంపెనీ చట్టం సెక్షన్ 135 ప్రకారం నిర్దిష్ట పెట్టుబడి, లావాదేవీలు, లాభం కలిగిన దేశంలోని కంపెనీలన్నీ వాటి వార్షిక నికర లాభంలో 2 శాతం నిధుల్ని ఏటా సీఎస్సార్ కింద కచ్చితంగా వ్యయం చేయాలి. రూ. 500 కోట్ల నికర విలువ కలిగిన, లేదా ఏటా రూ. 1,000 కోట్ల లావాదేవీలు జరిపిన, లేదా ఏటా రూ. 5 కోట్ల లాభాలార్జించిన కంపెనీలన్నీ ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్లు ఉమ్మడిగా పనిచేస్తే సమ్మిళిత ప్రగతికి ఆస్కారం ఉంటుందన్న నమ్మకమే దీనికి పునాది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఆచరణలోకి వచ్చిన ఈ విధానంతో... నిజంగా సాధించిందేమిటని వెనక్కి చూసుకుంటే, గొప్ప ఆశావహ వాతావరణమేమీ కనిపించదు. ఇందుకు కారణాలనేకం! దీన్నొక తంతుగా కొంత డబ్బు వెచ్చించి చేతులు దులుపుకొంటున్నాయి తప్ప సమాజ హితంలో ఏ మేర పాత్ర వహిస్తున్నామన్న సోయితో చేయ ట్లేదు. కొన్ని కార్పొరేట్లయితే వ్యయమే చేయట్లేదు. ఇంకొన్ని తమ వ్యాపార వృద్ధికే తప్ప సమాజం కోసం వ్యయం చేయట్లేదు. మరికొన్ని ఈ నిధుల వ్యయం కోసం సొంతంగా ట్రస్టులు, ఫౌండేషన్లు స్థాపించి మొక్కు బడిగా నిర్వహిస్తున్నాయి. ఇంకొందరైతే బోగస్ సంస్థలతో చేతులు కలిపి లెక్కలు మాత్రమే చూపించి, ఇరువురూ సీఎస్సార్ నిధుల్ని నొక్కేస్తున్నారు. అలా అని, సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న కార్పొరేట్లు అసలు లేవని కాదు, కానీ, వాటి సంఖ్య పరిమితం! నివేదిక కోరిన స్థాయీ సంఘం వివిధ విభాగాల్లోని పదేసి అగ్ర కంపెనీల సీఎస్సార్ వ్యయానికి సంబంధించిన సమగ్ర నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఇటీవలే ఆదేశించింది. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ, ఎంతేసి వ్యయం చేశారో చూపాలని పేర్కొంది. అభివృద్ధి చెందిన చోటనే తూతూ మంత్రంగా వెచ్చించడం కాకుండా, నిజంగా అవసరం ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో ప్రగతి సమతూకం సాధించాలన్నది ఇందుకు ఉద్దేశించిన లక్ష్యాల్లో ఒకటి! సీఎస్సార్ వ్యయంపై ఆయా కంపెనీలిచ్చే నివేదికల్లో సమాచారం అసమగ్రంగా ఉందనీ, వాటిపై నిఘా, నియంత్రణ వ్యవస్థ కూడా సరిగా లేదనీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. మైనింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ తదితర కీలక రంగాల్లో సీఎస్సార్ వ్యయాలు స్థానికంగా జరపటం లేదనే విష యాన్ని సంఘం గుర్తించింది. కార్పొరేట్ రంగంలో జరిగే తీవ్రమైన మోసాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) నిర్వహణ సరిగా లేదనీ తప్పుబట్టింది. అసాధారణంగా 60 శాతం పోస్టులు ఖాళీగా ఉండి, దర్యాప్తులు జాప్యమవటం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపు తోందని పేర్కొంది. సత్వరం సరిదిద్దాలని నిర్దేశించింది. గత ఏడేళ్లలో లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు సీఎస్సార్ కింద వ్యయమైనట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ నిరుడు పార్లమెంటుకు తెలిపారు. నిజానికిది నామ మాత్రమే! సగానికి మించి విఫలమే! సీఎస్సార్ నిధుల వ్యయం ద్వారా... విద్య, వైద్యం మెరుగు, ఆకలి, లింగ వివక్ష, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, గ్రామీణా భివృద్ధి, క్రీడాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, బలహీన వర్గాల సంక్షేమం– నైపుణ్యాల శిక్షణ వంటి పది లక్ష్యాల్ని నిర్దేశించారు. ఆయా అంశాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నిధుల్ని వ్యయం చేయవచ్చు. తగు ప్రాజెక్టుల్ని రూపొందించి, సొంతంగా ఏర్పరచుకున్న విభాగాల ద్వారానో, విశ్వసనీయత కలిగిన మూడో పక్ష ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతోనో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కానీ, దేశంలో వంద అతి పెద్ద కార్పొరేట్లలో 52 నిర్దేశించిన సీఎస్సార్ నిధుల్ని వ్యయం చేయలేదని ప్రపంచ స్థాయి అంచనాలు, అధ్యయన సంస్థ కేపీఎమ్జీ తాజా (2019) నివేదిక చెబుతోంది. ఒక్క 2017–18 లోనే పదివేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేయాల్సి ఉండిం దని ‘ప్రైమ్ డాటా గ్రూప్ అనాలిసిస్’ నివేదిక పేర్కొంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. సరైన ప్రాజెక్టులు గుర్తించలేదనో, భాగస్వామ్యానికి విశ్వసనీయ సంస్థలు దొరకలేదనో చెప్పడం కూడా ఓ కుంటి సాకే! ఎందుకంటే, చట్టం అమల్లోకి వచ్చి 8 ఏళ్లవుతోంది. ఈ పనుల నిర్వహణకు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంస్థలు, ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టరై ఉన్నాయి. సీఎస్సార్ కార్యకలాపాలు, నిధుల వ్యయానికి సంబంధించి వివరాల వెల్లడిలో మరింత పార దర్శకత కోసం నిబంధనల్లో ప్రభుత్వం ఇటీవల కొన్ని సవరణలు తెచ్చింది. (క్లిక్: పర్యావరణాన్నే పణంగా పెడదామా?) ఒక సంవత్సరం నిర్దేశించిన మొత్తం నిధుల్ని వ్యయం చేయ కుంటే, తర్వాతి సంవత్సరాలకు బదలాయించడం కాకుండా, కేంద్రం ఇదే అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఒక నిధికి మళ్లించే వ్యవస్థను కూడా కల్పించింది. సీఎస్సార్– ఫారమ్ 2 ద్వారా చాలా వివరాలను కంపెనీలు/కార్పొరేట్లు పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. మంత్రిత్వ శాఖకు, బోర్డుకు, సభ్యులకిచ్చే వార్షిక నివేదికల్లో విధిగా ఇది ఉండాలి. తాము సీఎస్సార్ కింద నిర్వహించిన కార్యక్రమ సామాజిక ప్రభావాల అంచనా నివేదిక కూడా ఇందులో భాగం. మన కార్పొరేట్లు మారాలి! సీఎస్సార్ విషయంలో ప్రపంచ కంపెనీల దృక్పథంలో వచ్చిన మార్పు భారతీయ కార్పొరేట్లలో రావటం లేదు. ‘వాతావరణ సంక్షోభం’ వంటి విపత్కర పరిస్థితుల్లో గ్లోబల్ కార్పొరేట్ల మౌలిక ఆలోచనలే మారుతున్నాయి. సామాజిక బాధ్యతను తదేక దృష్టితో ఆచరిస్తున్నాయి. ‘ఎల్పీజీ’ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) తర్వాత కంపెనీల్లో ప్రజాపెట్టుబడులు పెరిగాయి. పెట్టుబడుల భాగస్వాములుగా, ఉత్పత్తులు, సేవల వినియోగదారులుగా సాధారణ ప్రజానీకం ఆశలు, ఆకాంక్షల్ని కూడా కార్పొరేట్లు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. తమ నడతను మార్చుకుంటున్నాయి. వస్తు సేవల నాణ్యత, ధర మాత్రమే కాకుండా కంపెనీ నడత, నిర్వహించే సామాజిక బాధ్యతను కూడా పౌరసమాజం లెక్కలోకి తీసుకుంటుందనే గ్రహింపు వారిలో ఈ పరివర్తనకు కారణం. 2015–16లో భారత్లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, వస్తు సేవల నాణ్యత మాత్రమే కాకుండా పర్యావరణ, సామాజిక అంశాల్లో ఆయా కంపెనీలు, కార్పొ రేట్ల క్రియాశీలత, బాధ్యత, జవాబుదారీతనాన్నీ వినియోగదారులు పరిగణనలోకి తీసుకొని అటు మొగ్గినట్టు తేలింది. కార్పొరేట్ల నైతికత, సామాజిక స్పృహ కూడా వారి వ్యాపారాభివృద్ధిని ప్రభావితం చేసే అంశమే! ఈ గ్రహింపు వల్లే టాటా గ్రూప్ వంటి కొన్ని పెద్ద సంస్థల సీఎస్సార్ నిర్వహణ ఎంతో పద్ధతిగా ఉంటుంది. కొన్ని సంస్థలైతే తప్పుడు పద్ధతులు అనుసరించడం, స్టాక్ ఎక్స్ఛేంజీలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, సీబీఐ, ముంబై పోలీస్ వంటి విభాగాలు కేసులు నమోదు చేసే పరిస్థితుల్ని ఎదుర్కోవడం వరకూ వెళ్లాయి. (క్లిక్: మనమే రాస్తున్న మరణ శాసనం) పబ్లిక్ రంగ సంస్థల్లోనూ సీఎస్సార్ నిధులు దుర్వినియోగం అవు తున్నాయి. మంత్రుల ప్రత్యేక విమాన ప్రయాణాలకు, అధికారుల విలాసాలకు దుబారా చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల సంక్షేమానికి వాడి లెక్కలు చూపుతున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే, కేవలం నిధులిచ్చి పేరు తెచ్చుకోవడం అన్న భావన కన్నా అతీతమైంది. స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడం! కంపెనీలు, కార్పొరేట్లు చిత్తశుద్ధితో ‘అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి’ అనే విశాల దృక్పథంతో ఉంటేనే... సీఎస్సార్కి ఓ అర్థం, పరమార్థం! - దిలీప్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు -
GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?
వందేళ్ల క్రితం మూసీకి వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైనప్పుడు... మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి వారి ప్రాణాలు కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడంతోపాటు, ఖర్చు లేకుండా తాగునీటిని అందించొచ్చని ప్రణాళిక వేశారు. అలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉనికిలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు పడుతున్న పర్యావరణ హితం కాని అడుగులు ఆ జలాశయాల ఉసురునే తీస్తాయా అనే అనుమానాలు నెలకొన్నాయి. జీవో నూట పదకొండు (111) ఉంటుందా? ఊడుతుందా? ఇప్పుడిదొక పెద్ద చర్చ! జీవో ఉన్నా సరే... ‘ఉండదు’ అనే గట్టి ప్రకటన, ప్రచారం ఎవరైనా ఆశిస్తున్నారా? హైదరా బాద్కు ఆనుకొని పర్యావరణ ఊపిరి తిత్తులుగా ఉన్న ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంతో తెచ్చిన జీవో 111 చాన్నాళ్లుగా వివాదాంశమే. అనుకూల ప్రతి కూల వాదనలు... పాతికేళ్ల కింద (1996) జీవో వచ్చినప్పటి నుంచీ ఉన్నాయి. జలాశయాల పూర్తి సామర్థ్యపు నీటి మట్టం నుంచి ఎటూ పది కిలోమీటర్ల పరిధిని ‘జీవ పరిరక్షణ ప్రాంతం’ (బయో కన్జర్వేషన్ జోన్)గా ప్రకటించి, నిషేధిత కార్యకలాపాలు నిర్వహించొద్దనటమే ఇందులోని విశేషం! ఈ జీవో ప్రకారం, పరిశ్రమలు ఏర్పాటు, భారీ నిర్మాణాల వంటి వ్యవసాయేతర కార్యకలాపాలకు అనుమతి లేదు. అయినా లెక్కకు మించి ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పర్యావరణ హితం కోరే వాళ్లు సదరు యత్నాల్ని, చర్యల్ని వ్యతిరేకించి హరిత న్యాయస్థానం, సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జీవో వివాదం మలుపులు తిరిగి, రాజకీయంగా ముఖ్యాంశమై కూర్చుంది. తాగునీటి కోసమే కాదు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు దశాబ్దాలుగా జంటనగరాల దాహార్తిని తీరుస్తున్నా... వాటి నిర్మాణ లక్ష్యం కేవలం తాగునీరే కాదు. మూసీకి 1908లో వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైంది. భారీ జన, ఆస్తినష్టం వాటిల్లింది. మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి ఆ రోజున వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి, సలహా కోరారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడమే కాక పైపుల ద్వారా తాగునీటిని పౌరులకు ఖర్చు లేకుండా, భూమ్యాకర్షణతో అందించొచ్చని ప్రణాళిక ఇచ్చారు. ఆ మేరకు 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ వినియోగంలోకి వచ్చాయి. తాగునీటికి 80ల వరకు ఇవే పెద్దదిక్కు! మంజీరా, కృష్ణా, గోదావరి నుంచి తరలింపులు మొదలయ్యాక వీటి వాటా తగ్గింది. ఏ నదీ జలాలతో పోల్చినా... ఇవే రుచికరం, చౌక! ఇవి అవసరమే లేదనే మాట ఇప్పుడొస్తోంది. కానీ, పర్యావరణ పరంగా నగరాల్లో 25 నుంచి 29 శాతం భూభాగం నీరు, హరితంతో కూడి ఉండాలి. మిషన్ కాకతీయతో ఒక వైపు చెరువులు, కుంటల్ని పునరుద్ధరిస్తూ... ఇంకొక వైపు ఇంత ముఖ్యమైన జలాశయాలతో పనిలేదనడం సరికాదు. జీవో 111 ఎత్తివేసి, నిషేధాల్ని తొలగిస్తే పరిశ్రమలు, భారీ నిర్మాణాలు, వ్యర్థ జలాలు, కాలుష్యాలతో రెండు జలాశయాలు క్రమంగా అంతరించే ప్రమాదముంది. అదే జరిగితే, గాలిలో తేమ శాతం తగ్గి, నగరంపైకి వేడిగాలుల ప్రభావం, వేసవిలో మరణాల సంఖ్య పెరుగుతుంది, గొప్ప సహజ వాటర్షెడ్స్గా ఉన్న జలాశయాలు అంతరిస్తే భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతాయి. జీవో ఉన్నా ఉల్లంఘనలు జలాశయాల రక్షణ దిశలో 111 తొలి జీవో కాదూ, చివరిదీ కాదు. జల సంరక్షణ కోసం 1989 జనవరిలో జీవో 50 తెచ్చారు. పారిశ్రామిక కాలుష్యాల నుంచి రక్షణకు 1994లో జీవో 192 వచ్చింది. 2009 (జీవో 1113), 2011 (జీవో 293) లోనూ వచ్చిన పలు జీవోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జలాశయాలతో పాటు పరీవాహక ప్రాంతం, అక్కడి జీవావరణ రక్షణకు ఉద్దేశించినవే! కానీ, నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నీటి సహజ ప్రవాహాల్ని అడ్డుకున్నారు, 25,000 అక్రమ నిర్మాణాల్ని గుర్తించినట్టు కలెక్టరే రెండేళ్ల కింద ప్రకటించారు. వికారాబాద్లో వర్షం కురిసినా చెరువులకు నీరు రాని పరిస్థితి నేడు నెలకొంది. విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తు భవనాలు, రిసార్టులు, ఇతరేతర కార్యక్రమాలు పెరిగాయి. భూవినియోగ స్థితిని మార్చకున్నా భూబదలాయింపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఠాకూర్ రాజ్కుమార్సింగ్, ప్రొ. ఎమ్వీరావ్ వంటి వారు న్యాయస్థానాల్ని సంప్రదించారు. జీవోను ఎత్తివేయడమో, సడలింపో చేయొద్దనీ, జీవోలోని విధానాలనే కాక స్ఫూర్తినీ కాపాడాలనీ సుప్రీంకోర్టు చెప్పింది. ఒక నిపుణుల కమిటీ గురించి ప్రభుత్వం చెప్పినపుడు, సరే అంటూ, యధాతథ స్థితి కొనసాగించా లని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఎవరైనా ప్రకటనే ఆశిస్తున్నారా ? ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ అన్నట్టు, ఒకవైపు నివేదిక రావాలంటూనే... మరోవైపు ఏకపక్షంగా జీవో ఎత్తివేస్తామంటే, ఎత్తివేయడానికి అనుకూలంగా నివేదిక తెప్పించుకుంటారా? అన్న సందేహాలు సహజం. ఇంతకీ జీవో ఎత్తివేయాలని కోరుతున్నదెవరు? పొరుగువారి కన్నా అభివృద్ధిలో వెనుకబడి పోతున్నామనే ఆందోళనలో ఉన్న జీవో పరిధి స్థానికులు. ఏడు (శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, కొత్తూరు) మండలాల్లోని 84కు గానూ చాలా గ్రామాల్లో పాలకమండళ్లు జీవో ఎత్తేయమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. రియల్ ఎస్టేట్ లాబీ, పారిశ్రామిక లాబీలు కూడా ప్రభుత్వంపై జీవో ఎత్తివేతకు ఒత్తిడి తెస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. మరోవైపు జీవో ఉనికితో నిమిత్తం లేకుండా వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. చుట్టు పక్కల ఎకరం రెండు, మూడు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయల వరకు (ఇటీవల ప్రభుత్వ వేలంలో పలికిన ధరల ప్రకారమే) వెళ్లాయి. నిషేధాజ్ఞలు ఎత్తేస్తే ఈ జోన్లోని భూముల ధరలు కూడా అసాధారణంగా పెరుగుతాయి. ఎన్జీటీ, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంగా జీవో ఎత్తివేత అంత తేలికయిన వ్యవహారమేం కాదు. ఈ పరిస్థితుల్లో జీవో తొలగకపోయినా... ఇదుగో ఎత్తివేస్తున్నారు అన్న వాతావరణం చాలు అనుకునే భూదందాల వాళ్లూ ఉంటారు. అందరి ప్రయోజనాలూ ముఖ్యమే! సర్కార్లకు చిత్తశుద్ధి ఉంటే 111 జీవోనే కానక్కర్లేదు, ఎప్పట్నుంచో ఉన్న ‘వాటర్ యాక్ట్’ని వాడి కూడా జలాశయాల్నీ, జీవావరణాన్నీ, జీవ వైవిధ్యాన్నీ కాపాడొచ్చు అనే వారూ ఉన్నారు. ఈ వివాదాలు, ఉల్లంఘనలు, జీవో ఎత్తివేత యత్నాలు... తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస వరుస ప్రభుత్వాల కాలంలోనూ ఉన్నాయి. జీవో ఉంచాల్సిందేనని న్యాయస్థానాలు చెబితే నిష్కర్షగా ఉల్లంఘనల్ని అరికట్టాలి. జీవోని ఉంచే, తగు రీతిన సవరించే పక్షంలో... నిర్దిష్ట చర్యలు తప్పనిసరి. ఎవరెవరి అజమాయిషీలో ఎన్నెన్ని భూములు న్నాయి? వాటి వినియోగపు హక్కులేంటి? ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై ఏం చర్య తీసుకుంటారు? రైతులు ఎందరు, వారి వద్ద ఎంత భూమి ఉంది? వంటి వాస్తవిక లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. కాలుష్య కారకం కాని విధంగా సహజ వ్యవసాయాన్ని, తగిన సహాయాన్ని ప్రభుత్వం కల్పించాలి. జోన్ పరిధి గ్రామాల్లో భూమి లేని నిరుపేదలెవరో గుర్తించి, వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. ఇవేవి చేయకుంటే... పర్యావరణ హితాన్ని పణంగా పెట్టి, సర్కారే భూముల విలువ పెంచేందుకు మనుషుల విలువ తగ్గించినట్టే లెక్క! దిలీప్ రెడ్డి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు -
మనమే రాస్తున్న మరణ శాసనం
భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత తరాలు ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది. కానీ అలా చేస్తున్నామా? భూతాపోన్నతిని అనుకున్నట్టుగా రెండు డిగ్రీల లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంతమయ్యే ప్రమాదముంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. అయినా మన ప్రభుత్వాలు నిష్క్రియాపరత్వం వీడటం లేదు. ఈ నివేదిక సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో ముందుకు రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. పరిశోధన పత్రాలు పనికిరావు... అధ్యయన నివేదికలు ఆలోచనకు ఆనవు... శాస్త్రవేత్తల హెచ్చరికలు నెత్తికెక్కవు... మరెప్పుడు మేల్కొనేది? ఇంకెప్పుడు ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడు కునేది? ఇది ఇప్పుడు భారత పౌరసమాజం ముందున్న కోటి రూకల ప్రశ్న. సరైన సమయంలో తగు రీతిన స్పందించని నిష్క్రియాపర త్వమే సమస్యను మరింత జటిలం చేస్తోందని పలు అధ్యయన నివేది కలు తరచూ చెబుతున్నాయి! అసలు సమస్యకు పెరుగుతున్న భూతా పోన్నతి మూల కారణమైతే, ఎన్నో హెచ్చరికల తర్వాత కూడా కద లని మన ప్రభుత్వాల వైఖరే సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభు త్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. ఐపీసీసీ ఆరో అంచనా నివేదికలో భాగంగా ‘వర్కింగ్ గ్రూప్’ ఇచ్చిన 2022 తాజా (రెండో భాగం) నివేదిక ఎన్నో హెచ్చరికలు చేస్తోంది. గత సంవత్సరం విడుదల చేసిన నివేదిక (తొలి భాగం) లోనే, అంచనాలకు మించిన వేగంతో వాతావరణ సంక్షోభం ముంచుకువస్తోందని హెచ్చరించిన ఈ బృందం, ప్రమాదం మరింత బహుముఖీనంగా ఉందని తాజా నివేదికలో గణాంకాలతో సహా వివరించింది. భూగ్రహం మొత్తానికి సంబంధించిన సమస్యను నివేదికలో పేర్కొన్నా... ఆసియా ఖండానికి సంబంధించి, ముఖ్యంగా భారత్కు వర్తించే హెచ్చరికలు ఈ నివేదికలో తీవ్రంగా ఉన్నాయి. అయినా దీనికి సంబంధించిన కీలక చర్చ ఎక్కడా జరగటం లేదు. భారత్కే హెచ్చు ప్రమాదం హిమాలయాల దిగువన, మూడు సముద్రాల మధ్యనున్న ద్వీప కల్పమవడంతో వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం భారత్పైన ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమౌతోంది. హెచ్చు తేమ, వేడి వల్ల తలెత్తే దుష్పరిణామాలు (వెట్ బల్బ్ సిండ్రోమ్), నగర, పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని తాజా నివేదిక నిర్దిష్టంగా పేర్కొంది. అహ్మదా బాద్ను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ హైదరాబాద్తో సహా చాలా మెట్రో నగరాలదీ ఇదే దుఃస్థితి! ఫలితంగా వడదెబ్బ మరణాలు మితిమీరతాయి. మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోందని ఐపీసీసీ ఆరో నివేదిక తొలిభాగంలోనే పేర్కొన్నారు. దాంతో సముద్ర గాలులు పెరిగి, దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్లో తుపాన్లు, వర్షాలు, వరదలు, కరవులు సాధా రణం కన్నా ఎక్కువవుతాయని నివేదించారు. నివేదిక తొలి భాగం ప్రధానంగా ‘వాతావరణ మార్పు’ తాలూకు శాస్త్ర, సాంకేతిక, సామా జికార్థికాంశాలతో ఉంది. రెండో భాగం ముఖ్యంగా ‘వాతావరణ మార్పు ప్రభావాలు, సర్దుబాటు (అడాప్టేషన్), ప్రమాద ఆస్కారం’ కోణంలో విషయాలను నివేదించింది. వచ్చే ఏప్రిల్లో రానున్న మూడో భాగం ఏ రకమైన దిద్దుబాటు (మిటిగేషన్) చర్యలు అవసర మౌతాయో స్పష్టం చేస్తుంది. దీంతో, ఐపీసీసీ ఆరో అంచనా నివేదిక పూర్తవుతుంది. భూతాపోన్నతి వల్ల పుడమి ధ్రువాల్లోనే కాకుండా మన హిమాలయాల్లో ఉన్న మంచు అసాధారణంగా కరిగి కింద ఉండే భూభాగాల్లోనూ, నదుల పైనా ఒత్తిడి పెరుగుతుంది. అముదర్య (మధ్యాసియా నది), సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతాల్లో వరదలు పెరిగి తీవ్ర ప్రతికూల పరిణామాలుంటాయని నివేదిక చెబుతోంది. ‘వెట్ బల్బ్ టెంపరేచర్’ (అంటే, గాలిలో తేమ శాతం అసాధారణంగా పెరిగినపుడు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా తీవ్రంగా ఉంటుంది; 30–35 డిగ్రీల మధ్య వేడి అత్యంత ప్రమాదకారి) ఇప్పటికే 30 డిగ్రీలను దాటుతున్నట్టు నివేదిక చెబు తోంది. మనది స్థూలంగా వ్యవసాయాధారిత జీవనం, ఆర్థిక వ్యవస్థ అయినందున వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనేది నివేదిక సారాంశం. సాధారణ జీవనంతో పాటు వ్యవసాయం, ఆహారోత్పత్తి, పంపిణీ వంటివి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఐపీసీసీ ఛైర్మన్ హీసంగ్ లీ చెప్పినట్టు ‘నష్ట నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యల తర్వాత కూడా 300 నుంచి 350 కోట్ల మంది విశ్వజనుల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఉండేటప్పుడు... స్థానికంగా ఎక్కడికక్కడ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం చేసే నష్టం మరింత అపారం’ అన్నది కఠోరసత్యం! ‘కోడ్ రెడ్’ కన్నా తీవ్రం విశ్వవ్యాప్తంగా వచ్చే రెండు దశాబ్దాలు తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని జీవరాశి ఎదుర్కోవాల్సి వస్తుందని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. ఆరో అంచనా నివేదిక తొలిభాగంలోనే, ఇది మానవాళికి తీవ్రమైన ‘కోడ్ రెడ్’ ప్రమాదమని హెచ్చరించిన అధ్య యన బృందం, పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని తాజా నివేదికలో చెప్పింది. ప్రపంచ స్థాయిలో సత్వర నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టకపోతే ‘జీవయోగ్య, నిలకడైన భవితను పరిరక్షించుకునే అవకాశాన్ని మనం చేజేతులా జారవిడుచు కున్న వారమవుతాం’ అని హెచ్చరిస్తోంది. ప్రధానంగా అరడజను అంశాల్లో పరిస్థితులు విషమించే ఆస్కారాన్ని నొక్కి చెప్పింది. 1. మితిమీరిన కర్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరిగి జీవన పరిస్థితులు సంక్లిష్టమౌతాయి. వెట్ బల్బ్ సిండ్రోమ్తో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొం టాయి. అసాధారణ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటాయి. 2. పెరిగే తుపాన్లు, అతి వర్షాలు, వరదలు, కరవులు వంటి అతివృష్టి, అనా వృష్టి పరిణామాల కారణంగా ఆహారోత్పత్తి రమారమి తగ్గిపోతుంది. 2050 నాటికి భారత్లో 40 శాతం జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. తిండి గింజలు ఖరీదై పెద్ద సంఖ్యలో పేదలు తిండి కోసం అల్లాడుతారు. పిల్లల ఎదుగుదలపై పౌష్టికాహార లోపం ప్రతికూల ప్రభావం చూపుతుంది. 3. భూతాపోన్నతి వల్ల ధ్రువాల మంచు కరిగి, సముద్ర జల మట్టాలు 44–76 సెం.మీ. పెరగటం వల్ల దీవులు, తీర నగరాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ప్యారిస్లో చేసిన ప్రతిజ్ఞలకు ప్రపంచ దేశాలు కట్టుబడ్డా ఈ దుఃస్థితి తప్పదు. ఉద్గారాల్ని ఇంకా వేగంగా నియంత్రించగలిగితే... సముద్ర జల మట్టాల పెరుగుదలను 28–55 సెం.మీ. మేర నిలువరించవచ్చు. తీరనగరాల మునక, నగరాల్లో వరద సంక్షోభం, భూక్షయం, తీరాలు ఉప్పుగా మారి వ్యవసాయ అయోగ్యత వంటి వాటిని కొంతలో కొంత అదుపు చేయొచ్చు, 4. అతి వేడి, వడగాలులు, అసాధారణ వాతా వరణ పరిస్థితుల వల్ల జబ్బులు పెరిగి అనారోగ్యం తాండవిస్తుంది. శ్వాస, రక్తప్రసరణ, చర్మ సంబంధ రోగాలతో పాటు మధుమేహం వంటివి అధికమౌతాయి. 5. సీసీ (క్లైమేట్ ఛేంజ్)తో విద్యుత్తు వంటి ఇంధన వినియోగంలో అసాధారణ మార్పులు వస్తాయి. 6. అటవీ, సముద్ర తదితర అన్ని రకాల జీవావరణాలు (ఎకోసిస్టమ్స్) దెబ్బతిని జీవవైవిధ్యం అంతరిస్తుంది. భూతాపోన్నతిని అనుకున్నట్టు 2 డిగ్రీల కన్నా లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంత మయ్యే ప్రమాదముంది. సానుకూల మార్పే నిర్ణాయక శక్తి అభివృద్ధి నిర్వచనంతో పాటు సమకాలీన రాజకీయాల దశ, దిశ మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐరాస నిర్వచించినట్టు సుస్థిరా భివృద్ధి అంటే, ‘భవిష్యత్తరాల ప్రయోజనాల్నీ పరిగణనలోకి తీసు కొని, వాటిని పరిరక్షిస్తూ... ప్రస్తుత తరాలు తమ అవసరాల్ని తీర్చు కునేలా ప్రకృతి వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం’. ఐపీసీసీ వంటి ముఖ్యనివేదికల సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవ డానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. సంబంధిత వర్గాలన్నీ సత్వరం నడుం కడితే తప్ప జీవరాశి మనుగడకు భరోసా లేదు. ఇదే మనందరి తక్షణ కర్తవ్యం. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు -
కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?
కిందటి వారాంతంలో సాయుధబలగాలు నాగాలాండ్లోని ఓ మారుమూల సరిహద్దులో పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాదమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడిపాక... సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. ‘దేశ పౌరులపై చర్యలకు తలపడేటప్పుడు సాయుధ బల గాలు సంయమనం, కనీస బలప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. సుప్రీం కోర్టు, ఈశాన్య ప్రాంత ప్రజలు, అక్కడి ముఖ్యమంత్రులు సైతం నిరంకుశ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరెప్పుడు రద్దు? ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నాయకులు తమ నిరసన శిబిరాన్ని గురువారం ఎత్తివేస్తున్న సమయానికి నాగాలాండ్లోని ఓ మారుమూల సరిహద్దులో పరిస్థితి భిన్నంగా ఉంది. మయన్మార్తో సరిహద్దు కలిగిన మోన్ జిల్లా ఓటింగ్ పరిసరాల్లోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో నల్ల జెండాలు దర్శనమిస్తున్నాయి. క్రిస్టమస్ కొనుగోళ్లతో సందడిగా ఉండాల్సిన దుకాణాలపైన, దారి పొడుగు స్థంబాలపైన, వాహనాలపైన నల్లజెండాలు ఎగురవేస్తూ స్థానికులు నిరసన చెబుతున్నారు. కిందటి వారాంతంలో సాయుధ బలగాలు పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాధమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. సైనికులతో సహా ఎవరినీ తమ ప్రాంతంలోకి ఓటింగ్ గ్రామస్తులు ఇపుడు అను మతించడం లేదు. కేంద్ర గృహమంత్రి అమిత్షా పార్లమెంటులో చేసిన ప్రకటనను ‘నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ (ఎన్ఎస్సీఎన్) ఖండిస్తూ తీవ్రంగా ద్వజమెత్తింది. రక్షణ బలగాలకు విశృంఖల స్వేచ్చ, అధికారం కల్పిస్తున్న ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం–ఏఎఫ్ఎస్పీయే’ ఒక నల్లచట్టమంటూ, వ్యతిరే కంగా ప్రకటన జారీ చేసింది. ఆ చట్టం ఎత్తివేయకుండా, ఏ రాజకీయ ప్రక్రియనూ సాగనివ్వబోమని తేల్చి చెప్పింది. పలు నాగా తిరుగు బాటు సంస్థల్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా నిర్వ హిస్తున్న శాంతి ప్రక్రియపై తాజా పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్నది వేచి చూడాల్సిందే! కానీ, ఇదంతా దేశపు ఈశాన్యం లోని ఓ మారుమూలలో జరుగుతున్న చిన్నపాటి ‘కుంపటి రగలడం’ మాత్రమే! దినకూలీతో బతికే సామాన్యుల్ని, కర్కషంగా సాయుధ బలగాలు నలిపేసిన ఓ దుర్ఘటనపై దేశం తగు రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమౌతోంది. అంతర్జాతీయంగా... మానవహక్కుల పరి రక్షణ సూచీలో మనది ఎప్పుడూ నేల చూపే! తాజా ఘటనతో సహా ‘సైనికులది తప్పే’ అని ఏలినవారు ముక్తసరిగా అంగీకరించినా... అటువంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్య లేమీ లేవు. బలగాల అకృత్యాలను నిలువరించే కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పడటం లేదని ఈశాన్య రాష్ట్రాల మానవహక్కుల కార్యకర్తలు, పౌర సంఘాల ప్రతినిధులు అంటున్నారు. పదమూడు నెలలకు పైబడి రైతాంగం, ఫలితం రాబట్టుకునే దాకా జరిపినట్టు పోరాటం అన్ని సందర్భాల్లో, అందరివల్లా అవుతుందా? పలు ఈశాన్య రాష్ట్రాల్లో దశా బ్దాలుగా పోరాడినా... ఒక నల్లచట్టాన్ని ప్రభుత్వాలు రద్దు చేయటం లేదనే ఆందోళన ఉంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడి పాక సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. మానవ తప్పిదమా, మానని జాడ్యమా? తప్పు చేసినా తప్పించుకోవచ్చు, శిక్ష ఏమీ ఉండదన్న ధీమాయే సాయుధ బలగాల దుశ్చర్యలకు కారణమని పలుమార్లు రుజువైంది. ఈ చట్టంలోనూ అటువంటి లొసుగులే ఉన్నాయి. చట్టం కల్పించిన అధికారం, చేతిలో ఆయుధం ఇచ్చే బలం ఉన్నాయని అక్కడక్కడ రక్షణ బలగాలు చేసే ఆగడాలను ఉపేక్షించడం తప్పు. ఇలాంటి దుర్ఘటనల వల్ల ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని, పాలకులు సదరు ఆగడాలను వెనుకేసుకొస్తున్నారు. అతకని వాదనల్ని సమర్థిస్తూ మాట్లాడటం, చిన్న తప్పిదంగా కొట్టిపారవేసే వైఖరి మంచిది కాదు. దేశ సరిహద్దుల్లో, కల్లోలిత ప్రాంతాల్లో ఉగ్రమూకల తీవ్రవాదం, హింస, వి«ధ్వంస కార్యకలాపాలను నియంత్రించే క్రమంలో ఇటువం టివి మామూలే! అని బాధ్యత కలిగిన పౌరసమాజం కూడా సాధార ణీకరించడం దుర్మార్గం. ఎవరివైనా ప్రాణాలే! దేశవాసులకు తాము నిరంతర రక్షణ కల్పిస్తున్నామనే ‘త్యాగ భావన’ నీడలో... ఏ సామా న్యుల ప్రాణాలో నిర్హేతుకంగా తీసే హక్కు రక్షణ బలగాలకు ఉంటుందా? ఈ ప్రశ్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు తెగల గిరిజ నులు, ఆదివాసీలు, అల్ప సంఖ్యాకులు, విభిన్న జాతుల వారు తరచూ లేవనెత్తుతున్నారు. జాతుల సమస్య, అస్తిత్వ ఆరాటాలుండే నిత్య పోరాట నేలల్లో సామాన్యుల బతుకు సదా దర్బరమౌతోంది. బలగాల దీష్టీకాలకు అడ్డు–అదుపూ ఉండదు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వీరిపై ఏ విచారణా జరుగదు. సాయుధబలగాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, యువకుల్ని ఎత్తుకుపోవడం, ఎదురుకాల్పుల పేరిట మట్టుపెట్టడం... మానవ హక్కుల హననానికి ఎన్ని రూపాలో! వీటిని నిరసిస్తూ... హక్కుల కార్యకర్త – ఉక్కు మహిళ, ఇరోమ్ షర్మిల పద హారేళ్లు మౌన–నిరాహార దీక్ష చేసి ప్రపంచ దృష్టినాకర్శించినా మన ప్రభుత్వాలు కదల్లేదు, చట్టం రద్దవలేదు, ఫలితం శూన్యం! 2000–12 మధ్య ఒక్క మణిపూర్లో సాయుధబలగాలు జరిపిన 1528 ఎన్కౌం టర్ల పై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శానికి ఇవాల్టికీ అతీ–గతీ లేదు. కట్టుకథలదే ‘రాజ్యం’! గత శని–ఆది వారాల దుర్ఘటనలు పుండైతే, మాన్పే ప్రయత్నం చేయక పోగా కేంద్రం వైఖరి దానిపై కారం రుద్దినట్టుందనే విమర్శ వస్తోంది. మూడు రోజుల తర్వాత నోరిప్పిన ఓటింగ్ గ్రామస్తులు చెప్పే విష యాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. కాల్పుల్లో మరణించిన గని కూలీల శవాలను పక్కకు తీసి, వారి చొక్కాలు విప్పి మిలిటెంట్ల గుడ్డలు, బూట్లు తొడిగి, వారి చేతుల్లో ఆయుధాలు పెట్టి... బమటి ప్రపంచానికి చూపే యత్నం చేశారని! తద్వారా తమ దాష్టీకానికి హేతుబద్ధత తెచ్చే ప్రయత్నంలో సాయుధబలగాలు గ్రామస్తులకు దొరికాయి. ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు ప్రతిదాడికి దిగారు. నిరసన చల్లార్చే క్రమంలో మరో ఏడుగురు గ్రామస్తుల్ని బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. ట్రాలీ కూలీల్లో బతికిన∙షీవాంగ్ చెప్పడమేమిటంటే, సాయుధులు తమ వాహనాన్ని అడ్డుకోలేదు, ఆపమని అడగలేదు, అదుపులోకి తీసుకునే ఏ ప్రయత్నమూ చేయకుండానే నేరుగా కాల్పులు జరిపారని. మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్లు ఎకే–47 మారణాయుధాలు, మర తుపాకులు, గ్రెనేడ్ల అక్రమ రవాణాకు పాల్ప డుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది అనేది ‘21 పారా స్పెషల్ ఫోర్స్’ బృంద కథనం! సరే, వాదన కోసమైనా, ‘వారు చెప్పేది’ కాసేపు నిజమనుకుందాం, ఈ విషయం స్థానిక పోలీసులకు, అస్సాం రైఫిల్స్కి ఎందుకు చెప్పలేదు? దారికాచి వాహనాన్ని అడ్డ గించే ప్రయత్నమో, టైర్లనో, ఇంజన్నో కాల్పులతో పనికి రాకుండా చేసి అనుమానితుల్ని నిర్బంధంలోకి తీసుకోవడమో, బలవంతపు లొంగుబాట్లకో ఎందుకు యత్నించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అసలక్కడ కవ్వింపులే లేవు! వారు జరిపింది ఆత్మరక్షణ కాల్పులు కాదు, అణచివేసే అహంతోనో, అధికారాలున్నాయనే మిడి సిపాటో, ట్రిగ్గర్ మోజో... అయి ఉంటుందనేది విశ్లేషణ! వదలని వలసవాద మూలాలు ఎన్ని కమిటీలు? ఎన్ని అధ్యయనాలు? ఎన్నెన్ని నివేధికలున్నా.... చట్టంపై పునరాలోచనే లేదు. 1958 సాయుధ బలగాల ప్రత్యేక అధి కారాల చట్టమైనా,1972 కల్లోలిత ప్రాంతాల చట్టమైనా... వీటి మూలాలు బ్రిటిష్ వాలసపాలకులు, 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్య మాన్ని అణచివేసేందుకు తీసుకువచ్చిన ఆర్డినెన్స్లో ఉన్నాయి. సర్వ సత్తాక సార్వభౌమ దేశానికి అవి పొసగేవి కావు. ‘దేశ పౌరులపై చర్య లకు తలపడేప్పుడు సాయుధ బలగాలు సంయమనం, కనీస బల ప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్, జస్టిస్ జె.ఎస్.వర్మ కమిషన్ కూడా ఈ చట్టం వద్దనే సిఫారసు చేశాయి. ప్రస్తుతం నాగాలాండ్, మెఘాలయ ముఖ్యమం త్రులే కోరుతున్నారు. కేంద్రం 2004లో, జస్టిస్ జీవన్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమాచారం సేకరించి 2005లో ఇచ్చిన నివేదికలో ‘సత్వరమే ఈ చట్టాన్ని రద్దు చేయాలి’ అని నివేదించింది. మరెప్పుడు రద్దు? దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మలి సమరం మొదలు!
ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్రానికీ మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలిగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. కార్పొరేట్ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి. తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!! మూడు చట్టాల రద్దు, దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వ్యవసాయ సంస్కరణల్ని వెనక్కి నెట్టినట్టా? ఇదేం అవాంతరం కాదా? ఇప్పుడిదొక చర్చనీయాంశం. దేశ రైతుల్ని ఉద్ధరించే సంస్కరణల బాటలో పెద్ద ముందడుగు అని చెప్పిన చట్టాల్ని ఉపసంహరించే ప్రక్రియ కేంద్రం ప్రారంభించింది. ప్రధాని ప్రకటన బాటలోనే బిల్లు ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రేపు పార్లమెంటు సమావేశాల్లో రద్దు బిల్లును ఆమోదిస్తారు. తదుపరి ఏంటి? కోరినట్టే చట్టాల రద్దు సాధించిన రైతు సంఘాలు తమ అసలు డిమాండ్తో స్వరం పెంచుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు చట్టబద్దత వచ్చే వరకు ఆందోళన విరమించమంటున్నారు. మార్కెట్ వ్యవస్థ బలోపేతం డిమాండ్ కూడా ఉంది. ఈ మేరకు 40 సంఘాలతో శనివారం ఢిల్లీలో సమావేశమై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనుంది. రైతాంగం కోరుతున్నట్టు చర్చల ప్రక్రియ చేపట్టాలా? కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకోవాలా? వేర్వేరు అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు లోతుగా ఆలోచిస్తున్నారు. ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. లాబీయింగ్లో సిద్ధహస్తులైన కార్పొరేట్లకు కాకుండా వ్యవసాయ సంస్కరణలు రైతుకు మేలు చేయాలి. విశాల ఆర్థిక సంస్కరణల్లో భాగమైన వ్యవసాయ సంస్కరణలే కాకుండా సంస్కరణల ప్రక్రియలోనూ మార్పు రావాలి. చట్టబద్ధతే కీలకం వ్యవసాయ సంస్కరణల్ని స్థూల దృష్టితో చూడాలి. ప్రభుత్వంతో పాటు రైతు నాయకులకు పట్టువిడుపులు అవసరం. ఉభయత్రా నిర్మాణాత్మక ప్రతిపాదనలు, ఆచరణాత్మక అంగీకారాలు కుదరాలి. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, దానికో చట్టబద్ధత కావాలని ఇప్పుడు రైతాంగం కోరుతోంది. మద్దతు ధర, మార్కెట్ వ్యవస్థా కొనసాగుతాయని, దానికి ప్రయివేటు కొనుగోలు వ్యవస్థ తోడవుతుందని ప్రభుత్వం చెబుతోంది. చట్టబద్ధత కల్పిండానికి కొన్ని ఇబ్బందులున్నాయనేది ప్రభుత్వ వాదన. ప్రపంచ వాణిజ్య సంఘం (డబ్లుటీవో) ఒప్పందాల రీత్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాల వల్ల ఈ విషయంలో భిన్నమైన ఒత్తిళ్లున్నాయి. వారేమో, ఏ సబ్సిడీలైనా పది శాతాన్ని మించొద్దంటారు. అందుకు అంగీకరించకుండా, వాయిదాలు వేస్తూ వచ్చింది ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, ఎగుమతి–దిగుమతుల వంటి అంశాల దృష్ట్యా ఈ అంకానికి తెర తీసే ఆలోచన ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం చేస్తోంది. కానీ, కనీస మద్దతు ధర ప్రకటనకు, ఖచ్చితమైన అమలుకు చట్టబద్ధత ఉంటేనే మేలని రైతాంగం కోరిక. దాంట్లోనూ లోపాలున్నాయి. కొన్ని (23) పంటలకే ఎమ్మెస్పీ ప్రకటన, రెండు పంటలకే ప్రభుత్వం ధాన్యం సేకరణ, దానికీ భరోసానిచ్చే స్థాయి మార్కెట్ వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యలు. చిరుధాన్యాలకూ ఎమ్మెస్పీ ఉండాలి, గణింపు శాస్త్రీయంగా జరగాలి, సగటు పద్ధతిన కేంద్ర స్థాయిలో కాకుండా.. పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్రాల వారీ ఎమ్మెస్పీ ఉండాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్లో ఉన్నట్టు ప్రతి 25 చ.కి.మీ పరిధికి ఒక మార్కెట్ యార్డ్ ఉండాలనేది వారి వాదన. ఎమ్మెస్పీ ఉల్లంఘనలకు శిక్షలుండాలి. చట్టబద్ధతకు కొత్తగా కమిటీ వేసి కాలాయాపన చేయడంకన్నా, లోగడ ముఖ్యమంత్రుల బృందం ఇచ్చిన ప్రతిపాదన ఆమోదించాలని రైతు నేతలంటారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నపుడు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ బృందం ఎమ్మెస్పీ చట్ట ముసాయిదా ప్రతిపాదించింది. రెట్టింపు ఆదాయం ఎలా? వచ్చే జనవరి నాటికి రైతుకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చేయడం లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ఆ దిశలో రైతు ఆదాయం పెరగపోగా పడిపోతోంది. మార్కెట్ మాయాజాలంలో పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుంది రైతు పరిస్థితి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు లేక, నువ్వా–నేనా అనే కేంద్ర–రాష్ట్ర వివాదాల్లో రైతు నిత్యం నలుగుతున్నాడు. వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలు కూడా వ్యవసాయంపై మొదలయ్యాయి. ఒక సర్వే (ఎస్యేఎస్) ప్రకారం కర్షక కుటుంబాల రోజువారీ సగటు సంపాదన రూ.277 (ఉపాధిహామీ దినకూలీ సమానం) గా తేలింది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో రైతుల సగటు నెలసరి రాబడి రూ. 4–10 వేల మధ్య ఉంది. దేశంలో 80 శాతం సన్న చిన్నకారు రైతులే! ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిల్ల వ్యయాలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రోజుకు సగటున 2000 మంది వ్యవసాయం నుంచి ఇతరేతర వృత్తులకు మళ్లుతున్నారు. ఎమ్మెస్పీనే కాక... భూమి, కూలీలు, పెట్టుబడి, విత్తనం, రుణం, వాతావరణం, ఉత్పత్తి, ధర, మార్కెట్... అన్నీ సమస్యలే! ఇంతటి దయనీయ స్థితిలో దేశానికి అన్నం పెట్టే రైతు కోలుకోలేకుండా ఉంటే, మన ఒప్పందాలు, సంస్కరణలు అతన్ని ఆదుకునేలా కాక మార్కెట్ శక్తులకు దన్నుగా ఉంటే ఎలా? అన్న ప్రశ్న రైతు ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెంచింది. రైతుల ఆర్థిక స్వేచ్ఛ కోరిన దివంగత శరద్ జోషి (శెట్కారీ సంఘటన్) తన పుస్తకంలో రెండు విలువైన మాటలు చెప్పారు. మార్కెట్తో ఒప్పందపు షరతులు రైతు పక్షంలో ఉండాలి. పట్టణ, పల్లె ఉత్పత్తులు–సేవల ధరల్లో సామ్యం పుండాలంటారు. రైతు ఆదాయాన్ని పెంచేలా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. దాదాపు ఏడువేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో పదివేల రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్పీఓ) ఏర్పాటును కేంద్రం ప్రకటించింది. కానీ, కార్యాచరణలో చిత్తశుద్ధి లేదు. స్థానిక సహకార సంఘాల్ని ప్రోత్సహించాలి. వ్యవసాయోత్పత్తులు పెరిగిన చోట, ప్రభుత్వం చొరవతో.. విలువపెంచే ప్రక్రియను, అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. రైతు రాబడి పెంచాలి. నేలకిప్పుడు సాంత్వన కావాలి రైతాంగం సాగు పద్ధ తులు మార్చుకోవాలి. సాగు వ్యయాన్ని రమారమి తగ్గించుకొని, కనీస మద్దతు ధరపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా చూసుకోవాలి. విష రసాయనాల వాడకం తగ్గించి క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. ఫలితంగా రైతుపై ఒత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. లాభసాటి ప్రకృతి సాగుతో పుడమి తల్లికి సాంత్వన కూర్చాలి. రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులకు ప్రభుత్వం సబ్సిడీలివ్వాలి. రైతాంగం అదే డిమాండ్ చేయాలి. సంబంధీకులతో సంప్రదించకుండా, కార్పొరేట్ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి. తదుపరి సంస్కరణల్ని రైతు హితంలోనే చేపట్టాలని ఇకపై కేంద్రంపై నిరంతర ఒత్తిడి ఉంటుంది. 1992 నుంచి వ్యవసాయ సంస్కరణలపై గొంతెత్తుతున్న ఉదారవాదులు, రైతుకు లభించే సంస్థాగత మద్దతుకు ఎసరు పెడుతున్నారు. 1960–80ల నడుమ ఈ మద్దతే వ్యవసాయాన్ని అదుకుంది. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ అంశాల్లోనూ జోక్యంతో ఏకపక్షంగా చట్టాలు తెచ్చి, సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం భంగం కలిగించిందని విమర్శ ఉంది. ఆ మచ్చ తొలగించుకునేందుకైనా తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!! దిలీప్ రెడ్డి -
పడవ మునిగితే... ఎవరం మిగలం!
వచ్చే ఆదివారం నుంచి 13 రోజులపాటు జరుగనున్న ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26) కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబుతున్నా రాజకీయ వ్యవస్థే కదలటంలేదు! ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టు బడాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భూమి మునిగిపోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన కూర్చున్నా... ఆ పడవే మునిగితే... ఎవరం మిగలం! లక్ష్యం పెద్దదిగా ఉంటే... ఫలితం ఆశించిన దానికి దగ్గరగా ఉండొచ్చు. లక్ష్యమే చిన్నదైతే సాధించేదీ పరిమితమే! పెద్ద లక్ష్యం వల్ల మహా అంటే, ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చేమో? కానీ, ఆశించింది సాధిస్తే అంతకన్నా మేలేముంటుంది? ఈ సూత్రం, గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26)కు వర్తించదా? వర్తింపజేస్తే, అందుకు ప్రపంచ దేశాలు, అదే భాగస్వాములు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) సిద్ధమేనా? నిజానికి... ఆ సదస్సు ఏమి ఆశిస్తోంది? ఏమి సాధించనుంది? వచ్చే ఆదివారం నుంచి 13 రోజులు జరుగ నున్న సదస్సు ముందర ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతున్నాయి. కాలుష్యాల వల్ల పెరుగుతున్న భూతాపోన్నతిని నియంత్రించడం, తద్వారా వాతావరణ మార్పు దుష్ప్రభావాల్ని కట్టడి చేయడం సదస్సు ముందున్న ప్రధాన లక్ష్యం! వాతావరణ మార్పు విపరిణామాలు శాస్త్రీయ నివేదికలు, పరిశోధనా పత్రాల్లో కనిపించడమే కాకుండా... ప్రతి మనిషిని తాకుతున్నాయి. కొత్త రోగాలు, అడవుల దగ్ధం, తుఫాన్లు, అకాలవర్షాలు, వరదలు–కరువులు, ధ్రువమంచు కరగటం, సముద్రమట్టాలు పెరగటం వంటివన్నీ వాతావరణ మార్పువల్లే! దాంతో, మునుపెన్నడూ లేనంతగా మానవాళి చూపు ‘కాప్’ వైపు మళ్లింది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాల (జిహెచ్జి)ను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని ధ్రువపడింది. శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబు తున్నా రాజకీయ వ్యవస్థే కదలలేదు! హామీలివ్వడం, ప్రమాణాలు చేయడం కాదు, చర్యలు కావాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. శతాబ్దాం తానికి (2100) ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ను మించనీకుండా కట్టడి చేయాలని, 1.5 డిగ్రీలకన్నా తక్కువకే నిలువ రిస్తే మంచిదని ఆరేళ్ల కింద పారిస్లో (2015) భాగస్వామ్య దేశాలన్నీ ఒప్పందానికి వచ్చాయి. ఇది కూడా గొప్ప లక్ష్యమేం కాదని, కర్బన ఉద్గారాల తీవ్రత, భూమి వేడెక్కుతున్న వేగాన్ని బట్టి చూస్తే లక్ష్యాలే అరకొరగా ఉన్నాయి, వాటి సాధన కృషి మరింత నిస్సారమని ‘వాతావరణ మార్పుపై యూఎన్ ఏర్పరచిన అంతర్ప్రభుత్వాల బృందం’ (ఐపీసీసీ) తాజా నివేదిక చెప్పింది. దాంతో లక్ష్యాల్నే ఇంకాస్త పెద్దవిగా పెట్టుకొని, ఎక్కువ కష్టపడితే మేలనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. పారిశ్రామికీకరణ (1850–60) నాటి భూతాపం కన్నా పెరుగు దలను 2 డిగ్రీల దాకా అనుమతించే ఉదారవాదమో, 1.5 డిగ్రీలలోపే కట్టడి చేద్దామనే పరిమిత వాదమో ఎందుకు? పెరుగుదలను 1 డిగ్రీ మించనీకుండా కట్టడి చేద్దామనే కొత్త లక్ష్యాల ప్రతిపాదన వస్తోంది. ఆ మేర ఉద్గారాలను నియంత్రించాలని, సంపన్న దేశాలతో పాటు భాగ స్వాములంతా ముందుకు వచ్చి కార్యాచరణను వేగవంతం చేయాలని పౌరసమాజం కోరుతోంది. తాపోన్నతి కట్టడి సాధ్యమా? సగటు భూతాపోన్నతి ఇప్పటికే 1.12 డిగ్రీలు పెరిగింది. ఇదే పంథా సాగితే 2050 నాటికి 1.5 డిగ్రీలు దాటే ప్రమాదాన్ని శాస్త్రరంగం శంకిస్తోంది. ‘మా దేశం కట్టుబడ్డట్టు, మేమిది చేస్తాం’ (ఎన్డీసీ) అంటూ, భాగస్వాములు పారిస్లో పెద్ద హామీలే ఇచ్చారు. కానీ, కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకోలేదు. పెట్రోలియం, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర–పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్ఈ) వైపు దారి మళ్లాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలి. ఎక్కడా అది ఆశించిన స్థాయిలో జరగటం లేదు. 194లో 113 దేశాలు, యూఎన్కు ఇచ్చిన ఎన్డీసీ నివేదికల సార మేమంటే, 2010 స్థాయిపై 2030 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గకపోగా 16.3 శాతం పెరిగే ఆస్కారముంది. ఐపీసీసీ నివేదిక ప్రకారం 2010 నాటి స్థాయిపైన 2030 నాటికి, ఉద్గారాలను 45 శాతం తగ్గించగలిగి తేనే... భూతాపోన్నతి పెరుగుదలను 1.5 డిగ్రీలకు నిలువరించగలం. హామీలకు–ఆచరణకు ఇంత వ్యత్యాసం ఉన్నపుడు, పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడిచేస్తే చాలనే చిన్న లక్ష్యం వల్ల ప్రయోజనం లేదని, 1 డిగ్రీకి మించనీయవద్దనే పెద్ద లక్ష్యంతోనే ఎంతో కొంత సాధించగల మనేది తాజా ఒత్తిడి! ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 3400 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను వాతావరణంలోకి వదులు తున్నాం. 2030ని మైలురాయిగా పెట్టుకొని, ఉద్గారాలను తగ్గించే చర్యలు చేపడితేనే కట్టడి సాధ్యం. గాలిలోకి వదిలే సీవో2ను, 2005 స్థాయి నుంచి 2030 నాటికి, 33–35 శాతం తగ్గిస్తామన్నది పారిస్లో మన హామీ! వీటిని మార్చుకొని, విడుదలను అంతకన్నా ఎక్కువ శాతాల్లోనే నియంత్రిస్తామని కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి. ఉద్గారాల ‘శూన్య స్థితి’కి సిద్ధపడని భారత్! సీవో2 వంటి వాయువుల్ని మానవ ప్రమేయం తర్వాత కూడా, వాతా వరణంలో సహజ స్థాయికి పరిమితం చేయడాన్ని ఉద్గారాల ‘శూన్య స్థితి’ అంటారు. శిలాజ ఇంధనాల నుంచి ఆర్ఈ వెపు మళ్లడం ద్వారా ఎప్పటి వరకు ఆ శూన్యస్థితిని సాధిస్తారో ఆయా దేశాలు నిర్దిష్టంగా హామీ ఇస్తున్నాయి. 2050 నాటికని అమెరికా, ఐరోపా సంఘం హామీ ఇస్తే, 2060 నాటికి అని చైనా చెప్పింది. ఆస్ట్రేలియా ఇటీవలే తన గడువు ప్రకటించడంతో ఇక భారత్పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ సగటు (6.5 టన్నుల) కన్నా భారత్ తలసరి సీవో2 విడుదల (2.5 టన్నులు) చాలా తక్కువ! భారత్ తలసరి విడుదల కన్నా అమెరికా ఏడున్నర రెట్లు, చైనా మూడున్నర రెట్లు, ఐరోపా సంఘం మూడు రెట్లు అధిక తలసరి విడుదల నమోదు చేస్తున్నాయి. అయినా, భారత్ శూన్యస్థితికి హామీ ఇవ్వటం లేదు. ఎప్పట్నుంచో సహజ వనరుల్ని మితిమీరి వాడుకుంటూ, వాతావరణ కాలుష్యానికి కారకులైన అభి వృద్ధి చెందిన దేశాలు (కాలుష్య కారకులే!) మూల్యం చెల్లించాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం, సాంకేతిక బద లాయింపు చేయాలని కోరుతోంది. 2009 (కొపెన్ హెగెన్)లో హామీ ఇచ్చినట్టు, ఏటా పదివేల కోట్ల డాలర్ల సహాయం ద్వారా ‘వాతావరణ ఆర్థికాంశా’ నికి కట్టుబడాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ‘పర్యావరణ న్యాయం’ జరిగే వరకు కర్బన ఉద్గారాల ‘శూన్యస్థితి’పై ప్రకటనకు భారత్ సిద్ధంగా లేదు. శిలాజ ఇంధనాల నుంచి ఆర్ఈ వైపు క్రమంగా మళ్లుతున్నట్టు మనమొక చిత్రం చూపిస్తున్నాం. సౌర, పవన, చిన్న పాటి జల విద్యు దుత్పత్తి ద్వారా 2030 నాటికి 450 గిగావాట్ల హరిత ఇంధనోత్పత్తి లక్ష్యమని చెబుతున్నాం. కానీ, బొగ్గు వినియోగం కథ భిన్నంగా ఉంది. మనం వాడే విద్యుత్తులో థర్మల్ వాటా కొన్ని సంవ త్సరాల కింద 75 శాతం కాగా ఇప్పుడది 67 శాతం. 2030 నాటికి 50 శాతంగా ఉండొచ్చు! కానీ, అప్పుడు వినియోగమయ్యే మొత్తం విద్యు త్తుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ! 2030–40 మధ్య మన బొగ్గు విని యోగం ఉచ్ఛస్థితికి వస్తుందని ఒక అంచనా! సర్కార్లు–కార్పొరేట్లు మారితేనే! భూతాపోన్నతి పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడి, ఉద్గారాల శూన్యస్థితి ఇప్పట్లో దుస్సాధ్యమనే వాదన తరచూ తెరపైకి వస్తోంది. దీని వెనుక బొగ్గు లాబీ, చమురులాబీ, వాహనోత్పత్తి వంటి బలమైన లాబీలే కారణమని తెలుస్తోంది. యూఎన్ నివేదికనే మార్చే ఎత్తుగడలు వేసిన కార్పొరేట్ దళారీలు ఏమైనా చేయగలరనే విమర్శ వ్యక్తమౌతోంది. ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టుబడాలనే ఒత్తిళ్లు సామాజికవేత్తలు, కార్యకర్తల నుంచి పెరుగు తున్నాయి. కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద స్వచ్ఛ, హరిత ఇంధనాలవైపు మొగ్గడం వారికే ఉపయోగం! యువ తరం, షేర్హోల్డర్లు కూడా కార్పొరేట్లపై ఒత్తిడి పెంచితే సానుకూల ఫలితాలుంటాయి. రేపు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ హరితంలోనే! ఈ పర్యావరణ సంక్షోభంలో... అందరం బాగుంటేనే, ఎవరమైనా బాగుండేది. జీవమున్న ఏకైక గ్రహం భూమి మునిగి పోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన, ఎంత పద్ధతిగా కూర్చున్నా... ఆ పడవే మునిగితే.... ఎవరం మిగలం! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
చట్టం బలపడితేనే అడవి నిలబడేది
అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు ‘అటవీ సంరక్షణ చట్టం’ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నించేస్తున్నారు. పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా.... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది. అడవి అమ్మలాంటిది. అన్నీ తనలో ఇముడ్చుకుంటుంది. యుగాలుగా మనిషి మను గడ అడవితో ఎంత గాఢంగా పెనవేసుకుందో వేద–వేదాంగాలు, పురాణ–ఇతిహాసాలు, సంస్కృతీ సంప్రదాయాలు చెప్పకనే చెబుతాయి. రామాయణ, మహాభారత ఇతిహాసాల నుంచి నైమి«శారణ్య బోధనలూ, పంచతంత్రం వరకు ఎన్నో గాథలకు వేదిక అడవి! కోట్ల ఏళ్లుగా మానవేతిహాసం అడవితో–సకల జీవరాశితో సహజీవన యానం (సింబయాసిస్ లివింగ్) చేస్తోంది. నింగి, నేల, గాలి, నీరు, ఆకాశం.... పంచభూతాలే ఇందుకు సాక్ష్యం! స్వార్థంతో మనిషి ప్రకృతికి చేసిన విఘాతాలే నేడు ఉగ్రరూపంతో మానవాళిని వేధిస్తున్న విపత్తులకు, ఉపద్రవాలకు కారణం. ఆ వరుసలో.. తాజాగా ఇపుడు అడవికి ముప్పు తెస్తున్నారు. భూతాపోన్నతి పెరిగి వాతావ రణ విపత్తులు ముంచుకు వస్తున్న వేళ, అడవుల్ని కాపాడుకొని, విస్తీర్ణం పెంచుకోవాల్సిన సమయంలో... ఉన్న చట్టానికి కేంద్రం తల పెట్టిన సవరణ ప్రతిపాదనలు మేలు చేయకపోగా కీడు చేసేవిగా ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు, ఉద్దేశపూర్వకం! పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్లకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది. అటవీ భూముల్ని అటవీయేతర అవసరాలకు వాడే భూబదలాయింపులకు ఇక తలుపులు బార్లా తెరచినట్టే! కీలకాంశాల్ని చట్ట పరిధి నుంచి తప్పించనున్నారు. అప్పుడిక ఏ ముందస్తు అనుమతులూ తీసుకునే పనిలేదు. గిరిజనులకు, అడవి బిడ్డలకు తీరని కష్టాలే! గ్రామీణులు, వనవాసీల సహకారంతో చేపట్టే వనసంరక్షణ స్ఫూర్తి గాలికే! ప్రతి పాదనల్లోని కొన్ని అంశాలు 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధం. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. కేంద్ర అధికారాల్ని మరింత కేంద్రీకృతం చేసేవే! చట్టం చేసే ముందరి సంప్రదింపుల విధాన (పీఎల్సీపీ) ప్రక్రియలో భాగంగా సంబంధీకుల వ్యాఖ్యలు, సూచ నల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావ రణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక (ఎఫ్.నం. ఎఫ్సీ–11/61/2021– ఎఫ్సీ) పత్రం విడుదల చేసింది. వాటిపై రాష్ట్ర–కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలే కాకుండా పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, హక్కుల కార్య కర్తలు.... ఆసక్తిగల పౌరులెవరైనా తమ అభిప్రాయాల్ని, అభ్యంత రాల్ని తెలుపవచ్చు. అక్టోబరు నెలాఖరు వరకు గడువుంది. పయనం ఎటు? మార్పు ఏదైనా మంచికి జరగాలి. 1980లో వచ్చిన ‘అటవీ సంరక్షణ చట్టం’ ముందుగా ఒక అత్యవసర ఆర్డినెన్స్! ఆ తర్వాత చట్టమైంది. అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు (42వ రాజ్యాంగ సవరణలో భాగంగా) ఈ చట్టాన్ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. సుప్రీంకోర్టు 1996 (గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు)లో సంచలన తీర్పిచ్చింది. అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా... ఏ ప్రాజెక్టు–కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవేనని, అవన్నీ సదరు చట్ట పరిధిలోకే వస్తాయని, అలాంటి ఏ భూవినియోగ మార్పిడికైనా అను మతులు తప్పనిసరి అంది. అప్పట్నుంచి భూయాజమాన్య హక్కు లతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చ దనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా పచ్చదనం పెరిగింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నం చేస్తున్నారు. కానీ, పైకి ‘చట్టంలోని పలు అంశాలను చక్కదిద్దడానికి’ అని చెబుతున్నారు. ‘ఒకవైపు అడవుల రక్షణ, మరో వైపు అభివృద్ధిని వేగంగా సమీకృత పరచటానికే ఈ చట్ట సవరణ’ అనేది సర్కారు వాదన. సమాచార హక్కు చట్టాన్ని సవరించేప్పుడూ ఇదే చెప్పారు. చివరికేమైంది అందరికీ తెలుసు. అటవీ చట్టానికే గతి పట్టనుందో! ఎవరు ప్రస్తుత మార్పు కోరారు? ఏమడిగారు? ఎందు కడిగారు? వంటి విషయాల్లో పారదర్శకతే లేదు. ఈ 40 ఏళ్లలో చట్టం ఎలా అమలయింది? అందులో మంచి–చెడు ఎంత? అధ్యయనాలేవీ లేవు. మార్పులు చేస్తే... ఎక్కడ? ఎందుకు? దానికో హేతుబద్ధత లేదు. ప్రభుత్వం తలపోసింది, అధికారులు పత్రం రూపొందించారు, అంతే! ప్రస్తుత చట్టంలో ఉన్న రక్షణ వ్యవస్థను పలుచన చేయడం, విలువైన అటవీ భూముల్ని చట్టం ఛత్రచ్ఛాయ నుంచి తప్పించడం, ‘అభివృద్ధి’ ముసుగులో సహజవనరుల్ని కొల్లగొట్టేవారికి చేయూతే పాలకుల రహస్య ఎజెండా అని పర్యావరణవేత్తల ఆందోళన! కార్పొ రేట్ వ్యాపారాల్ని సులభం చేసే చర్యల్లో ఇదొక భాగమన్నది విమర్శ. రోగం కన్నా చికిత్స ఘోరమైతే....? అటవీ చట్ట సవరణకు పద్నాలుగంశాలు ప్రతిపాదించారు. వివిధ రకాల రక్షిత అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడమో, భూబదలాయింపుల్ని సులభం చేయటమో, నియంత్రణ పట్టు సడలిం చడమో, నిబంధనల్ని నీరుగార్చడమో.. ఇలాగే సాగింది. ప్రయివేటు అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం, రైల్వేలు, హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్ పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస–ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మా ణాలు అనుమతించడం... వంటివి ప్రతిపాదించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత–వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే... అనుమతులు అక్కర్లేదంటు న్నారు. స్థలయాజమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ –రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించాలంటున్నారు. ఇలాంటి భూమి, ఒక్క తెలంగాణలోనే అయిదారు లక్షల ఎకరాలుంది. దేశమంతటా కనీసం 150 లక్షల ఎకరాలు చట్టపరిధి నుంచి బయటపడి, అటవీయేతర అవసరాలకు దారి మళ్లుతుంది. అడవుల విస్తరణపై ఇది ప్రతికూల ప్రభావమే! పోడు వ్యవసాయం చేసుకునే వనవాసీలకు హక్కులు కల్పించడం ఇప్పుడొక పెద్ద వివాదాస్పదాంశం, దాన్ని తేల్చరు. కానీ, ఖనిజాలు తవ్వే కార్పొరేట్లకు ఎర్రతివాచీ స్వాగతాలు ఇక సులభం. అడవి పెరిగేనా? తరిగేనా? సర్కారుది ఇంకో విచిత్ర వాదన. అడవులుగా ఉన్న అటవీయేతర, ప్రయివేటు భూముల్ని ఈ చట్టపరిధి నుంచి తప్పించి, భూయజమా నుల్లో భయాల్ని తొలగించాలట! నిర్భయంగా వారు ముందుకు వస్తారు కనుక, ఇప్పుడు 24.5 శాతంగా ఉన్న అడవుల వాటాను మొత్తం భూభాగంలో మూడో వంతుకు పెంచాలనే లక్ష్యం సాధ్యమౌ తుందట! అడవికి ఏ నష్టం కలిగించని ఆధునిక సాంకేతికత వచ్చింది కనుక.. చమురు, సహజవాయువు కోసం అడవుల కింద, ఏ ముందస్తు అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుకోవచ్చని ప్రతి పాదించారు. ఖనిజాలు, ఇతర వనరుల తవ్వకాలకు జరిపే సర్వేలను కూడా అటవీ చట్ట పరిధి నుంచి మినహాయించాలన్నారు. అంటే, మన అమ్రాబాద్ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వంటి సర్వేలు ఏ అనుమతులు లేకుండా చేసుకోవచ్చు! అంటే, ఏ అటవీ భూమి ఏ ఇతర అవసరాలకు దారి మళ్లుతుందో ఎవరికీ తెలియదు. నిశ్శబ్దంగా అంతా జరిగిపోతుంటుంది. తెలియనపుడు ప్రజాందోళనలుండవ్! న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించే సందర్భాలుండవు. ప్రస్తుత ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పర్యా వరణ సంస్థలు, నిపుణులు, కార్యకర్తలు ఇతర బాధ్యతకలిగిన పౌరులు ఎలా స్పందిస్తారు? అన్నదాన్ని బట్టే దేశంలో అడవులు, పర్యావరణ భవిత ఆధారపడి ఉంది. అడవి ఎవరికీ శత్రువు కాదు. ఆయుధమెప్పుడూ అలీనం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రా యమే ఆయుధం. శమీ వృక్షంపైనుంచి దించి, జరిపే ఆయుధపూజకు వేళైంది. చెడుపై మంచి గెలుపే విజయదశమి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
హరిత ఇంధనమే భవితకు బాట
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజవనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిళ్ళున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లుతోంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహ నాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్కు రక్ష! ఆధునిక మానవుడి నిత్యావసరమైన ఇంధన వనరు రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. కర్భన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ (స్వచ్ఛ– హరిత) ఇంధనాల వైపు మళ్లుతోంది. ఇదొక... అవసర, అనివార్య స్థితి! ఈ మార్పుకనుగుణంగా భారత్లోనూ బలమైన అడుగులే పడు తున్నాయి. అక్టోబర్ నెలాఖరుకి 150 గిగావాట్లు, 2022 సంవత్సరాం తానికి 175 గిగావాట్ల పునర్వినియోగ విద్యుత్ ఇంధన (ఆర్ఈ) స్థాపక సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. (ఒక గిగా వాట్ అంటే వెయ్యి మెగావాట్లు) గాంధీ జయంతి రోజైన శనివారం 2.2 గిగావాట్లు, నెలాఖరున మరో 2.32 గిగావాట్ల స్థాపక సామర్థ్య ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ రంగం నుంచి ఇటీవల వచ్చిన భారీ ప్రకటనల ప్రకారం.... రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వచ్చే మూడేళ్లలో రూ 75 వేల కోట్లు (పది బిలియన్ డాలర్లు), అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లలో రూ 1.50 లక్షల కోట్లు (ఇరవై బిలియన్ డాలర్లు) çపునర్వినియోగ ఇంధన రంగంలో వ్యయం చేయనున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ, పౌర సమాజం... అప్రమత్తంగా ఉండి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బాటను చక్కదిద్దుకోవడమే వారి ముందున్న కర్తవ్యం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజ వనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిడులున్నాయి. వాటి లభ్యత కష్టం–ఖరీదవుతుండగా, వినియోగం దుర్భరమౌతున్న పరిస్థి తుల్లో పర్యావరణ సానుకూల çపునర్వినియోగ ఇంధనాల వినియోగ వాటాను పెంచడం ఆరోగ్యకర పరిణామం! ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించనట్టు, 2015 పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి ఈ దిశలో పయనం అత్య వసరం! అదే సమయంలో సుస్థిరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుంటే, ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభ దుస్థితి మనకూ తప్పదు! ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు వినియో గించే చైనా సదరు శిలాజ ఇంధన వాడకాన్ని రమారమి తగ్గించింది. గత దశాబ్దారంభంలో 68 శాతం ఉన్న బొగ్గు వినియోగం వాటాని, 2020లో 56 శాతానికి తగ్గించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేనందున ఇప్పుడు పారిశ్రామిక, నివాస, ట్రాఫిక్ నిర్వహణ వంటి నిత్యావసరాలకూ తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటూ దిగుమతుల కోసం దిక్కులు చూస్తోంది. సరైన దిశలోనే భారత్! అమెరికా, చైనా తర్వాత ఎక్కువ కర్బన ఉద్గారాలను (గ్రీన్ హౌజ్ గ్యాసెస్) విడుదల చేస్తున్న దేశంగా భారత్పై పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎంతో ఉంది. 2030 నాటికి, కార్బన్ ఫుట్ప్రింట్ని 33–35 శాతం (2005 నాటి స్థాయిపై లెక్కించి) మేర తగ్గిస్తామని పారిస్లో మాటిచ్చాం. పునర్వినియోగ ఇంధన వాటాని 40 శాతానికి పెంచుతా మన్నది కూడా ఒప్పందంలో భాగమే! ఇప్పటికే 38.4 శాతానికి చేరు కున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వ–ప్రయివేటు రంగంలో తాజాగా వస్తున్న పెట్టుబడులు, ప్రణాళికల్ని బట్టి ఈ వాటాను 2030 నాటికి 66 శాతానికి పెంచే ఆస్కారముంది. పర్యా వరణ సానుకూల దిశలో గట్టి ముందడుగు పడ్డట్టే! కార్బన్ డైయాక్సైడ్ (సీవోటూ) వంటి కర్బన ఉద్గారాలను 28 శాతానికి తగ్గించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ రెండో అల సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గి, బొగ్గు ఉత్పత్తి పెరిగింది. కానీ, సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం మనదేశంలో పెరుగుతోంది. గరిష్ట వినియోగ సమయంలో (పీక్) గత జూలై 7న, 200.57 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు కేంద్ర ఇంధన మంత్రి రాజ్కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచ సగటు తలసరి కర్బన ఉద్గారాలతో పోలిస్తే మన తలసరి మూడో వంతేనని ఇటీవల ఒక అంతర్జాతీయ వేదిక నుంచి, సదరు మంత్రి సెలవిచ్చారు. కర్బన ఉద్గారాల సున్నాస్థితి (జీరో న్యూట్రాలిటీ) సాధించే విషయమై భారత్ నిర్దిష్ట ప్రకటన చేయాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఆయనీ మాటలన్నారు. కానీ, అది సరైన వాదన కాదనేది పర్యావరణ కార్యకర్తల భావన! ప్రపం చంలో రెండో అతి పెద్ద ఉత్పత్తి దేశం, రెండో అత్యధిక జనాభా దేశం, కర్బన ఉద్గారాల్లో మూడో అతిపెద్ద దేశం. తలసరి ఉద్గారాల వెల్లడి తక్కువే అయినా, విస్తృత జనాభా రీత్యా, దీన్ని తీవ్ర సమస్యగానే పరిగణించాలి. నెల రోజుల్లో గ్లాస్గోవ్లో జరుగనున్న ‘కాప్–26’ యూఎన్ సదస్సులోగానీ, ముందేగానీ దీనిపై నిర్దిష్ట ప్రకటన చేయా లని భారత్పై అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడి పెరుగుతోంది. భూమి ఒక వివాదాంశమే! భారత్ పురోగమిస్తున్న çపునర్వినియోగ ఇంధన రంగంలో, అందుక వసరమైన భూలభ్యత, సేకరణ, వినియోగం జఠిల సమస్యే కానుంది. హరిత మార్గాలైన సౌర విద్యుత్కైనా, పవన విద్యుత్తుకైనా నిర్దిష్టంగా స్థలం అవసరమౌతుంది. పునర్వినియోగ ఇంధనాల ద్వారా. 2050 నాటికి కర్భన ఉద్గారాల శూన్యస్థితి సాధించాలంటే ‘ఇంధన వ్యయ– ఆర్థిక విశ్లేషన సంస్థ’ (ఐఈఈఎప్ఎ) అధ్యయనం ప్రకారం, పెద్ద మొత్తం భూమి అవసరమౌతుంది. సౌర విద్యుత్ వ్యవస్థకు 50,000 నుంచి 70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పవనవిద్యుత్ వ్యవస్థ కోసం మరో 15,000 నుంచి 20,000 చ.కి.మీ భూమి అవసరమౌతుంది. అంటే ఒక్క విద్యుత్తుకే మొత్తం భూభాగంలో 1.7 నుంచి 2.5 విస్తీర్ణం, అటవీయేతర భూభాగంలో దీన్ని 2,2 నుంచి 3.3 శాతంగా లెక్కగట్టారు. ఇది మంచిది కాదని, భూమ్యావరణ వ్యవస్థకు చేటని పర్యావరణవేత్తలంటున్నారు. ఆహారోత్పత్తిపైనా ప్రతికూల ప్రభా వమే! బడా కార్పోరేట్ల స్పర్థలో భూసేకరణ, భూదురాక్రమణలు మళ్లీ వివాదాస్పదమనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో తగినంత కస రత్తు జరగాలని, భూవినియోగ విధానాలు సమగ్రంగా ఉండాలని ఆ సంస్థ సిఫారసు చేసింది. సౌరవిద్యుత్ పలకలు (ప్యానల్స్), పవన్ విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేసే భూములు, సామాజికంగా–వ్యావసా యికంగా–పర్యావరణ పరంగా తక్కువ ప్రభావితమయ్యే ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ, పోరంబోకు, గైరాన్ వంటి భూముల్ని ఎంపిక చేయాలి. గరిష్ట ప్రయోజనం–కనీస వివాదం ప్రాతిపదకగా ఉండాలనీ సూచించింది. పంట కాల్వలపైన, ప్రయివేటు–కృత్రిమ జలాశయాల పైన సౌరపలకలు ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు, నీటిపారుదల ప్రాజెక్టు కాలువ లపై సౌరపలకలు ఏర్పాటు చేసిన నమూనాకు ‘జాతీయ సోలార్ మిషన్’గా యూఎన్ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇపుడు దేశ వ్యాప్తంగా దాన్ని మరింత విస్తృతపరచవచ్చు. ఇళ్లు, ఇతర నివాస ప్రదేశాలు, కార్యాలయాలపైన (రూప్టాప్) కూడా ప్యానల్స్ ఏర్పాటు చేయడం సముచితమనే అభిప్రాయముంది. ఫ్రాన్స్లో ఒక దశలో, ప్రతి ఇంటి పైకప్పునూ అయితే హరితంతో లేదా సౌరపలకలతో గానీ కప్పి ఉంచేట్టు ఇచ్చిన ఆదేశాలు ఫలితమిచ్చాయి. పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా పెరుగు తున్నాయి. బ్యారెల్ క్రూడ్ 90 డాలర్లకు చేరనుందని వార్తలొస్తు న్నాయి. భారత్, 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా పెట్రో ఉత్పత్తి విస్తరణ అవకాశాలు తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలు రావాల్సినంత త్వరగా భారత్ మార్కెట్లోకి రావటం లేదు. ఏయే లాబీలు బలంగా పనిచేస్తున్నాయో గానీ, వాటికెన్నో ప్రతి బంధకాలు! పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) అధ్యయనం ప్రకారం, వచ్చే పాతికేళ్లలో, డీజిల్–గ్యాసోలైన్పై ఆధారపడి నడిచే మన వాహనాల వాటా 51 శాతం నుంచి 58 శాతానికి పెరుగనుంది. ఇది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహనాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్కు రక్ష! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
‘మనం’ మారితేనే మనుగడ!
దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జఠిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో గ్రీన్ పార్టీ రాజకీయాలు మొదలయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దిశ మార్చు కుంటున్న సంధి కాలమిది! పునరుత్పాదక ఇంధనాలు, నికర శూన్య ఉద్గారాలు, పచ్చ పెట్టుబడులు, వాతావరణ బడ్జెట్లు, హరిత ఆర్థిక వ్యవస్థలు .... వంటి ఆధునిక పదజాలం తెరపైకి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న సంక్లిష్ట సమయం. ప్రకృతిలో మానవ ప్రమేయపు అలజడి, భూగ్రహంపై మనిషి మనుగడ పెంచిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! అది సృష్టిస్తున్న అనేక రూపాల కాలుష్యం ‘వాతావరణ మార్పు’గా ఉపద్రవమై ముంచుకు వచ్చింది. భూతాపోన్నతి పెరుగుతూ ఎండలు, వానలు, వరదలు, కార్చిచ్చులు... అన్నీ పరిమితులు దాటి విలయం సృష్టిస్తు న్నాయి. సరికొత్త వైరస్లు మానవాళి ఉనికినే ఊగిసలాటలోకి నెడుతు న్నాయి. ఇందుకు కోవిడ్–19 తార్కాణం! ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. లోతట్టు దీవులతో పాటు తీర నగరాలూ ప్రమాదంలో పడ్డాయి. అంచనాకు మించిన వేగంతో విధ్వంసం కమ్ముకొస్తోంది. ‘వెనక్కి తిరిగి సరిదిద్దుకునే వీలులేని అన ర్థాలు జరిగిపోతున్నాయ’ని ఐక్యరాజ్యసమితి (యూన్) తాజా నివేదిక హెచ్చరించింది. దక్షిణాసియా దేశాలకు ముప్పు ఎక్కువుంది. పర్యా వరణం ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యకర్తలు.. అనే దశ దాటి అందరి నోళ్లలోనూ నిత్యం నానుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగి, కొడు తున్న దెబ్బలు ‘తమ దాకా వస్తే గాని...’ జనాల్లో కదలిక రాలేదు! పాలనాపీఠాలు అధిష్టించిన రాజకీయ వ్యవస్థలే ప్రాధాన్యాంశంగా ఇంకా ఎజెండాపైకి తేవటం లేదు. ఇప్పుడిక అనివార్యం! అభివృద్ది చెందుతున్న ఓ పెద్ద దేశంగా భారత్ నేడు కీలక స్థానంలో ఉంది. ఆరేళ్ల కిందటి పారిస్ ఒప్పందాల నుంచి సాగుతున్న ప్రయాణంలో... ఇచ్చిన హామీల అమలు, ఫలాలు, వైఫల్యాలు, మున్ముందరి సవాళ్లు– అవకాశాలను ప్రపంచమంతా సమీక్షించుకునే ‘భాగస్వాముల సదస్సు’ (కాప్26) వైపు అడుగులు పడుతున్నాయి. గ్లాస్గో (నవంబరు1–12)లో జరిగే ఈ సదస్సునాటికి చాలా విషయాల్లో మనం విధాన నిర్ణయాలతో సన్నద్ధం కావాలి. పరిష్కారంలో భాగమైతేనే... వాతావరణ సంక్షోభంలో మన పరిస్థితి సంక్లిష్టమే! భారత భూభా గంలో 65 శాతం కరువు ప్రభావిత ప్రాంతం, 12 శాతం భూమి వరదలు, 8 శాతం భూభాగం తుఫాన్ల ప్రభావితం. దీనికి తోడు భూతాపోన్నతికి కరుగుతున్న మంచు పర్వతశ్రేణి, హిమాలయాలు ఉత్తర సరిహద్దులుగా ఉన్న దేశం. మేఘ విచ్ఛిత్తితో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే విధ్వంసాలు ఇప్పటికే పెచ్చుమీరాయి. ‘వాతావరణ మార్పుల’పై యూఎన్ ఏర్పాటు చేసిన అంతర్ ప్రభుత్వ వేదిక (ఐపీసీసీ) ఆరో నివేదిక ప్రకారం మిగతా సముద్రాల కన్నా హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం మనకు అరిష్టం. వేడి గాలులే కాకుండా రుతుపవనాలను, వ్యవసాయ పరిస్థితుల్నీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సుదీర్ఘ తీరం ఉండటంతో సముద్రమట్టాల పెరుగుదల ప్రమాదమౌతోంది. మన సముద్ర తీరంలోని ఖిదిర్పూర్ (కోల్కత), పారాదీప్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ట్యూటీకొరిన్, చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), మంగళూరు (కర్ణాటక), మార్ముగోవా (గోవా), ముంబాయి (మహారాష్ట్ర), కండ్ల, ఓఖా, భావ్నగర్ (గుజరాత్) ఈ 12 నగరాలు/ పట్టణాలు జలమయమయ్యే ప్రమాద సంకేతాలున్నాయి. తాజా ఐపీసీసీ నివేదిక ఆధారంగా, ఈ శతాబ్ది అంతానికి ఇవి సుమారు మూడు అడుగుల మేర నీట మునిగే ప్రమాదముందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ విశ్లేషించింది. ‘వాతా వరణ మార్పు’ విశ్వవ్యాపితమైనా సమస్యలు, సంక్షోభాలు స్థానిక మైనవే! పరిష్కరాలను స్థానికంగా యోచించాలి. సమస్య తీవ్రత అధి కంగా ఉన్న దేశాల్లో ఉన్న మనం, బాధిత దేశమే అయినా.. సమస్యలో కన్నా పరిష్కారంలో భాగం కావాలి. పెద్దన్న పాత్ర పోషించాలి ప్రపంచంలో మనం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగాం. చైనా తర్వాత మనదే స్థానం! వాతావరణ కాలుష్యానికి, తద్వారా భూతాపో న్నతికి కారణమవుతున్న కర్భన ఉద్గారాల విడుదలలో మనది మూడో స్థానం. విద్యుత్ వినియోగంలో చైనా, అమెరికా, ఐరోపా సంఘం (ఈయూ) తర్వాత భారత్ది నాలుగో స్థానం! శిలాజ ఇంధనాల వినియోగమే 80 శాతం కర్బన ఉద్గారాలకు కారణం. ఆయా దేశాల ఇంధన విధానాలు, నూతన వైఖరులే వాతావరణ సంక్లిష్టతను నిర్దేశి స్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానం తరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత జరిగిన వాతావరణ నష్టమే అపారం. అభివృద్ధి చెందిన దేశాలు, ఆ క్రమంలో విడుదల చేసిన–చేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతివనరుల దోపిడీకి లెక్కేలేదు. ఇది నొక్కి చెబుతూ పారిస్ ఒప్పంద సమయంలో భారత్ క్రియాశీల పాత్ర పోషించింది. మారిన మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో, రానున్న కాలం లోనూ భారత్ పోషించాల్సింది కీలక భూమికే! మన వాణికి ఎక్కువ ఆదరణ! కర్బన ఉద్గారాల స్థాయిని బట్టి, అభివృద్ధి సమాజాల పాపమే అధికమైనప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు ఆయా దేశాలు ఉదారంగా ముందుకు రావడం లేదు. మన పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మనం బాధితు లమైనా పరిష్కర్తలుగా ముందున్నాం. వాతావరణ సంక్షోభంలో... ‘కారణ’మైనదానికి నాలుగు రెట్లు ‘భారం’ మనం మోస్తున్నాం. విధానాలు మార్చుకోక తప్పదు! విద్యుదుత్పత్తి ఇంధన వనరుల వినియోగం తర్వాత కర్బన ఉద్గారా లకు, కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో పౌర రవాణా, నిర్మాణ, ఉత్పత్తి, వస్తు రవాణా, సేవా తదితర రంగాలున్నాయి. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు ‘వాతావరణ మార్పు’ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్గారాలు, ఇతర కాలుష్యాల్ని నివారించేలా ప్రాధాన్య తలు మార్చాలి. ముఖ్యంగా శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలి. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంతో కార్బన్డయాక్సైడ్ (సీవో2) విడుదలే కాక 80 శాతానికి మించి దిగుమతులే కనుక ఇదొక ఆర్థిక భారమే! ధరలు రమారమి తగ్గిన పరిస్థితుల్లో సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లాలి. బొగ్గు వినియోగాన్నీ తగ్గించాలి. 2050 నాటికి కర్భన ఉద్గారాల నికర శూన్య స్థితి సాధిం చేందుకు మనం సంకల్పం తీసుకోవాలి. అవసరమైతే గ్లాస్గోలో ప్రకటించాలి. ఇప్పటికే 100 దేశాలు ప్రకటించాయి. ఇతర మెజారిటీ దేశాలు ఈ దిశలో నడిచేలా ఒత్తిడి పెంచాలి. శిలాజ ఇంధనాల వాడకం ఏటా 83 కోట్ల టన్నుల సీవో2 విడుదలకు కారణమవుతోంది. ఇది మారాలి! అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సూచించినట్టు సింగపూర్తో సహా ఇప్పటికే 40 దేశాలు కార్బన్ పన్ను విధిస్తున్నాయి. పన్ను ఏకరీతిలో ఉండాల్సిన పనిలేదు. ప్రపంచ సగటు కింద టన్ను సీఓ2 ఉత్పత్తికి 5 నుంచి 10 డాలర్లు పన్ను ఖరారు చేసి, భారత్లో (25), చైనాలో (50), అమెరికాలో (70 డాలర్లు) ఇలా, విభిన్నంగానూ ప్రతిపాదించవచ్చు. డీజిల్కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించాలి. వాతావరణ మార్పును తట్టుకునే సామ ర్థ్యాల కోసం వెచ్చిస్తున్న (ఎన్ఏఎఫ్సీసీ) నిధులు పెంచాలి. తమ వాటా చెల్లించి, రాష్ట్రాలు గరిష్టంగా వినియోగించుకునేలా చూడాలి. దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జటిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో హరిత పక్ష (గ్రీన్ పార్టీ) రాజకీయాలు మొద లయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ఈమెయిల్:dileepreddy@sakshi.com -
ముప్పు వచ్చేసింది... మనకు మరింత!
భూగోళమంతటికీ విస్తరించి మానవాళి మనుగడని భయాందోళనకు గురిచేస్తున్న ‘వాతావరణం మార్పు’ ప్రతికూల ప్రభావాలు.. కార్చిచ్చు, వరదలు వంటివి అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, టర్కీ వంటి దేశాలను తాజాగా గజగజలాడిస్తున్నాయి. ప్రపంచం మొత్తం అప్రమత్తమై వాతావరణ మార్పు ఉపద్రవాలపై కార్యాచరణను వేగవంతం చేయాల్సిన ప్రమాద స్థితికి చేరుకున్నాం. ముఖ్యంగా మన దేశం! ఈ ప్రమాదంలో భారత్ది మరింత దయనీయ పరిస్థితి అని ఇటీవలి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. వాతావరణ మార్పు అందరి సమస్య కనుక, ముఖ్య కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగానో, సాంకేతికంగానో అభివృద్ధి చెందుతున్న, చెందని సమాజాలకు సహకారం అందించాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల రికార్డు వర్షం నిన్న 24 గంటల్లో కురిసింది. ఉత్తర అమెరికాను నూరేళ్లలో లేని ఎండలు ఇటీవల మండించాయి. కెనడా, బ్రిటిష్ కొలంబియాలో 49.6 (జోరెండకాలం, థార్ ఎడారిలో కన్నా ఎక్కువ) డిగ్రీలకు తాకిన ఎండవేడి వల్ల నెలలో 370 మంది మరణించారు. చైనాలో వర్షం–వరదలు వెయ్యేళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టాయి. కాలిఫోర్నియా, ఆస్త్రేలియా, ఆమెజాన్ (బ్రెజిల్), టర్కీ, చివరకు సైబీరియాలోనూ అడవులు అంటుకొని కార్చిచ్చు దీర్ఘకాలం రగులు తూనే ఉండింది. జర్మనీలో పట్టణాలు పట్టణాలనే ఊడ్చుకుపోయిన వరదలకు విస్తుపోయిన ఆ దేశ చాన్స్లర్ అంజెలీనా ‘ఈ వైపరీత్యాన్ని వర్ణించడానికి జర్మనీ భాషలో నాకు మాటలు దొరకటం లేద’ని కంటతడి పెట్టారు. ఏమిటిదంతా? ‘వాతావరణం మార్పు’ ప్రతికూల ప్రభావాలివన్నీ! (చదవండి: పెట్రోల్ బంకుల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్) వాతావరణ మార్పులపై ఏర్పడ్డ, యూఎన్ సభ్య దేశాల అంత ర్ప్రభుత్వ బృందం (ఐపీసీసీ) తన ఆరో నివేదికగా ‘మానవాళికి రుధిర సంకేతం’ పంపింది. దాన్ని ప్రపంచం ఎలా స్వీకరిస్తుంది? ఏ రీతిన– ఎంత వేగంగా స్పందిస్తుంది? అన్న దానిపైనే వచ్చే శతాబ్ది, ఆ మాట కొస్తే సహస్రాబ్ది మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రమాద తీవ్రతను గుర్తించి చేపట్టే ఏ కార్యాచరణకైనా ప్రస్తుత దశాబ్ది (2020 –30) ఎంతో కీలకమైందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రకృతిని వంచించిన మానవ తప్పిదాల వల్ల, కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల కారణంగా భూతాపోన్నతి పెరుగుతోంది. 2100 నాటికి 2 డిగ్రీల సెల్సియస్కు మించి పెరగనీ యకుండా కళ్లెం వేయాలన్న లక్ష్య సాధనకు, ఆచరణలో పట్టు సడలు తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. 2030 నాటికి ఇది 1.5 డిగ్రీలకు చేరే ప్రమాదాన్ని నిపుణులు శంకిస్తున్నారు. మొదట సహస్రాబ్ది లక్ష్యాలు (మిలీనియం గోల్స్), తర్వాత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీస్) ఏర్పాటు చేసు కొని పురోగమించాలని ప్రపంచ దేశాల ముందు యూఎన్ లక్ష్యాలు నిర్దేశించినా ఎవరికీ పట్టడం లేదు. ఆరేళ్ల కింద పారిస్లో సభ్య దేశాలన్నీ సమావేశమై ఒక చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్నా... ఆశించిన స్థాయిలో ముందడుగు పడటం లేదు. వాతావరణ మార్పు లను దీటుగా ఎదుర్కొనే, తట్టుకొని నిలువగలిగే, నష్టనివారణతో సర్దుకు పోగలిగే చర్యలేవీ... స్వీయ ప్రతినల స్థాయిలో లేవు. మన కష్టాలు మనవి భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల దృష్ట్యా వాతావరణ మార్పు ప్రతి కూల ప్రభావాలు దక్షిణాసియాలో అధికం. అందులోనూ భారత్పై ఎక్కువ అని తాజా (ఐపీసీసీ) నివేదిక వెల్లడిస్తోంది. ఫలితంగా పౌరుల ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారోత్పత్తి వంటి అంశాల్లో తీవ్ర పరిణామాలుంటాయని అంచనా! ప్రపంచ సముద్రాల సగటుకన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం, అసాధారణ జనసాంద్రత, అతిగా భూమ్యావరణ వ్యవస్థ పాడవడం, నియంత్రణలో లేని కాలుష్యం, ఆహారోత్పత్తి– వినియోగానికి సంబంధించి సుస్థిరం కాని అననుకూల విధానాల్ని ఇంకా పాటించడం వంటివి ఈ దుస్థితికి కారణాలు. అతి ఉష్ణోగ్రత వల్ల హిమాలయాల మంచు పొరలు కరగడం, కొండచరియలు విరిగి పడటం తరచూ జరుగుతోంది. ధ్రువాల మంచు కరుగుతున్నందున సముద్ర జల మట్టాలు పెరిగి, సుదీర్ఘ తీరమున్న భారత్ను ప్రమాదం లోకి నెడుతోంది. వాతావరణ మార్పు వల్ల మేఘ విచ్ఛిత్తితో అసాధారణ వర్షాలు, తుఫాన్లు, వరదలు వంటి వైపరీత్యాలు పెరుగు తాయి. ఇంకోపక్క కరువులు కూడా అధికమవడం మరో అరిష్టం! వ్యవసాయాధారిత దేశమైన భారత్కి ఇదెంతో ప్రతికూలాంశం. వేగంగా నగర–పట్టణీకరణ జరుగుతున్న మన దేశంలో ఈ మార్పులు ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్ సాధారణ వర్షాలకే అల్లాడే పరిస్థితిని యేటా కళ్ల జూస్తున్నాం. గత అయిదారేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ–వడగాలికి మరణిస్తున్న వారి సంఖ్య అసాధారణంగా ఉంటోంది. దేశంలో, 40 డిగ్రీల సెల్సియస్కు మించిన ఉష్ణోగ్రత దినాలు యేడాదిలో బాగా పెరి గాయి. 2013–19 మధ్య ఇవి యేడాదికి సగటున 114 దినాలుగా నమోదయ్యాయంటేనే తీవ్రత అర్థమౌతోంది. ఆ దేశాలు దిగిరావాలి కాలుష్య కారకులే పరిష్కారాల వ్యయం భరించాలి. అవి దిద్దుబాటు చర్యలైనా, సుస్థిరాభివృద్ధి దిశలో అడుగులైనా, ముందు జాగ్రత్త చర్యలైనా... అని భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో నొక్కి చెప్పింది. జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానం కూడా చెప్పిందిదే! పారిశ్రామిక విప్లవ క్రమంలో, రెండో ప్రపంచ యుద్ధానంతరం పలు అభివృద్ధి చెందిన దేశాలు ప్రకృతి వనరుల్ని అడ్డదిడ్డంగా వాడుకున్నాయి. ఏ జాగ్రత్తలూ తీసుకోనందున... కర్బన వ్యర్థాలు, వాయువులతో సహా పలు ఉద్గారాలకు కారణమయ్యాయి. సృష్టి పరిణామ క్రమంలో 8 లక్షల సంవత్సరాల్లో పెరిగిన భూతా పోన్నతి కంటే ఎక్కువగా గడచిన 200 సంవత్సరాల్లో పెరిగింది. ముఖ్యంగా గత వందేళ్లలో, మరీ ముఖ్యంగా ఇటీవలి 20 ఏళ్లలో ఈ పెరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. వాతావరణం, కాలుష్యం వంటి అంశాలపై స్పృహ పెరిగేనాటికే ఆయా దేశాలు ఒక స్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందే క్రమంలో చేపట్టే చర్యలపై కట్టడి గురించి అభివృద్ధి సమాజాలు మాట్లాడుతున్నాయి. ఇది ఒక అసమతుల్య ప్రతిపాదన. పారిస్ సదస్సుకు ముందు ఇదొక పెద్ద చర్చ! మనిషి సౌఖ్యం అనుభవించే క్రమంలో... ఇప్పటికీ, ఆయా అభివృద్ధి సమాజాల సగటు ఉద్గారాలు అత్యధిక స్థాయిలోనే ఉన్నాయి. మనం ప్రపంచ సగటుకన్నా చాలా తక్కువ విడుదల చేస్తు న్నాము. ప్రపంచ సగటు తలసరి ఉద్గారాలు (ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్) 6.55 టన్నులైతే, భారత్ తలసరి సగటు 1.96 టన్నులు మాత్రమే! అదే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో రెండున్నర రెట్లు అధికంగా ఉంది. జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి ఐరోపా సమాజ దేశాలు దాదాపు ప్రపంచ సగటుతో సమానంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న చైనా కూడా అంతే! వాతావరణ మార్పు అందరి సమస్య కనుక, ముఖ్య కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగానో, సాంకేతికంగానో అభివృద్ధి చెందుతున్న, చెందని సమాజాలకు సహకారం అందించాలన్నది అందరూ అంగీకరించిన సత్యం. (చదవండి: అఫ్గాన్లో ఆహార కొరత తీవ్రం!) మాట తప్పుతున్న జాడ... ప్రపంచ దేశాలన్నీ వాతావరణ అత్యయిక స్థితిని ప్రకటించి, భూతాపోన్నతి నియంత్రించే సత్వర ఉపశమన చర్యలకు దిగాలి. మరోపక్క వాతావరణ బడ్జెట్ను రూపొందించుకొని ముందుకు కదలాలి. కోపన్హెగన్ (2009) సదస్సులో అంగీకరించినట్టు అభి వృద్ధి చెందిన దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందించాలి. కర్బన ఉద్గారాలను అదుపుచేసే అభివృద్ధి నమూనా సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాలకు బదలాయిం చాలి. ఇటీవల జరిగిన జీ–7 దేశాల సదస్సులోనూ ఇది చర్చకు వచ్చింది. జీ–20 దేశాలు, ఇంకా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమౌతున్నాయి. మాటలకు చేతలకు పొంతన లేకుండాపోతోంది. ఇది ఉమ్మడిగా నిర్వహించాల్సిన బాధ్యత. వచ్చే నవంబరులో గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరిగే (కాప్– 26) సదస్సు నాటికి నిర్దిష్టమైన విధానాలతో ముందుకు రావాలి. అంతా కలిసి, చిత్తశుద్ధితో ముందుకు కదిలితేనే జఠిలమైన ఈ సమ స్యకు ఉపయోగకరమైన పరిష్కారం. మానవాళి మనుగడకు రక్ష! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com (భారత్ తక్షణ కర్తవ్యం–వచ్చే వారం) -
పెనం మీంచి పొయిలో వేసిన పెద్దన్న!
చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్లో చేరింది. ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ-ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు? నేలను చీల్చుకువచ్చే పచ్చని పసరికను ఎంతో ఆశావహంగా చూస్తుంది ప్రపంచం. ఆకుల స్వరూపం ఏర్పడని లేతపిలక ఏం మొక్కై ఉంటుందా? అన్న ఆసక్తి చూపరులకు సహజం! ఎవరి సంగతెలాఉన్నా.... విత్తు అలికిన వాడికి తెలుస్తుంది మొలుచుకు వచ్చే మొక్క ఏంటో? అమెరికా అధ్యక్షుడు బైడన్ మాటలు... ‘‘ఇంకా ఒకటో, ఐదో, ఇరవయో.. ఏళ్లు మేం ఇక్కడే ఉండి సహాయం చేసినా, అప్పటికీ తుది ఫలితం ఇలాగే ఉంటుంది’’ అని అఫ్గానిస్తాన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంపై చేసిన వ్యాఖ్యలు సాపేక్షంగా ఇదే వెల్లడిస్తాయి. ‘పుల్లగుంజుడు ఆట’లో నెపం నెత్తిన పడ్డ ఆఖరివాడు బైడన్... ఓ నలుగురు అమెరికా అధ్యక్షులు, ఇరవై ఏళ్ల కాలం, వేల కోట్ల డాలర్ల సాక్షిగా జరుగుతున్న మారణ హోమమిది. పెనంలోంచి పొయ్యిలోకి పడ్డ అఫ్ఘాన్ తాజా దుస్థితి కారణాల్లో అమెరికా మొదటిది. ఎందుకంటే, తమ గూడాచార సంస్థ సీఐఏని వాడి తాలిబన్లను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది అమెరికాయే! రష్యా, చైనాలకు వ్యతిరేకంగా మొదట తాలిబన్లను, వారి స్థావరాలను పెంచి పోషించింది. తర్వాత వారు రష్యాకు దగ్గరైన పరిస్థితులు అమెరికా వైఖరిలో మార్పు తెచ్చాయి. ఉగ్రవాద ముప్పు వేడి తమకు తాకిన ‘జంట భవనాల విధ్వంసం’ తర్వాత అఫ్గానిస్తాన్నే స్వాధీనపరచుకుంది. అల్ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల పీఛమణచడానికని నాటో మిత్ర దేశాల సహకారంతో తిష్ట వేసింది. అఫ్గానిస్తాన్ని సుస్థిర–ఆధునిక దేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి, అందుకు భిన్నంగా గడచిన రెండు దశాబ్దాలుగా చేస్తున్న నిర్వాకం కూడా బైడన్ మాటల వెనుక నుంచి తొంగి చూసింది. తాలిబన్లతో ఒప్పందం, దేశం నుంచి వైదొలగిన సమయం, కార్యాచరణ తీరు, వైఖరి సమర్థన... ఇదంతా ఘోర వైఫల్యాల శృంఖలం. మరోవైపు, ‘ఇప్పుడు మేం మారిన మనుషులం, విధానాలు మార్చుకున్న పాలకులం’ అంటున్న తాలిబన్ల మాటల్ని అంతర్జాతీయ సమాజం వింతగా చూస్తోంది. ఏ మాత్రం ప్రతిఘటన ఎదుర్కోకుండా కాబూల్ని స్వాధీనపరచుకున్న ఆదివారం నుంచి తాలిబన్లు చెబుతున్న మాటలకు భిన్నంగా గత 24 గంటల్లో హింసాత్మక పరిణామాలు, తాలిబన్లు సంయమనం కోల్పోయిన ఉదంతాలు సందేహాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి (యూఎన్) తో సహా ముఖ్య దేశాలు ఒకటొకటిగా స్పందిస్తున్నాయి. (కనీసం మా బిడ్డల్ని అయినా కాపాడండి! బావురుమంటున్న అఫ్గన్లు వైరల్ వీడియో) భారత్ ఒంటరవుతోందా? దక్షిణాసియాలో క్రమంగా భారత్ ఒంటరవుతోందా? విస్తరణ తత్వాన్ని పెంచుకున్న చైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, భారత్ స్థానే దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం ఎత్తులు వేస్తోంది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) చప్పబడిన ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్ను మినహాయించి, మెజారిటీ సార్క్ సభ్యదేశాలతో చైనా కొత్తగా జట్టుకడుతోంది. ఈ దిశలో ‘ఒక బెల్టు, ఒక రోడు’్డ పథకం వారికి కలిసివచ్చిన అదృష్టం! ఇప్పుడు అఫ్గాన్లో స్వేచ్ఛ లభించిందని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ బహిరంగ ప్రకటన చేశారు. (Afghanistan: అశ్రఫ్ ఘనీ స్పందన, ఫేస్బుక్లో వీడియో) ఇటీవలి కాలంలో, భారత్ విదేశీ విధానంలో కొట్టిచ్చిన మార్పు అమెరికాతో అతిగా అంటకాగటం! అలా అని, అమెరికా ఏమైనా భారత్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అంటే, అదేం లేదు. అమెరికాకు ఎంతసేపూ, తన ప్రయోజనాలే ముఖ్యం. అఫ్గాన్ విషయంలోనూ అదే జరిగింది. దేశం విడిచివెళ్లాక కూడా మధ్య ఆసియాపై పెత్తనానికి అమెరికా ఏర్పాటు చేసుకున్న ‘చతుష్ట కూటమి’ (క్వాడ్)లో తనతో పాటు అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్లను చేర్చింది తప్ప భారత్కు చోటు లేదు. అమెరికా శక్తిసా మర్థ్యాలపై అతినమ్మకం, ముఖ్యంగా అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా చర్యలన్నింటికీ మద్దతిచ్చిన మనతీరు దౌత్య వైఫల్యంగానే నిపుణులు చెబుతారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇప్పటికి రెండు మార్లు భేటీ అయిన రక్షణ మంత్రివర్గ సంఘం (సీసీఎస్) వేచి చూసే «ధోరణికే ప్రాధాన్యతనిస్తోంది. ‘జియోపాలిటిక్స్’ ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ రోజుల్లో, పలు దేశాల సరిహద్దులతో భౌగోళికంగా ఎంతో కీలక స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్, రష్యా, చైనాలకు దగ్గరవడం... మనను అస్థిరపరిచేదే! ఎలా చూసినా ఇది భారత్కు ప్రమాదకరమనే భావన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా ఉగ్రవాదం–కశ్మీర్ సమస్యల దృష్ట్యా ఈ లెక్కలు. తాలిబన్లతో ఒక దొడ్డిదారి సంపర్కం భారత్కు ఏర్పడిందని, తద్వారానే సురక్షితంగా మన దౌత్య సిబ్బందిని కాబూల్ నుంచి ఢిల్లీ రప్పించగలిగారనీ వార్తలు. కవలలతో ప్రపంచమే కలవరం బయటకు పోరాడుతున్నట్టే కనిపించినా, పరస్పరం పెంచి పోషించుకునే సామ్రాజ్యవాదం, మతోన్మాదం... ఈ రెండూ ప్రమాదకర కవలలే! విస్తరణ తత్వంతో ఆధిపత్య పోరు జరిపే అగ్రరాజ్యాలు వివిధ దేశాల్లో పెట్టే చిచ్చు చరిత్ర చెప్పే సత్యం. జాతి–మత–ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధాఓలను ఆయా దేశాలపై రుద్దిన సందర్భాలెన్నో! ఉగ్రవాదాన్ని ఒక్కో సందర్భాన్ని బట్టి పుట్టించడం, పెంచి పోషించడం, పీఛమడచినట్టు వ్యవహరించడం ఈ పెద్దన్నలకు రివాజు! మతోన్మాద సంస్థలు కూడా తమ సంకుచిత ప్రయోజనాలకు, ఆయుధాలు, స్థావరాలు, డబ్బు కోసం సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో సందర్భాన్ని బట్టి పావులుగా మారతాయి. వారి స్థూల ప్రయోజనాలు నెరవేర్చి, తమ పబ్బం గడుపుకుంటాయి. చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్లో చేరింది. ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ–ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు? నిజానికి ఏమీ లేదు. తన సామ్రాజ్యవాద ప్రయోజనాలు, ఆధిపత్య అవసరాలు, ఆయుధ విక్రయాలు, వ్యాపార లాభాలు... ఇవే అమెరికాకు కావాలి. కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ను 2011, పాకిస్తాన్లో మట్టుపెట్టిన తర్వాత అఫ్గాన్లో అమెరికా మిషన్ ముగిసింది. తర్వాత దశాబ్దం, గడువు మించి ఉండటమే! తాలిబన్ల శక్తి–విస్తరణని, అఫ్గాన్ సైనిక చేవను, అక్కడి కీలుబొమ్మ ప్రభుత్వ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో అమెరికా ఘోరంగా విఫలమైంది. సర్కారు మనుగడ 3 నెలలని జోస్యం చెప్పినా, రెండు వారాల్లో ప్రభుత్వం చేతులెత్తి పలాయనం చిత్తగించింది. ఇదంతా, అమెరికా చరిత్రలోనే హీనమైన ఓటమికి తార్కాణమన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య అక్షర సత్యం! ఇక ఆయన నిర్వాకానికి వస్తే, అఫ్గాన్ ప్రభుత్వాన్ని, ప్రజల్ని భాగం చేయకుండా 2020 ఫిబ్రవరి, దోహా(కతర్)లో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందమే ఓ గుల్ల, ఏకపక్షం! అనుచిత జోక్యాలు, ఆధిపత్య పోకడలు, సొంత మేళ్లు, నికర నష్టాలు, జారుకొని వైదొలగడాలు అమెరికాకు కొత్తేమీ కాదు. 1970లలో వియత్నాం నుంచి, 2011లో ఇరాక్ నుంచి వైదొలగడాలూ వైఫల్యాలే తప్ప వారి ఖాతాలో విజయాలు శూన్యం! (Afghanistan: ఆమె భయపడినంతా అయింది!) అఫ్గాన్లో ఛాందసవాదం వీడిన సమ్మిళిత సర్కారును అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. అప్పుడే... మహిళలు, పిల్లలు, మైనారిటీలకు రక్ష! మానవహక్కులు భద్రం! పాకిస్తాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) అదుపాజ్ఞల్లో, ఇస్తామాబాద్ కనుసన్నల్లో పనిచేసే సర్కారయితే... అఫ్గాన్లో ఇక నిత్యం రగిలేది రావణ కాష్టమే! ప్రపంచంలోని దాదాపు ఉగ్రవాద సంస్థలన్నిటికీ అక్కడ ఇప్పటికే స్థావరాలున్నాయి. తాలిబన్ల వైఖరిని బట్టే వాటి భవిష్యత్ మనుగడ! ఉగ్రవాద పోషణకు, ఎగుమతికి అఫ్గాన్ను కేంద్రం చేస్తే అంతర్జాతీయ సమాజం ఉపేక్షించదు. తాలిబన్లు ఆశిస్తున్నట్టు అధికారం సుస్థిరం కావాలంటే, అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందాలంటే, వారే చెప్పుకుంటున్నట్టు వారి పంథా మారాలి. అప్పుడే తాలిబన్ల విజయం సార్థకం! దిలీప్ రెడ్డి -
దొంగ‘చూపు’లెవరివి?
హక్కుల కార్యకర్తల నుంచి జర్నలిస్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్షనేతలు, మంత్రులు.. పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కదలికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెంట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరంతరం నలుగుతున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది? గ్రీక్ ఇతిహాసంలోదే అయినా... ఎగిరే రెక్కల గుర్రం (పెగసస్) అంటేనే అసాధారణ శక్తి. అది ఆధునిక శాస్త్ర సాంకేతికత రూపంలో కనబడకుండా, వినబడకుండా అన్ని వ్యక్తిగత గోప్య ప్రదేశాల్లోకి చొర బడితే పరిస్థితి ఏంటి? పురమాయించిన పనే రహస్య నిఘా, నివేదిం చడం అయితే, రాజ్యాంగం దేశ పౌరులకు హామీ ఇచ్చిన వ్యక్తిగత గోప్యత హక్కు గాలికిపోయినట్టే! సదరు స్వేచ్ఛ ఆధారంగా అభిప్రా యాలు ఏర్పరచుకోవడం, భావ వ్యక్తీకరణ, పాలనలో పాల్గొనడం మొదలు... గౌరవప్రదంగా జీవించడం వరకుండే ప్రజాస్వామ్య మౌలిక హక్కులన్నీ భంగపోయినట్టే! హక్కుల కార్యకర్తల నుంచి జర్నలి స్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్ష నేతలు, మంత్రులు.... పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కద లికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెం ట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరం తరం నలుగు తున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందెవరు? ఎవరు చేయిం చారు? విస్తృతి ఎంత? అన్నది తేలితే కాని, ప్రమాద తీవ్రత బోధ పడదు. విపక్షాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నట్టు రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది? కేంద్ర ప్రభుత్వం చెబుతు న్నట్టు తనకు ప్రమేయం లేకుంటే, మరెవరు చేసినట్టు? దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, వ్యక్తుల గోప్య సమాచారంపైన, కేంద్ర ప్రభు త్వానికి తెలియకుండా ఏ విదేశీ ఎజెన్సీలదో నిఘా ఉంటే, సమాచార మంతా రహస్యంగా వారికి చేరుతుంటే, దేశ భద్రతకది ముప్పు కాదా? నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇవీ తాజా ప్రశ్నలు. పార్లమెంటు కార్యకలాపాలు గత నాలుగు రోజులుగా ఇదే వివాదంపై దాదాపు స్తంభించాయి. సాంకేతిక పరిజ్ఞానమే ఉపకర ణంగా ‘పెగసస్’ ఓ నిఘా దాడి. ఇజ్రాయెల్కు చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఓ) ఈ స్ఫై(సాఫ్ట్)వేర్ విక్రేత! ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లో యాబై వేలమంది మొబైల్ నంబర్లు ఈ నిఘా కింద ఉండగా, వెయ్యిమంది ఫోన్ల నుంచి సమాచార చౌర్యా(హాక్)నికి లంకె ఏర్ప డ్డట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. పారిస్ కేంద్రంగా పనిచేసే లాభా పేక్షలేని ఓ మీడియా కూటమి (ఫోర్బిడెన్ స్టోరీస్)– హక్కుల సంఘం (ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్) జరిపిన పరిశోధనలో ఇది ధ్రువపడింది. అందులో మన దేశానికి చెందిన 300 నంబర్లు బయట పడ్డాయి. తొలిసారి కాదు తెలియకుండానే ‘పెగసస్’ నిఘా దేశంలో పలువురిపై ఉందని వెల్లడ వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ నిందితులైన హక్కుల కార్యకర్తలు, న్యాయవాదుల టెలిఫోన్లు ట్యాప్/హ్యాక్ అయ్యాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తెలియకుండానే కంప్యూటర్లు, ల్యాప్టాప్లలోకి ఓ మాల్వేర్ చొరబడి పోయింది. అప్పటికే పెగసస్ ప్రస్తావన వచ్చింది. 2019లో పార్ల మెంట్ (ఐటీ) స్థాయీ సంఘం విచారించినపుడు, 121 మంది ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టు అధికారులు తెలిపారు. రిమోట్ పద్ధతిలో మొబై ల్లోకి వచ్చి తిష్టవేసే ఈ మాల్వేర్, ఫోన్ యజమానికి స్పృహలో లేకుండానే సమాచారాన్ని వేరెక్కడో కేంద్రకంగా పనిచేసే నిర్వాహ కులకు చేరుస్తుంది. కాంటాక్ట్ నంబర్లు, మెసేజ్లు, కాల్డాటాయే కాకుండా సంభాషణలు, మెయిల్ సమాచారం, పత్రాలు, ఫోటోలు కూడా పంపిస్తుంది. రిమోట్ ఆపరేషన్ పద్ధతిలోనే కెమెరా కూడా పని చేస్తుంది. మన దేశంలో, బయట కూడా ఇది వెలుగుచూశాక... వాట్సాప్, ఫేస్బుక్, యాపిల్ వంటి సామాజిక మా«ధ్యమ వేదికలు పెగసస్ బారిన పడకుండా సెక్యూరిటీ ఫీచర్స్ను ఆధునికీకరించు కున్నాయి. అయినా, ఆ స్ఫైవేర్ మరింత ఆధునికతతో ఆపిల్, ఆండ్రా యిడ్లలో చొరబడగలుగుతోంది. ‘పెగసస్’ సేవల్ని ప్రభుత్వం విని యోగించుకుంటోందా? అన్న నిర్దిష్ట ప్రశ్నకు నాటి ఐ.టీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాజ్యసభలో సూటిగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. ‘ఏది జరిగినా చట్టనిబంధనలకు లోబడి, అధికారిక అనుమ తులతోనే నిఘా ఉంటుంది’ అని ఓ నర్మగర్భ సమాధానమిచ్చారు. మాల్వేర్ విక్రేత ఎన్ఎస్ఓ కథనం ప్రకారం ఇది కేవలం ప్రభు త్వాలకు, వారి అధీకృత సంస్థలకే విక్రయిస్తారు. నిర్దిష్టంగా దేశ భద్రత, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ కోసమే! అలాంట ప్పుడు సమాజంలోని వివిధ వృత్తుల, స్థాయిల వారి ఫోన్లు ఎందుకు హ్యాక్ అయ్యాయి? ప్రభుత్వ విధానాలను నిరసించే వారు, చీకటి వ్యవహారాల నిగ్గుతేల్చే పరిశోధనా జర్నలిస్టులు, గిట్టని అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు లక్ష్యం అవుతున్నారు? జాబితాలోని పేర్లను బట్టి చూసినా, ఈ నిర్వాకం ఎవరి చర్య? వారిపై నిఘా వేయా ల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అన్నది ఇట్టే తెలిసిపోతోంది. వెల్లడైన జాబితా ఊహాజనితమని ఒకసారి, తామేమీ నిర్వహించం, స్ఫైవేర్ ఒకసారి విక్రయించాక, నిర్వహణ అంతా ఆయా దేశాలదే అని మరోమారు ఎన్ఎస్వో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. సంస్కరణలు రావాలి మన దేశంలో నిఘా వ్యవస్థ నిర్వహణ సరిగా లేదు. సమూల సంస్క రణల అవసరం. వ్యక్తుల గోప్యత హక్కు–దేశ భద్రత మధ్య సమ తూకం సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కేంద్ర గృహమంత్రి అమిత్ షా తాజా వివాద నేప«ధ్యంలో వెల్లడించారు. కానీ, చట్టాలకు అతీతంగా, అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రభుత్వ నిఘా నిర్వాకాలు భంగం కలిగించిన సందర్భాలే ఎక్కువ. ‘వ్యక్తిగత సమాచార సంరక్షణ చట్టం’ దేశంలో ఇంకా తుది రూపు సంతరించుకోలేదు. ‘గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే’ అని 2018లోనే సుప్రీంకోర్టు తేల్చింది. పౌరుల వ్యక్తిగత సమాచారంలోకి అనుచితంగా జొరబడే అధికారం ప్రభుత్వానికి, దర్యాప్తు–నిఘా సంస్థ లకి లేదు. సంభాషణల్ని అడ్డగిస్తూ, టెలిఫోన్ ట్యాప్ వంటివి చేయాల్సి వచ్చినా.. చట్టాలకు లోబడి, సుప్రీంకోర్టు వేర్వేరు సంద ర్భాల్లో వెల్లడించిన తీర్పుల స్ఫూర్తిని నిలబెడుతూ జరపాలి. అలా నిఘా వేయాలంటే, ఏయే పరిస్థితులు ఉండాలో 2017లో, 2019లో జస్టిస్ పుట్టుస్వామి ఇచ్చిన తీర్పులే స్పష్టం చేశాయి. ‘నేర ప్రక్రియ çస్మృతి’ (సీఆర్పీసీ) సెక్షన్ 92, ‘భారత టెలిగ్రాఫ్ చట్టం’, నిబంధన 419ఎ తో పాటు ‘ఐ.టీ చట్టం’, సెక్షన్లు 69, 69బి కింది నిబంధనల ప్రకారమే ప్రస్తుతం పౌరుల టెలిఫోన్ సంభాషణలు, ఇతర సమా చార–ప్రసార మార్పిడులలో అధికారులు కల్పించుకుంటున్నారు. నిఘా వేస్తున్నారు. విధివిధానాల్లో స్పష్టత లేక, రాజకీయ ప్రయోజ నాలకోసం దురుపయోగం ఎక్కువనేది విమర్శ. హిమాచల్ప్రదేశ్లో, 2012లో కొత్త ప్రభుత్వం పోలీసు దర్యాప్తు సంస్థలపై దాడి జరిపి నపుడు, వెయ్యి మందికి సంబంధించిన లక్ష సంభాషణలు దొరికాయి. 2009లో సీబీడీటీ–నీరారాడియా వ్యవహారంలో, 2013లో గుజరా త్లో అమిత్షాపై అభియోగాలు వచ్చిన కేసులో... ఇలా చాలా సంద ర్భాల్లో ఇదే జరిగింది. పౌరుల హక్కుల భంగంతో పాటు దేశ ప్రతిష్ట విశ్వవేదికల్లో ఇటీవల దిగజారిపోతోంది. అమెరికాకు చెందిన ‘ఫ్రీడమ్ హౌజ్‘ భారత్ను స్వేచ్ఛాయుత స్థితి నుంచి పాక్షిక స్వేచ్ఛా దేశంగా వెల్లడిం చింది. ‘వి–డెమ్’ అనే స్వీడన్ సంస్థ అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాదు, మనది ‘ఎన్నికల నియంతృత్వం’ అని తన వార్షిక నివేదికలో అభివ ర్ణించింది. ‘ప్రజాస్వామ్య సూచిక’లో భారత్ ‘లోపభూయిష్ట ప్రజా స్వామ్యం’గా ముద్రపడి 53వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 142 (180 దేశాలకు) స్థానానికి దిగజారి పోయాం. నిర్హేతుకమైన నిఘా, వ్యక్తిగత గోప్యతపై దాడి జరిగిన తాజా వివాదంపై నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలి. నిజాలు నిగ్గుతేలాలి. అప్పుడే, పౌరులకు రక్ష, మన ప్రజాస్వామ్యానికి విలువ. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నిన్నటి తప్పు నేడు చేయొద్దు!
‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...’ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. ‘ఇది అత్యంత ప్రమాదకారి, దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! పౌరసమాజానికిది పరీక్షా కాలం! ప్రభుత్వాలకు, అంతకుమించి మన ప్రజారోగ్య వ్యవస్థకున్న పరిమితులు తేటతెల్లమైన తర్వాత ఎవరైనా పౌరసమాజంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ చర్యల వైపు చూస్తూనే విశాల జనబాహుళ్యపు పూర్తి సహకారం అర్తించే సమయమిది. ప్రజలు సంయమనం, క్రమశిక్షణ, శ్రద్ధ వహిస్తేనే... కోవిడ్–19 వంటి మహమ్మారి నుంచి సమాజం బయటపడగలుగుతుంది. ఇలాంటి ఉపద్రవాలనెన్నింటినో అధిగమిం చిన చారిత్రక సందర్భాలు ప్రజల ‘సమష్టి–నిబద్ధ కృషి’ ఖాతాలో చాలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా ప్రపంచ మానవాళినే వణికి స్తున్న కోవిడ్–19 తగ్గినట్టే తగ్గుతూ... వైరస్ కొత్త రకాల్ని సృష్టి స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మనిషి సహజ రోగనిరోధక శక్తి, చికిత్స ద్వారా ఇచ్చే ఔషధాలను తట్టుకునేందుకు వైరస్ తనంత తాను రూపు–స్వభావం మార్చుకోవడం (మ్యుటేషన్) సహజం. ఈ క్రమంలో పుడుతున్న కొత్త రకాలు (వేరియంట్స్) ఎన్నో! వూహాన్ (చైనా) మౌలిక రకం నుంచి... ఆల్ఫా (యు.కె.లో గుర్తించిన రకం), బీటా (దక్షిణాఫ్రికాలో బయటపడిన రకం), డెల్టా (భారత్లో వెలుగు చూసిన రకం)లను దాటి తాజాగా పుట్టి క్రియాశీలమౌతున్న ‘డెల్టా ప్లస్’ రకం దడ పుట్టిస్తోంది. దేశంలో 40 కేసులు దాటాయి. మననే కాక మరో 8 దేశాలకూ నిద్ర లేకుండా చేస్తోంది. దాని లక్షణాలు, కన బరిచే స్వభావం, చూపే ప్రభావం... సరికొత్త సవాల్! ఇప్పుడు మనం వాడుతున్న టీకామందులు కొత్త రకం వైరస్ నుంచి ఏమేర రక్షణ కల్పిస్తాయనే విషయమై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతు న్నాయి. ‘డెల్టా’ మౌలిక రకం వైరస్ బారిన పడినా, ఆస్పత్రి వెళ్లే దాకా పరిస్థితిని రానీయకుండా ఫైజర్, ఆస్ట్రాజెనికా (మన కోవిషీల్డ్) టీకా మందు రక్షణనిస్తుందని ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ‘డెల్టా ప్లస్’ వైరస్ నుంచి కూడా సదరు రక్షణ లభిస్తుందా? అన్నది ఇంకా పరీక్షల స్థితిలోనే ఉంది. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్) నిర్వహిస్తున్న పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ‘టీకామందు తీసుకున్న వారిలో పుట్టే యాంటీ బాడీలు, కొత్త వైరస్ను నిర్వీర్యం చేస్తున్నాయా? అనేది మా పరీక్షల్లో తేలుతుంది’ అంటూ మండలి శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పండ చెప్పిన మాటలు కొత్త ఆశల్ని, ఆకాంక్షల్ని రేకెత్తిస్తున్నాయి. అతి ప్రమాదకారి కొత్త రకం ‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...‘ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సల హాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. లోతైన పరిశీలనల్ని బట్టి.... వేగంగా వ్యాప్తి, ఇన్ఫెక్షన్ను పెంచడం, సోకిన వారి–ఊపిరితిత్తుల కణజాలాన్ని బలంగా అంటిపెట్టుకోవడం, మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావాన్ని బాగా తగ్గించడం వంటివి తాజా వైరస్ లక్ష ణాలుగా చెబుతున్నారు. అందుకే, వ్యూహాత్మకంగా ముందుకు సాగా లని ప్రభుత్వాలూ హెచ్చరిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ‘ఇది అత్యంత ప్రమాదకారి, తీవ్ర రూపం దాల్చకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను అప్ర మత్తం చేసింది. మరో మూడు రాష్ట్రాల్లోనూ ఈ కేసుల్ని గుర్తించినట్టు చెబుతున్నా అధికారికంగా సమాచారం లేదు. డెల్టా ప్లస్ కేసులు రాగానే అప్రమత్తం కావాలని, ఆయా ప్రాంతాల్లో స్థానిక కట్టడి (కంటైన్మెంట్ జోన్ల ప్రకటన) ఏర్పరచాలని, నమూనాలను తదుపరి పరీక్ష–విశ్లేషణ కోసం ‘జీనోమిక్ కన్సార్షియం’ (ఐఎన్ఎస్ఏసీవోజీ)కి పంపించాలనీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. డెల్టా రకం వైరస్ 80 దేశాల్లో కనిపించినా, డెల్టా ప్లస్ భారత్తోపాటు అమెరికా, బ్రిటన్, పోలాండ్, పోర్చ్గల్, రష్యా, చైనా, జపాన్, నేపాల్ దేశాల్లో వెల్లడైంది. ఆల్ఫా రకం ఒకరి నుంచి సగటున నలుగురికి వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటే, డెల్టా ప్లస్ 5 నుంచి 8 మందికి సోకే ప్రమాదముంది. డెల్టా మౌలిక రకం కూడా ప్రమాదకారేనని పశ్చిమ దేశాల వైద్యులు, శాస్త్రవేత్తలంటున్నారు. బ్రిటన్ గణాంకాల ప్రకారం, డెల్టా సోకిన వారిలో లక్షణాలు బయటకు కనిపించిన నాటి నుంచి కేవలం 3–4 రోజుల్లోనే ఇన్ఫెక్షన్ తీవ్ర స్థితికి వెళ్లిపోతున్నట్టు స్పష్టమైంది. అడుగులు ముందుకే పడాలి దేశంలో కోవిడ్ కేసులు రమారమి తగ్గుతున్న పరిస్థితి. మొత్తమ్మీద 40 కోట్ల మందికి పరీక్షలు జరుపగా, 3 కోట్ల మందికి కరోనా సోకినట్టు రికార్డయింది. ఒకరోజు కొత్త కేసులు సగటున 40 వేలకు తగ్గాయి. ఒకరోజు కోలుకున్న వారి సంఖ్య 82 వేలకు పెరిగింది. కొత్త కేసుల కన్నా రోగులు కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువ గత 40 రోజుల నుంచి నిరవధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో... వైరస్ కొత్తరకం వ్యాప్తి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, కోవిడ్ మూడో అల అనుకున్న దానికన్నా ముందే ముంచుకు వచ్చే ప్రమాదాన్ని ప్రభు త్వాలతో పాటు నిపుణులూ శంకిస్తున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల చర్యలెలా ఉన్నా... పౌరసమాజం బాధ్యతగా వ్యవహరించాలంటు న్నారు. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కలిగి ఉండాల్సిన అవ సరం ఏమిటో రెండో అలలో మనకు స్పష్టంగా బోధపడింది. వ్యూహం కొరవడ్డ ప్రభుత్వ విధాన లోపాలు, అవసరానికి తగ్గట్టు లేని మన వైద్య–ప్రజారోగ్య వ్యవస్థ అగచాట్లకు పౌరుల విపరీత ప్రవర్తన తోడై రెండో అలలో తీవ్ర నష్టమే జరిగింది. లక్షలమంది ప్రాణాలు కోల్పో యారు. ఇరవై రోజుల్లో లక్షమంది భారతీయులు చనిపోయిన పాడుకాలం ఈ అలలోనే చూశాం. లక్షలాది మంది వ్యాధి బారిన పడి కోలుకున్నా... కోవిడ్ తర్వాతి ఇబ్బందులతో ఇంకా సతమతమౌ తున్నారు. కోట్లాది మంది ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడిపిన దిక్కుమాలిన కాలం. మొదటి అల ముగింపు దశలో మన అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంత దాకా ఉన్న కట్టడిని క్రమంగా ఎత్తివేసి ప్రభుత్వాలు కొంత వెసులు బాటు ఇవ్వగానే, పౌరులు విచ్చలవిడిగా బయటకు వచ్చారు. మహ మ్మారి నుంచి గట్టెక్కామనుకున్నారు. గుంపులుగా తిరిగి, పండుగలు– పబ్బాల్లో గుమిగూడి, మాస్క్లు లేకుండా, భౌతిక దూరం లెక్క చేయక ఇష్టానుసారం నడిచారు. అప్పుడే డెల్టా రకం వైరస్ వచ్చి తీరని నష్టం కలిగించింది. గత డిసెంబరులో తొలిసారి ఇక్కడే వెలుగు చూసింది. రెండో అల వేగంగా ముంచుకు వచ్చి, తీరని నష్టం కలిగిం చడం వెనుక బలమైన కారణాలు ఇవే అని ఆధారాలతో వెల్లడైంది. వైరస్ ప్రభావం, కేసుల సంఖ్య తగ్గుతూ ఇప్పుడిప్పుడే ఊరట చెందు తుంటే... వైరస్ కొత్త రకం మళ్లీ బయపెడుతోంది. అవసరం మనది... ఒక వంక వైరస్ వ్యాప్తిని నిలిపి, వైద్యం అందించి ప్రాణాలు నిలు పడం మరో వైపు కార్యకలాపాలు సాగించి ఆర్థికవ్యవస్థను మెరుగు పరచడం ప్రభుత్వాల బాధ్యత. రెంటి మధ్య సమతూకం పాటించి ప్రాణాలు, ప్రాణాధారాలను కాపాడే ద్విముఖపాత్ర ప్రభుత్వాలు పోషిస్తాయి. కానీ, ప్రాణాధారాలు కాపాడుకుంటూనే ప్రాణాలు నిలుపుకోవలసిన అవసరం ప్రజలది. ఇంతటి మహమ్మారిని ఎదు రొడ్డి నిలిచే నిత్య పోరాటం ఒక ఉమ్మడి బాధ్యత! వైరస్ వ్యాప్తిని, కోవిడ్ ప్రభావాన్నీ నిలువరించేలా పౌరులు అన్ని జాగ్రత్తలు పాటిం చాలి. వైరస్ కొత్తరూపంలో ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు... అప్రమత్తత ఎంతో అవసరం. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని నిరంతరం శుభ్రపరచుకోవడం... ఇలా వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
లోకం చూపు టీకావైపు!
సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శలున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్ను ఓడించి నిలుస్తాం! దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి కోవిడ్ రెండో అల వెనక్కి జారుతున్న క్రమంలోనే... టీకా ప్రక్రియ (వ్యాక్సినేషన్) పైకి అందరి దృష్టీ మళ్లుతోంది. ఇప్పుడిదొక ముఖ్యాంశమైంది. కోవిడ మూడో అల రాకుండా, వచ్చినా తీవ్రత లేకుండా చూసుకోవాలంటే వేగంగా టీకా ప్రక్రియ జరిపించాలనేది దేశం ముందున్న లక్ష్యం. దీనిపై కేంద్ర– రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తగు దిద్దుబాటు చర్యలతో, విధానమార్పు ప్రకటించిన ప్రధాని మోదీ, ఇకపై టీకామందును కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని చెప్పారు. ప్రక్రియను పరు గులు తీయిస్తామన్నారు. అదే సమయంలో ముళ్లపొదల్లా... పలు అంశాలు టీకా చుట్టే అల్లుంటున్నాయి. ఇందులో కొన్ని వ్యూహ వైక ల్యాలు, నిర్వహణా లోపాలు, విధానపరమైన వైఫల్యాలైతే మరికొన్ని అనుకోకుండా పుట్టుకు వచ్చిన సవాళ్లు! ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఈ చిక్కుముడులన్నిటినీ విప్పి ముందుకు సాగితేనే మనమీ ఉపద్రవం నుంచి తక్కువ నష్టంతో బయటపడగలుగుతాము. కోవిడ్ విషకోరల నుంచి విశాల భారతాన్ని కాపాడుకోగలుగుతాం. టీకామందుల తయారీలో ఘన చరిత్ర, పంపిణీలో మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ పాటికి ప్రపంచంలోనే భారత్ ముందుండాల్సింది! మరెన్నో దేశాలకు ఆపన్న హస్తం అందించి ఉండాల్సింది. ఉంటామనే మొదట్లో మన ప్రధాని, దావోస్ ఆర్థిక సదస్సు వేదిక నుంచి ప్రపంచానికి తెలియ జెప్పారు. కానీ, ఆ పరిస్థితిపుడు లేదు. లక్ష్యం వైపు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నడుస్తున్నాం. అమెరికా, యూరప్, ఇతర అభివృద్ధి చెందిన సమాజాలు రెండు డోసుల టీకా ప్రక్రియ ముగించుకొని తలసరి రెండు, మూడు డోసుల టీకా భవిష్యత్తు కోసం రిజర్వు చేసుకున్నాయి. కెనడా ఒక్కో పౌరుడికి (తలసరి) 9 డోసుల చొప్పున రిజర్వు చేసు కుంది. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ, పలు దేశాల్లో కట్టడి ఉపసంహ రిస్తున్నారు. జనజీవనాన్ని సాధారణ స్థాయికి తెస్తున్నారు. ఆర్థిక వ్యవ స్థల్ని పునరుత్తేజం చేస్తున్నారు. జనవరి మధ్యలో టీకా ప్రక్రియ ప్రారంభించిన మనం, ఇప్పటికి సుమారు 20 కోట్ల మందికి కనీసం ఒక డోసు, దాదాపు 5 కోట్ల మందికి సంపూర్ణ టీకా (రెండు డోసులు) ఇచ్చాం. 137 కోట్ల భారతావనిలో భారీ లక్ష్యాలే ముందున్నాయి. శరవేగంతో వెళితేనే..... ఆర్థిక వ్యవస్థను పూర్వపుబాట పట్టించాలంటే వాణిజ్యం, వ్యాపారం వంటి దైనందిన ప్రక్రియలు పూర్తిస్థాయిలో పనిచేయాలి. అందుకు, ‘సామూహిక రోగనిరోధకత’ (హెర్డ్ ఇమ్యూనిటీ) రావాలి. జనాభాలో 70 శాతం మందికి టీకామందు, కనీసం ఒక డోసైనా ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ(మే) నివేదిక చెబుతోంది. సెప్టెంబరు మాసాంతానికి ఈ లక్ష్యం సాధించా లంటే సగటున రోజూ 93 లక్షల మందికి టీకా మందు వేయాలి. గడ చిన 5 మాసాల్లో అత్యధికమంటే, ఒక రోజు 42.65 లక్షల డోసులే ఇవ్వగలిగారు. ఈ వేగం సరిపోదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తి పెరగడం, విదేశీ కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు, కేంద్రమే సమకూర్చుకొని పంపిణీ చేయడం, రాష్ట్రాలూ ఈపాటికే కోవిడ్ సెంటర్లను ఏర్పరచి నిర్వహిస్తున్నందున లక్ష్యం సాధ్యమే అంటున్నారు. నమోదు సైట్లు, టీకామందు సెంటర్లు, వైద్య–అనుబంధ సిబ్బంది, టీకామందు సరఫ రాలను సమన్వయ పరచి, రాత్రీపగలు (27/7) శ్రమిస్తే లక్ష్యం సాధ్య మేనని నివేదిక పేర్కొంది. టీకామందు ఉత్పత్తిపై సందేహాలు, అపో హలతో టీకాకు పౌరుల వెనుకంజ, ఇతర నిర్వహణా లోపాల్ని అధిగ మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వివిధ కంపెనీల టీకామం దుల్లో ధర వ్యత్యాసాల సమస్య అలాగే ఉంది. సుప్రీంకోర్టూ దీన్ని తప్పుబట్టింది. ప్రయివేటు ఆస్పత్రులకు 25 శాతం టీకామందు కేటా యింపు, వారి దోపిడీకి లైసెన్సు ఇవ్వడమేననే విమర్శలున్నాయి. కోవిడ్ సమాచార వెల్లడిలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు న్నాయి. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహె చ్వో) అనుమతించిన జాబితాలోకి, స్వదేశీ టీకామందు కోవాక్సిన్ (భారత్ బయోటెక్ వారి ఉత్పత్తి) ఇంకా ఎక్కకపోవడం పెద్ద సమ స్యగా మారుతోంది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నా, దాన్ని ‘వాక్సినేషన్’గా పరిగణించక పలు దేశాలు అనుమతి నిరాకరిం చడంతో, భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలకిది అవరోధంగా మారింది. కోరిన సమాచారం కంపెనీ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం మరింత చొరవతో సత్వరం డబ్లుహెచ్వో ఆమోదం తీసుకురావాలి. ఉత్పత్తి ఊపందుకోవాలి దేశీయ, విదేశీ కంపెనీలయినా టీకామందు ఉత్పత్తి ఎన్నో రెట్లు పెంచాలి. సెప్టెంబరు–డిసెంబరు మధ్య 216 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తామని కేంద్రం లోగడ ప్రకటించింది. కానీ, ఇదే కాలంలో సరఫ రాకై 44 కోట్ల డోసుల ఉత్పత్తికి ఆర్డర్లు, అడ్వాన్సులు ఇస్తున్నట్టు ఇటీ వలే వెల్లడించింది. ఎందుకీ వ్యత్యాసమో తెలియదు. దాదాపు 90 శాతం ఉత్పత్తికి బాధ్యత వహిస్తున్న భారత్ సీరమ్ సంస్థ (కోవీషీల్డ్) ఇకపై ఉత్పత్తిని పెంచనున్నట్టు పేర్కొంది. ముడి పదార్థాల దిగుమతి ఓ సమస్యగా ఉండింది. కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత అమెరికా (యుఎస్), ఆయా పదార్థాల ఎగుమతు లపై ఉన్న నిషే«ధం తొలగించింది ‘అమెరికా రక్షణ ఉత్పత్తుల చట్ట’ నిబంధనల్ని సడలిం చామని యుఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి. ముడిసరుకు దేశానికి వచ్చి, ఉత్పత్తి పెరిగేది ఆగస్టు నెలాఖరులోనే! భారత్ బయోటెక్ సంస్థ కూడా తమ ఉత్పత్తుల్ని జూన్ నుంచి పెంచుతున్నట్టు చెప్పింది. జూలైలో 7.4 కోట్ల డోసులు ఈ సంస్థ ఉత్పత్తి చేయనుందని కేంద్రం వెల్లడించింది. ఇదంతా గజిబిజిగా ఉంది. ఫైజర్ (యూఎస్) టీకా మందు ఉత్పత్తి చేసే కంపెనీ, తాము భారత్లో సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవాలంటే న్యాయపరమైన రక్షణ కల్పించాలని కేంద్ర సర్కా రును అడుగుతోంది. పాక్షికంగా కల్పించే అవకావాలున్నాయి. స్వదే శీతో సహా ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఇటువంటి రక్షణ కల్పించలేదు. ధరల్లో అసాధారణ తేడా! లాభాపేక్షలేని పద్ధతిన భారత్లో పది డాలర్ల (రూ.730)కే ఒక్కో డోసు టీకామందు ఇస్తామని ఫైజర్ ఉత్పత్తిదారు చెబుతోంది. ఇదే కంపెనీ అమెరికాలో, ఐరోపాలో ఇస్తున్న ధర కంటే ఇది తక్కువ. అంటే, భారత్లో ఇది దేశీయ ఉత్పత్తి కోవిషీల్డ్ ధర (రూ.780) కన్నా తక్కువ! మరి, రష్యాకు చెందిన స్పుత్నిక్–వి (రూ.1145), మరో దేశీయ ఉత్పత్తి కోవాక్సిన్ (రూ.1410) ధరలు ఎందుకంత ఎక్కువ అనేది ప్రశ్న. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం కోటా కేటా యించిన నేపథ్యంలో, ఈ ధర వ్యత్యాసం పలు సమస్యలకు దారి తీస్తుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయ పడింది. టీకామందు ఉత్పత్తి ఫార్ములాలను బట్టి ఈ వ్యత్యాసమని, అధికధర నిర్ణయించిన కంపెనీలు చెబుతున్నాయి. అడెనోవైరస్ ఫార్ములాతో రూపొందించే మిగతా టీకామందు తయారీ చౌకలో అవుతుందని, తమలా ఇనాక్టివేటెడ్ వైరస్ వినియోగ ఫార్ములా వల్ల, పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసినా వ్యయం తగ్గదని కోవాక్సిన్ ఉత్పత్తి దారు చెబుతున్నారు. ధర ఎక్కువున్నప్పటికీ, ఆయా టీకా మందుల సామర్థ్యం తక్కువని వస్తున్న అధ్యయనాలు పౌరుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. సదరు నివేదికలు సత్య దూరం, అసమగ్రమని ఉత్ప త్తిదారు అంటున్నారు. ఏమైనా.. ప్రభుత్వం ఇంకా సమర్థంగా ఆయా కంపెనీలతో చర్చించి, సహేతుక ధరల్ని ఖరారు చేసుండాల్సింది. సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విష యాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శ లున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్ను ఓడించి నిలుస్తాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అస్త్రాలు లేకుండా గెలిచేదెలా?
రాష్ట్రాలు కోరిన డోసులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రులు, కార్పొరేట్లకు టీకామందు అందుబాటులోకి తేవడం ఆశ్చర్యకరం.18 ఏళ్లు పైబడ్డ ఎవరికైనా ప్రయివేటు ఆస్పత్రులు టీకామందు ఇవ్వొచ్చన్న వెసులుబాటుతో సమీకరణాలు మారుతున్నాయి. పౌరులకు ఉచితంగా టీకాలిస్తున్న రాష్ట్రాలు కొంటామన్నా, కోరినన్ని టీకాడోసులు అందివ్వలేనపుడు, ప్రయివేటు పంపిణీ ఎలా సమంజసం అని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వద్ద సమాధానం లేదు. పాలకులు బేషజాలకు వెళ్లకుండా తప్పులు అంగీకరించడం, సరిదిద్దుకోవడమే సమస్యకు పరిష్కారం. సత్తా ఉంది, సమయమే లేదు. ఆయుధం తెలుసు, అవసరమైనన్ని లేవు. ఈ యుద్దం గెలిస్తేనే నిలుస్తాం, యుద్ధవ్యూహమే లోపం. శత్రువు రూపం మార్చుకుంటూ చేస్తున్న దాడిలో రెండో కెరటం కూల నేలేదు, ముంచుకొస్తున్న మూడో కెరటం పొడ భయపెడుతోంది. కోవిడ్–19పై పోరాటంలో మనదేశ పరిస్థితి ఇది. ‘కోవిడ్ యుద్ధం గెలిచేది టీకా (వ్యాక్సినేషన్) అస్త్రంతోనే!’ వైద్యులు, శాస్త్రవేత్తల నుంచి పాలకుల వరకు అంతా ఒక గొంతుతో చెబుతున్నదిదే! ప్రధాని మోదీ కూడా బుద్ధపూర్ణిమ సందర్భంగా ఓ కీలకోపన్యాసం చేస్తూ, ఈ పోరులో టీకాయుధమే శరణ్యమని చెప్పారు. మరి, సమయం దొరి కినా ఆయుధాలెందుకు సమ కూర్చుకోలేదు? కారణం యుద్ధ వ్యూహం కొరవడటమే! యుద్ధమని తెలిశాక, వ్యూహం ఏర్పాటు చేసుకోకపోవడం పెద్ద తప్పు. ఇప్పుడు తప్పొప్పులు సమీక్షించుకునే సందర్భం కాదు, సమయమూ లేదు. ఎందుకంటే, ప్రమాదం మరింత తీవ్రతతో ముంచుకు వస్తోంది. ఉపద్రవాన్ని తట్టుకునే రక్షణ వ్యవస్థను ముందే ఏర్పాటు చేసుకోవాలి. రాగల ప్రమాద తీవ్రత తగ్గించే భూమిక సిద్ధం చేయాలి. మనకున్న చతురంగ బలాల్ని, బల గాల్ని ఉపయోగించి శత్రువును ఢీకొట్టాలి. యుద్ధ ఎత్తుగడల్లో తేఢా లొస్తే అసలుకే మోసం! కోవిడ్ను ఎదుర్కొనే క్రమంలో... టీకా ప్రక్రియ తగినంత వేగంగా, నిర్ణీత గడువులోగా జరగకపోతే ఓ ప్రమా దముంది. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ వైవిధ్యాలతో దెబ్బకొట్టే ఆస్కారాన్ని నిపుణలు హెచ్చరిస్తున్నారు. నేటికి సరిగ్గా నాలుగు నెలల కిందట, జనవరి 28న దావోస్, ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ ఆన్లైన్ భేటీనుద్దేశించి మాట్లాడుతూ మన ప్రధాని చేసిన ప్రకటన లోని గాంభీర్యత నేడేమైంది? టీకా ప్రక్రియ మందగించి, టీకామందు దొరక్క, సత్వరం సమకూర్చుకునే స్వదేశీ–విదేశీ మార్గాలు మూసుకు పోయి, కేంద్ర–రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలొచ్చి... ఈ గందరగోళం ఎందుకేర్పడింది? చిక్కుముడి వీడేదెలా? ఆ రోజున ఆయన ఏమ న్నారంటే, ‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్!... ఇపుడు కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను నెత్తి కెత్తుకుంటోంది. దేశ ఆర్థిక చరిత్రలో ఒక కీలక మలుపు కానుంది. భారత్ గొప్పతనం మరోమారు కీర్తించబడుతుంది’ అని. కానీ, వాస్త వాలు నేడెందుకు భిన్నంగా మారాయి? టీకా మందు కోసం ఇంటా, బయటా అయ్యా! అప్పా! అని దేబిరించాల్సిన పరిస్థితి ఎలా దాపు రించింది? టీకా కోసం దేశమంతా నిరీక్షించాల్సిన దుస్థితి ఎందు కొచ్చింది? ‘18 ఏళ్లు దాటిన వారికి రేపటి నుంచి టీకా’ అని, ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు, సగటు భారతీయులు సమా ధానం అడుగుతున్నారు. టీకా విధానమే కరువు దేశంలో టీకామందు విధానమే సవ్యంగా లేదు. ఫలితంగా ఉత్పత్తి, పంపిణీ, రేపటిపై ఆశ అంతా అస్పష్టమే! రాజ్యాంగం 21 అధికరణం ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఖర్చు భరించగలిగే, అందు బాటులో ఉండే, వైద్యారోగ్య సదుపాయాలు పౌరులకు సమానంగా కల్పించాలి. ఏదీ! ఎక్కడ? కోవిడ్ ప్రమాద తీవ్రత తెలిసీ, టీకా ప్రక్రియ విషయంలో కేంద్రం బాధ్యతల నుంచి వైదొలగినట్టే వ్యవ హరించింది. ఏడాది కిందటే కోవిడ్ మహమ్మారి మనల్ని అంటు కున్నా, ఈసారి బడ్జెట్లో టీకామందు కోసం కేంద్రం తన వంతుగా రూపాయి కేటాయించలేదు. ముప్పై అయిదు వేల కోట్ల రూపాయలు అప్పు/గ్రాంట్ కింద తానిచ్చేట్టు, వ్యయ బాధ్యతను రాష్ట్రాలకు బద లాయించింది. స్వతంత్ర భారతంలో ఏడు దశాబ్దాలు పాటించిన, విజయవంతమైన ‘సామూహిక టీకా’ పద్ధతికి తిలోదకాలిచ్చింది. మశూచి, పోలియో వంటి టీకాలను ఇన్నేళ్లు కేంద్రం ఇదే పద్ధతిన ఇచ్చింది. టీకామందు కేంద్రం సమకూర్చేది, ఎక్కడికక్కడ పంపిణీ– నిర్వహణ రాష్ట్రాల బాధ్యతగా అమలైంది. కానీ, ఈసారి టీకా మందును రాష్ట్రాలే సమకూర్చుకోవాలని తేల్చిచెప్పింది. జనాభా దామాషా ప్రకారం ఎవరికెంత అనే వాటాలు మాత్రం తానే నిర్ణయి స్తానంది. కానీ, దేశంలో... ఉత్పత్తికి సవ్యమైన విధానం లేక, అను మతించిన రెండు కంపెనీలు, సీరమ్ (కోవిషీల్డ్), భారత్ బయోటిక్స్ (కోవాగ్జిన్) తగు ఉత్పత్తి చేయలేక, వారికి కేంద్రం ఇతోధిక సహాయం చేయక, రాష్ట్రాలు కోరినంత టీకామందు వారు అందించలేక, ప్రపంచ మార్కెట్ల నుంచి గ్లోబల్ టెండర్లతో రాష్ట్రాలు నేరుగా టీకామందు సమ కూర్చుకునే వెసులుబాటు లేక... నానా ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. రెండు డోసుల టీకా మందే పరిష్కారమని ప్రపంచమంతటా రుజువవుతుంటే, ఇక్కడ టీకామందే దొరకటం లేదు. కొండంత కొత్త లక్ష్యం వచ్చే ఆగస్టు–డిసెంబర్ నడుమ 216 కోట్ల డోసుల టీకామందు సమ కూర్చుకునే లక్ష్యాన్ని కేంద్రం ప్రకటించింది. అంటే, నూరు కోట్ల మందికి పైగా రెండు డోసులూ అందుతాయన్న మాట! ఇప్పటికున్న అనుభవాన్ని బట్టి దేశీయ సీరమ్, భారత్ బయోటిక్స్ల ఉత్పత్తి సామర్థ్యం ఆ చాయల్లో కూడా లేదు. ప్రపంచ మార్కెట్ విదేశీ ఉత్పత్తి దారుల నుంచి సమకూర్చుకోవడానికి ఎన్నో ప్రతిబంధకాలున్నాయి. నిజానికి ఈ ఇబ్బందులు రాకూడదు. సరైన ముందస్తు వ్యూహం లేక పోవడం, అవసరాలకు తగ్గట్టు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ దుస్థితి. దేశంలో టీకాప్రక్రియ జనవరి మధ్యలో ప్రారంభించి నాలుగు నెలలు దాటినా ఇప్పటికి సుమారు 15 కోట్ల మందికి ఒక డోసు, 5 కోట్ల మందికి రెండు డోసుల టీకామందు ఇచ్చాం. ఒక దశలో రోజుకు 40 లక్షల వరకు టీకాలిచ్చిన ప్రక్రియ మందగించి, ఇపుడు రోజూ అయిదారు లక్షలకు పడిపోయింది. కొత్త లక్ష్యాలు అందుకోవడం, అయిదు నెలల్లో (150 రోజులు) రోజూ సగ టున 1.4 కోట్ల మందికి టీకాలిస్తే తప్ప సాధ్యపడదు. మే నెల మొత్తం 6 కోట్లు కోవిషీల్డ్ , 2 కోట్లు కోవాగ్జిన్ టీకా డోసుల ఉత్పత్తే జరిగింది. నెలలో 5 కోట్ల మందికి టీకాలిచ్చినట్టు అధికారుల కథనం. మరో అయిదు స్వదేశీ కంపెనీల కొత్త టీకాలు, ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. రష్యా టీకా స్పుత్నిక్–వీని దేశంలో వాడేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతించినా దిగుమతి, పంపిణీ మందకొడిగా సాగు తోంది. ఇతర అంతర్జాతీయ ఉత్పత్తిదారుల నుంచి గ్లోబల్ టెండ ర్లతో టీకామందు సమకూర్చుకునేందుకు డజన్ రాష్ట్రాలు చేసిన యత్నా లన్నీ విఫలమయ్యాయి. ఫైజర్, మోడెర్నా వంటివి తాము రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోలేమని, కేంద్రంతోనే వ్యవహరించగల మని ప్రక టించాయి. తాము సంప్రదించినా, ఇప్పటికే పలు దేశాలతో కుదుర్చు కున్న ఒప్పందాల దృష్ట్యా, తమ మిగులు ఉత్పత్తి ఏమైనా ఉంటే ఇవ్వగలమని సదరు కంపెనీలు పేర్కొన్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రయివేటు విక్రయాలు పుండుమీద కారం రాష్ట్రాలు కోరిన డోసులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్ప త్రులు, కార్పొరేట్లకు టీకామందు అందుబాటులోకి తేవడం ఆశ్చర్య కరం. మే 1 నుంచి 18–44 ఏళ్ల మధ్య వయస్కులకు ఇస్తామని ప్రక టించీ, తగు ఉత్పత్తి లేక పంపిణీని ప్రభుత్వాలు నిలిపివేశాయి. 45 ఏళ్లు పైబడ్డవారికి టీకాలివ్వడంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించాయి. ఈ స్ఫూర్తిని తాజా నిర్ణయం దెబ్బతీస్తోంది. 18 ఏళ్లు పైబడ్డ ఎవరికైనా ప్రయివేటు ఆస్పత్రులు టీకామందు ఇవ్వొచ్చన్న వెసులుబాటుతో సమీకరణాలు మారుతున్నాయి. టీకామందు నల్లబజారుకు చేరే ఆస్కారాలు పెరిగాయి. ఇది సామాజికంగానూ అంగీకారం కాదని, అసమానతలకు దారితీస్తుందనే విమర్శ వస్తోంది. పౌరులకు ఉచి తంగా టీకాలిస్తున్న రాష్ట్రాలు కొంటామన్నా, కోరినన్ని టీకాడోసులు అందివ్వలేనపుడు, ప్రైవేటు పంపిణీ ఎలా సమంజసమని ఏపీ సీఎం వైఎస్ జగన్లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వద్ద సమాధానం లేదు. పాలకులు బేషజాలకు వెళ్లకుండా తప్పులు అంగీకరించడం, సరిదిద్దుకోవడం, తగిన పంథాలో సాగడమే సమస్యకు పరిష్కారం. సరైన అస్త్రాన్ని, సకాలంలో, గురిచూసి సంధిస్తేనే ఏ యుద్ధమైనా గెలి చేది! ఇది తప్పక గెలిచితీరాల్సిన యుద్ధం!! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అశ్రద్ధ వీడకుంటే పల్లె గుల్లే!
కోవిడ్ సెకండ్ వేవ్ బారిన పడుతున్నవారి సంఖ్య గ్రామాల్లో రమారమి పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి వేగం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, చిన్న పట్ట ణాల్లో వైద్య సదుపాయాలు అరకొర. ప్రమాదం ముంచుకు వచ్చినపుడు పెద్ద పట్టణాలు, నగరాలకు పరుగు తీయాల్సి వస్తోంది. మూడో ఉధృతిపై కూడా హెచ్చరికలు వస్తున్న తరుణంలో గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాగల రోజుల్లో తీవ్ర పరిణామాలుంటాయి. జాతిపిత గాంధీజీ చెప్పినట్లు భారతీయ ఆత్మ అయిన గ్రామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం దృష్టిపెట్టి కోవిడ్ నుంచి విముక్తి కలిగించాలి. దీనికి తక్షణ కార్యాచరణ అవసరం. కోవిడ్ రెండో ఉధృతి గ్రామీణ భారతాన్ని పట్టి పీడిస్తోంది. నిరుడు నెలల పాటు కోవిడ్ తొలి ఉధృతి వివిధ స్థాయిల్లో ఉన్నపుడు నగరాలు, పట్టణాల్లో కనిపించిన తీవ్రత గ్రామీణ ప్రాంతాల్లో లేదు. ఒక రకంగా గ్రామాలే సురక్షితమని నగర, పట్టణ వాసులు స్వస్థలా లకు వెళ్లి గడిపిన ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ, ఈ సారి పరిస్థితి అందుకు భిన్నం. కొన్ని ప్రధాన మెట్రో నగరాలు మినహాయిస్తే దేశ మంతటా ఇదే పరిస్థితి! ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాల్లో పెద్ద సంఖ్యలో కేసులు–మరణాలు నమోదవుతు న్నాయి. అదే క్రమంలో మిగతా రాష్ట్ర రాజధానులు, ఇతర ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ కేసులు పెరిగాయి. ప్రభుత్వాలు, వైద్య రంగం, సహాయక విభాగాలు, నిపుణులు... ఇలా అందరి దృష్టీ నగర –పట్టణ ప్రాంతాలపైనే కేంద్రీకృతమైంది. టీకామందిచ్చే ప్రక్రియ కూడా అక్కడే ఎక్కువ! మరోవైపు కోవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య గ్రామాల్లో రమారమి పెరుగుతోంది. మరణాల రేటూ లోగడ కన్నా ఎక్కువే! వైరస్ వ్యాప్తి వేగం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, చిన్న పట్టణాల్లో వైద్య సదుపాయాలు అరకొర. ప్రమాదం ముంచుకు వచ్చినపుడు పెద్ద పట్టణాలు, నగరాలకు పరుగు తీయాల్సి వస్తోంది. ఇది దేశం అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల నుంచి దక్షిణాది చిన్న రాష్ట్రం కేరళ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. గడచిన పక్షం, రోజువారీ కేసుల సంఖ్య దేశంలో మూడున్నర నుంచి నాలుగు లక్షలు తాకుతూ బెంబేలెత్తిం చింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఉధృతి రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జనం కదలికలపై కట్టడి (లాక్డౌన్) విధిం చడం వల్లే వైరస్ వ్యాప్తి తగ్గి ఈ ఫలితం లభిస్తున్నట్టు నిపుణులూ, కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తాజా కట్టడితో ఉపాధిపోయిన వలస కూలీలు తిరిగి సొంతూళ్ల దారిపట్టారు. దేశవ్యాప్తంగా తొలి ఉధృతిలో సొంతూళ్లకు వచ్చిన దాదాపు ఏడెనిమిది కోట్ల మందిలో 37 శాతమే, మళ్లీ పని ప్రదేశాలకు వెళ్లినట్టు ఒక అంచనా! మిగిలిన వారంతా ఇంకా గ్రామాల్లోనే ఉన్నారు. తాజాగా వెనుదిరిగే వారితో గ్రామాలపై మరింత ఒత్తిడి ఖాయం. రెండో ఉధృతి కలవరపరుస్తుండగానే, మూడో ఉధృతిపై హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాగల రోజుల్లో తీవ్ర పరిణామాలుం టాయి. అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని దేశీయ, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిదిద్దకుంటే ప్రమాదమే! దేశవ్యాప్త గణాంకాలకు తోడు సాధారణ అంచనాలు, శాస్త్రీయ అధ్య యనాలు కూడా గ్రామీణభారత దుస్థితికి అద్దం పడుతున్నాయి. దేశంలో నాలుగింట మూడొంతు ప్రాంతాలు ఇప్పుడు కట్టడి నీడన ఉన్నాయి. పరీక్షించిన వారిలో వైరస్ సోకినవారు (పాజిటివిటీ రేటు) 10 శాతం దాటిన జిల్లాలు దేశంలో 718 ఉన్నట్టు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) చెబుతోంది. వచ్చే 6–8 వారాల దాకా ఇక్కడ కట్టడి కొనసాగించాల్సిందేనని మండలి ఛైర్మన్ డా.బలరాం భార్గవ పేర్కొన్నారు. 24 ప్రధాన రాష్ట్రాలకుగాను 13 రాష్ట్రాల్లోని జిల్లాలను, పట్టణ–గ్రామీణ ప్రాంతాలుగా వేర్పరచే వీలుంది. వాటిల్లో నగరాలు, పెద్ద పట్టణాల కన్నా చిన్న పట్టణాలు, గ్రామాల్లోనే ఎక్కువ కోవిడ్ కేసులున్నాయి. మిగిలిన 11 రాష్ట్రాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు, మరణాలు నమోదవు తున్నాయి. అధి కారిక లెక్కల్లో చేరని కేసులు–మరణాలు గ్రామీణ భారతంలో ఎన్నో రెట్లు అధికం! ఓ ఉజ్జాయింపు లెక్క ప్రకారం, రోజు వారీ (వారం సగటు) కేసుల్లో 65 నుంచి 89 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాయి. ఛత్తీస్గఢ్ (89 శాతం), హిమాచల్ ప్రదేశ్ (79), బీహార్ (76), ఒడిశా (76), రాజస్తాన్ (72), ఏపీ (72), ఉత్తరప్రదేశ్ (65), జమ్మూ–కశ్మీర్ (65) రాష్ట్రాల్లో మెజారిటీ కేసులు గ్రామీణ ప్రాంతాలవని ఒక పరిశీలన. ఉత్తరప్రదేశ్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య పెరగటమేకాక, ఏ పరీక్షలూ చేయించుకోకుండా కోవిడ్ లక్షణాలతో అసంఖ్యాకులు న్నారు. రాష్ట్రాన్ని జ్వరం మాగన్నులా కమ్మింది. గ్రామీణ ప్రాంతాలు కోవిడ్ కోరల్లో నలుగుతుంటే, స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలు ఎలా జరిపిస్తున్నారని రాష్ట్రప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అలహాబాద్ హైకోర్టు మంద లించింది. ‘మేమీ పరిస్థితిని అంచనా వేయలేక పోయాం, ఇంత వేగంగా గ్రామగ్రామానికీ వైరస్ వ్యాప్తి చెందుతుం దనుకోలేదు’ అని అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రాదేశ్ సింగ్ చెప్పిన మాటలు అక్కడి పరిస్థితికి నిదర్శనం. గతంతో పోలిస్తే, పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేటు (2.8 శాతం) పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లో తక్కువ (0.7) నమోదయింది. పరిస్థితి విశ్లే షిస్తే, దేశ వ్యాప్తంగా దాదాపు ఒకేరీతి కారణాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో కోవిడ్ లక్షణాలు కనిపించినా అత్యధికులు పరీక్షలకు, చికి త్సకు వెళ్ల టంలేదు. వెళ్లిన చోట కూడా, రెండు రోజుల్లో రావాల్సిన ఆర్టీ–పీసీఆర్ రిపోర్టుకు వారంపైనే పడుతోంది. ఈ లోపు, వైరస్ సోకినవారి వ్యాధి ముదిరి, బాగుచేయలేని స్థితికి చేరుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఆధునిక వైద్య సదుపాయాలు, పరీక్ష అవకాశాలు, ఆక్సిజన్ అందుబాటు... ఇలా ఏవైనా గ్రామీణ ప్రాంతాల్లో సరిగా లేవు. సరైన అవగాహన లేక కొంత, తప్పుడు భావనలతో మరికొంత గ్రామాల్లో ‘కోవిడ్ సముచిత ప్రవర్తన’ (సీఏబి) ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అత్యధికులు మాస్క్లు లేకుండా, భౌతికదూరం పాటించ కుండా, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా నిర్లక్ష్యంగా లెక్కలేనితనంతో తిరుగుతున్నారు. పరస్పర విమర్శలు పరిష్కారమా? నిర్దిష్ట చర్యలతో కార్యాచరణ మాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సరి హద్దు రాష్ట్రాలు, వేర్వేరు విభాగాలు... పరస్పర విమర్శ–ప్రతివిమర్శ చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా గాలికి వదిలే శాయి. టీకా మందు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. దేశీయ ఉత్పత్తి తమ అవసరాలు తీర్చటం లేదని, కేంద్ర పంపిణీ పద్ధతి కూడా బాగోలేదని కొన్ని రాష్ట్రాలు ప్రపంచ టెండర్లకు సన్నద్దమయ్యాయి. ‘రాష్ట్ర ప్రభు త్వాలు టీకా మందు సేకరణ విషయమై అవాస్తవిక ఆలోచనలు వీడాలి, మేం శాస్త్రీయంగానే పంపిణీ చేస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంచే యత్నం చేస్తున్నామం’టూ కేంద్ర వైద్యారోగ్య శాఖామంత్రి పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడారు. కేసుల ఉధృతి రాష్ట్రాలతో తమ కున్న సరిహద్దుల్ని కొన్ని రాష్ట్రాలు మూసివేస్తున్నాయి. షరతులతో రాకపోకల్ని నియంత్రిస్తున్నాయి. కోవిడ్తో గతించిన వారి, వందకు పైగా శవాలు గంగానదిలో కొట్టుకు వస్తే ‘మీ శవాలం’టే, ‘కాదు మీ శవాలే’ అని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు తిట్టుకుంటున్నాయి! వేర్వేరు గట్లలో నాలుగైదు రోజుల కిందట, వారంపది రోజుల కిందటే మరణించగా... కుళ్లిన శవాలని ఒడ్డుకు చేర్చి, అంతిమ సంస్కారాలు చేశామని, శరీర అవశేషాల నుంచి డీఎన్ఏ పరీక్షలకుగాను శాంపిళ్లు తీసి భద్రపరిచామని బీహార్ ప్రకటించింది. భారత్లో పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ, దేశీయ సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తు న్నారు. టీకామందు రెండు డోసులు తీసుకున్న వారిపై వైరస్ ప్రభావం లోపించి, ప్రమాదస్థాయి రమారమి తగ్గిపోయినట్టు పరిశోధన ఫలి తాలు వస్తున్న వేళ... టీకా ప్రక్రియను వేగవంతం చేయాలి. కోవిడ్ విష కోరల నుంచి గ్రామాలను రక్షించడానికి అవగాహన, నిఘా. పరీక్షలు, క్వారంటైన్ సెంటర్లు, వైద్యచికిత్స కేంద్రాలు, మందులు–ఇతర అను బంధ సహాయకాలను విరివిగా పెంచాలి. అత్యధిక భారత జనాభా నివ సిస్తున్న, జాతిపిత గాంధీ చెప్పినట్టు భారతీయాత్మ అయిన గ్రామాలపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం దృష్టి పెట్టి కోవిడ్ నుంచి విముక్తి కలిగించాలి. దీనికి తక్షణ కార్యాచరణ అవసరం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ప్రయి‘వేటు’ పడగ నీడ!
ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. దీంతో ప్రపంచం లోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. చిత్తశుద్ది ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి– ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రం. ప్రభుత్వ రంగ సంస్థల స్థిరాస్తుల మీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించుకుంటాయి? కార్యదక్షత తెలిసేది కష్టకాలంలోనే! అన్నీ సాఫీగా నడిచినపుడు కాక సంక్షుభిత సమయాలే పాలకుల్లో సమర్థత ఉందో, లేదో అద్దంపడుతాయి. ప్రజల పట్ల ప్రభుత్వాల నిబద్ధతను నిగ్గు తేలు స్తాయి. మాటకి–చేతకి పొంతన ఎంతో తేల్చి చెబుతాయి. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. కోవిడ్ మహమ్మారి కొట్టిన దెబ్బకు దేశంలోని కోట్లాది కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. సంవత్సరాల నుంచి ఉద్యోగమో, ఉపాధో అని నిరీక్షిస్తున్న కుటుంబాల గతి ఇప్పటికే దీనంగా ఉంటే, ఉన్న ఉద్యోగం–ఉపాధి కోవిడ్ వల్ల కోల్పోయి రొడ్డున పడ్డ జీవితాలు దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నాయి. తమ ఉద్దీపన చర్యలతో కోలుకుంటోందని ప్రభుత్వాలు ఊదరగొట్టిన ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ రెండో విజృంభణతో వెనక్కి జారుతోంది. పూర్తి మూసివేత (లాక్డౌన్) లేకపోయినా... దాదాపు అలాంటి పరిస్థితినే తలపిస్తున్న నిర్బంధాలు, నిషేధాలు, కఠిన ఆంక్షలు వివిధ కార్య కలాపాల్ని స్తంభింపజేస్తున్నాయి. సామాన్యుల మనుగడ దుర్భరం చేస్తూ ఆర్థిక వృద్ధిని అడ్డగిస్తున్నాయి. దినకూలీల ఉపాధి ఉట్టెక్కుతోంది. ఉద్యోగాలు ఊడుతున్నాయి. రాబడి తగ్గిన ఈ కష్టకాలం లోనే.. ఖర్చులు రమారమి పెరిగాయి. అత్యధికుల బతుకు దుర్భర మౌతోంది. ప్రకృతి దెబ్బకు ప్రభుత్వాల నిర్వాకంతోడై సమాజంలో ఆర్థిక అంతరాలు అధికమౌతున్నాయి. సంపన్నులు మరింత సంపన్ను లవుతుంటే, పేదలు నిరుపేదలవుతున్నారు. మధ్యతరగతి జీవులు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. అశాంతి ప్రబలుతోంది. ఈ నెల 11తో ముగిసిన వారం నమోదైన జాతీయ నిరుద్యోగిత 8.58 శాతానికి చేరింది. గత నెలా ఖరుకున్న 6.65%పైన ఇది దాదాపు 2% పెరుగుదల. నగర–పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత సుమారు పది శాతానికి చేరుకున్నట్టు ‘భారత ఆర్థిక నిర్వహణ కేంద్రం’ (సీఎంఐఈ) అధ్యయనం చెబుతోంది. ఇవి ప్రమాద సంకే తాలు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. సర్కార్ల చిత్తశుద్ధే ముఖ్యం! ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావు. కనుకే, అందుకు తలపడవద్దని, పోరాడి నిలిచి–గెలవాలనీ అందరూ చెబుతారు. అయినప్పటికీ ఆత్మహత్య చేసుకునే వారి మానసిక పరిస్థితి గురించి ఒక క్షణం ఆలోచించాలి. ‘నేను చాతకాక చావటం లేదు, నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి.. ఆరేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఏ యత్నమూ ఫలించలేదు, సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తేవాలని...’ అంటూ వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్న కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సునీల్ నాయక్ ఒక హెచ్చరిక! మరో నిరుద్యోగి, నాగార్జునసాగర్లో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, దుస్థితి తట్టుకోలేక తానూ బలవన్మరణంతో తనువు చాలించిన అతని భార్య అక్కమ్మ... ఇవన్నీ సమస్య తీవ్రతకు ప్రతీకలే! ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి–ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లు, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులు, నర్సులు, టీచర్లు, పోలీసులు, సర్వీసు కమిషన్ ద్వారా ఉన్నతస్థాయి ఉద్యోగులు... ఇలా వివిధ విభా గాల్లో కలిపి రెండేళ్ల కాలంలోనే 4 లక్షల మందికి పైగా ఉద్యోగ–ఉపాధి కల్పించింది. వారంతా, రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడపడంలో భాగమౌతున్నారు. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టక పోవడం విస్మయం. ఖాళీలు భర్తీ చేయరు. వాటిని ఖాళీగా చూపించడం ఇష్టం లేక, విమర్శల్ని ఎదుర్కోలేక పోస్టుల్నే రద్దు చేస్తారు. అయినా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కింద కలిపి సుమారు 60 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం దేశవ్యాప్తం ఖాళీగా ఉన్నట్టు ఓ లెక్క! వాటిని భర్తీ చేసే ప్రయత్నం జరగటం లేదు. ఎన్నికవడానికి ముందు దేశ ప్రజలకు హామీ ఇస్తూ, ‘ఏటా కోటి నుంచి రెండు కోట్ల ఉద్యోగాలి స్తాం’ అన్నారు, ఏవీ? అలాంటిదే మరో ఎన్నికల హామీ, ‘రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం’ అన్నారు, అవెక్కడ? తెలంగాణలో పాలక– విపక్షాల మధ్య ఇదో నిత్యరగడ! ఆరేళ్లలో 1.35 లక్షల మందికి ఉద్యోగ –ఉపాధి కల్పించామని పాలకపక్షం అంటే, నిజానికి ఆ సంఖ్య 35 వేలే అని విపక్షాలంటున్నాయి. ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలూ తమ ఘనతే అంటే, అక్కడ ఊడిపోతున్న అవకాశాలకూ సర్కార్లు బాధ్యత వహించాలి, వహిస్తాయా? పెరగాల్సిన ఉద్యోగులు తగ్గితే? ఏటా లక్షలాది మంది డిగ్రీలు పొంది ఉద్యోగాల కోసం వీధుల్లోకి వస్తు న్నారు. తగినన్ని అవకాశాలు ఉండటం లేదు. 2017–18 లో నిరుద్యోగిత తీవ్రస్థాయికి చేరింది. 1972–73 తర్వాత, 45 ఏళ్లలో ఇదే అత్యధికమని జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) వెల్లడించింది. 2017 నుంచి 2018 కి వచ్చే సరికి పెరగాల్సింది పోయి, 1.09 కోట్ల మంది ఉద్యోగులు తగ్గినట్టు సీఎంఐఈ అధ్యయనం తెలిపింది. ఖాళీలు భర్తీ చేయడం లేదు. ప్రయివేటు రంగంలోనూ విస్తరణలు ఆశించిన స్థాయిలో లేవు. పెద్ద కార్పొరేట్లు మధ్యతరహా పరిశ్రమల్నీ మననీయటం లేదు. ఉద్యోగిత పెంచే చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రభుత్వాలు తగినంత ప్రోత్సహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటివరకు దాదాపు 3 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయని ఒక అంచనా! 1.91 లక్షల ఖాళీలున్నాయని ఇటీవల పీఆర్సీ నివేదికే చెప్పింది. 25 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్లో రిజిష్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది యువకులు ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో.. కోవిడ్ పెద్ద దెబ్బే కొట్టింది. మొదటి విజృంభణలో గత సంవత్సరం కష్ట నష్టాలకోర్చి స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికుల్లో 38.6 శాతం మంది మాత్రమే, తమ పని ప్రదేశాలకు తిరిగి వెళ్లినట్టు ఓ అధ్య యనం చెప్పింది. ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకమే (ఎన్నార్ఈజీ) అత్యధికుల్ని ఆదుకుంది. ఈ పథకం ద్వారా 2019–20 లో 7.88 కోట్ల మంది, 2020–21 లో 11.17 కోట్ల మంది శ్రామిక ప్రజలు లబ్ధి పొందారు. కాలం మారుతోంది, కర్కశంగా... ఇదివరకెన్నడూ లేని విధంగా, ‘అవునూ, అన్నీ ప్రైవేటుపరం చేస్తాం, ఏమిటి తప్పు?’ అని దర్జాగా, ధాటిగా సర్కార్లు ఎదురు ప్రశ్నించే కాలం వచ్చింది. సంక్షేమ రాజ్యం–జవాబుదారీతనం అర్థాలే మారుతున్నాయి. ‘‘ప్రభుత్వ నిర్వాకాల వల్ల నష్టాలొస్తున్నాయి, అందుకే పబ్లిక్ రంగ సంస్థల్ని ఎంతో ‘సామర్థ్యం’ ఉన్న ప్రైవేటుపరం చేస్తు న్నామం’’టున్నారు. అంతటా ప్రైవేటు రంగానికి అంతటి సామర్థ్యమే ఉంటే, వాళ్లు తీసుకున్న అప్పులు, ఇన్నిన్ని బ్యాంకుల్లో ఇన్నేసి లక్షల కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్పీయే)గా ఎందుకు మారుతున్నాయి? ప్రజాధనాన్ని ఎందుకిలా కొల్లగొడుతున్నారు? ఇప్పటికే నదులు, సముద్రాలు, అడవులు, కొండలు, కోనలు, ఖనిజాలు.. ఇలా సహజ వనరుల్ని ప్రైవేటుపరం చేసి, కొత్త ఆశ్రిత వర్గాల్ని బలోపేతం చేసు కుంటున్నారు. పరిశ్రమలని, సెజ్లని, ఫార్మాసిటీలని ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తుల కిచ్చేస్తున్నారు. కర్షకులు, కార్మికులు, ఇతర పౌర సమాజం పోరాడి సాధించుకున్న చట్టాల్ని, హక్కుల్ని క్రమంగా నీరుగారుస్తున్నారు. చట్టాల్ని మారుస్తూ, ప్రజల దృష్టి ఏమారుస్తూ... ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అరవై, డెబ్బై ఏళ్లుగా ప్రజాధనం వెచ్చించి, ఇటుక ఇటుకగా పేర్చి అభివృద్ధి చేసిన పబ్లిక్రంగ సంస్థల్ని (వ్యూహాత్మ కమైనవి తప్ప) అన్నింటినీ ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. పప్పు బెల్లాలకు ధారా దత్తం చేస్తున్నారు. అందులో నష్టాలొచ్చేవే కాదు, లాభాలు గడించేవీ ఉన్నాయి! వాటి స్థిరాస్తులమీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించు కుంటాయి? జీతాలు కోస్తే అడిగేదెవరు? ఉద్యోగుల్ని తొలగిస్తే పట్టించుకునేదెవరు? అది పరోక్షంగా నిరుద్యోగితకే దారి తీస్తుంది. అందుకే అంటారు, విప్లవం ప్రత్యక్ష ఉత్పత్తి కాదు, విప్లవ పరిస్థితుల ఉప ఉత్పత్తి అని! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సమాజ టీకా తోడవ్వాలి!
వైరస్ విజృంభణతో ‘కోవిడ్–19 రెండో ఉధృతి’ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వ అలసత్వం, ప్రజల నిర్లక్ష్యం.. వెరసి కోవిడ్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికి వైద్య టీకాతో పాటు సామాజిక టీకా ముఖ్యం. ‘బహుముఖ పంథా కావాలి. ప్రభుత్వం– సమాజం కలిసి చేయాల్సిన కర్తవ్యమిది. అన్ని ఉపకరణాల్నీ ప్రభావవంతంగా వాడాలి. క్రమం తప్పని పరీక్షలు, వ్యాధి కట్టడి, పాజిటివ్లపై నిఘా, వైద్య రక్షణ, కోవిడ్– సముచిత అలవాట్లు, టీకా... వీటన్నిటి సమర్థ నిర్వహణతోనే కోవిడ్పై విజయం సాధ్యం’ అన్న నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాటలు అక్షర సత్యాలు. దేశం మరో లాక్డౌన్కి సిద్దంగా లేదు. మంచిది కూడా కాదు! కానీ, పరిస్థితులు వికటించి, అదే జరిగితే... ఆర్థిక వ్యవస్థ కోలుకో లేనంత అధ్వానంగా మారి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. సామాన్యుడితో పాటు అప్పుడిక అందరి బతుకూ దుర్భరం. అంతా ఒక్కటై ఆ దుస్థితి రాకుండా అడ్డుకోవాలి. వైరస్ విజృంభణతో ‘కోవిడ్–19 రెండో ఉధృతి’ ప్రమాదఘంటికలు మోగి స్తోంది. ప్రభుత్వ అలసత్వం, ప్రజల నిర్లక్ష్యం... వెరసి కోవిడ్ మహ మ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఏకరీతిలో లేదు. ఉన్నచోట క్రమంగా–వేగంగా విస్తరిస్తున్న తీరే ఆందో ళన కలిగిస్తోంది. ఏడాది కిందట తొలిసారి వచ్చినప్పటికంటే ఇప్పుడు వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వైరస్ ఉత్పరివర్తన వల్ల వచ్చిన వైవిధ్యం కూడా ఓ కారణం. జనం కరోనా బారిన పడ్డాక... రికవరీ రేటు తగ్గుతోంది. పాజిటివిటీ రేటు ఎక్కు వౌతోంది. ఆందోళనకరంగా మరణాల రేటు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు అని లెక్క లేకుండా ఆస్పత్రుల్లో కోవిడ్ వార్డులు మళ్లీ తెర చుకుంటున్నాయి, నిండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అసాధారణంగా కేసులు పెరిగాయి. అక్కడ్నుంచి ఎక్కువ రాకపోకలున్న పొరుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి, రోజు రోజుకు అధి కమవుతున్నాయి. గమనించి, లోతుగా విశ్లేషిస్తే గణాంకాలు భయం కలిగిస్తున్నాయి. తగు చర్యలతో నియంత్రించాల్సిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే నిద్రమత్తు వదిలినట్టు జాగృతమవుతున్నాయి. ‘పరిస్థితులు అధ్వానం నుంచి మరింత దయనీయ స్థితికి జారిపోతున్నాయం’టూ తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ప్రజలు ఇంకా మెలుకున్నట్టు కనిపించడం లేదు! టీకా (వాక్సిన్) అందుబాటులోకి వచ్చి, మనదేశం వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా... జనానికి టీకా ఇస్తున్న/వారు తీసుకుంటున్న ప్రక్రియలో మందకొడితనం నిరాశ కలిగిస్తోంది. లక్ష్యానికి ఆమడ దూరమే! దేశంలో అత్యధికులు కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. టీకా తీసుకున్నప్పటికీ కోవిడ్ జాగ్రత్తలు అవసరమే అని ఎంత చెబు తున్నా... పౌరుల నిర్లక్ష్యం పతాక స్థాయిలో ఉంది. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం/శానిటైజ్ చేసుకోవడం వంటి కనీస పద్ధతులు అనుసరించడంలోనూ తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇతర కారణాలకు తోడు ఈ నిర్లక్ష్యమే ప్రమాద తీవ్రతను ఎక్కువ చేస్తోంది. ఇలా అయితే ఎలా? అవగాహన వేరు చైతన్యం వేరు. అవగాహన లేక ఆచరించకపోవడం ఒక స్థితి. దాన్ని అధిగమించడానికి ఏమైనా చేయొచ్చు! అవగాహన ఉండీ ఆచరించకపోవడమే నిర్లక్ష్యం! ఒక అంతర్గత సర్వే ప్రకారం, కోవిడ్ వ్యాప్తి నివారణకు మాస్క్ ధరించడంతో పాటు కనీస జాగ్ర త్తలు ముఖ్యమని 90 శాతం మందికి తెలుసు. కానీ, 44 శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. అది కూడా నగర, పట్టణ ప్రాంతాల్లోనే, గ్రామీణ ప్రాంతాల్లో అదీ లేదు. కనీస దూరాలు ఎవరూ పాటించడం లేదు. ప్రతి చిన్న అవసరానికీ, ఒకోసారి అవసరం లేకున్నా లెక్కలేకుండా గుమిగూడుతున్నారు. గోప్య కెమెరాలతో నిఘా పెట్టి, మాస్క్లేని వారికి వెయ్యేసి రూపాయల జరిమానా విధించే పరిస్థితి తెచ్చారు. విమానాశ్రయాల్లో కూడా కనీస పద్ధతులు పాటించనివారిపై చర్యలకు నిర్ణయించారు. సంతలు, బార్లు, వర్తక– వాణిజ్య కేంద్రాల వద్దే కాకుండా పండుగలు, పబ్బాలు, గుడి– గోపురాలు, శుభకార్యాలు .. ఇలా అన్నింటికీ తోసుకొని వెళ్లడమే, ఒక రికొకరు రాసుకు–పూసుకు తిరగడమే! నెల పాటు జరిగే కుంభమేళా ఉత్సవాలు గురువారమే మొదలయ్యాయి. లక్షలాది మంది పోగవుతారు. అప్పటికీ ఉత్తరాఖండ్ హైకోర్టు కఠిన నిబంధనల్ని నిర్దేశిం చింది. 72 గంటల లోపు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉంటేనే ఉత్సవాల్లోకి అనుమతించాలంది. హరిద్వార్ ప్రాంతంలోకి రావడానికీ ఆంక్షలు పెట్టారు. ఇలాంటి కట్టడి అంతటా రావాలి. పౌరులు తమ వంతు బాధ్యత గుర్తించాలి. కోవిడ్ వ్యాప్తి అరికట్టే కనీస నిబంధ నలు–పద్ధతులు (ప్రొటోకాల్స్) పాటించకుండా, పౌరులు సహకరించ కుండా ప్రభుత్వ చర్యలతోనే అంతా అయిపోవాలనుకోవడం అత్యాశే! మహారాష్ట్రతో పాటు గుజరాత్, హర్యానా, జమ్మూ–కాశ్మీర్, బీహార్, పంజాబ్, ఢిలీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ నమోద వుతున్నాయి. ఛత్తీస్ఘడ్, తమిళనాడుతో పాటు కొన్ని ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. వైద్య టీకాతో పాటు సామా జిక టీకా ముఖ్యం. ‘బహుముఖ పంథా కావాలి. ప్రభుత్వం– సమాజం కలిసి చేయాల్సిన కర్తవ్యమిది. అన్ని ఉపకరణాల్నీ ప్రభా వవంతంగా వాడాలి. క్రమం తప్పని పరీక్షలు, వ్యాధి గుర్తించి కట్టడి, పాజిటివ్ల పై నిఘా, వైద్య రక్షణ, కోవిడ్–సముచిత అలవాట్లు, టీకా... వీటన్నిటి సమర్థ నిర్వహణతోనే కోవిడ్ పై విజయం సాధ్యం’ అన్న నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రభుత్వ సాధికార కమిటీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ కె పాల్ మాటలు అక్షర సత్యాలు. టీకా ప్రక్రియ వేగం పెరగాలి కోవిడ్ టీకా ఇచ్చే ప్రక్రియ వేగిరపరచడంలో ప్రభుత్వం వద్ద వ్యూహం కొరవడింది. పౌరుల్లో బాధ్యత లోపించింది. టీకా ఉత్పత్తిలో, ప్రపం చంలోనే మూడో పెద్ద దేశం భారత్లో టీకాలిచ్చే ప్రక్రియ మంద కొడిగా సాగుతోంది. మనకున్న వ్యవస్థలకు ఇది మరింత వేగంగా జరగాలి. జూన్ మాసాంతానికి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలన్నది లక్ష్యం. కానీ, గడచిన రెండున్నర మాసాల్లో ఇచ్చింది 6 కోట్ల మందికే! ఇదే సమయంలో 6.4 కోట్ల టీకా డోసుల్ని మనదేశం 82 దేశాలకు పంపిణీ చేయగలిగింది. రాష్ట్రాలతో చర్చించి, ప్రణాళిక రచించి, కేంద్రం తగు కార్యాచరణ చేపట్టాలి. టీకా ఉత్పత్తి, అట్టడుగు కేంద్రా లకు చేర్చడం, వినియోగంలో వృధా అరికట్టడం, పౌరులు ముందు కొచ్చేలా చైతన్యపరచడం... ఇలా కొన్ని సమస్యల్ని ఇంకా అధిగమిం చాలి. ప్రయివేటు ఆస్పత్రుల సహకారంతో టీకా కేంద్రాలు పెంచినా, గ్రామీణ ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయికి టీకా మందు అందుబాటులోకి తెచ్చినా.. ఇదీ పరిస్థితి! కరోనా మృతుల్లో 88 శాతానికి మించి 45 ఏళ్లు పైబడ్డ వాళ్లే! షరతులతో పనిలేకుండా, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇచ్చే ప్రక్రియ గురువారం మొదలైంది. ఇప్పుడిక వేగం పెరగాలి. ఈ లక్ష్యం వచ్చే రెండు వారాల్లో నూరు శాతం పూర్తి కావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాలను నిర్దేశిం చింది. ఇంకా టీకా రెండో డోసు ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత పది–పదిహేను రోజులకు గాని యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందవంటారు. ఆ తర్వాతే ‘సామూహిక రోగనిరోధకత’ గురించి ఆలోచించాలి. అందుకని, పౌరులు చొరవ చూపాలి. ఎవరికి వారు బాధ్యతగా భావించి, కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవాలి. ఇంకా... కోవిషీల్డా? కోవాక్సినా? అనే మీమాంస ప్రజల్లో ఉంది. నిజానికి ఏదైనా ఒకటే! ఉత్పత్తిలో తగు ప్రమాణాలు లేవని బ్రెజిల్ వంటి దేశాలు కోవ్యాక్సిన్ అనుమతి నిరాకరించడం ఇలాంటి సందేహాలకు కారణం కావచ్చు! ఉత్పత్తిదారు–ప్రభుత్వం ఈ సందేహాల్ని నివృత్తి చేయాలి. మరో టీకా స్పుత్నిక్–వి(రష్యా)ని దేశంలోకి అనుమతిం చడం ఇప్పుడు పరిశీలనలో ఉంది. అదీ వస్తే మరింత మేలు. మేలుకోకుంటే ప్రమాదమే! మన వాతావరణం, జీవనశైలి, ఇక్కడి పరిస్థితులు ఇన్నాళ్లూ కాపాడాయి. కిందటి వారంతో పాలిస్తే దేశంలో గత వారం కోవిడ్ మరణాల రేటు 51 శాతం పెరిగింది. ఇంకా చాలా మరణాలు కోవిడ్ వల్లే అయినా, అధికారికి లెక్కల్లో అంతకు ముందరి జబ్బుల కిందే చూపుతున్నారు. ఆస్పత్రులకు వచ్చిన కోవిడ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలోనూ పది రోజుల్లో రెట్టింపయ్యాయి. కేసులు బాగా పెరుగు తున్న, వేగంగా వ్యాధి విస్తరిస్తున్న జిల్లాల సంఖ్య దేశంలో 47కు చేరింది. వాటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణెతో కలుపుకొని పది జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు న్నాయి. మన నిర్లక్ష్యం స్థాయి ఇలాగే ఉంటే.... పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందరూ బాగుంటేనే, అందులో ఎవరమైనా బాగుంటాం. అందుకే తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఏప్రిల్ 10,11 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం
ఉగాది సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21ను ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు, 21 దేశాలలోని 21 సంస్థల అధ్యక్షులు పాల్గొంటారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి. చంద్రయ్య (తెలంగాణ మానవ హక్కు కమిషన్ చైర్మన్), విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరుకానున్నారు. 21 గంటలపాటు కొనసాగే ఈ కార్యకమ ముగింపు వేడకకు పద్మభూషణ్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, ప్రఖ్యాత రచయిత తనికెళ్ల భరణి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఈనాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సబ్ఎడిటర్ విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, మనతెలంగాణ ఎడిటోరియల్ అడ్వైజర్ గార శ్రీరామ మూర్తి హాజరవుతారు. -
నిబద్ధతే అసలైన కొలబద్ద
పదవీవిరమణ చేసిన అఖిల భారత సర్వీస్ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్లోకి ఓ అధికారి థామస్ నియామక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపాల్సిన జోడు గుర్రాలు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వతంత్రులా? అస్వతంత్రులా? స్వతంత్రులైతే... తరచూ న్యాయస్థానాల మందలింపులెందుకు? విప క్షాల విమర్శలేల? సర్కార్లు మారినపుడల్లా సాధింపులెందుకు? అస్వ తంత్రులైతే... ఇంతకీ వారు ఎవరికి కట్టుబడి ఉండాలి, అప్పటి పాల కులకా? ప్రభుత్వ విధానాలకా? రాజ్యాంగ పరిధి చట్టాలకా? ఎందు కిన్ని ప్రశ్నలంటే.. వారి పనితీరు రేకెత్తిస్తున్న సందేహాలే కారణం! నిబంధనలకు నీళ్లొదిలి కొన్ని ప్రభుత్వాలు వారి సేవల్ని దుర్విని యోగం చేస్తున్న వైఖరొక హేతువు! సంగారెడ్డి అదనపు కలెక్టర్ను హైకోర్టు మందలించడం, ముంబై నగర పోలీస్ కమిషనర్ ఆక స్మిక బదిలీ, గోవా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు బాధ్యతల నుంచి ఆ రాష్ట్ర న్యాయకార్యదర్శిని సుప్రీంకోర్టు తప్పించడం.. ఇటువంటి తాజా పరిణామాలన్నీ ఇదే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అత్యున్నత అధికార వ్యవస్థను నడిపే అఖిల భారత సర్వీస్ అధికారులు తరచూ వివా దాలకు, విమర్శలకు కేంద్ర బిందువవుతున్నారు. నిజానికి ఎక్కువ మంది అధికారులు చట్టాలకు, విధానాలకు లోబడి ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వారయినా, ఉద్యోగవర్గంపై విమర్శలకు కొదువ లేదు. కొన్నిసార్లు పాలకుల చేష్టలు కారణమైతే, మరికొన్నిసార్లు సదరు అధి కారుల వ్యవహారశైలే ఇందుకు దారితీస్తోంది. ఫలితంగా ఉన్నతాధికార వ్యవస్థ ప్రజా విశ్వాసం కోల్పోతోంది. మరేమిటి మార్గం? అనే ప్రత్యామ్నాయ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. తాము తలపెట్టిన సంస్కరణలు నెమ్మదించడానికి అధికార వ్యవస్థ మందకొడితనమే కారణమని దేశ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. సంప్రదాయానికి భిన్నంగా, వయసు మళ్లిన నిపు ణుల్ని పాలనావ్యవస్థలోకి నేరుగా తీసుకోవడం (లేటర్ ఎంట్రీ) క్రమంగా ఎక్కువౌతోంది. ఆర్థిక వ్యవస్థ ఛిద్రమై, కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా ప్రైవేటీకరణకు వాకిళ్లు తెరుస్తున్న ప్రస్తుత సంక్షుభిత సమయంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని సర్కారు ఎందుకు నడపాలి? అని ప్రశ్నించే ముందు, అందుకు బాధ్యులెవరో శోధించరా? కడదాకా నిలువని తొలినాళ్ల స్ఫూర్తి దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసు అధికారులు అత్యధికుల్లో తొలినాళ్ల ఉత్సాహం, నిబద్ధత తర్వాతి సంవత్సరాల్లో కనబడటం లేదు. పలు రకాల జాడ్యాలకు వారు లోబడిపోతున్నారనే విమర్శలున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో ఎంపిక వల్ల ప్రతిభ, నైపుణ్యం కలిగిన వారే వస్తుంటారు. ఉత్తమ శిక్షణ వల్ల మంచి ఆశయాలతో సర్వీసులో చేరుతారు. ఇటీవలి సంవత్స రాల్లో అయితే... ఐఐటీ, ఐఐఎం తదితర ప్రామాణిక సంస్థల నుంచి పట్టాలు పొందిన వారు అఖిల భారత, రాష్ట్రాల సర్వీసులకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మొదట్లో వారు పూర్తి సమయం వెచ్చించి, ఉదాత్తమైన సేవల్ని అందిస్తారు. సంక్షేమమైనా, అభివృద్ది కార్యక్రమా లైనా క్షేత్రంలో మంచి చొరవ, నాయకత్వ స్ఫూర్తితో నిర్వహించి ఆద రణ పొందుతారు. కాలం గడుస్తుంటే పరిస్థితిలో చాలా మార్పు వస్తోంది. అధికారం కేంద్రీకృతమయ్యే రాజకీయ వ్యవస్థ ప్రాపకం కోసం ప్రయాసలో దారి తప్పుతుంటారు. కొన్నిసార్లు రాజకీయ క్రీ(నీ)డల్లో సమిధలవుతారు. అందుకే తరాలు మారుతున్నా... అధికా రుల మంచితనం మాట్లాడేటప్పుడు ఒక శంకరన్, ఒక వేణుగోపాల్, ఒక నాగిరెడ్డి వంటి కొన్ని పేర్లే ఉదహరించాల్సి వస్తోంది. ‘అధికార వ్యవస్థ–వృద్ధి’ అనే అంశంపై ఓ ప్రపంచ స్థాయి సదస్సులో సమ ర్పించిన పత్రం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న 35 దేశాల్లో ఆర్థికాభివృద్ధికి అధికారుల నైపుణ్యాలే కారణంగా వెల్లడైంది. ‘తూర్పు ఆసియా అద్భుతం’ పేరిట ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలోనూ జపాన్, కొరియా వంటి దేశాల్లో ఇది సాధ్యమైనట్టు స్పష్టమైంది. మనది సహజంగానే ‘వృద్ధి ప్రతిబంధక’ ఉద్యోగ వ్యవస్థ అనే భావన వ్యాప్తిలోకి వచ్చింది. వీరప్పమొయిలీ నేతృత్వాన 2005లో ఏర్పాట యిన రెండో పాలనా సంస్కరణల కమిషన్ సిఫారసుల్లోనూ అత్య ధికం సీనియర్ అధికారులకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. కానీ, అవేవీ సరైన రీతిలో అమలుకు నోచలేదు. పాలనా సంస్కరణలు కష్టమేమో కానీ, అసాధ్యమేమీ కాదు. చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పి.. అధికార వ్యవస్థ చెడ్డపేరుకు కారణాలెన్నో! వారి పనుల్లో రాజకీయ అనుచిత జోక్యాలు, నేతల ప్రాపకానికి అధికారులు అర్రులు చాచడం వంటివి ముఖ్యం. మంచి హోదాలు పొందడానికో, ఇష్టమైన చోటుకు బదిలీనో–ఇష్టం లేని చోటు తప్పించుకోవడానికో కొందరు నేతల చెప్పుచేతల్లో ఉంటున్నారు. అంతిమంగా వివిధ స్థాయిల్లో జరిగే అవి నీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించే పనులు నాయకులు చెప్పినా... కూడదని నిరాకరించి, అడ్డంగా నోట్ఫైల్ రాసే అధికారులు ఎందరుంటారు? దేశంలో మధ్యాహ్న భోజన వ్యవస్థకు తమిళనాడులో బీజం పడింది. సదరు ప్రతిపాదన వచ్చినపుడు ఇది ఆచరణ సాధ్యం కాదంటూ ఫైలును ఆర్థికాధికారి తిప్పిపంపారు. నాటి ముఖ్యమంత్రి ఆ అధికారిని పిలిపించి, ‘ఈ పూట భోజనం ఎక్కడ్నుంచి, ఎవరు పంపితే వచ్చిందో తెలియకుండా.. తదుపరి పూట భోజనం అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నీవెప్పుడైనా ఎదుర్కొన్నావా?’ అని అడిగారట. ‘లేదు’ అని చెప్పిన అధికారికి, ‘నేనా పరిస్థితి ఎదు ర్కొన్నాను. రాష్ట్రంలో ఎందరో అలాంటి వారున్నారు. సంక్షేమ రాజ్యంగా వారిని ఆదుకోవడం మన బాధ్యత, ఎలా సాధ్యమో నే చూసుకుంటాను, నీ అభిప్రాయాన్ని ఓవర్రూల్ చేస్తూ నోట్ రాస్తున్నాలే!’ అని సౌమ్యంగా చెప్పి పంపారట. ఆయన ఎవరో కాదు, దివంగత ఎమ్జీ రామచంద్రన్. రాజకీయ వ్యవస్థకు లొంగి చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పటమే కాదు, కోర్టు ఉత్తర్వుల్నీ అమలు చేయని అధికారులుంటారు. అది న్యాయ ధిక్కారం కేసు అయినపుడు కోర్టుల నుంచి చీవాట్లు. ‘ఈ పద్ధతేం బాగోలేదు. కోర్టు ఆదేశాలు అమలు చేయరు. చివరి నిమిషం దాకా ఎలా భంగపరచాలని చూస్తారు. తప్పనపుడు... బేషరతుగా క్షమాపణలు అడుగుతారు’ అని తెలంగాణ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంగారెడ్డి జిల్లా అధికారుల్ని మందలించింది. పరస్పర లబ్ధికి లొంగుబాట్లు.. విభేదించినప్పటి కన్నా, నేతలతో అధికారులు అంటకాగటం వల్ల ఉద్యోగ వ్యవస్థ భ్రష్టుపట్టిందే ఎక్కువ! అలా అని అన్నింటికీ అధికా రులు నేతల్ని విభేదించాలని ఎవరూ అనరు. పాలకులకు అనుచిత ప్రయోజనాలు కల్పించినందుకు ఉద్యోగ విరమణ తర్వాత మంచి హోదాలు పొందిన వారుంటారు. వాటిపై కన్నేసి... రాజ్యాంగానికి, చట్టానికీ అతీతంగా ఉద్యోగం చివరి రోజుల్లో రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేసిన అధికారులూ ఉన్నారు. అందుకే, వివిధ కమిషన్లు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లోకి పదవీ విరమణ తర్వాత అధికారులు రావడాన్ని పౌరసమాజం తరచూ విమర్శిస్తోంది. యోగ్యులు, వివాద రహితులైన తటస్థ అధికారులు రావటాన్ని స్వాగతించిన సందర్భాలెన్నో! యోగ్యత లేకుండా జరిగే అడ్డదిడ్డపు నియామకాలను కోర్టులూ తప్పుపట్టాయి. పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీస్ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అధికారులకు పునరావాస కేంద్రాలవుతున్నాయన్నది ముఖ్య విమర్శ. అధికారులు సమాచారం సరిగా ఇవ్వనందుకే, సర్వీసు నిబంధనల్ని ఉన్నతాధికారులుగా ఉల్లంఘించినందుకే... అప్పీళ్లు వచ్చే ఆర్టీఐ కమిషన్లలో, పాలనా ట్రిబ్యునళ్లలో తిరిగి రిటైర్డ్ అధికారులే తీర్పులు చెప్పడమేమిటి? అన్నది సగటు మనిషి విస్మయం. కేంద్ర విజిలెన్స్ కమిషన్లోకి ఓ అధికారి థామస్ నియా మక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపా ల్సిన జోడు గుర్రాలు. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కట్టడి సరే! కర్ర పెత్తనమొద్దు
ఆన్లైన్ కంటెంట్ విచ్ఛలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. అభ్యంతరకర కంటెంట్ డిజిటల్ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం. భరోసా ఇవ్వాల్సిన నిబంధనలు భయాలు రేపితే? పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే! ‘డిజిటల్ మీడియా’లో వచ్చే కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు చర్చ రేపుతున్నాయి. ఇదొక ‘మృదు స్పర్శ’ అని సర్కారు ముచ్చటగా పేర్కొన్నా, చివరకు కఠువైన కర్రపెత్తనానికి దారితీసే జాడే కనిపిస్తోంది. అదే జరిగితే, ఇంతటి కసరత్తు తుదిస్వరూపం... భావ వ్యక్తీకరణ హక్కుకు ఒకడుగు దూరం, సెన్సార్షిప్కు మరొకడుగు దగ్గరైనట్టే లెక్క. ఇన్నాళ్లూ వాటిపై చట్ట నియంత్రణ లేకపోవడం ఓ లోపమైనా, ఎంతో ఆసక్తితో నిరీక్షించింది ఇందుకా? అన్న పెదవి విరుపు మీడియా వర్గాల్లో వస్తోంది. పౌరులు కూడా ఏం బావుకుంటారనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిబంధనల వెనుక పేర్కొన్న లక్ష్యాలు ఆదర్శవం తంగా అమలయితే, హానికి బదులు సమాజానికి మంచి జరగొచ్చు! కానీ, నిబంధనల నీడలో కేంద్ర సర్కారు పెద్దలకు లభించే నిర్హేతుక విచక్షణాధికారాల వల్ల దురుపయోగానికి ఆస్కారం పెరుగుతుంది. నిబంధనావళి రూపొందించిన తీరే అందుకు కారణం. ఆన్లైనే వేదికగా... ఏలిన వారి సానుకూల ప్రచార ద్వారాలు తెరచుకునేందుకు, గిట్టని ప్యత్యర్థి పక్షాల వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బంధాలు వేసేందుకూ ఇది ఊతమిస్తుంది. ఆన్లైన్ కంటెంట్ విచ్చలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. ఆన్లైన్ సమాచార వ్యవస్థల ఊపిరైన భావవ్యక్తీకరణ హక్కుకు గండి పడొచ్చు. డిజిటల్ మాధ్యమాలే వేదికగా పరస్పర సమాచార మార్పిడి చేసుకునే వినియోగదారుల గోప్యత గోడలె క్కొచ్చు! ఓటీటీ వేదికల్లో పుట్టే కంటెంట్ సృజన భంగపడచ్చు! నచ్చని సర్కారు విధానాలని ఎండగడుతూ వేర్వేరు సామాజిక వేది కల నుంచి నిరసనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే ప్రజాస్వామ్యవాదుల గొంతును నొక్కే ఆయుధంగా మారే ప్రమాదముంది. ఇప్పుడెందుకీ నిబంధనలు? సామాజిక మాధ్యమాలతో సహా ఇతర ఆన్లైన్ డిజిటల్ వేదికల నుంచి వస్తున్న కంటెంట్ తరచూ వివాదాస్పదమౌతోంది. రాజకీయ అనుకూల, ప్రతికూల వాదనల నడుమ ట్విటర్, ఫేస్బుక్ వంటి మాధ్యమిక డిజిటల్ వేదికలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలనెదు ర్కొంటున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, దానికి భంగం కలిగేలా ‘వాట్సాప్’ ఇటీవల తాజా నిబంధనావళిని తెచ్చే యత్నం, వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం తెలిసిందే! ఇక్కడొక పద్ధతి, పకడ్బందీ చట్టాలున్న ఇంగ్లండ్ వంటి ఐరోపా దేశాల్లో మరో పద్ధతి ఎలా పాటిస్తారంటూ కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు సదరు మాధ్యమిక డిజిటల్ వేదికను ప్రశ్నించాయి. ఆ పరిస్థితి కూడా, దేశంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం, ఒక నియం త్రణ వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెప్పింది. డిజిటల్ మీడియా వేదికల నుంచి పిల్లలను పెడదారి పట్టిస్తున్న శృంగార వీడియోలు (పోర్నో), మహిళల్ని అసభ్యంగా, అభ్యంతరకరంగా చూపించే వీడియోలు, చిత్రాలు ప్రసారమౌతున్న తీరుపట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ప్రజ్వల కేసులో కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది. వినియోగదారుల సమాచారం పంచుకునే మాధ్యమిక వేదికలతో సహా వివిధ డిజిటల్ మీడియాలో వస్తున్న కంటెంట్ను కట్టడి చేయాలని, అవసరమైతే మార్గదర్శకాల్ని జారీ చేయాలని, నియంత్రణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. ప్రస్తుత మార్గదర్శకాలు ఆ క్రమంలో వచ్చినవే! అయితే వీటిని పార్లమెంటు లోగానీ, మరే ఇతర శాసన వేదికల్లోగానీ చర్చించ లేదు. డిజిటల్ మీడియాపై అధికారిక నియంత్రణ, వారి పనితీరును నిర్దేశించే చట్ట మేదీ లేకపోవడం లోపంగానే ఉంది. కొత్తగా చట్టం తీసుకురాకుండా కేంద్రం తాజా నిబంధనలతో ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేసింది. ఎటు దారి తీసేనో...! డిజిటల్ వేదికల్లో కంటెంట్ ఏ అదుపూ లేకుండా, విచ్చలవిడిగా ఉండా లని ఎవరూ కోరుకోరు. నియంత్రణ, అందుకు తగిన మార్గదర్శకాలు, అమలుపై నిఘా ఉండాల్సిందే! అవి ఏ మేర సముచితమన్నది ప్రజా స్వామ్య వ్యవస్థలో చర్చ పుట్టిస్తుంది. ఫిర్యాదుల్ని పరిష్కరించడం, డిజిటల్ వేదికలని నియంత్రించడం, వారి ప్రక్రియల్ని చట్టబద్ధం చేయడం కోసమే ప్రస్తుత నియమావళి. డిజిటల్ అన్న మౌలిక పదం కింద... అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికల్ని, ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్ని, వాట్సాప్, సిగ్నల్ వంటి సమాచార మార్పిడి–మాధ్యమిక వేదికల్ని, వివిధ న్యూస్ వెబ్సైట్ల వంటి సమా చార మాధ్యమాల్ని... అన్నింటినీ ఒక గాటన కట్టడం ఆశ్చర్యం కలిగి స్తోంది. వాటి స్వరూప స్వభావాలు, పనితీరు, కంటెంట్ నిర్మాణం, పంపిణీ, లక్ష్యిత వినియోగదారులు... భిన్నం. కంటెంట్ పట్ల అభ్యంత రాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించేందుకు ఆయా సంస్థల్లో నిర్దిష్ట మూడంచెల వ్యవస్థ ఉండాలని నిర్దేశించారు. అంతర్గ తంగా మొదట గ్రీవెన్స్ ఆఫీసర్, తర్వాత ఫిర్యాదుల్ని పరిష్కరించే ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. అప్పటికీ పరిష్కారం లభించ కుంటే, సదరు అంశం మూడో స్థాయిలో, ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో ఏర్పడే ‘తుది అంచె కమిటీ’కి వెళ్తుంది. వారిచ్చే తీర్పుకు లోబడి ఉండాలి. అంటే, పాలకపక్షాల కనుసన్నల్లోని వీర విధేయ అధికారులు ఆయా స్థానాల్లో ఉంటే, ఇది ’సూపర్ సెన్సా రింగ్’ కాక మరేమవుతుందన్నది ప్రశ్న! ఆన్లైన్ మీడియాలో ఏం రావాలి? ఏం రావొద్దు? అన్నది ప్రభుత్వాధికారుల నిర్ణయాల ప్రకారం జరిగితే, మీడియా స్వేచ్ఛ– వాక్స్వాతంత్య్రానికి అర్థం చిన్న బోతుంది. చిన్న సంస్థలు ఇంతటి ఫిర్యాదు–పరిష్కార వ్యవస్థల్ని ఏర్పరచుకోలేవు. పెద్ద సంస్థలు సర్కారు పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడ సాహసించలేవు. చివరకిది, ఫక్తు ప్రచారానికి–సమాచార వ్యవస్థకి మధ్య విభజన రేఖను చెరిపేస్తుంది. మీడియా విశ్వసనీయ తను తగ్గిస్తుంది. కడకు ఆర్థికంగా మనలేని స్థితికి మీడియా దిగజారు తుందన్నది ఆందోళన. ఓటీటీలో వచ్చే కంటెంట్ వీక్షకులను వేర్వేరు వయసుల వారిగా వర్గీకరించాలన్న నిబంధన స్వాగతించదగ్గదే. న్యాయస్థానంలో నిలిచేనా...? పరస్పర విరుద్ధాంశాలు సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. అభ్యంతరకర కంటెంట్ డిజిటల్ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత (ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టింగ్) ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం. ఇదే సమయంలో ఆ రెండు చట్టాలు తీసుకువచ్చే యత్నాలు మరోవైపు జరుగుతున్నాయి. గోప్యత ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు 2017 ఆగస్టులో విస్పష్టమైన తీర్పునిచ్చింది. పైగా, నిబం ధనల్లో పేర్కొన్న పలు అంశాలు నిర్ణయించే అధికారం సర్కారుకు/ అధికారులకు దఖలుపరిచే మూల స్వరూపమేదీ సదరు ‘ఐటి చట్టం– 2000’లో లేదు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నట్టే, ఒక చట్టం కింద రూపొందే నిబంధనలు సదరు చట్టానికి లోబడే ఉండాలి. భిన్నంగా ఉంటే, సవాల్ చేసినపుడు న్యాయస్థానంలో నిలువ జాలవు. తగురీతిన పార్లమెంటులో చర్చించకుండా, చట్ట సవరణకూ సిద్దపడ కుండా, తనకు లేని అధికారాల్ని ప్రభుత్వం నిబంధనల రూపంలో తీసుకురావడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ బద్ధత అటుంచి, ముందు చట్టబద్ధతైనా ఉండాలిగా? అనే ప్రశ్న తలె త్తుతోంది. తప్పిదాల్ని సరిదిద్దుకోకుంటే... భారత రాజ్యాంగం అధిక రణం 19(1)(ఎ)లో, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన అధి కరణం 19లో నొక్కిచెబుతున్న భావ ప్రకటన స్వేచ్చ గాలికి ఎగిరిపోయి ప్రజాస్వామ్యం పరిహాసమవుతుంది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అణచేస్తే అణగని జనగళం
దేశద్రోహం అభియోగంతో ‘టూల్కిట్ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.. ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేతమివ్వా లన్న సర్కారు ఆలోచన వికటించింది. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరి ష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోదీ ప్రభుత్వపు ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగజారుస్తోంది. రైతులకు ఏది మంచో, వారేం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేయడమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజాందోళనలు సునాయాసమైన ఆహ్లాద క్రీడలు కావు. ఎంతో శ్రమ, త్యాగాలతో కూడుకున్నవి. శక్తివంతమైనవి కూడా! తాము చేసేది, ‘సమాజ ఉమ్మడి ప్రయోజనాల కోసం’ అనే తలంపులోనే ప్రగాఢ శక్తి ఇమిడి ఉంది. ఎన్నో ప్రతీఘాత చర్యలకు ఎదురొడ్డి నిలుస్తాయి. వెంటనే ఫలితం కనపించకపోయినా... ఎప్పుడో ఒక ప్పుడు, ఏదో రూపంలో ఫలిస్తాయి. వాటిని కించపరిస్తే... అగ్నికి ఆజ్యం పోసినట్టు మరింత రగులుతాయి. అణచివేస్తే నేలకు కొట్టిన బంతిలా రెట్టించిన ఒత్తిడితో పైకి లేస్తాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కేంద్రంలోని పాలకపక్ష వ్యూహకర్తలు ఈ చారిత్రక సత్యాన్ని ఎందుకు విస్మరించారు? వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం, దన్నుగా ఎక్కడికక్కడ జరుగుతున్న మద్దతు పోరా టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి విమర్శలనెదుర్కొంటోంది. కొన్ని నెలలుగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి పాలకపక్షీయులు చేయని ఆలోచన లేదు, పన్నని వ్యూహరచన లేదు! అయినా, సాధిం చిందేమీ లేదు. గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల ఆధారంగా... వేర్పాటు వాదులు, విధ్వం సక శక్తుల చేతుల్లోకి ఉద్యమం వెళిపోయిం దని చేస్తున్న ప్రచారానికీ స్పందన రాలేదు. ఆ ఒక్క ప్రతికూల పరి ణామంతో ఉద్యమ నాయకులూ ఢీలా పడ్డారు. ప్రభుత్వం దీన్ని ప్రచా రాస్త్రం చేయడంతో అంతా ‘ఇక అయిపోయింది’ అనుకున్నారు. కానీ, తిరిగి పుంజుకున్న రైతాంగ ఉద్యమం భౌగోళికంగా, భావజాలపరంగా ఇంకా విస్తరిస్తోంది. సరి కొత్త సవాళ్లు విసురుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా విరుగుడు ఆలోచిస్తూ కొత్త కార్యాచరణ చేపట్టింది. తాజాగా, పర్యావరణ కార్యకర్త దిశరవి అరెస్టు, అంతకు ముందు ఆమెపై దేశద్రోహం, కుట్ర, విద్వేషం రగిలించడం వంటి అభియో గాలతో ఢిల్లీ సైబర్ పోలీసులు కేసు పెట్టడం దేశం లోపల, బయట పెద్ద చర్చనే లేవనెత్తింది. మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలపై దేశ ద్రోహం కేసు పెట్టి ‘బెయిల్లేని అరెస్టు వారెంట్’ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేయడంతో వారిద్దరూ బెయిల్ తీసుకుంటున్నారు. ‘శాంతియుత అస మ్మతి, విమర్శ, నిరసన... దేశ పౌరుల ప్రాథమిక హక్కు’ రైతు ఉద్య మంలో అరెస్టయిన ఇద్దరికి బెయిల్ ఇస్తూ ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్య రాజ్యాంగపరమైన మౌలికాంశాన్ని తెరపైకి తెచ్చింది. ‘నిరసనల్ని తొక్కిపెట్టడానికో, విమర్శకుల నోరుమూయిం చడానికో దేశద్రోహం చట్టాన్ని దుర్వినియోగపరచనీయం’ అన్నారీ సందర్భంగా! ఏమనుకుంటే ఏమౌతోంది? ప్రభుత్వం, నిర్దిష్ట సంకేతమివ్వాలనే కొన్ని చర్యలు చేపడుతుంది. కానీ, కొన్నిమార్లు సదరు చర్య అందుకు భిన్నమైన సందేశాన్ని జనం లోకి తీసుకుపోతుంది. దిశ అరెస్టులోనూ అదే జరిగింది. దేశద్రోహం అభియోగంతో ‘టూల్కిట్ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.... ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేత మివ్వాలన్న సర్కారు ఆలోచన వికటించింది. ‘56 ఇంచ్ల ఛాతీ, నిత్య కసరత్తులతో సడలని దృడఖాయం, వెరువని ధీరోదాత్తమైన వజ్ర సంకల్పం.. ఇరవయేళ్ల అమ్మాయికి ఇంతగా భయపడుతోందా?’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలు, సంప్రదాయ మీడియాలో వెలసిన కార్టూన్లు పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. న్యూయార్క్లో ఉండే భారత మేధావి, ప్రఖ్యాత కాలమిస్ట్ సలీల్ త్రిపాఠీ దాదాపు ఇలాగే స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులు పేర్కొన్న దాన్ని బట్టి... భారత్ ఇపుడు అతి ప్రమాదస్థితిలో ఉంది. 2.6 ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, అణ్వాయుధంతో ప్రపంచంలోని అయి దింట ఒకటైన మహాదేశం, ఓ బలీయశక్తి ముందు అత్యంత దుర్భ లంగా కనిపిస్తోంది. అదేదో మరో అణ్వాయుధమున్న శత్రుదేశం కాదు, విడివిడిగా–ఎవరికి వారుగా ఉండే సెలబ్రిటీలు, విభిన్నరంగాల సామాజిక కార్యకర్తలు, పోరాటాలు–ఉద్యమాలతోనే జీవించే, ప్రధాని మోదీ పరిభాషలో ‘ఆందోళన జీవుల’ బృందమది’’ అంటారాయన. డిజిటల్ సాంకేతికత వచ్చాక, ఐటీ తదితర రంగాల నెట్వర్కింగ్ వ్యూహకర్తలే కాకుండా ప్రజాపోరాటాలు జరిపేవారు కూడా ‘టూల్ కిట్’ ఉపకరణాన్ని వాడుతారు. ఇదేం మారణాయుధం కాదు. ఐటీ యుగంలో ఇదొక పరస్పర సమాచార మార్పిడి వేదిక. భాగమైనవారు, సమాచారాన్ని వేర్వేరు రూపాల్లో పంచుకుంటారు. ఇది చాలా సాధా రణ ప్రక్రియ. అయితే, దీన్ని ‘ఖలిస్తాన్’ వేర్పుటువాదంతో ముడిపెట్టి, వారితో రహస్యంగా సంబంధాలు నెరపడం కింద నిర్దిష్ట అభియోగా లతో దిశరవితో పాటు మరో హక్కుల కార్యకర్త, ముంబై అడ్వకేట్ నికితా జాకోబ్, పర్యావరణ కార్యకర్త–ఇంజనీర్ శంతను ములుకుల పైనా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇదివరకే జారీ చేసిన మార్గదర్శకాల్ని బేఖాతరంటూ, అంతర్రాష్ట్ర అరెస్టుల్లో పాటిం చాల్సిన కనీస పద్దతుల్నీ ఢిల్లీ పోలీసులు విస్మరించారు. దిశను బెంగళూరు నివాసంలో అరెస్టు చేసేటప్పుడు పోలీసులు భయోత్పాతం సృష్టిం చారు. ఇదంతా పోలీసుల, తద్వారా ప్రభుత్వం వైఖరిని వెల్లడించేదే అనే విమర్శలున్నాయి. మొరటు చర్యలు అణచగలవా? సమస్యను, దాని మూలాలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం వల్లే పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అతిగా స్పందిస్తోందన్నది విమర్శ. స్వీడన్ పర్యావరణ యువకార్యకర్త గ్రెటా తన్బర్గ్ ట్వీట్కు స్పందిం చడం ఓ ఉదాహరణ. వేర్వేరు రంగాల దేశీ ప్రముఖులతో ప్రతిస్పం దనలు ఇప్పించి, వ్యవహారాన్ని జటిలం చేయడమే కాక దేశ ప్రతిష్టను అంతర్జాతీయ సమాజంలో దిగజార్చారు. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరిష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దాన్ని దేశ సార్వ భౌమాధికారంలో చొరబాటుగా పరిగణించడం విమర్శలకు తావి చ్చింది. ఇదే నిజమైతే... నేటి చైనా నాయకత్వ సరళిపైన, నిన్నటి ట్రంప్ నిర్ణయాల పట్ల, మొన్నటి హిట్లర్ నియంతృత్వం మీద మనం, మన మేధావులు చేసిన వ్యాఖ్యలన్నీ ఆయా దేశాల సార్వభౌమాధికార ధిక్కరణలేనా? ఎవరిపైన అయినా దేశద్రోహం ఆరోపించడం తేలిక! నిరూపించడం దుర్లభం. లేనపుడు రుజువుచేయడం అసంభవం. ఉద్యమాలను బలహీనపరచడానికి, సాధారణ జనంలో దురభిప్రాయం కలిగించడానికి దేశద్రోహం ఆపాదిస్తున్నారనే విమర్శ బలపడుతోంది. రైతాంగ పోరాటాన్ని అణచే ఎత్తుగడల్లో ఇదీ ఒకటనే భావన జనంలోకి చొచ్చుకు పోతోంది. ఉద్యమాలను సామరస్యంగానే తప్ప మొరటు, అణచివేత చర్యల ద్వారా అదుపుచేయలేమన్నది ప్రపంచవ్యాప్తంగా నిరూపిత మైంది. అమెరికా మేధావి, విశ్లేషకుడు జెనె షార్ప్ 200కు పైగా అహింసాయుత నిరసన పోరాటాలను, ‘నియంతృత్వం నుంచి ప్రజా స్వామ్యం వైపు’ అనే తన పుస్తకంలో నిర్వచించారు. అనేక దేశాల్లో కార్యకర్తలు, ఉద్యమనేతలు దీన్నొక మార్గదర్శిగా మలుచుకొని నియం తృత్వాల స్థానే ప్రజాస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. బ్రిటిష్ విశాల సామ్రాజ్యాధీశుల్ని పిడికెడు ఉప్పుతో వణికించిన మహాత్ముడిని పలుమార్లు ఆ పుస్తకంలో ఆయన ఉటంకించారు. దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోది ప్రభుత్వ ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగ జారుస్తోంది. ఉదారప్రజాస్వామ్యమనే కీర్తి క్రమంగా పలుచబారు తోంది. మోదీ వీసాను అమెరికా పునరుద్దరించాక, సదరు సంబంధాల మెరుగుకు ఎన్ని యేళ్లు ఆయన శ్రమించాల్సి వచ్చింది? ఈ అయిదా రేళ్ల కృషిలో అంతర్జాతీయంగా భారత్కు లభిం చిన పేరు ప్రతిష్టల్ని, కీలక పాత్రనీ ఎందుకు కాలదన్నుకోవడం? రైతాంగం మదిలో చోటు కోల్పోవడం వల్లే, తమకు బాగా పట్టున్న ఉత్తరాదిలోనూ జనాదరణ కోల్పోవాల్సి వస్తోందని పంజాబ్ పట్టణ ఎన్నికల ఫలితాల్ని చూసి పాలకపక్షం గ్రహించాలి. పంతం వీడి, రైతులకు ఏది మంచో, వారు ఏం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేసి, జనాభీ ష్టాన్ని నిరవేర్చడమే ప్రజాస్వామ్యానికి బలం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్: dileepreddy@sakshi.com -
సయోధ్య సర్కారు విధి
ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. దారులు మూసుకుపోయే పరిస్థితులు కల్పించడం తన వైపు నుంచి జరుగకూడదు. వ్యవసాయం బాగు చేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించలేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వివాదాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమస్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతులతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్ష. వెన్నెముక శస్త్రచికిత్స సున్నితమనే భావన వైద్యవర్గాల్లోనే కాక సామాన్యుల్లోనూ ఉంది. అందుకే, వైద్యులు శ్రద్ధతో సిద్ధమౌతారు. వైద్యపరంగా అనివార్యం, రోగి అంగీకారం అయితే తప్ప శస్త్రచికిత్సకు పూనుకోరు. దేశానికి వెన్నె ముక అయిన రైతు వ్యవసాయ సమస్యల్ని పరిష్కరించేప్పుడు పాలకు లకు ఎందుకు ఆ శ్రద్ధ ఉండదు. ఇది కోటిరూకల ప్రశ్న! జనాభాలో అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయరంగంలో సంస్కరణలు వెన్నెముక శస్త్రచికిత్సకన్నా కీలకం. రైతుల ఎడతెగని పోరొకవైపు కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి మరోవైపు సమస్యను జటిలం చేశాయి. ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చల ద్వారా పరిష్కార అవకాశాలు సజీవంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా... అటు కేంద్రం, ఇటు రైతాంగం పర స్పర విశ్వాసరాహిత్య స్థితికి చేరాయి. సర్కారు కవ్వింపు చర్యలు ఉద్యమిస్తున్న రైతాంగాన్ని రెచ్చగొడుతున్నట్టున్నాయి. ఉద్యమంలో అసాం ఘిక శక్తులు చేరాయంటున్న సర్కారు, గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల్ని ఉటంకిస్తోంది. ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. వ్యవసాయం బాగుచేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించ లేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వ్యవసాయరంగ మనుగడతో నేరుగా ముడివడిన మూడు కీలక చట్టాల ప్రతిపాదన, పొందుపరచిన అంశాలు, ముసాయిదా తీరు, పార్లమెంటులో ఆమోదించుకున్న వైనం, కడకు అమలు... అన్నీ వివా దాస్పదమే! అమలు నిలిపివేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రైతు సందేహాలను నివృత్తిచేసే సంతృప్తికర జవాబు ఇంతవరకు రాలేదు. పైగా, తాజా బడ్జెట్లోని వ్యవసాయ అంశాలు దేశ రైతాంగంలో కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తమ అనుమా నాలు అపోహలు కాదని, వాటిని ధ్రువీకరించే సంకేతాలు బడ్జెట్ ప్రతి పాదనల్లో పుష్కలంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. వ్యవసా యాన్ని రైతుల చేతుల్లోంచి జార్చి, కార్పొరేట్లకు ధారాదత్తం చేసే భూమికను కేంద్రం సిద్ధం చేస్తున్న జాడలే çస్ఫుటమని వారంటున్నారు. కొత్తగా వ్యవసాయ మౌలికరంగాభివృద్ధి సెస్ (ఎఐడీసీ) విధింపుపైనా రైతాంగానికి అనుమానాలున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి భంగం పరిమిత వస్తువులపై వేర్వేరు శాతాల్లో ఎఐడీసీ విధింపును కొత్త బడ్జె ట్లో ప్రతిపాదించారు. పెట్రోలు, డీజిల్ పైనే కాకుండా కొన్ని ఆహార పదార్థాల దిగుమతి పైనా ఈ సెస్ రానుంది. అది వినియోగదారులపై భారం కాకుండా ఉండేందుకు ఆ మేర, ప్రస్తుత కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ తొలగింపో, తగ్గింపో ప్రతిపాదించారు. ఇక్కడొక మతల బుంది. సెస్పై కేంద్ర ప్రభుత్వానికే పూర్తి అజమాయిషీ! రాష్ట్రాలకు వాటా ఇచ్చే పనిలేదు. కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ కింద వసూలయిం దాంట్లో రాష్ట్రాలకు నిర్ణీత వాటా ఇవ్వాలి. ఇలా రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు తాజా మార్పు గండి కొడుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కొన్ని రాష్ట్రాలు స్పందించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభు త్వాల జాబితాలోని అంశమైనా కేంద్రం ఏకపక్షంగా మూడు చట్టాలను తీసుకువచ్చిందనే విమర్శ ఉంది. సదరు చట్టాల్లోని అంశాలు ప్రభావం చూపకుండా ఉండే విరుగుడు చట్టాలను దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే తీసుకువచ్చాయి. ఇది కూడా సమాఖ్య స్ఫూర్తికి భంగమే! వ్యవసాయరంగంలోకి పెద్ద మొత్తంలో ప్రయివేటు పెట్టు బడుల్ని ఆకర్శించి తద్వారా ఉత్పాదకత, సామర్థ్యం పెంచాలంటే సంస్కరణలు అనివార్యం అని కేంద్రం అంటోంది. ప్రభుత్వం ఇదే విషయం రాష్ట్రాలతో సంప్రదించి, రైతాంగాన్ని ఒప్పించి చేసి ఉండా ల్సిందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటులోనూ బిల్లుపై విపులంగా చర్చించలేదని, స్థాయీ సంఘానికో, సంయుక్త పార్లమెంటరీ కమిటీకో పంపి ఏకాభిప్రాయ సాధన చేసి ఉండాల్సిందంటారు. అలా జరిగి ఉంటే రాష్ట్రాల సహకారంతో చట్టాల అమలు సజావుగా సాగేదనేది అంతరార్థం. అది లోపిండం వల్లే ఇంతటి వ్యతిరేకత, ప్రస్తుత ప్రతిష్టంభన! ఆధిపత్యానికి ఊతం కొత్త చట్టాల్లో పొందుపరచిన పలు అంశాలు తమకు ప్రతికూలమని రైతాంగం అంటోంది. వాటి వల్ల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్లు, వ్యవస్థీకృత మార్కెటింగ్, తద్వారా ప్రయి వేటులోనూ లభించే మార్కెట్ స్పర్ధ క్రమంగా కొరవడుతాయని వారి ఆందోళన. అది తప్పు, వారిది అపోహ మాత్రమే అని కేంద్రం అంటోంది. కనీస మద్దతుధర కొనసాగుతుందని, వ్యవసాయోత్ప త్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లు ఉంటాయని ప్రభుత్వం నమ్మ బలుకుతోంది. ప్రయివేటు రంగం రాకవల్ల పోటీ ఏర్పడి వ్యవసాయో త్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని, రైతులకు మేలని సర్కారు వాదన. బడా వ్యాపారులు రిటేల్ వస్తు విక్రయరంగంలోకి వచ్చి, చిన్నా, చితకా దుకాణాలు, నాలుగు చక్రాల బళ్లపై విక్రయాలు లేకుండా చేసి, పూర్తి ఆధిపత్యం సాధించిన తర్వాత తమకు అను కూలంగా ధరల్ని నియంత్రించిన ఉదాహరణలు కోకొల్లలు. తమది అపోహ కాదని, ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రయివేటు ఆధిపత్యంలోకి వ్యవసాయంరంగం చేజారాక తలెత్తే అనర్థాలకు అంతుండదని రైతు సంఘాలంటున్నాయి. ఇదంతా ఓ పెద్ద కుట్ర అని, సంస్కరణల ముసుగులో ప్రయివేటుకు తివాచీలు పరచి, క్రమంగా రైతును నిస్స హాయ స్థితిలోకి నెడతారనేది రైతు సంఘాల భయాందోళన. ప్రయి వేటు పెట్టుబడుల్ని పెద్ద మొత్తాల్లో ఆకర్శించి, ఆహ్వానించకుండా వ్యవ సాయాన్ని లాభసాటిగా మార్చలేమని ప్రభుత్వం చెబుతోంది. మొదట అలా కనిపించినా, రాను రాను అసంఘటిత రైతాంగాన్ని మరింత దీనస్థితిలోకి నెడుతుందనే అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. బడ్జెట్లోనూ కవ్వింపు ప్రతిపాదనలా? వ్యయ ప్రయాసలకోర్చి, రైతాంగం ఎడతెగని ఉద్యమం చేస్తున్నా, వారిని అనునయించి మచ్చిక చేసుకునే సర్కారు ప్రయత్నమేదీ బడ్జెట్ ప్రతిపాదనల్లో లేదని వ్యవసాయ నిపుణులంటున్నారు. పైగా కొన్ని కవ్వింపు చర్యల సంకేతాలున్నాయనేది వారి భావన! వ్యవసాయ రంగానికి నిధులు పెంచకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. రుణ సదుపా యాన్ని స్వల్పంగా పెంచినా ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతాంగానికి అందిస్తున్న పెట్టుబడి సహాయానికి కత్తెర వేశారు. గత సంవత్సరపు నిధి రూ. 75 వేల కోట్ల నుంచి ఈ సారి రూ. 65 వేల కోట్లకు (13 శాతం) తగ్గించారు. రైతు సంక్షేమ వ్యయం లోనూ 8.5 శాతం కోత విస్మయం కలిగించింది. కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యానికి సర్కారు దారులు పరుస్తోందన్న విమర్శకులే, తాజా బడ్జెట్లో కేంద్రం ఆ దారుల్ని మరింత చదును చేయజూస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రయివేటు శక్తుల ఇష్టారాజ్యానికి కొత్తచట్టాల పక డ్బందీ అమలుకు భూమిక, అదికూడా ప్రజాధనంతో సిద్ధం చేస్తోం దనేది అభియోగం. వ్యవసాయ మౌలికరంగాభివృద్ధే సెస్ సమీకరణ వెనుక ఉద్దేశం. కానీ, ఈ నిధుల్ని ఎక్కడ? ఏ మౌలిక వ్యవస్థ ఏర్పా టుకు? ఏ ప్రాతిపదికన వెచ్చిస్తారో స్పష్టత ఉండాలని రైతాంగం కోరు తోంది. రోడ్లు వేస్తారా? గిడ్డంగులు కడతారా? యాంత్రికత పెంచు తారా? ఏం చేస్తారు? తద్వారా ఎవరికి ప్రయోజనం, రైతుకా, పరిశ్ర మకా? వ్యాపారులకా? స్పష్టత ఉండాలనేది విమర్శకుల వాదన. వివా దాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమ స్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతు లతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటున్నారు. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
డేటా చోరీ.. గోప్యతకు గోరీ
వ్యక్తిగత సమాచార భద్రత! ‘అబ్బో! అది దుర్వినియోగమైతే ఎలా...?’ మన సమాజం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సదరు ప్రాధాన్యతను నిజంగా గుర్తించిందా? ఏమో! పరస్పర సందేశాల మార్పు ఉపకరణం (మెసే జింగ్ యాప్) ‘వాట్సాప్’ను మునివేళ్లపై నిలిపి, నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేసిందంటే నిజమేనేమో! అనిపిస్తుంది. ‘ఫలానా తేదీ లోపు మా కొత్త గోప్యతా విధానానికి అంగీకారం తెలపండి లేదా సేవల నుంచి వైదొలగండి’ అన్న వాట్సాప్, భారతీయుల్లో పెల్లుబికిన వ్యతిరేకత దెబ్బకు వెనక్కి తగ్గింది. వాయిదాతో తన ప్రతిపాదన మూడు నెలలు వెనక్కి నెట్టింది. ‘మీ సమాచార వివరాలు చూడబోము, వాడబోము’ అని వినియోగ దారుల్ని నమ్మించే కాళ్లబేరానికొచ్చింది. ఎందుకంటే, 40 కోట్ల అకౌంట్లతో ఈ దేశంలో తనకున్న అతి పెద్ద మార్కెట్ పడిపోతే ఎలా? భయం! తాజా ప్రతిపాదన నచ్చక లక్షలాదిమంది వేగంగా ‘సిగ్నల్’ ‘టెలిగ్రామ్’ వంటి ప్రత్యామ్నాయ యాప్లకు దారి మళ్లడంతో జడు సుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి నిద్రమత్తు వదిలినట్టు లేచి, వాట్సాప్ను ప్రశ్నావళితో గద్దిస్తోంది. అసలు మీ విధానమేంటి? మా పౌరుల నుంచి మీరేం సమాచారం సేకరిస్తున్నారు? ఇక్కడ–యూర ప్లో తేడాలెందుకు? అని ప్రశ్నలు సంధిస్తోంది. గోప్యత విధానంలో మార్పులేమీ తేకండి అంటోంది. వాట్సాప్ ప్రతిపాదన వాయిదా పడిందే తప్ప సమస్య తొలగిపోలేదు. ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుందన్నది నిజం. సామాజిక మాధ్యమాలన్నింటితోనూ ఈ ప్రమాదం ఉంది, ఉంటుంది. తమ వినియోగదారుల నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించే, పొందే, నిల్వ చేసే, అనుసంధానమయ్యే వ్యక్తిగత సమాచారం వారి వద్ద ‘డాటా’గా నిక్షిప్తం అవుతుంది. దాన్ని వారు గోప్యంగా ఉంచాలి. ఉంచుతు న్నామనే చెబుతారు. కానీ, ఉంచరు. వేర్వేరు వ్యాపార అవసరాలకు తామే వాడినట్టు, వ్యాపార ప్రయోజ నాలున్న మూడో పక్షానికి అమ్ముకున్నట్టు చాలా సార్లు వెల్లడయింది. ఇప్పుడదే పెద్ద సమస్య! అది తప్పించాలంటే పౌరుల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వ పరమైన భద్రత కావాలి. చట్టపరమైన రక్షణ ఏర్పడాలి. దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘వ్యక్తిగత సమా చార రక్షణ చట్టం’ (పీడీపీ) పకడ్బందిగా ఉండాలి. తగిన నిఘా, నియంత్రణ వ్యవస్థలతోనే వ్యక్తిగత సమాచార దోపిడీ, దుర్వినియో గానికి కళ్లెం వేయగలం. ఉచిత సేవ, ధనార్జన యావ! ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ గతి మారింది. కమ్యూని కేషన్ రంగంలో శాస్త్ర–సాంకేతిక విప్లవమే వచ్చింది. ఎన్నో విధాలుగా సమాచారం సేకరించడం, ప్రోదిచేయడం, మార్పిడి చేయడం నుంచి క్లౌడ్ కంప్యూటింగ్తో అపరిమితంగా, గోప్యంగా దాచిపెట్టడం వరకు ఆశ్చర్యకరమైన పరిణామాలొచ్చాయి. దొంగచాటుగా, బహిరంగంగా అమ్ముకోవడమూ రివాజయింది. డిజిటల్ ఎకానమీలో ఇదే ఓ ఇంధన మైంది. ఈ–కామర్స్కు రాచబాట పడింది. క్షణాల్లో సమాచార మార్పిడి జరిగిపోతోంది. వ్యాపార–వాణిజ్య వ్యవహారాల్లో పెను మార్పులకు వాకిళ్లు తెరుచు కున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్... ఇలా ఎన్నెన్నో వైవిధ్యభరిత ఉపకరణాలొచ్చాయి. ఈ– కామర్స్ ప్రక్రియలో మెసేజింగ్ యాప్లూ బలపడ్డాయి. కరోనా మహమ్మారి మనుషుల భౌతిక కదలికల్ని కట్టడి చేసిన దరిమిళా.. వస్తు, సేవల రంగంలో ‘ఆన్లైన్’ ఒక కీలక ప్రక్రియ అయిపోయింది. అంతకు ముందునుంచే సామాజిక మాధ్యమ వేదికలతో కోట్లమంది అనుసంధానమయ్యారు. వారెవరు, ఎక్కడివారు, ఎంత వయసు, ఏం చేస్తుంటారు, ఆదాయమెంత, వ్యయమెంత, అభిరుచులేంటి, వ్యవహా రాలేంటి... ఒక్కటేమిటి? వారికి సంబంధించిన సమస్త సమాచారం ఆయా యాప్లలోకి చేరుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, మనమే.. వారిని ఆహ్వానించడమే కాక చొచ్చుకు వచ్చేంత చనువిచ్చాం. నిజానికి ఈ సమాచారమంతా వారు గోప్యంగా ఉంచాలి. నిర్దేశించిన అవసరానికే వినియోగించాలి. అలా కాకుండా వేర్వేరు వ్యాపార సంస్థలకు విక్రయిస్తు న్నారు. ఆయా కంపెనీల వ్యాపార వృద్ధికి తోడ్పడే వాణిజ్య ప్రకటనలు చేర్చడానికి, భావజాల వ్యాప్తికి, ఆలోచనా సరళిని ప్రభా వితం చేయడానికీ... ఇలా ఎన్నో వ్యాపార, కొన్ని చోట్ల రాజకీయ అవసరాలకు పౌరుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని వాడుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటివి రుసుమేమీ తీసుకోకుండా ఉచిత సేవలు అందిస్తున్నట్టే ఉంటుంది. కానీ, తమ విని యోగదారుల సమాచారాన్ని అందివ్వడం–అమ్ముకోవడం ద్వారా వస్తోత్పత్తి, సేవా విక్రయ సంస్థల నుంచి పెద్దమొత్తాల్లో వారు డబ్బు గడిస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపారం. సదరు యాప్ సంస్థలు పౌరుల వ్యక్తిగత ఉనికి వివరాలే కాకుండా ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోకి చొరబడటంతో సగటు మనిషి వ్యక్తిగత సమాచారం అంగడి వస్తువయింది. ప్రతొక్కరి బతుకు వాల్పోస్టరయింది. వాట్సాప్ గగుర్పాటే సాక్ష్యం! సమాచార గోప్యత విషయంలో వాట్సాప్ కొత్త ప్రతిపాదన ఏక పక్షంగా ఉన్నందున నిలిపివేయాలన్న ఒక అడ్వకేటు పిటిషన్ విచా రిస్తూ డిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అది ప్రయివేటు యాప్, మీ సమాచారానికి భద్రత లేదనుకుంటే అక్కడ్నుంచి తొలగించండి, వారి సేవల నుంచి మీరు తొలగిపోండి, భద్రత ఉన్న వేరే యాప్కు మారండి’ అని జస్టిస్ సంజయ్ సచ్దేవ్ అన్నారు. అదంత చిన్న విషయమా? కోట్ల మందికి సంబంధించిన అంశం. తమ వద్ద వినియోగదారుల సమాచారం ‘తొలికొస నుంచి కడకొస దాకా’ గోప్యమే! అని హామీ ఇస్తాయి. ఈ హామీకి ఎందుకు కట్టుబడవు? అన్నది మౌలిక ప్రశ్న. తమ కొత్త విధానానికి అంగీకారం తెలపండి అని వాట్సాప్ ప్రకటించాక వారం (జనవరి5–11)లోనే ప్రత్యా మ్నాయ యాప్ ‘సిగ్నల్‘ను దేశంలో 33 లక్షల మంది డౌన్లోడ్ చేసు కున్నారు. అదే వారంలో వాట్సాప్ డౌన్లోడ్లు 39 శాతం తగ్గాయి. దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి వాట్సాప్ వినియోగదారుడే! వారు జారి పోతున్న ఆ వేగం చూసి వాట్సాప్ జడుసుకుంది. సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏ ప్రయోజనాలు లేకుంటే ఇంత దేబిరింపు దేనికి? నిజానికి వారి ఉద్దేశం కొత్త గోప్యత నిబంధనల ప్రకారం తాము సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకోవడానికి వినియోగదారులు సమ్మతించడం. సమ్మతిలేని వారు వైదొలగడం. ఫేస్బుక్ ఇక యథేచ్చగా సదరు సమాచారాన్ని తన, తన ఒప్పంద వ్యాపార సంస్థలు స్వేచ్ఛగా విని యోగించుకోవడం. వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడం. ఉభయత్రా లాభం! ఇదీ తలంపు. కానీ, ఇప్పుడిస్తున్న తాజా వివరణ ప్రకారం కేవలం వ్యాపార అకౌంట్ల విషయంలో తప్ప సాధారణ పౌరుల వ్యక్తిగత సమాచారం, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ప్రేమికులు వంటి వారి సంభాషణల జోలికి రామంటున్నారు. అసలు అలాంటి డాటాను మేం చూడం, వాడం అని నమ్మబలుకు తోంది. కానీ, పౌరులకు అనుమానాలు న్నాయి. ఆ భయ–సందేహాలతో ఇవాళ పౌరులు ప్రత్యామ్నాయ ‘యాప్’లకు వెళ్లవచ్చు! కానీ, రేపు ఏదో రోజు అదే ఫేస్బుకో, మరో పోటీదారో ప్రత్యామ్నాయ యాప్లను కొనరని, మంచి ధర పలికితే అవి మాత్రం అమ్ముడు పోవని గ్యారెంటీ లేదు. వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురయ్యే ప్రమాద ఆస్కారం నుంచి పౌరులకు శాశ్వత రక్షణ కావాలి. సర్కార్పై కన్నేయాల్సిందే! వ్యక్తిగత సమాచార దుర్వినియోగ ప్రమాదంపై మెసేజింగ్ యాప్ల పట్ల పౌరులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాల పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా సేకరించిన ఆధార్ సమాచారం లోగడ దుర్వినియోగమైన సందర్భాలెన్నో వెలుగు చూశాయి. పౌరుల ఫోన్ నంబర్ల సమాచారాన్ని పదిహేడు పైసల చొప్పున అమ్ముకున్న నీచ ఘటనలున్నాయి. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత సంవత్సరం విస్పష్టంగా తేల్చి చెప్పే వరకు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే కాదని కేంద్ర ప్రభుత్వం భావించిన, వాదించిన దేశం మనది. పౌరుల హక్కుల కన్నా కార్పొరేట్ల వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసే సర్కార్ల ఎత్తుల్ని పసిగట్టాల్సిందే! వ్యక్తిగత సమాచార భద్రత పేరిట ఇప్పుడు తీసుకురానున్న పీడీపీ చట్టం ఎంత పకడ్బందీ అన్నదీ కాపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే, గత శీతాకాల సమావేశాల్లోనే ముసాయిదాను పార్లమెంటు ముందుకు తెచ్చినా, అభ్యంతరాల నడుమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. అధికార భాజపా ఎంపీ మీనాక్షీ లేకీ నేతృత్వం లోని జేపీసీ సంప్రదింపుల ప్రక్రియ ముగించి, చట్టం పేరుతో సహా 89 సవరణలతో తుది ముసాయిదాను ఇటీవలే సిద్ధం చేసింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపచేయాలన్నది తలంపు. ప్రయివేటు యాప్ల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత అనే వంకతో సదరు సమాచారాన్ని కేంద్రం తన గుప్పెట్లోకి, నియంత్రణలోకి తెచ్చుకునేలా ముసాయిదా ఉందనే విమ ర్శలున్నాయి. అప్పుడది, రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత సమాచార గోప్యతా హక్కుకే భంగకరం! వ్యక్తిగత–వ్యక్తిగతం కాని సమాచారాన్ని నిర్వచించడమైనా, సదరు డాటా సేకరణ–నిర్వహణ– నిలువ–వినియోగం, దుర్వినియోగ నియంత్రణ, భద్రత వంటి విషయాల్లో ఎటువంటి చట్టరక్షణ కల్పిస్తారన్నది ముఖ్యం. నిన్నటి వాట్సాప్ ఎత్తుగడైనా, రేపు మరే ఆన్లైన్ యాప్ నిర్వహకులో చేసే లోపాయికారి ప్రతిపాదనలనైనా.. ఈ చట్టం ఎలా నిలువరిస్తుంది? అన్నది చట్టరూపకల్పనను బట్టే ఉంటుంది. అందుకే, ప్రజాప్రతి నిధులు, పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి. రెండు నియంత్రణలూ ఉండాలి చట్టం ఒక్కటే సరిపోదు. గట్టి చట్టం అమల్లోకి వచ్చాక ఏర్పాటయ్యే రక్షణ ప్రాధికార సంస్థ, నియంత్రణ వ్యవస్థ పనితీరు ముఖ్యం. నిఘా –నియంత్రణ వ్యవస్థలు గోప్యత ఉల్లంఘనలకు ప్రతిస్పందించడమే కాకుండా ముందస్తు నివారణా వైఖరితో పనిచేయాలి. చట్టాలు చేసే– ఉల్లంఘించే వారి మధ్య పిల్లి–ఎలుక ఆట ఎప్పుడూ ఉంటుంది. ఒక నిబంధన తమని అడ్డగిస్తే, దాన్ని అధిగమించి పని కానిచ్చుకునే సాంకేతికతను నేరబుద్ది కలిగిన సంస్థలు సృష్టించుకుంటాయి. ఇదొక చక్రీయ ప్రక్రియ. పౌరులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఉచితంగా వస్తుందంటే చాలు, ఏ ఆధునిక సదుపాయమైనా నిబంధ నలు చదువకుండానే గుడ్డిగా సమ్మతి తెలుపడం మానుకోవాలి. అవసరం ఉన్నా, లేకున్నా వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఎక్కడపడితే అక్కడ పంచుకునే అలవాట్లను తగ్గించుకోవాలి. తెలిసో తెలియకో.. కనీస గోప్యత లేకుండా సొంత జీవితాన్ని ఎంతగా బజారుకీడ్చుకుంటున్నామో... కొంచెం ఇంగితంతో వ్యవహరిస్తేనే మనకూ, సమాజానికీ మంచిది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement